గత రెండు సంవ‌త్స‌రాల జమా,ఖర్చుల విశ్లేషిస్తూ,రాబోయే సంవ‌త్స‌ర‌పు రాష్ట్ర అవసరాలే గాకుండా,భవిష్య‌త్తును దృష్టి లో పెట్టుకొని వివిధ రంగాలకు నిధులు కేటాయింపు చేయడమే బడ్జెట్ లక్ష్యం.ఇందులో,ప్రజల తక్షణ అవసరాలకై సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే,రాష్ట్ర సమగ్రాభివృద్ధికి  దోహదపడేలా నిధుల (మూలధన పెట్టుబడి) కేటాయింపులుండాలి.అప్పుడే క్రమక్రమంగా ప్రజలు తమకాళ్ళపై తాము నిలబడగలుతారు. భవిష్యత్తరాలు,ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని కొనసాగించగలిగే అవకాశంవుంటుంది కూడా.అయితే.ఇక్కడ కేవలం ఆర్థికాభివృద్ధి చెందడమే సరిపోదు,అందులో ప్రజలకు వారి వాటకూడా దక్కాల్సివుంటుంది. అలా ఆశించడం ఈ వ్యవస్థలో పేరాశనే అవుతుందనేది మరో అంశం.

 పొతే, కేవలం ఓట్ల రాజకీయాల్లో,   మంది బలం పై నడిచే నేటి రాజకీయాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి  అనేది ఒక నెరవేరని కల.అన్ని రాజకీయపార్టీలు,నేడు  ఓట్లవేటలో ప్రజల దీర్ఘ‌కాలిక ప్రయోజనాలను విస్మరించి,వారి మెప్పు పొందడం కోసం,వారి తక్షణావసరాలను తీరుస్తూ,వారిని ఎల్లప్పుడూ తమ కాళ్ళ దగ్గరే పడివుండేలా చూస్తున్నాయి.ఇందులో అన్ని రాజకీయపార్టీలు పోటీ పడుతున్నాయి.సంక్షేమ పథకాల పేరిట,ప్రజల సొమ్మునే ప్రజలకు కొంత పంచుతూ,వారిని మరోవైపు సారా మత్తులో ముంచి,తమపబ్బం గడుపుకోవడమే ప్రభుత్వాల ఏకైక విధానమైంది. ఆ మాత్రమైనా ప్రజలకందుతుందని తృప్తి పడేవాళ్ళూ వున్నారు.కానీ,ఆమాత్రం ప్రజలకంద‌జేయడానికి కూడా రాష్ట్రాలు ఆర్ధికాభివృద్ధి చెందక తప్పదు.అప్పుజేసి పప్పు బెల్లాలు ఎల్లకాలం పంచాలేరుగా.అయితే,దానికి సులభమైన మార్గం,ప్రభుత్వ(ప్రజల వుమ్మడి) ఆస్తులు అమ్మడం,నేటి పాలకులు కనుక్కున్నారనుకోండి. సంక్షేమ పథకాలు,చేపలను పట్టేందుకు వేసే “ఎర” లాంటివి.ఆకలితో వున్నప్పుడు  చేపలైనా,ప్రజలైనా వలకు దొరకాల్సిందే.అంతేగానీ,సంక్షేమ పథకాలు పాలకులకు ప్రజలపైన వున్న ప్రేమ మాత్రం కాదు అనేది  చేదు నిజం.అవి వుపశమనాలే తప్ప,శాశ్వత పరిష్కారాలు కాదు.

     

జగన్ ప్రభుత్వమూ, గత ప్రభుత్వాల బాటలో నడుస్తూనే మరింత ముందడుగు వేసింది.ఆంగ్లంలో ఒక నానుడి వుంది. One should know which side one’s bread is buttered. అందుకే ఓట్లను తెచ్చిపెట్టే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత నిచ్చింది.ప్రజలను తమ స్వంత కాళ్ళపై నిలబడి,స్వాభిమానంతో,స్వావలంబనతో బతికేలా జేసే పథకాలను నీరుగార్చింది.

                   

2020-21బడ్జెట్లో సంక్షేమ పథకాలకు రూ.24,719 కోట్లు కేటాయించగా,ఈ బడ్జెట్ లో 37,659 కోట్లు పెంచడం, సమర్థ‌నీయమైనా (ముఖ్యంగా కరోనా కాలంలో) రాష్ట్ర సమగ్రాభివృద్ధ‌కి  దోహదపడే వ్యవసాయ‌,పారిశ్రామిక,విద్యారంగాలను విస్మరించడం, దీర్ఘకాలంలో రాష్ట్రాన్ని దివాలాతీయిస్తుంది.  దేశ ఆర్థికానికి ఈ కరోనా కాలం లో కూడా  వ్యవసాయ రంగం దన్నుగా నిలిచిందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. కోట్లాది మందికి పరోక్షంగా,లక్షలాది రైతాంగానికి ప్రత్యక్షంగా లబ్ది చేకూర్చే ఆ రంగానికి జవం,జీవం సాగునీరే అని చెప్పక్కర్లేదు ఆ సాగునీటిపథకాలకు కేటాయింపులు 2019-20 బడ్జెట్ లో రూ.13,139 కోట్లు వుండగా, ఖర్చు పెట్టినది మాత్రం కేవలం రూ.5,300 కోట్లు  కావడం గమనార్హం. ఇక,2020-21 బడ్జెట్ లో రూ.11,185కోట్లు కేటాయించి,కేవలం రూ.5,239 కోట్లు గా సవరించిన అంచనాగా వుందంటే ,జగన్ ప్రభుత్వపు మాటలకు/రాతలకు చేతలకు మధ్య ఎంత వ్యత్యాశముందో అర్థం  చేసుకోవచ్చు. ఇక ఈ బడ్జెట్ లో రూ.కేటాయించిన రూ. 13,000 కొ. ఎంత విడు దలజేస్తారో,విడుదలజేసిన మొత్తం లో ఎంత ఖర్చుజేస్తారో  చెప్ప‌లేం. అంతేగాదు,మొత్తం వ్యవసాయ రంగానికి,పారిశ్రామిక రంగాలకు కేటాయింపులు తగ్గడంతో,ప్రజలకు  ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. అయితే,జగన్ ప్రభుత్వ పుణ్యమా అంటూ,వారు ఉపాధి కై  వెదుకాల్సిన పని లేదు.శ్రమ చేయాల్సిన పనీ లేదు. జగనన్న ఉచిత పథకాలతోఇంట్లో కూర్చొని హాయిగా కాలక్షేపం చేయవచ్చు.దానికి త్వరలో ఇంటింటికి ఉచిత కనెక్షన్ తో  ఒక టెలివిజన్ ఇచ్చినా ఇస్తారు.అవును మరి,ప్రచారానికి,ప్రజల ద‌గ్గరికి వెళ్ళడానికి  సంక్షేమ పథకాలకన్నా దగ్గరి,సులువైన దారి మరేముంది.అందుకే కాబోలు, ప్రచారానికై,సమాచార శాఖకు కేటాయింపులు 39 శాతం పెంచారు. సాగునీటి పథకాలు తక్షణ ఫలితాలివ్వవు కదా.

 అప్పులకుప్పయిన రాష్ట్రం తీసుకున్న అప్పుల వడ్డీ చెల్లింపులకై మరలా అప్పులు చేయాల్సిన ప‌రిస్థ‌తి.  రాష్ట్ర ప్రభుత్వం ,తెచ్చిన అప్పుల  వివరాలు,వాటి చెల్లింపుల వివరాలు చూస్తే ప్రభుత్వం దివాలాకి దగ్గరగా ఉందనిపిస్తుంది. జూన్ 5,2021 నాటికి ప్రభుత్వం చేసిన అప్పులు రూ.5,03,075 కోట్లు  కాగా వాటి చెల్లింపులు ఈ విధంగా ఉన్నాయి.

రంగం.                 రుణాలు(కోట్ల‌లో).              సకాలం లో చెల్లించనవి.            NPA

వ్యవసాయం          రూ.1,84,585                     రూ.31.920                    రూ.4,906

MSMS               రూ.61.984                        రూ.13,228                    రూ.4,550

ప్రాధాన్యతరంగం.    రూ.2,82,585                      రూ.47,686                    రూ.10,160

ప్రాధాన్యేతర           రూ.2,20,490                      రూ.23,711                   రూ.4,365

మొత్తం.                రూ. 5,03,075                     రూ.71,398

(ప్రజాశక్తి దినపత్రిక 5,జూన్,2021 )             రూ.14,425                                                                                                                           

 

 

       

కేవలం అప్పులపై,కేంద్రప్రభుత్వ నుండి ఆశిస్తున్న(ఊహాజనిత) గ్రాంట్ల పై ఆధారపడ్డ ఈ బడ్జెట్ కు  నిధులను సమకూర్చుకోవడంలో,ప్రభుత్వం  ఏ మేరకు సఫలమవుతుందో ,రాబోయే కాలానికి వదిలేద్దాం.రాష్ట్రానికి కాదు,దేశానికే వెన్నుముకగా నిలుస్తున్న వ్యవసాయరంగాన్ని చిన్న చూపుచూడడం ఈ బడ్జెట్ ప్రత్యేకత.2019-20  సం. ఆ రంగానికిరూ.20,677 కో కేటాయించగా,20-21 బడ్జెట్ లో ఆ మొత్తం ఏకంగా34% తగ్గించి రూ. 13,617కోట్లు కేటాయించారు.ఇప్పుడది 2021-22 లో కొద్దిగా పెంచి రూ. 14,049.29 కోట్లు పెంచారు. కోవిడ్ మహమ్మారి కారణంగా దేశం లో అన్ని రంగాలు కుదేలైనా,ఒక్క వ్యవసాయ రంగమే దేశ ఆర్ధిక పునరుజ్జీవనానికి దోహదపడుతుందని ఆర్ధికవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా,జగన్ ప్రభుత్వం వారి సలహాలను పెడచెవిన పెట్టడానికి కారణాలు ఆయన సలహాదారులు,వీరాభిమానులే వివరించాలి. అంతేకాదు,గ్రామీణాభివృద్ధి,పాఠ‌శాల విద్యకు నిధులు తగ్గించడం లాంటివి గ్రామీణులకు ఏమాత్రం ఉపయోగపడుతుందో అర్థంగాని విషయం. ప్రభుత్వ పాఠ‌శాలలను,ఒకవైపు నిధుల కొరతతో నిర్వీర్యంజేస్తూ,మరోవైపు అమ్మ ఒడికి నిధులు కేటాయించడం,ఆ నిధులు విద్యావ్యాపారుల ఒడిలోచేర్చేందుకు గాక,మరెందుకు?  చంద్రన్న,తన మంత్రివర్గం లో ఒక విద్యావ్యాపారికి స్థానం కల్పించగా,జగనన్న మరొక్క అడుగు ముందుకు వేసి,మరొక విద్యావ్యాపారికి ఏకంగా విద్యాశాఖనే అప్పగించాడు.

