ఛత్తీస్గఢ్లో 29 మందిని చంపిన సందర్భం
మొదటగా, బ్రిటీష్ సామ్రాజ్యం భారతదేశంలోని మెజారిటీ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని భగత్ సింగ్ నమ్మాడు. గుర్తుంచుకోండి, అందరూ కాదు –మెజారిటీ. బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి పెద్ద పాలులో భారతీయులు ప్రయోజనం పొందుతూండేవారు. వారికి మద్దతుగా వుండేవారు. వారే రాజులు-చక్రవర్తులు, భూస్వాములు-నవాబులు, బ్యూరోక్రాట్లు, న్యాయమూర్తులు, పోలీసులు, సైన్యం మొదలైనవారు .
బ్రిటీష్ ఉన్నతాధికారులు (బ్యూరాక్రసీ), న్యాయమూర్తులలో అధిక భాగం భారతీయులే. సైన్యంలో మెజారిటీ భారతీయులు, పోలీసులలో భారతీయులు మాత్రమే ఉన్నారు. రెండవది, భగత్ సింగ్, అతని సహచరులు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పెకలించి పారేయాలని నిర్ణయించుకున్నారు. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో కాదు, ఆయుధాలతో. అవసరమైతే, ప్రతీకాత్మకంగా అయినా, బ్రిటిష్ అధికార క్రూరమైన ప్రతినిధులను చంపడం ద్వారా కూడా . ఇది ఒక్క భగత్ సింగ్ మాత్రమే కాదు, అతని ముందు, అతని తర్వాత చాలా మంది చేశారు. ఉధమ్ సింగ్ లాంటి వాళ్లు బ్రిటన్ వెళ్లి ఇలాంటి క్రూరమైన వాళ్లను చంపేశారు. వారికి కాంగ్రెస్, గాంధీ మార్గాలు సరిపోలేదు..
భగత్ సింగ్, అతని సహచరులు కూడా ఆయుధాలతో బ్రిటిష్ పాలనను సవాలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ క్రూరమైన ప్రతినిధులను చంపారు లేదా చంపటానికి ప్రయత్నించారు. వారు ఆ విషయాన్ని దాచలేదు కూడా. ప్రతిగా, బ్రిటిష్ ప్రభుత్వం ఆ వ్యక్తులకు మరణశిక్ష (ఉరి) విధించింది. వారు సంతోషంగా స్వీకరించారు. మనలో చాలా మందిమి ఇందుకోసం కూడా భగత్ సింగ్ను గుర్తుంచుకుంటాం, అతని ధైర్యాన్ని, వీరత్వాన్ని మెచ్చుకుంటాం.
ఈ వారసత్వం భగత్ సింగ్తో ముగిసిందని, వారసులు ఎవరూ లేరని కాదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ ప్రజాయుద్ధం జరిగింది. తెలంగాణ సాయుధ ప్రజాయుద్ధం (1946 నుండి 1951 వరకు) దీనికి ఉదాహరణ. ఇందులో వందలాది కాదు వేల సంఖ్యలో రైతులు, వ్యవసాయ కూలీలు, యువకులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వారిని చంపేశారు, అత్యాచారం తదితర అన్ని రకాల వేధింపులకు గురయ్యారు.
ఇక నక్సల్బరీ (1967) అందరికీ గుర్తుంది. వేలాది మంది ఆదివాసీలు, రైతులు, యువకులు భారత రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, చాలా మంది మరణించారు. మహాశ్వేతా దేవి నవల ‘హజర్ చౌరాసి కి మా’ అందరికీ గుర్తుండే ఉంటుంది. నక్సల్బరీ తర్వాత, హిందీ ప్రాంత గుండెకాయ భోజ్పూర్-సహార్ (1970ల) విప్లవకర సాయుధ పోరాటం గుర్తుండే ఉంటుంది.
అటువంటి వ్యక్తులు ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్తో సహా ఆదివాసీ ప్రాంతాలలో భారత రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ ప్రజాయుద్ధం కొనసాగిస్తున్నారని భారత ప్రభుత్వం చెబుతోంది. అలాంటి వారిని భారత రాజ్యం ‘మావోయిస్ట్లు’ అని అంటుంది.
మొదట్లో భారత ప్రభుత్వం ఇలాంటి వారిని ‘కమ్యూనిస్టులు’ అని పిలిచేది. ఈ పేరు పెట్టి తెలంగాణలో పెద్ద ఎత్తున ఇలాంటి వారిని చంపేశారు. అప్పుడు ఈ ‘కమ్యూనిస్టుల’ నాయకులు తాము భారత రాజ్యానికి సంబంధించిన అన్ని చట్టాలు, నియమాలను అంగీకరిస్తామని, సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామని చెప్పారు. తిరిగి చాలా మంది ‘కమ్యూనిస్టులు’ భారత పాలక వర్గాలకు మిత్రులయ్యారు.
