భావుకత, అన్వేషణ కలగలసిన కవిత్వం
ఖమ్మం జిల్లా రచయిత్రి రూప రుక్మిణి కలం నుండి జాలు వారిన అక్షరాలు సమకాలీన జీవితాన్ని సుతిమెత్తగా స్పృశిస్తాయి. సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇవ్వాల్టి జీవన పరిస్థితుల లోతులను భావుకతతో అన్వేషిస్తూ, వ్యక్తీకరిస్తూ సాగిన కవితల సమాహారమే ‘‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’’ సంపుటి. శూన్యం కవితలో.. ‘‘పచ్చి గుండెను తవ్వి చూడకు భరోసాగా భుజమెప్పుడు పానుపు కాలేదని తప్పొప్పుల లెక్కల్లో ఆమెకెప్పుడూ విశేషాలేమీలేని సశేషాలే మిగిలాయి’’ అంటూ మహిళ బతుకును ఆవిష్కరించారు. ‘ఒంటరి’ కవితలో ‘‘క్షణాలన్నీ పొరలు పొరలుగా తెగి పడుతూ పగిలిన అద్దం పైన మరకల్లా’’ అంటూ వేదనను పలికించటానికి అద్దాన్ని వస్తువుగా తీసుకుని వర్తమానాన్ని కళ్ళ ముందుంచారు.