           

ఇక,వ్యవసాయరంగానికి దన్నుగా నిలిచే సాగునీటి పథకాలను చూద్దాం.2019-20  బడ్జెట్ లో ఆరంగానికి కేటాయింపు రూ.13,139 కోట్లు కాగా,ఖర్చు చేసింది కేవలం రూ. 5,300 కోట్లు. 2020-21 బడ్జెట్ లో,ఆ రంగానికి కేటాయింపు రూ.11,800 కోట్లు అంటే 10.15% తగ్గింపు అన్నమాట. అంతేకాదు సవరించిన అంచనా గా కేవలం రూ.5,239 కోట్లు  చూపించారు.ఇక నేటి బడ్జెట్ లో ఆ కేటాయింపు రూ. 13,00 కోట్లు  అందులోనూ ప్రణాళికేతర వ్యయం (సిబ్బంది జీతభత్యాలు,ఇతర ఖర్చులు).పోగా, నికరంగా సాగునీటి పథకాలపై ఖర్చుచేయద‌లచుకున్నది వీసంమాత్రమే.

     

సీమవాసుల కేంద్రీకరణంతా సాగునీటిపథకాలపై వుండటంలో ఆశ్చర్యమేముంది.ప్రాంతాలవారిగా పెద్ద,మధ్యతరహా ప్రాజెక్టులకు కేటాయింపులను చూద్దాం.

  రాయలసీమ.(4 జిల్లాలు)

1) గాలేరు-నగరి రూ.250.15 కోట్లు

2) హంద్రీ-నీవా రూ.1042.06 కోట్లు

3) తుంగభద్ర ఎగువ కాలువ రూ.429.75 కోట్లు

4) కేసి.కాలువ రూ.61.01 కోట్లు

5) తెలుగు గంగ రూ.909.90 కోట్లు  (నెల్లూర్ జిల్లా ను కలుపుకొని )

6) తుంగభద్ర దిగువ కాలువ రూ.30.32 కోట్లు

7) గురురాఘవేంద్ర కాలువ రూ.14 కోట్లు

8)పులివెందుల బ్రాంచ్ కాలువ రూ.149.16 కోట్లు

9) శ్రీశైలం కుడి కాలువ రూ.34.005 కోట్లు

10) తుంగభద్ర బోర్డ్ రూ. 121.12 కోట్లు

11) తుంగభద్ర ఎగువ కాలువ రూ.429.75  కోట్లు

మొత్తం రూ.2,378.16 కో. సాగునీటి బడ్జెట్ లో -18.23%



శ్రీకాకుళాంధ్ర-.(3 జిల్లాలు)

 1) వంశధార రూ. 42.185 కోట్లు

2) తోటపల్లి రూ189.70 కోట్లు

3) తారకరామతీర్థసాగర్ రూ.201  కోట్లు.

4) మహేంద్రతనయ.రూ.227 కోట్లు

5) ఉత్తరాంధ్ర సుజలస్రవంతి.రూ79.95 కోట్లు

6) మద్దివలస రూ. 8.50 కోట్లు

మొత్తం రూ.761.84 కో. సాగునీటి బడ్జెట్ లో-5.84%

దక్షిణాంధ్ర(.(4 జిల్లాలు) కృష్ణ,గుంటూర్,ఉభయగోదావరి జిల్లాలు)

1) పోలవరం.రూ.4510.41 కోట్లు సాగునీటి బడ్జెట్ లో 34.69%

1 ) తాడిపూడి రూ.46.49 కోట్లు

2) గోదావరి డెల్టా రూ 65.10 కోట్లు

3 ) చింతలపూడిఎత్తిపోతల రూ.115.00 కోట్లు.

4) క్రిష్ణా డెల్టా రూ370 కోట్లు

5) పులిచింతల రూ.31.06 కోట్లు.

6) చాగలనాడు. రూ. రూ.26.22 కోట్లు

7) పురుషోత్తపట్నం రూ. 14.33 కోట్లు.

మొత్తం రూ.`రూ.854.23 కోట్లు . సాగునీటి బడ్జెట్ లో-6.571 %

ప్రకాశం జిల్లా

1 ) గుండ్లకమ్మ రూ.10 కోట్లు

2)వెలిగొండ రూ.1595.38 కోట్లు.

మొత్తం రూ.1608.38 కో సాగునీటి బడ్జెట్ లో-12.346%

నెల్లూర్ జిల్లా .

1) సోమశిల-రూ. 70.22 కోట్లు

2) సోమశిల-స్వర్ణముఖి లింకు-రూ.57.05 కోట్లు

3) పెన్నార డెల్టా – రూ.210 కోట్లు. మొత్తం రూ.`337.27 కోట్లు. సాగునీటి బడ్జెట్ లో-2.59%

 

           

సాగునీటికి కేటాయించిన నిధులలో ప్రాంతాలవారిగా పరిశీలిస్తే, రాయలసీమకు 18.23%(21%)శ్రీకాకుళాంధ్ర -5.84%(5.48%), దక్షిణాంధ్ర-6.41%,పోలవరం తో 34.69%(41%),ప్రకాశం -12.346%(8.32%),నెల్లూర్- 2.59%గా కేటాయింపులు జరిగాయి. (బ్రాకెట్ లో చూపినవి 20-21 బడ్జెట్ కేటాయింపులవి )

      

పోలవరం, మొత్తం రాష్ట్రానికి లబ్ది కలిగించే ప్రాజెక్ట్ కాబట్టే దాన్ని దక్షిణాంధ్ర కోటాలో చేర్చడం అన్యాయమని కొందఱు భావించవచ్చు.పొతే,దశాబ్దాలుగా రాయలసీమ పట్ల ప్రభుత్వాలు అనుసరించిన వివక్షతను గమనం లోకి తీసుకుంటే, ఆ నీళ్ళు సీమకు అందవని  స్పష్టమవుతుంది.అంతేగాక, పోలవరం కు తాత్కాలిక ప్రత్యామ్నాయమంటూ  నిర్మించిన పట్టిసీమ నుండి లబ్దిపొందుతున్నది కృష్ణా డెల్టానే.అప్పుడు చంద్రన్న గాని,ఇప్పుడు జగనన్నగాని పట్టిసీమద్వారా అదనంగా పొందుతున్న 80 tmc లను సీమకు కేటాయిస్తూ జీ.ఓ.ఇవ్వకపోవడం,అంతేగాకా, పోలవరం ద్వారా పొందే జలాలను తమకే ఇవ్వాలని డెల్టా రైతుసంఘాలు తీర్మానాలు చేయడం సీమ ప్రజల అనుమానాలను నిజం చేస్తున్నాయి.నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్దయివుంటే ,పోలవరం పూర్తయ్యాక అనీరు సీమకే కేటాయించాలనే ఉద్దేశ్యంఉంటే ఇప్పుటికే, పట్టిసీమ ద్వారా విడుదలయ్యే నీటికి సమానంగా  సీమకే కేటాయించాలి.

 

     

రాయలసీమలో జిల్లాలవారిగా కేటాయింపులని విశ్లేషించేముందు,దశాబ్దాలుగా సీమ ప్రజల డిమాండ్లను చెప్పాల్సివుంది.సీమప్రజలకు ప్రధానంగా నీరందిస్తున్నది తుంగభద్రానది అనే విషయం మరువరాదు.ఎప్పుడో బ్రిటీష్ ప్రభుత్వం లో ప్రారంభమయిన కె.సి.కాలువ ద్వారా కర్నూల్,కడప జిల్లాలకు 39.9 tmc ల నీటిని,ఆ తర్వాత 1956 నుండి తుంగబద్ర జలాలను  అందిస్తున్న తుంగభద్ర ఎగువ కాలువ 32.5 tmc , తుంగభద్ర దిగువ కాలువ 29.5 tmc ల ఆయకట్టుకు,కేటాయించిన వాటిలో సగం నీల్లయిన అందించే ప్రయత్నం జరగలేదు.కేటాయించిన నీటిని నిల్వజేసుకునేందుకు గుండ్రేవుల రిజర్వాయర్, తుంగభద్ర ఎగువ కాలువ కు ప్రత్యామ్నాయంగా తుంగభద్ర ఎగువ సమాంతరకాలువ నిర్మాణం,తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు స్థిరీకరణకై వేదవతినది పై ఎత్తిపోతల, ఆర్ డి  ఎస్ వరదకాలువ ను,కేటాయించిన కృష్ణా జలాలను వినియోగించుకొనేందుకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం లాంటి పథకాల ఊసేలేదు.జగన్ ఎన్నికలముందు హామీ ఇచ్చిన గుండ్రేవుల రిజర్వాయర్ గురించి రెండు బడ్జెట్ లలో ప్రస్తావన లేకపోవడం గమనార్హం. సీమ విషయం,జగన్ గర్వంగా చెప్పుకునే  “మడమ తిప్పడు,మాట తప్పడు”-వర్తించదేమో?

        మొదట ముఖ్యమంత్రిగారి జిల్లాకే పోదాం.

           

కడప జిల్లాలో మనకు కొట్టవచ్చినట్టు కనపడే కేటాయింపులు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడ్,గాలేరు-నగరి ప్రాజెక్టుకు కేటాయింపులు.3 జిల్లాలకు సాగునీరందించే గాలేరు-నగరి,నత్తకూడా గర్వపడేలా,అతినెమ్మదిగా నడుస్తున్నది. ఈ బడ్జెట్ లో కడప  జిల్లాలో కేటాయించినది రూ.1,545.28 కోట్లు (,రూ.1,173.86కోట్లు ).దాదాపు రూ.4వేల కోట్లకు పైగా అవసరమయ్యే గాలేరు-నగరి కి కేటాయించినది రూ.250.16 కోట్లు ( గత బడ్జెట్ లో  జగన్ రూ.1073 కోట్ల రూపాయలు కేటాయించడంతో కడప జిల్లావాసులకే గాకా,చిత్తూర్ జిల్లా ప్రజలకు ఆశలు మోసులేత్తాయి. కానీ,విడుదలజేసింది కేవలం రూ. 564.54 కోట్లు.) గండికోట రిజర్వాయర్ కు  నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం పోగా ఇక గాలేరు-నగరి కడప జిల్లా గడప దాటడం అసంభవమే. పులివెందుల బ్రాంచ్ కాలువకు రూ.149.165 కోట్లు ( రూ.69.76 కోట్లు),మైలవరం రూ. కై రూ.40 కోట్లు.ప్రతిపాదనలు పంపగా,కేటాయించింది రూ.2 కోట్లు. (రూ.5.93 కోట్లు.),వెలిగల్లు రూ.1.51 కోట్లు (రూ.1.31 కోట్లు.),బుగ్గనవంక రూ.1 కొ.( 1 కోట్లు), అన్నమయ్య-1 కోట్లు( 1 కోట్లు),లోయర్ సగిలేరు రూ.0.20 కోట్లు (0.20 కోట్లు),మేజర్ ఇరిగేషన్-రూ. 93.29 కోట్లు. (రూ.59 కోట్లు) మొత్తం-రూ. 1,545.28   కోట్లు

 పై కేటాయింపులను జగన్ డిసెంబర్ 2019 కడప పర్యటన సందర్బం లోజేసిన హామీల నేపథ్యం లో జూస్తే, మాటలకు చేతలకు మధ్య హస్తిమశకాంతరం తేడా కనపడుతుంది.కడపజిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు నీరందించే బ్రహ్మసాగర్ జలాశయం పూర్తిగా మరిచారు.దాదాపు రూ.3,733 కోట్లు తో 7నూతన ప్రాజెక్టులకు జగన్ 19 డిసెంబర్ 2019న శంకుస్థాపన చేసాడన్న విషయం గమనం లోకి తీసుకుంటే , ఈ బడ్జెట్లో కేవలం రెండు పథకాలకు మాత్రమె నిధులు అరకొరగా కేటాయించబడింది.ఇక, నీటి సరఫరాను వేగవంతం చేయడానికి వివిధ కాలువుల పారుదల సామర్థ్యం పెంపుకై రూ.2కోట్లు.హామీకూడా వుంది.అవేమీ ఈ బడ్జెట్ లో మచ్చుకైనా కన్పించవు.

           

అత్యంత కరువు పీడితజిల్లా  అనంతపూర్ జిల్లా విషయానికొస్తే, పరిస్థితి ఆశాజనకంగా లేదు. జిల్లా నుండి రూ.4000 కోట్లు ప్రతిపాదనలు పంపగా,వాటిని పునః ప్రతిపాదన గా రూ.1700 కోట్లు. కై తిప్పి పంపారు. చివరకు కేటాయించినది రూ.1040 కోట్లు. అనంతపూర్ జిల్లా ప్రజలు సాగు,తాగు నీటికి  మొదటినుండి ఆధారపడివున్నది  తుంగభద్ర ఎగువ కాలువ పైనే.ఆ తర్వాతి కాలం లో అనంతపూర్  జిల్లావాసులకు వరప్రదాయినిగా  కనపడుతున్నది,హంద్రీ-నీవా.కానీ కొన్ని దశాబ్దాలుగా ఆ కాలువ మొదటిదశ కూడా పూర్తికాలేదు.తుంగభద్ర ఎగువ కాలువ నుండి అందవలసిన 32.5tmc లకు గాను, తుంగభద్ర డ్యాం పూడిక వల్ల,పైభాగాన అనధికారిక నీటి వినియోగం వల్ల కొన్ని దశాబ్దాలుగా 15 tmc ల కన్నా మించి నీరంధలేదు. దానికి ప్రత్యామ్నాయంగా జలవనరుల నిపుణులు తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. కానీ ఏ ప్రభుత్వమూ దాన్ని  పట్టించుకోలేదు.ఆ నీల్లన్నీ నదిలో పారి, కృష్ణ లో చేరి సాగర్ ,డెల్టా ఆయకట్టులను సస్యశ్యామలం చేస్తూ, చివరకు సముద్రాన్ని చేరుతున్నాయి.ఆదలావుంచుతే, తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరనైనా చేపట్టి, నీటి వృధాను అరికట్టుతారా అంటే,అదీలేదు. ఆధునీకరణ కు రూ.540 కో.అవసరమని అంచనాలుంటే, బడ్జెట్ కేటాయింపులు రూ. 260 కోట్లు(రూ.62 కోట్లు) సంవత్సరం, సంవత్సరం పెరిగే ధరలతో , ఆధునీకరణపై కూడా ఆశ వదులుకోక తప్పదేమో?

          

4 జిల్లాలకు తాగు,సాగునీరందే హంద్రీ-నీవా పథకం ఎక్కడిగొంగలి అక్కడ వేసినట్టే వుంది. నాయకుల ప్రచారమే గాని,కాలువ సామర్థ్యం  పెంచడం,ఉప,పిల్లకాలువుల నిర్మాణం ఏ మాత్రం జరగలేదు.కళ్ళముందు ప్రధాన కాలువ పారుతున్నా,రైతులు తమ  పొలాలకు నీరు పెట్టుకోలేని స్థితి. హంద్రీ-నీవా పథకం పూర్తయ్యేందుకు ఇంకా 1,345 కోట్లు. అవసరమైతే,2020-22  లో కేటాయించింది కేవలం రూ.516.81 కోట్లు  (రూ 565 కోట్లు)మాత్రమె. జలవనరుల శాఖ పూర్తి మరిచిపోయిన ఒక ప్రాజెక్ట్ భైరవానితిప్ప ప్రాజెక్ట్. వేదవతి నది జలాలపై ఆధారపడిన,4.9 tmc ల సామర్థ్యంగల ఈ రిజర్వాయర్లో దశాబ్దాలుగా ఏనాడు 1 tmc నీరు నిల్వకాలేదు.అందుకై హంద్రీ-నీవా నుండి నీటిని ఎత్తిపోయాలని జీడిపల్లి- భైరవానితిప్పఎత్తిపోతల పథకానికి రూ.510 కోట్లుతో శంకుస్థాపన జరిగింది. నేటి బడ్జెట్ లో దానికి  ఒక్క రూపాయి కేటాయించక పోవడం గమనార్హం. ( రూ.౩౦ కోట్లు.). పార్టీలు మారినా, సీమ ప్రజల పట్ల పాలకుల వివక్షతలో ఏ మాత్రం మార్పులేదు.

 చిత్తూర్ జిల్లా           

        

మొదటినుండి భూగర్భాజలాలపైనే ఆధారపడివుంది.కాలువల సాగు ఆ రైతాంగానికి ఏనాడు అందుబాటులో లేదు.వరద జలాలపై ఆధార పడ్డ  హంద్రీనీవా,గాలేరు-నగరి అనే రెండుపథకాలు చిమ్మ చీకట్లో కాంతి రేఖలని ఆ జిల్లా ప్రజలనుకుంటున్నారు. . కేవలం 40 tmc ల నీటిని ఎత్తిపోసే హంద్రీనీవా 600 కి,మీ. ధాటి,మూడు జిల్లాల రైతాంగపు దాహం తీర్చి చిత్తూర్ జిల్లా చేరుతుందనే ఆశ అక్కడి ప్రజలకుండొచ్చునేమో గాని, చాలామంది జలనిపుణలకు లేదు.అదేగాక ఇంకా దాదాపు రూ.2000 కో.పైగా ఖర్చయ్యే ఈ ప్రాజెక్ట్ కు కేటాయింపులు-రూ.525 కోట్లు. ( రూ.287.43) కోట్లు.మరో అశారేఖ అయిన గాలేరు-నగరి కడప గడప దాటనంటుంది.కేవలం,17% పనులు కూడా పూర్తిగాని,ఈ ప్రాజెక్ట్ పనులకు ఇప్పుడు కేటాయించిందిరూ.250.15 కొ.(రూ.350 కో).మాత్రమె.ఇక కృష్ణాపురం రిజర్వాయర్ కు 2020-21 లో రూ 6.6 కోట్లు కేటాయించి విడుదలజేసింది రూ. రూ 4.44 కోట్లు. ఈ బడ్జెట్ లో కేటాయింపు రూ.6.62కోట్లు,కాగా విడుదలజేసేది ఆ దేముని దయ. చిత్తూర్ జిల్లావాసుల విషాదమేమంటే,కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలను చంద్రన్న రద్దుజేస్తే,చంద్రన్న ప్రతిపాదనలను జగనన్న రద్దుచేయడం. ఈ పరిస్థితులలో  తాగు,సాగు నీటి పథకాల పూర్తికి మరి కొన్ని దశాబ్దాలు వేచివుండాల్సిందే.

   