తరువాత ప్రజాయుద్ధం లేదా సాయుధ మార్గాల ద్వారా రాజ్యాధికారాన్ని సవాలు చేసేవారిని ‘నక్సలైట్లు’ అని పిలిచారు. మళ్ళీ నక్సలైట్లను తుడిచిపెట్టే కేంపెయిన్ మొదలుపెట్టారు. వారిని ఎంపిక చేసి హత్య చేశారు. అప్పుడు నిన్న నక్సలైట్లుగా వున్నవారిలో ఎక్కువ భాగం వీటన్నింటినీ వదిలేస్తున్నాం అన్నారు. వారిలో అధిక భాగం భారత పాలక వర్గానికి మిత్రులుగా మారారు.
మళ్ళీ కొంతమంది ముందుకు వచ్చారు, వారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ప్రజాయుద్ధం చేస్తున్నారు. వారిని ఈ రోజు ‘మావోయిస్ట్లు’ అని అంటున్నారు. మహా దయామయుడుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వారిని ‘అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పు’ అన్నాడు. నేడు ప్రజాస్వామ్యం, ప్రజా ప్రయోజనాల గొప్ప న్యాయవాది చిదంబరం వారిని అంతమొందించడానికి క్రూరమైన ప్రణాళిక వేశాడు.
ఏప్రిల్ 16వ తేదీన మావోయిస్టులనే అనుమానంతో 29 మందిని హత్య చేశారు.
మొదటగా, వారి క్రూరమైన హత్యల పట్ల నా తీవ్ర వేదనను తెలియజేస్తున్నాను. వారు ఆదివాసీలుగా తమ ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు లేదా ఆదివాసేతరులుగా ఆదివాసీల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. వారి పోరాటానికి, వారి అమరత్వానికి వందనం (సలాం) చేస్తున్నాను. వారి పోరాట పద్దతి ఏదైనా కావచ్చు కానీ అది భగత్ సింగ్ పద్ధతే కదా.
అలాంటి వారిని భగత్ సింగ్ సంప్రదాయానికి వారసులుగా నేను భావిస్తాను, అలాంటి వారు నేటి భారత పాలక వర్గాన్ని తెల్ల బ్రిటిష్ వారికి బదులుగా నల్ల బ్రిటిష్ వారిగా చూస్తున్నారు. ఇర్విన్ స్థానంలో తేజ్ బహదూర్, పురుషోత్తం లేదా ఠాకూర్ దాస్ రావడం వల్ల ఎటువంటి తేడా ఉండదని వారు చెప్పారు. వాళ్ళు ఆదివాసీల నీరు, అడవి, భూమిని దోచుకునే వాళ్ళే. తెలంగాణా కాలంలో సీపీఐ ఎలా చూసేదో, నక్సల్బరీ కాలంలో సిపిఐ (ఎంఎల్) అలా భావించేది.
మనలో చాలా మందికి తెలిసో, తెలియకో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. వారి మాటల సారాంశం భగత్ సింగ్ ఆలోచనలు, విధానాలను నేను సమర్థిస్తాను. రష్యాలో విప్లవం వచ్చినట్లుగా భారతదేశంలో విప్లవం రావాలని భగత్ సింగ్ కలలు కన్నాడు, నా కల కూడా అదే. కానీ నేను తెలంగాణలోని వేలాది మంది భగత్ సింగ్లతో లేను. కొందరు అంటారు – నేను తెలంగాణ భగత్ సింగ్తో ఉన్నాను కానీ, వేలాది మంది నక్సల్బరీ భగత్ సింగ్లతో కాదు అని. మరికొందరు , నేను నక్సల్బరీకి చెందిన భగత్ సింగ్తో ఉన్నాను, కానీ భోజ్పూర్- సహర్లోని వందలాది భగత్ సింగ్లతో కాదు అని అని అంటారు. కొంతమంది అంటారు – నేను భోజ్పూర్-సహర్లోని భగత్ సింగ్తో ఉన్నాను, నేను అతనిని నమ్ముతున్నాను, కానీ నేను ఆంధ్రా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ భగత్ సింగ్లతో లేను…
భగత్సింగ్ కాలంలో భగత్సింగ్తో నిలబడటం చాలా మందికి కష్టమే కాదు, అసంభవంలాగా వుండిది. అలాగే తెలంగాణ, నక్సల్బరీ, భోజ్పూర్, నేటి భగత్ సింగ్తో కూడా నిలబడటం చాలా మందికి కష్టమే కాదు, అసాధ్యంగా కూడా వుంది. వారిలో నేను కూడా ఉన్నాను.
అలాంటప్పుడు వారు భగత్ సింగ్తో ఎందుకు నిలబడలేదు, భగత్ సింగ్కు అనుకూలంగా ఎందుకు వాదించలేదు, భగత్ సింగ్కు అనుకూలంగా ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు రాయలేదు అనే ప్రశ్న వ్యర్థం. మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులనే వారు ఎదుర్కొన్నారు.
(డాక్టర్ సిద్ధార్థ్ రచయిత, జర్నలిస్టు)
मुश्किल तो अपने समय के भगत सिंह के साथ खड़ा होना है: संदर्भ छत्तीसगढ़ में मारे गए 29 आदिवासी या गैर-आदिवासी