మహిళలకు చట్టసభ ల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును డి లిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ)బిల్లుతో ముడి వేసి 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశపెట్టగా, అది వీగిపోయింది.. మరు సటి రోజు ప్రధానమంత్రి మోడీ, “మహిళా బిల్లుపై మేము నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు బ్రూణ హత్య చేశాయి మహిళలారా క్షమించండి” అని సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇది కోట్లాది మహిళలకు జరిగిన ద్రోహం గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్ణించాడు.. శాసనసభ హాజరుకాని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు ఏం సాధించాయి అని వ్యాఖ్యానించారు..
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన చర్చ గత 30 ఏళ్లుగా సాగుతున్నది.. 1992లో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించి నారు. 1996 లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ప్రక్రియకు ప్రయత్నాలు ప్రారంభమై నా 2010 వరకు ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2010లో 108 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యసభ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించింది. కానీ లోక్ సభ లో ఈ బిల్లును ఆమోదం పొందకపోవడం, 2014లో ప్రభుత్వం మారడంతో మహిళలకు మరోసారి నిరాశే మిగిలింది. 2024 ఎన్నికల ముందు, 2023 సెప్టెంబర్ లో మోడీ ప్రభుత్వం “నారీ శక్తి అది నీయం” పేరుతో బిల్లును 128 వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్ సభ లో భారీ మెజారిటీతో (454/543), రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొంది చట్టంగా మారింది. మూడు దశాబ్దాల పోరాటానికి ఒక విజయంగా కనిపించింది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది.ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. దీనిని జనగణన, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఆర్టికల్ 334 -ఏ ద్వారా అనుసంధానం చేశారు. ఫలితంగా 2026 నాటికి కూడా మహిళలకు రిజర్వేషన్ అందని ద్రాక్ష గాని మిగిలిపోయింది. ఇలా మొదటి నుంచి మహిళలకు రిజర్వేషన్ను దూరం చేసిన ఎపిసోడ్ బిజెపి దే.
ఇంత చరిత్ర ఉండగా, ఈమధ్య హడావిడిగా ఈ బిల్లును ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టడం వెనుక మోడీ కుట్ర ఉందని అందరికీ తెలిసిన మే. డిలిమిటేషన్ తో ముడివేసి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉండడమే కాక దీనిపై అఖిలపక్ష సమావేశం జరపాలని కూడా కోరుతూ వచ్చారు. కానీ మోడీ ప్రభుత్వం ఒకవైపు అందుకు ఒప్పుకోకపోగా, ఇంకోవైపు రిజర్వేషన్లు సమర్థిస్తూ జాతీయ మీడియాలో వ్యాసాలు రాశాడు .. లోక్ సభలో ప్రతిపక్షానికి సంపూర్ణ మెజారిటీ అంటే రెండు బై మూడు వంతు లేనప్పుడు ప్రతిపక్షాలను సమ్మతింప చేసుకోవలసిన ప్రయత్నం జరగాల్సి ఉంది. కానీ ఇక్కడే బిజెపి రాజకీయ డ్రామాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2024 ఎన్నికల్లో బిజెపి లోక్ సభ లో మైనారిటీలో పడింది. కనుక 2029 ఎన్నికల నాటికి సంపూర్ణ మెజారిటీ లోక్ సభ లో సాధించాలంటే ప్రతిపక్షాలపై తప్పుడు ప్రచారం సాగించాలి.తమకు లోక్ సభ లో మెజారిటీ లేదు కనుక డీ లిమిటేషన్ తో ముడివేసి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు కచ్చితంగా ఓడిపోతుందని వారికి తెలుసు..ఓడిపోయిన తర్వాత విపక్షాలు అందుకు సహకరించలేదని ప్రచారం చేయడం ద్వారా మహిళలను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టవచ్చు. మహిళా ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు.ఇది మోడీ మార్కు రాజకీయం.
బిజెపికి లోక్ సభ లో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా 33% రిజర్వేషన్లు చాలా సులభంగా అమలు పరచవచ్చు. అందుకు ప్రతిపక్షాలు సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి . కానీ ఆ పని చేయడానికి మోడీ షా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రస్తుత సంఖ్యా బలాన్ని 50% పెంచి డి లిమిటేషన్ చేసి మాత్రమే అమలు చేయాలని వారు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ మేరకు బిల్లు 50% పెంచుతామనే ప్రతిపాదన పొందుపరచలేదు.. ప్రతిపక్షాలు ఆమోదిస్తే వీళ్ళు ఆ మేరకు సవరించడానికి నోటిమాటగా సభలో సిద్ధపడ్డారు. అది ఎంతవరకు సమంజసం వారే చెప్పాలి. సీట్ల పెంపుపై ఇంత గట్టి పట్టు ఎందుకని దానిపై విమర్శలు వచ్చాయి.. ఉన్నఫళంగా 33 శాతం మహిళలకు ఇస్తే, పురుషుల వాటా 67% గణనీయంగా పడిపోతుంది. సంఖ్యాపరంగా చేసినప్పుడు 363 కు పడిపోతుంది. దీంతో తమకు అనుకూలమైన సంపన్న వర్గాలకు, వారి తాబేదారులైన వారికి సీట్లు తగినంతగా కేటాయించడం సాధ్యం కాదు. అందువల్లనే మోడీ షా ప్రభుత్వం సీట్లు పెంచి తీరాలని భావిస్తున్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు 1950లో లోక్ సభ సభ్యత్వం 522. 1973 లో (1971 జనాభా లెక్క ల ప్రకారము) చేసిన డీలిమిటేషన్ ప్రకారము లోక్ సభ సభ్యత్వం 542 కు పెరిగింది. ఈ పెరుగుదల కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్దగా సీట్లు పెరగలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం గణనీయంగా తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ఇందులో భాగంగా బిజెపికి మద్దతు పలుకుతున్న చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువ మంది పిల్లల్ని కనమని మహిళలకు పిలుపునిస్తున్నారు. ఆయన ఒక్కరి తో సరిపెట్టుకొని, ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను ముగ్గురేసి పిల్లల్ని కనమని పిలుపునివ్వడం ఎట్లా సమంజసం అవుతుంది? మహిళల స్వేచ్ఛ స్వాతంత్రం సాధికారత గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు తిరిగి మహిళల ను శాసించడం చాలా అసహజమైన విషయం.. ఇది మహిళల శారీరక మానసిక ఒత్తిడికి గురి చేయడం తప్ప వేరే ఏమీ కాదు..
బిజెపి నిజంగా మహిళా రిజర్వేషన్ తేవాలనుకున్నప్పుడు మహిళలను మనువాద దృష్టితో చూడదు. రాజకీయ పార్టీలలో స్వయానా బీజేపీ వారే మహిళల పైన అత్యాచారాలు చేసిన వారిలో ఎక్కువమంది ఉన్నారు .. దీనికి ఉదాహరణ ఉన్నావ్, హత్రాస్ సంఘటనలు. హత్రాస్ లో ఒక దళిత మహిళ అత్యాచారానికి,హత్యకు గురైతే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నించిన విలేకరులపై ‘ఊపా ‘ కేసు నమోదు చేశాడు. స్వయంగా భార తీయ జనతా పార్టీ ఎంపీ పై మహిళా అథ్లెట్లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుదీర్ఘంగా నిరసన తెలిపిన ఆ పార్లమెంటు సభ్యులపై ఎట్టి చర్యలు తీసుకోలేదు. తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకైన బండి భగీరథ పై pocso కేసు నమోదైన, ఆయన ను అరెస్టు చేయకపోవడంతో తెలంగాణ సమాజమంతా తీవ్ర ఆందోళనలతో అట్టుడికి పోతుంది.. ఇలాంటి చరిత్ర కలవారు మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు ఎలా ఇస్తారని అనుకోవాలి.
నేడున్న అసమాన సమాజంలో స్త్రీలకు రాజకీయ రిజర్వేషన్లు వచ్చినంత మాత్రాన వాళ్లు తమ దోపిడీ పీడనల నుంచి విముక్తి కారు. 1992లో 73, 74 సవరణ ప్రకారం స్థానిక సంస్థల్లో లభించిన రిజర్వేషన్ల ఫలితంగా స్థానిక సంస్థల అధిపతులుగా ఎన్నికైన మహిళల స్థానంలో వారి భర్తలు లేదా గ్రామ పెద్దలు అధికారాలు నిర్వహిస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. మహిళలకు
పురుషా దిక్యతపై సరైన అవగాహన ను కల్పించిన తర్వాత తమ రాజకీయ అధికారాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోగలరు.
సంఖ్య రీత్యా అధికంగా ఉన్న సాధారణ మహిళల విద్య, ఆరోగ్యం,ఉపాధి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకుండా మహిళల సాధికారత సాధ్యమవుతుందా.. మహిళలు పురుషులతో సమానంగా ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమానత్వ సాధించినప్పుడే వారికి నిజమైన విముక్తి లభిస్తుంది..