కర్నూల్ జిల్లా

రాయలసీమకు జలరాజదానిగా చెప్పుకొనే కర్నూల్ జిల్లా నీటి పథకాల కేటాయింపులను పరిశీలిద్దాం.నాలుగు జిల్లాలకేగాక,అటు తెలంగాణ ,ఇటు సాగర్,కృష్ణా డెల్టాలకు నీటి సరఫరా కేంద్రంగా కర్నూల్ జిల్లాను చెప్పవచ్చు. రాష్ట్రానికి జలవిద్యుత్తు, తెలంగాణా,దక్షిణ కోస్తాలకు జలరిజర్వాయర్ (శ్రీశైలం) నిర్మాణానికి రెండుపంటలుపండే కె.సి.ఆయకట్టు 88వేల ఎకరాలను త్యాగంజేసిన చరిత్ర జిల్లా రైతాంగానిది.మరి,గత అర్థశతాబ్దం లో వీరికి దక్కింది హల్లికి హళ్లి,సున్నకు,సున్నా.చంద్రబాబు జీ.ఓ69 తో అందే నీళ్ళకు ఉరితాడు బిగిస్తే,ఏ రాజకీయపార్టీ నోరువిప్పని చరిత్ర .ఇక,వాల్లెవ్వరూధక్షిణ కోస్తా ఆదిపత్యవర్గాలనెదురించాలేరని తెల్సిన జిల్లా రైతాంగం,తమకు కేటాయించిన నీటిని సకాలం లో అందుకునేందుకు సిద్దేశ్వరం అలుగు నిర్మించాలని వుద్యమాలుజేస్తే,అటు చంద్రన్న,ఇటు జగనన్నాకూడా నోరు విప్పలేదు.జగనన్న ఒకడుగు ముందుకు /వేనుకకు వేసి సంగమేశ్వరం ఎత్తిపోతల అంటూ తెలంగాణాతో స్పర్థలు పెంచి సిద్దేశ్వరం అలుగు నిర్మాణ ప్రతిపాదనకు మరిన్ని అడ్డంకులు కొని తెచ్చాడు. వివాదాలపై బతకాలనుకున్న నాయకులు అంతకంటే వేరే ఏం చేయగలరు?

                        

అందుకే,తమ యజమానులనొప్పించేందుకు ఇష్టం లేకనే కాబోలు,బడ్జెట్ లో   సిద్దేశ్వరం అలుగు,గుండ్రేవుల రిజర్వార్ (మాటతప్పని,మడమతిప్పని నాయకుడని ,ఎవరైనా జ్ఞాపకంజేసేరు)ల ఊసేలేదు.అంతకుముందు హంద్రీ-నీవా కాలువ నుండి మరిన్ని నీళ్ళను సరఫరాజేసేందుకై,ప్రభుత్వమూ,దాని తైనాతీయులు ప్రచారం చేసుకున్న హంద్రీ-నీవా సమాంతర కాలువ మాట అసలేలేదు. దానికై రూ.630 కో.ప్రతిపాదనలు పంపారు కూడా. అంటే కాదు కర్నూల్ జిల్లాలో 88 వేల ఎకరాలకు నీరు అందించాల్సి వుండగా,20 వేల ఎకరాలకు నీరంధడం లేదు.దానికి ఉప,పిల్లకాలువల నిర్మాణంతోపాటు,పత్తికొండ ప్రాంతం లో 108 చెరువుల నింపాలనే ప్రతిపాదన ఒక్క అడుగూ ముందుకు కదలలేదు.ఇక ఎప్పటినుండో సరైన నిర్వహణ లేక వచ్చిన నీళ్ళను సరిగా అందించలేని కె.సి కాలవకు జీతభత్యాలు,ఇతర ఖర్చులతోసహా కేటాయింపులు రూ. 8.55 కోట్లు. (రూ.101కోట్లు).రెండుజిల్లాల కు కలిసి 1,76.536 ఎకరాలకు నీరందించే SRBC కి రూ.34 కోట్లు. (రూ.94.55 కోట్లు.) కేటాయించారు.తరచూ ప్రధాన కాలువకు గండ్లుపడే  ఈ ప్రాజెక్ట్ నుండి సక్రమంగా నీరు సరఫరాకావాలంటే గోరుకల్లు రిజర్వాయర్, ఔక్ టన్నెల్లు పూర్తికావల్సి వుంది.2002 పూర్తయినట్టు చెప్పబడుతున్న ఈ ప్రాజెక్ట్ గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణ లోపాలవల్ల ఔక్ టన్నెల్లు పూర్తికాకపోవడం తో,దాని ఆయకట్టుదారులు ఏనాడు పూర్తిగా లబ్దిపొంధలేదు. గాలేరునగరిద్వారా నీరందిస్తానన్న జగన్ తన వివాదాస్పద జీ.ఓ.2005 లో కూడా ఆ ఊసు ఎత్తకపోవడం గమనార్హం. తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టుస్తిరీకరణ,66 ఎకరాలకు సాగునీరందించేందుకై చేపట్టిన గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాల (12)కై  1999 జూన్ లో పరిపాలన అనుమతి పొందిన రెండు దశాబ్దాల తర్వాతనైనా దాని ప్రకటిత లక్ష్యం నెరవేరుతుందా?దీనికి కేటాయింపులు రూ. 14 కోట్లు. (రూ.48.49కోట్లు.). ఇక ,కర్నూల్ జిల్లాలో కరువుపీడిత పక్షిమ మండలాలకు తాగు,సాగుకై,24tmc లనీరందించే తుంగభద్ర దిగువ కాలువ దశాబ్దాలుగా 10 tmc ల నీరు కూడా అందించలేకపోతుంది.పైభాగాన జలచౌర్యమే గాక,తుంగభద్ర డ్యాం లో పూడిక చేరడం దానికి  కారణం. తుంగభద్ర దిగువ కాలువ,వేదవతి ఎత్తిపోతల మరియ ఆర్ ది ఎస్ కుడి కాలువ లకూ కలిపి  రూ.30.32 కోట్లు(రూ.30.1కోట్లు.)కేటాయించడం గమనార్హం..ఆయకట్టుదారులకు,వారికి కేటాయించిన నీరు పూర్తిగా అందాలంటే వృధాగా పోతున్న వేదవతి జలాలను ,కేవలం 4 tmc లకు కుదించకుండా, లభ్యమయ్యే  దాదాపు 23 tmc ల ఎత్తిపోతపథకాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.అయితే జగన్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తలేదు.ఇక చిన్న,చితక పథకాలైన గాజులదిన్నేకు రూ.07.89 కోట్లు సిద్దాపురం ఎత్తిపోతలకు రూ. 14.49 కోట్లు (రూ.5.9 కోట్లు) కేటాయించారు. వరదరాజుల స్వామి ప్రాజెక్ట్ కు రూ.7.85 కొ. తెలుగు గంగ కు రూ.2 కోట్లు సుంకేశుల రూ. 1.20 కోట్లు మొత్తంపైన,కేటాయించింది,జీతభత్యాలు,ఇతర నిర్వహణ ఖర్చులతో సహా, కేవలం రూ.-రూ.123.30 కోట్లుకేటాయించారు. ఇక తుంగభద్ర బోర్డ్ కు రూ.124కోట్లు కేటాయించారు.

