1 మళ్లీ చీకటిరోజుల్లోకి గ్రామాలను, పట్టణాలను ప్రస్తుత విద్యుత్ సంక్షోభం తోసేయనుందా?
జ: అలాంటి అవకాశమే లేదు. ఎందువల్లనంటే, ఈ రోజు విద్యుత్ ప్రభుత్వ బాధ్యతగా కాక, ఒక సరుకుగా మారిపోయింది. ఎప్పుడైనా సరుకులు అమ్ముడుపోతేనే లాభం వస్తుంది కనుక, విద్యుత్ కూడా అమ్ముడుపోవాలి. ఇది నేడు నిత్యావసరమయింది కనుక, ప్రజలు కూడా ధర ఎక్కువైనా తప్పకుండా కొనితీరవలసిందే.
2. థర్మల్ విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గు కొరత, దిగుమతి సమస్యలే ఈ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయా?
జ: బొగ్గు కొరతే లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి తెలిపారు. తాజాగా ఆర్ధిక అంత్రి ఎటువంటి కొరత లేదని, విద్యుత్ ఉత్పత్తిలో దేశం మిగులో ఉందని అమెరికాలో తెలిపారు. కానీ వాస్తవంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తి లేక కోటలు విధుస్తున్నాయి. వ్యాపారంలో గిరాకీ పెరగాలంటే కొరత ఉండవలసిందే. అందువల్ల నేటి కొరత సృస్టించబడుతున్నదే కానీ, వాస్తవంగా బొగ్గు కొరత లేదు. అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి కేంద్ర ప్రభుత్వ వారి కారణాల రీత్యా సిద్ధంగా లేదు.
3. అధిక వ్యయం, ఉద్యోగరంగానికి పెద్ద మొత్తంలో చెల్లింపులు, తవ్వకాలు, నిల్వ, సరఫరాల్లోని మాన్యువల్ సమస్యల వల్లే థర్మల్ విద్యుదుత్పత్తిని ప్రభుత్వాలు తగ్గించుకుంటున్నాయా?
జ: ప్రభుత్వ పాత్ర తగ్గడం వాస్తవమే కానీ, కారణాలు మాత్రం ఇవి కావు. ఇవే కారణాలయితే ప్రైవేటు సంస్థలు ఎందుకు ముందుకు వస్తాయి. గత యూపీఏ ప్రభుత్వ కాలంలో జరిగిన పెద్ద కుంభకోణాలలో ఇదొకటి. ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా మోడీ ప్రభుత్వం తీసుకున్న బహిరంగవేలం నిర్ణయంతో పెద్ద ఎత్తున ప్రవేటు సంస్థలు ఈ రంగంలోనికి ప్రవేశించాయి. లాభాలు రాకపోతే వారెందెకు వస్తారు?
బొగ్గుకు నల్ల బంగారం అని పేరు. నిజంగా బంగారు గుడ్లు పెట్టే బాతులనే కేంద్ర ప్రభుత్వం ప్రవేటు ఫారం చేస్తోంది. స్పీడుగా అమలవుతున్న ప్రభుత్వ ప్రవేటీకరణ విధానాలలో భాగంగానే ఇది
4. ఉత్పత్తి మొదలు ప్రభుత్వ అదుపు, లైసెన్సు వరకు ధర్మల్తో పోల్చితే సోలార్ పవరే లాభదాయకమనే కార్పొరేట్ల వ్యాపారనీతిని శ్రుతిమించి మోస్తూ ప్రభుత్వాలు చేజేతులా విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయా?
జ: రెన్యువబుల్ ఎనర్జీ ఎప్పుడు మంచిదే. సోలార్, విండ్, హైడ్రో వంటివి ప్రోతసహించవలసిందే. కానీ. ఇవి ప్రజల అవసరాలను తీర్చడానికా లేక ప్రవేటు సంస్థలకు లాభాలు చేకూర్చడానికా అన్నదే ప్రశ్న.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన విద్యుత్ బిల్లు, 2020 సోలారు విద్యుత్ ను ప్రోత్సహించాలని చెబుతూనే, ప్రవేటు సంస్థల నుండి కొంత వాటాను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కొనితీరాలని షరతు విధించింది. ఇది వారి లాభాలు పెంచడానికే తప్ప మరొకటికాదు. ప్రభుత్వమే రెన్యువబుల్ ఎనర్జీ నిర్వహించడం ద్వారా నాణ్యమైన విద్యుత్ ప్రజలకు తక్కువ ధరకు సరఫరా చేయవచ్చు. ఈ పని చేయడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.
5. సూర్యరశ్మి నుంచి అతి సహజసిద్ధంగా జనరేట్ చేసే సోలార్ పవర్ని అతి పెద్ద మార్కెట్గా అదానీ గ్రూపు మార్చేసింది. తొలినుంచీ సౌర విద్యుత్ను అహ్వానిస్తున్న పర్యావరణవాదులు ఇప్పుడు ఏ వైఖరిని తీసుకోవాలి?
జ: పర్యావరణ రీత్యా సోలార్ ఎనర్జీని అహ్వానించవలసిందే. అయితే, పైన చెప్పినట్లు లాభాల గురించి మాత్రం ఉండకూడదు. ఈ పేరుతో మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను, ఆఖరుకు ఫారస్టు భూములను కూడా అదాని వంటి సంస్థలకు ధాదాదాత్తం చేస్తోంది. ఇది అడవుల నరికి వేతకు దారితీసి, తిరిగి అ పర్యావరణమే నాశనమవుతుంది.
6. విద్యుత్ సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించుకుంటున్న పరస్పర అబద్ధాల యుద్ధంలో అసలు ఘర్షణ ఎంత? ఏపీలో అదానీ సోలార్ ప్రాజెక్టులను అనుమతించిన జగన్ ప్రభుత్వం… ధర్మల్ పవర్పై వ్యక్తం చేస్తున్న ఆందోళనలో రాష్ట్ర ప్రయోజనాల పాలు ఎంత?
జ: పరస్పర అరోపణలు రాజకీయ ప్రయోజనాలకే కానీ, ఆచరణలో రెండు ప్రభుత్వాలూ ప్రవేటీకరణకు, సహజవనరుల లూటీకి అనుకూలమే. రెంటికి తేడా ఏమీ లేదు. అయితే నేటి బొగ్గు కొరతకు మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత.