ఈ సంచిక వసంతమేఘం పాఠకులకు *జగిత్యాల జంగల్ మహల్ * విప్లవోద్యమ చారిత్రక పత్రాల రెండు సంకలనాలు ఇస్తున్నాం. విప్లవాభిమానులకు ఇవి అపురూపమైన కానుకలు. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు దెబ్బతినిపోయాక తిరిగి ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక సమరశీల రైతాంగ పోరాట ప్రజ్వలన ఉవ్వెత్తున సాగింది. అది తెలుగు నేల అంతా విస్తరించింది. దానికి అక్షర రూపం 1981లో వచ్చిన నాగేటి చాళ్లలో రగిలిన రైతాంగ పోరాటాల చరిత్ర అనే పత్రం. అది మొదలు 1984లో మహారాష్ట్ర కొండకోనల్లో ఊపిరి పోసుకుంటున్న ఆదివాసీ రైతాంగ పోరాటాల చరిత్ర అనే పత్రం దాకా ఈ రెండు సంకలనాల్లో ఉన్నాయి.
ఇవి కేవలం ఆనాటి పోరాట పత్రాలు మాత్రమే కాదు. ఇవ్వాల్లి పోరాటాలుగా సాగుతున్న దేశ వ్యాప్త విప్లవోద్యమంలో ఆనాటి ఉద్యమం రగిల్చిన నిప్పురవ్వ దాగి ఉన్నది. జగిత్యాల రైతాంగ పోరాటంగా మొదలై జంగల్ మహల్ పోరాటం దాకా, దండకారణ్య ప్రత్యామ్నాయ ఉద్యమం దాకా, పశ్చిమ కనుమల వర్గపోరాటాల దాకా సాగిన విస్తృతి వెనుక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ తరం విప్లవాభిమానులు తప్పక ఈ చారిత్రక పత్రాలు చదవాల్సిందే. అందుకే ఈ-బుక్స్ మీ కోసం శీర్షిక కింద ఈ సంచికలో ఈ రెండు పుస్తకాలు ఇస్తున్నాం. అందుకోండి. చదవండి.
(రెండు కలిపి ఒకే ఈ బుక్ గా పెట్టాము)