             

ఏ ప్రభుత్వమైనా అన్నిజిల్లాల అవసరాలను ఒకే బడ్జెట్ కేటాయింపులతో తీర్చలేదు.కాని,నిధుల కేటాయింపులలో ఆయా ప్రాంత ప్రత్యెక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి.వెనుకబడిన ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. ఇది సహజ న్యాయసూత్రం. కాని మొదటినుండి అన్ని పార్టీలు అభివ్రుద్దిపొందిన ప్రాంతాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు.అందుకు  జగన్ మినహాయింపు కాదని గత రెండేళ్ళలోనే రుజువు చేసుకున్నారు. చంద్రన్న మాదిరే,జగనన్న పోలవరం జపంచేస్తూ,అధిపూర్తయితే, కృష్ణా-గోదావరిఅనుసంధానం తో  సీమ సస్యశ్యామలం అవుతుందని ఎండమావుల్లో దాహం తీర్చుకోమంటున్నారు.ఇక సంక్షేమపథకాలు ఓట్లను రాలుస్తాయి. ప్రచారానికి స్వంతమీడియా,పెంచిపోషిస్తున్న స్వగణం ఉండనే వుంది.కులాలవారీగా విడిపోయిన ప్రజలున్నారు.అంతేకాదు,మూడు రాజధానులంటూ మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి,ప్రజల్ని మౌళిక సమస్యల నుండి ధృష్టి మారల్చడం లో సఫలమయ్యాడు. సీమ ప్రజలు గతంలాగానే, తమను కరువునుంది కాపాడే దైవం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. వ్యక్తిపూజకు దాసోహం అన్నంత కాలం పరిస్థితిలో మార్పునాశించలేము.

  

చివరి వాఖ్యానం :  సాగునీటి పథకాల పూర్తిజేయడం, కొత్తపథకాలను చేపట్టడం అటుంచితే,అధికావర్షాలవల్ల లభ్యమయిన నీటిని ఒడిసి పట్టడం లో ప్రభుత్వ వైఫ్యల్యాన్ని ఏమనాలి? కొత్త రిజర్వాయర్ల నిర్మాణాలు లేకపోవడమటుంచితే ,చెరువులలో  పూడికలు,ఉన్న రిజర్వాయర్ల లీకేజీలు,వీటిపట్ల పాలకుల నిర్లక్ష్యం ఈ కింది వివరాలను పరిశీలిస్తే స్పస్టమవుతుంది.

                       

2019-20లో రాష్ట్రంలో లభ్యమయిన నీరు 8,637 .14  టిఎంసి లు కాగా,ఆడిట్ నివేదిక ప్రకారం మనం వినియోగించుకున్నది (భూగర్భంలో ఇంకినది+మట్టిలో కలిసినది+రిజర్వాయర్లలో నిల్వ) కేవలం 978.16టిఎంసి లు.అంటే 11.32% మాత్రమే. – (ది హిందూ,  5 అక్టోబర్ 2019). రాష్ట్రం లో చిన్న,మధ్య తరహా, పెద్ద రిజర్వాయర్ల నిలవసామర్థ్యం 982.35 టిఎంసి లు కాగా నిల్వజేసుకున్నది కేవలం 311.10 టిఎంసి లు మాత్రమే. సముద్రం పాలయినవి 2019-20 లో కృష్ణా జలాలు  1268.62 టిఎంసి లు, గోదావరి జలాలు 1991 టిఎంసి లు. ఇక 2020-21 లో సముద్రం పాలయిన కృష్ణా జలాలు  903 టిఎంసి లు. అయినా సీమ జిల్లాలవ సాగు,తాగు నీరు లేక డిసెంబర్ నెలకు ముందునుండే గ్రామాలకు,గ్రామాలు ఖాళీ కావడానికి ఎవరిని నిందించాలి ప్రకృతినా? ప్రభుత్వాలనా ?

Leave a Reply