న్యాయస్థానాల్లో విజయం పొందినప్పటికీ మైనింగ్‌ తవ్వకాల నుండి భూమిని కాపాడుకోవడానికి పోరాడుతున్న 3 ఆంధ్ర ఆదివాసీ గ్రామాల ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మలపాడు గ్రామ ప్రజలు 1997లో అనూహ్యమైన ఒక విజయాన్ని సాధించారు. మైనింగ్‌ కార్యకలాపాల నుండి తమ గ్రామాన్ని కాపాడుకోవడంకోసం రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ప్రైవేటు కంపెనీకి వ్యతిరేకంగా సాగిన న్యాయపోరాటంలో వాళ్ళు విజయం పొందారు.

సుప్రీంకోర్టు 1993లో, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా యిచ్చిన తీర్పును కొట్టివేసింది. 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని ఖనిజ సంపదను వెలికితీసే హక్కు కొండదొర తెగకు చెందిన ప్రజలకు మరియు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాలకు మాత్రమే వుందని,  ప్రభుత్వం మద్ధతు యిచ్చినప్పటికీ ఈ ప్రాంతాలలో  ప్రైవేటు మైనింగ్‌ చట్ట వ్యతిరేకమని ప్రకటించింది.

ఈ వివాదంలో న్యాయపోరాటంలో స్థానికులకు సహాయంచేసిన ‘సమత’ అనే సంస్థ పేరుమీద ఈ తీర్పుని ప్రజలందరూ సమతా తీర్పు అని పిలుస్తారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తానే మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టాలనుకున్నా ముందుగా ఆదివాసీల ప్రయోజనాలను అది దృష్టిలో వుంచుకోవాలని కూడా న్యాయస్థానం చెప్పింది.

అయినప్పటికీ, రెండు దశాబ్దాల తరవాత, ఆంధ్రప్రదేశ్‌` ఒడిషా సరిహద్దు గ్రామాలలోని ప్రజలు తమ ప్రాంతాలలో దొరికే సున్నపురాయి నిధులపై యాజమాన్యం కోసం ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ సున్నపురాయిని ఇళ్ళ నిర్మాణంలోనూ, మట్టిని శుభ్రం చేయడంలోనూ, ఇళ్ళు తవ్వేటప్పుడు పునాదులను గట్టిపరచడానికీ, రంగుల తయారీకీ వాడతారు.

మైనింగ్‌ లైసెన్సులు యివ్వడానికి అధికారంగల ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (APMDC) 1977 నుండి, కొండదొర తెగకు చెందిన వ్యక్తులకు లేదా సహకార సంఘాలకు ఐదుసార్లు లైసెన్సులు మంజూరు చేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమం నుండి ప్రజలను దూరంగా వుంచడానికి ఆ సంస్థ ప్రతిసారీ కొత్తకొత్త పద్ధతులను అనుసరించింది.

2006, 2012, 2018, 2019, 2021లలో టెండర్లను ప్రకటించారు. అయినా ఒక్క 2012లో మాత్రమే నాలుగు హెక్టార్ల భూమిలో తవ్వకాలు జరపడానికి ప్రజలు అనుమతించారు. అదికూడా వాళ్ళకు తగినంతగా నష్టపరిహారం చెల్లించాకనే.

‘‘దుర్గా శాండ్‌స్టోన్‌ పరస్పర సహకార సంఘం మైనింగ్‌ కిందకు వచ్చిన భూములకుగాను ప్రజలకు సంవత్సరానికి రెండు లక్షలు చెల్లించింది. భూమిలేనివారికి సంవత్సరానికి లక్షరూపాయలు ఇచ్చింది. ఆ సంస్థ కొంతమందిని సభ్యులుగా చేర్చుకొని వాళ్ళకు జీతాలుకూడా ఇచ్చింది’’ అని కరకవలస గ్రామస్ధుడు లచ్చన్నరావు అన్నారు.

మళ్ళీ ప్రారంభమైన దాడులు :

ప్రజల ప్రాథాన్యతను తగ్గించడానికి 16మార్చి 2021న మరొక ప్రయత్నం జరిగింది. ఆ రోజు APMDC 32.7 హెక్టార్లలో సున్నపురాయి తవ్వకాలకు సంబంధించిన టెండర్లను ప్రకటించింది. దీని ప్రభావం నిమ్మలపాడు గ్రామంతోపాటు పక్కనేవున్న కరకవలస, రాళ్లగరువు గ్రామాలపై కూడా వుంటుంది. భారీ యంత్రాల సహాయంతో మైనింగ్‌ చేసే అనుభవం వున్న కాంట్రాక్టర్లు మాత్రమే ఈ వేలంపాటలో పాల్గొనవచ్చునని టెండర్‌లో షరతు పెట్టిన కారణంగా తాము అందులో పాల్గొనడానికి అవకాశంలేకుండా పోయిందని వాదించి గ్రామస్ధులు కొద్దిరోజుల్లోనే హైకోర్టు నుండి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారు.

గతంలో దుర్గా శాండ్‌స్టోన్‌ సొసైటీలో పనిచేసి, ఇప్పుడు తామే నేరుగా మైనింగ్‌ కార్యకలాపాల్లో పాల్గొనాలనుకున్న కొందరు గ్రామస్థులు శ్రీ అభయ గిరిజన పరస్పర సహకార లేబర్‌ సహకార సంస్ధను స్థాపించుకొని దాని తరఫున పై పిటీషన్‌ దాఖలు చేశారు.

‘‘మా పెద్దలు ఎన్నడూ మైనింగ్‌లో పాల్గొనాలని అనుకోలేదు. అయితే ప్రభుత్వం మొండి పట్టుదల చూశాక మేంకూడా ఇందులో జోక్యం చేసుకోవడమే మేలని నిర్ణయించుకొన్నాం’’ అన్నారు ఆ సంస్థలో ఒక సభ్యుడైన చొంపి బాలరాజు.

ఆ వివాదస్పద నిబంధనను APMDC గత సంవత్సరం ఏప్రిల్‌లో తొలగించి, కొండదొర తెగకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లకు ఐదు సంవత్సరాలపాటు మైనింగ్‌ చేసుకునే లైసెన్సు ఇచ్చింది. కాని వాళ్ళెవరూ ఈ మూడు గ్రామాలకు చెందినవాళ్ళు కాదు.

‘‘ఈ కాంట్రాక్టర్లకి మైనింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. కేవలం కాగితంమీదనే వాటికి వాళ్ళు బాధ్యులు. ఇంతకాలంగా ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో ఆ ప్రైవేటు వ్యక్తులు వీళ్ళద్వారా ఆ భూమిలో మైనింగ్‌ దోపిడీ చేస్తారు’’ అని సమత స్వచ్ఛంద సంస్థ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవి వెబ్బాప్రగడ అంటున్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఈ కాంట్రాక్టును ప్రజల సహకార సంఘానికి యిచ్చివుండేదని ఆయన అంటున్నారు. కాంట్రాక్టర్లు నెలకు 4,000 మిలియన్‌ టన్నుల సున్నపురాయిని వెలికితీయగలరని, APMDC కి టన్నుకు 448రూపాయలు చెల్లించగలరని అంటున్నారు.

షెడ్యూల్డ్‌ ప్రాంతాలలోని పంచాయితీల చట్టం 1996లో నిర్దేశించినట్లుగా, ఈ లైసెన్సులు మంజూరు  చేయడానికి ముందు ప్రభుత్వం ఈ మూడు గ్రామాలలోనూ గ్రామ సభలు నిర్వహించలేదనికూడా ప్రజలు ఆరోపిస్తున్నారు.

