కరోనా మూడవ వేవ్ రిత్యా తెలంగాణ సర్కారు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ, జెఎన్ టి యు, శాతవాహన యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీలు, ఉన్నత విద్యలో ఆన్ లైన్/డిజిటల్ విద్యభోదన జరుపుతామని ప్రకటించాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో ఆన్ లైన్ భోదనకు మొగ్గుచూపుతున్న తెలంగాణ సర్కారు పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు వినేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొదటి, రెండవ కరోనా వేవ్ లలో ఆన్ లైన్/డిజిటల్ భోదన పాఠాలు అందక తీవ్రంగా నష్టపోయిన పేద విద్యార్థులు మూడవ వేవ్ లో కూడా విద్యకు పూర్తిగా దూరమయ్యి రోజూవారి కూలీలుగా, మేకల కాపరులుగా మారుతారు. డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థుల పరిశోధనలు, ఉద్యోగ ప్రయత్నాలు నిలిచిపోయి చదువుకున్న నిరుద్యోగులుగా మారనున్నారు.

రెండేళ్ళుగా కరోనా అనుభవం మనముందు ఉన్నప్పటికీ విద్యా సంస్థల్లో, సంక్షేమ హౕస్టళ్ళలలో, గురుకులాలలో కనీస వసతులు మెరుగుపరచలేదు. విద్య సంస్థలు ప్రారంభించిన ఈ నాలుగు నెలల్లో మహాత్మ జ్యోతిరావు పూలే వెనకబడిన తరగతుల గురుకులాల్లో పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలలో 46 మందికి కరోనా సోకగా, వికారాబాద్ జిల్లాలలోని కొడంగల్ బాలుర గురుకులలో ఐదుగురితో పాటు సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల్లో, యస్సీ, యస్టీ, బీసీ సంక్షేమ హౕస్టళ్ళలలో, మోడల్ స్కూళ్ళలో అనేక కేసులు బయట బడ్డాయి. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా, వేల విద్య సంస్థలు ప్రారంభించినా, ప్రారంభించకపోయినా నష్టపోయేది బడుగు బలహీన వర్గాల విద్యార్థులే అనేది స్పష్టమవుతున్నది.

ఈ పరిస్థితి ఏర్పడుతుందని రెండేళ్ళ అనుభవంలో రుజువైంది. అయినా తెలంగాణ  పాలకులు విద్యసంస్థల్లో వసతులు మెరుగుపరచకుండా, ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టివేశారు. భౌతిక తరగతులు సాద్యం కానియెడల ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు విద్యార్థులందరికీ చేర్చాల్సిన భాద్యత పాలకులపై ఉంటుంది. కానీ ఆన్ లైన్ భోదనలో కూడా కనీస సౌకర్యాలు మెరుగుపరచక పోవడంతో విద్యాభోదన ప్రశ్నార్థకంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కాలంలో 24 మిలియన్ల పాఠశాల స్థాయి విద్యార్థులు డ్రాపౌట్లుగా మారినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అనుబంధ సంస్థ యునెస్కో(UNESCO) ప్రకటించింది. మార్చి 20, 2020 నాడు దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేయటంతో విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి. అనంతరం సెప్టెంబర్ 1, 2020  నాడు ప్రభుత్వం ప్రకటించిన వర్చువల్ విధానంలో ఆన్ లైన్ తరగతులు పేరుకే మిగిలిపోయాయి. గ్రామీణ ప్రాంతాలలోని, పట్టణ ప్రాంతాలలోని యస్సీ, యస్టీ, బిసి, మైనార్టీ వర్గాల-కులాల పేద విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సౌకర్యాలు, కనీసం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ లేక తీవ్రంగా నష్టపోయారు. వీరి చదువులు పూర్తిగా నిలిచిపోయాయి. తెలంగాణలో ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ప్రభుత్వం అట్టాహౕసంగా ప్రకటించిన టి-శాట్, దూరదర్శన్ తరగతులు పర్యవేక్షకులు, టీచర్లు లేక విద్యార్థులు వినలేకపోయారు. ఏజెన్సీ ప్రాంతాలలో 80% గిరిజన విద్యార్థులు కేబుల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టెలివిజన్ లేక ఆన్లైన్ పాఠాలు అందలేదు. ఈ కాలంలో పాఠశాల డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

2021, అక్టోబర్ నెలలో తెలంగాణలో విద్య సంస్థలు ప్రారంభించడంతో ప్రవేటు, బడ్జెట్ పాఠశాలలలో డ్రాపౌట్లు 10-20% ఉండగా, ప్రభుత్వ పాఠశాలలలో డ్రాపౌట్ విద్యార్థుల  సంఖ్య రెట్టింపుగా ఉంది. ఇక బడి మానేసిన బాలికలు చదివే “కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల(కెజిబివి)”లో 50% మించి విద్యార్థులు బడిమానేశారు. ఎకనామిక్ సర్వే 2019-20, విద్యార్థుల్లో డ్రాపౌట్ పెద్ద మొత్తంలో సూచించింది. 13.6% విద్యార్థులు పేదరికంతో బడి మానేశారు. ప్రాథమిక విద్యలో 10%, ప్రాథమికోన్నత విద్యలో 17.5%, ఇంటర్మీడియట్ సెకండరీ విద్యలో 19.8% విద్యార్థులు చదువుకు దూరమయ్యారని జనవరి 2020లో ప్రకటించారు. 2020 నవంబర్ లో డిల్లీకి చెందిన చైల్డ్ పండ్ ఇండియా(Child fund India) అనే NGO పదిరాష్ట్రాలలోని 20 జిల్లాలోని విద్యార్థులు, ఉపాద్యయుల సర్వేలో 64% గ్రామీణప్రాంత విద్యార్థులు, పేద విద్యార్థులు డ్రాపౌట్లుగా మారారని నివేదిక విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి తెలంగాణలో డ్రాపౌట్ల సంఖ్యను తెలంగాణ సర్కారు ఇంకా ప్రకటించటం లేదు. డ్రాపౌట్ల సంఖ్య విపరీతంగా పెరగటమే ఇందుకు కారణం.

భారత పాలకులు ఆన్లైన్ తరగతుల పేర ప్రపంచ పెట్టుబడిదారులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారంలా ఆన్లైన్ విద్యా భోదనను మారుస్తూ గూగుల్, జియో, జూమ్, రిలయన్స్ వంటి అంతర్జాల బడా కార్పోరేట్ కంపెనీలకు మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లు అమ్మే సామ్రాజ్యవాద కంపెనీలకు లక్షల కోట్లు దోచిపెడుతున్నారు. ఇక విద్యార్థుల తల్లితండ్రులు వారికున్న ఎకరా, అర భూములమ్మి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టెలివిజన్లు కొంటున్న పరిస్థితి నేడు దేశంలో ఏర్పడింది. ఇక కటిక దారిద్ర్యములో మగ్గుతున్న తల్లితండ్రులు వారి పిల్లలను వారితో పాటు పనిలోకి తీసుకెళ్తున్నారు. వారికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కొనే ఆర్థిక స్థోమత లేదు. ఆన్ లైన్ పాఠాలు వినలేకపోతున్నామని విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నాడు వేద విద్యను అభ్యాసించడానికి అనర్హులుగా మారిన శోశిత జనసమూహౕల ప్రజల పిల్లలు, నేడు పెట్టుబడిదారీ ప్రయోజనాలు నెరవేర్చే ఆన్లైన్ విద్యా పేరుతో జరుగుతున్న కుట్రలో చదువుకు దూరంగా గెంటివేయబడుతున్నారు.

డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించటంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యము వహిస్తున్నారు. 2021 అక్టోబర్ నెలలో పాఠశాలలో భౌతిక తరగతులు ప్రారంభించే ముందు దేశవ్యాప్తంగా డ్రాపౌట్లుగా మారిన విద్యార్థులను గుర్తించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికి తీవ్ర నిర్లక్ష్యము వహించాయి. కేంద్ర విద్యా శాఖ బడి బయటవున్న 6-18 సంవత్సరాల విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పిచాలని 10 జనవరి 2021 నాడు ఇచ్చిన ఆదేశాలు నామమాత్రంగా మిగిలిపోయాయి. ఒక్క డ్రాపౌట్ విద్యార్థిని గాని బడి బయట ఉన్న వలస కార్మికుల పిల్లలను గాని గుర్తించలేదు. కనీసం స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులు గాని, పాఠశాలలకు సన్నధం చేసే బ్రిడ్జి కోర్సులు గాని కేంద్ర విద్యశాఖ నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రాపౌట్లను గుర్తించి పాఠశాలలో చేర్పించేందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం పేదలపట్ల, రైతు కూలీల బిడ్డలపట్ల తెరాస సర్కారు నిర్లక్ష్యవైఖరికీ, లేకితనానికి నిదర్శనం.

జాతీయ విద్యా విధానం 2020 లో ప్రటించిన Sustainable Development Goal(SDG)-4 (సస్టేనబుల్ అభివృద్ధి లక్ష్యము-4) అనే ఎజెండాలో భాగంగా ప్రభుత్వం 2030 కల్లా ఇండియాను సర్వ సమగ్ర విద్య అభివృద్ధి దేశంగా మారుస్తామని అందుకొరకు నవోదయ విద్యాలయ స్కీమ్స్, e-Content, ఇ-పాఠశాల, దీక్ష(DIKSHA-Digital infrastructure of knowledge platform), ప్రధాన మంత్రి ఇన్నోవేటివ్ స్కీం వంటి ఆన్లైన్ వేదికలు ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సామ్రాజ్యవాద కంపెనీల పైనాన్స్ పెట్టుబడిని విద్యారంగంలో చొప్పించేందుకే అనేది స్పష్టమవుతున్నది. అనియత ఆన్లైన్ విద్యతో పాలకులు ఒకవైపు పేదలకు విద్యనందించే భాద్యతనుండి తప్పుకొంటూ, మరో వైపు పెట్టుదారుల ప్రయోజనాలను నెరవేర్చుతున్నారు. కరోనా సంక్షోభం పేరుతో ప్రారంభించిన ఆన్ లైన్ విద్యభోదన, నూతన విద్యా విధానం 2020తో సుస్థిరమవుతూ వేల సంఖ్యలో పేద విద్యార్థులను డ్రాపౌట్ విద్యార్థులుగా తయారు చేస్తూ, సామాజిక వివక్షతను పెంపొందిస్తున్నది. బాలకార్మిక వ్యవస్థ, బాలిక వివాహౕలను ప్రోత్సాహిస్తూ, గ్రామాల్లో అర్థ బానిసలను తయారు చేస్తున్నది.

ఆన్ లైన్ విద్యా బోధన దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు అందేవిధంగా అవసరమైన సౌకర్యాలైన మెరుగుపరచాలి. అందుకనుగుణంగా ప్రతి విద్యార్థికి ఐ ట్యాబ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించాలి.తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టి పాఠశాల,ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్యాబ్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించితే 3 వేల కోట్ల రూపాయలకు మించదు. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు అందులో 3% కేటాయించినా పేద విద్యార్థులకు కొంతనైనా మేలు జరుగుతుంది. మన ఊరు-మన బడి పేరుతో మౌలిక సదుపాయాలు కల్పనకు 7,289 కోట్లరూపాయలు కేటాయిస్తామని చెప్తున్న తెలంగాణ సర్కారు ఆన్ లైన్ ఉపకరణాల పంపిణీకి నిధులు మంజూరు చేయాలి. అందరికి విద్య హక్కు అమలు జరగాలంటే పేద, మధ్యతరగతి విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు అందల్సిందే. విద్య భోదనలో ఈ సమానత్వంకై పోరాడాల్సిన కర్తవ్యం మనందరిపై ఉన్నది.

Leave a Reply