‘‘మైనింగ్‌ జరపతలపెట్టిన ప్రాంతంలో 18 కుటుంబాలకు భూమి వుంది. వ్యవసాయ కూలీలుగా గాని, చట్టబద్ధమైన హక్కు లేకుండా తరతరాలుగా ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు కనీసం 130 వుంటాయి. వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని’’ రెబ్బాప్రగడ అన్నారు.

2012లో చెల్లించినట్లుగానే తమ భూమికి రాయల్టీ చెల్లించాలని, దానితోపాటు ఈ పథకం అమలులోకి వచ్చేంతవరకు ప్రతి సంవత్సరం కొంత డబ్బు చెల్లించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మైనింగ్‌ ఆగిపోయాక ఆ భూమిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి నిధిని కేటాయించాలని వారు కోరుతున్నారు. వీటితోపాటు భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, సెల్‌టవర్‌ ఏర్పాటు చేయాలని, 24గంటల వైద్య వసతి కల్పించాలని, రవాణా సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

‘‘మా కోర్కెలలో అత్యధికం అభివృద్ధికి సంబంధించినవి. నిజానికి అవి చేకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అయితే మేం ప్రైవేటు మైనింగ్‌ను వ్యతిరేకించినందుకు ప్రభుత్వం మమ్మల్ని శిక్షించింది. 1970లలో ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సున్నపురాయి నిక్షేపాలను కనుగొన్నప్పటినుంచి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పథకాలను ప్రభుత్వం నిర్వహించలేదు’’ అంటున్నారు ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న 60సంవత్సరాల పాండన.

అక్కడకు 40కిలోమీటర్ల దూరంలో బొబ్బిలిలో వున్న ఆసుపత్రి మాత్రమే అత్యంత దగ్గరలో వున్నట్లు లెక్క. ‘‘గ్రామాలలో శానిటేషన్‌ పనులు సక్రమంగా జరగకపోవడం మూలంగా మలేరియా, టైఫాయిడ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. బయటి వూళ్ళకు వెళ్ళడానికి సరైన రోడ్లులేవు. బయటవాళ్ళతో సంబంధం పెట్టుకోవడానికి అవసరమైన సెల్‌ కనెక్షన్‌కూడా లేదు అన్నారు బాలరాజు. సరైన విద్యావసతి లేకపోవడంతో చిన్న పిల్లలు కూడా ఇతర గ్రామాలకు వెళ్ళాల్సిన స్థితి వుంది.

తాము కేవలం ప్రభుత్వం భూముల్లో మాత్రమే మైనింగ్‌ చేస్తామని, అందుకు ప్రజలు అనుమతిని ఇవ్వాలని కాంట్రాక్టర్లు, APMDC డిసెంబర్‌ 2021లో ప్రతిపాదించారు. దీనికి సమాధానంగా ప్రజలు ఇలా డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాలకు ఎకరానికి ఒకటిన్నర లక్షల రూపాయలు చెల్లించాలి. మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి చుట్టపక్కల వున్న ప్రాంతాలలో ఏదైనా నష్టం వాటిల్లితే దానికికూడా కాంట్రాక్టరు పరిహారం చెల్లించాలి.

‘‘మాజీ మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌ , ఈ కొత్త కాంట్రాక్టర్లలో ఒకడైన దురియా రుక్మాని మమ్మల్ని మాటల్లో పెట్టి ఒప్పించడానికి ప్రయత్నిస్తునాడు. అతడి మనుషులు ఉత్సవాలు జరిపిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా మా డిమాండ్లన్నిటికి ఒప్పుకొని చట్టబద్ధమైన ఒడంబడికమీద సంతకం చేసేదాకా మేం లొంగేదిలేదు’’ అని బాలరాజు అన్నాడు.

(‘డౌన్‌ టు ఎర్త్‌’ అనే పత్రికలో 2022 జనవరి 29న ప్రచురితమైంది.)

అనువాదం : సిఎస్సార్ ప్రసాద్

Leave a Reply