2024 సెప్టెంబర్ 19నాడు మా మట్టి మాలి సురక్ష మంచ్ ప్రముఖ నాయకుడు కార్తీక్ నాయక్‌ను, భారతీయ శిక్షా స్మృతి కింద చట్టవిరుద్ధంగా గుమికూడడం, తీవ్రమైన గాయాలు కలిగించడం, హత్యాయత్నం వంటి అనేక ఆరోపణలపైన అరెస్ట్ చేసారు. సిజిమాలి/తీజ్మాలి కొండలలోని 1,549 హెక్టార్ల భూమిని (ఇందులో 699 హెక్టార్ల స్వచ్ఛమైన అటవీ ప్రాంతం ఉంది) వేదాంత సంస్థ ప్రతిపాదించిన బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా, రాయగడ, కలహండి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఆదివాసీలను నాయక్ సమీకరిస్తున్నారు.

అంతకుముందు అదే ఏడాది, 2024 జూన్ 3నాడు మూల్ నివాసీ బచావో మంచ్ (ఎమ్‌బిఎమ్) ఉపాధ్యక్షురాలు సునీత పొట్టంను బీజాపూర్ పోలీసులు రాయ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. ఎటువంటి వారెంట్ లేకుండా, అరెస్టుకు గల కారణాలను తెలపకుండానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 2021 నుండి, గ్రామస్తుల ముందస్తు సమాచారం లేదా అంగీకారం లేకుండా సంప్రదాయ భూముల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయడం, భద్రతా సిబ్బంది చేసే మానవ హక్కుల ఉల్లంఘనలు, తీవ్రవాద ఆరోపణలతో ఆదివాసీలను భారీగా జైళ్లలో నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్‌బిఎమ్ పోరాడుతోంది. సునీత తనపై ఉన్న 12 క్రిమినల్ కేసుల్లో తొమ్మిదింటిలో నిర్దోషిగా విడుదలైనప్పటికీ, బహిరంగ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నదని; ప్రభుత్వ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని పేర్కొంటూ, అక్టోబర్ 2024లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రత చట్టం కింద ఎమ్‌బిఎమ్‌ను నిషేధించింది. 2025 ఏప్రిల్‌లో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆమెను మళ్లీ అరెస్ట్ చేసింది. ఈసారి చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం (ఉపా)కింద, ఎమ్‌బిఎమ్‌ ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. సునీత నేటికీ జైలులోనే ఉన్నారు.

మరోచోట, 2017లో, జెసూట్ పాస్టర్‌లు, సామాజిక కార్యకర్తలు అయిన స్టాన్ స్వామి, జేవియర్ సోరెంగ్, ‘తీవ్రవాదం’ అనే ఆరోపణలతో ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న విచారణా ఖైదీల విడుదలను కోరుతూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. సరైన ఆధారాలు, ప్రాసిక్యూషన్ అనుమతులు లేదా ఛార్జీషీట్లు లేకపోయినా వీరి విచారణలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. రాంచీలోని ‘బగైచా’ అనే సామాజిక కార్యాచరణ కేంద్రం రూపొందించిన పరిశోధనా నివేదిక ఆధారంగా ఈ ప్రజార్జిత వ్యాజ్యం (పిఐఎల్)దాఖలైంది. ఆదివాసీలను వారి భూములు, సహజ వనరుల నుండి దూరం చేయడం, ఉపా, క్రిమినల్ లా (అమెండ్‌మెంట్) యాక్ట్ 1908 (సిఎల్‌ఎ)వంటి భద్రతా చట్టాల ద్వారా వారిని క్రమబద్ధంగా జైళ్లలో నిర్బంధించడం మధ్య ఉన్న సంబంధాన్ని ఈ నివేదిక వెల్లడించింది. కుఖ్యాతి గాంచిన భీమా-కోరేగావ్ కేసులో స్టాన్ స్వామిని కూడా అవే ఆరోపణలతో త్వరలోనే అరెస్ట్ చేశారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే మరణించినప్పటికీ, ఈ పిఐఎల్ దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

‘రాజకీయ ఖైదీలు’ అంటే మనం సాధారణంగా సామాజిక-రాజకీయ కారణాల కోసం పోరాడుతున్న వ్యక్తులను ప్రభుత్వం ‘తప్పుడు కేసుల’ ద్వారా లక్ష్యంగా చేసుకుందని భావిస్తాం. ఇటువంటి వేధింపులను చట్టాన్ని వక్రీకరించడమని లేదా అమాయకులపైన, ‘న్యాయబద్ధమైన’ అసమ్మతిని వ్యక్తం చేసేవారిపైన ప్రభుత్వ అధికారాన్ని ‘దుర్వినియోగం’ చేయడమని మనం అంటాం. అయితే, మన దృష్టిని కేవలం వ్యక్తులకే పరిమితం చేయడం ద్వారా, వనరుల స్వాధీనం కోసం వలసవాద, వలసవాదానంతర ప్రభుత్వ ప్రాజెక్టులలో భాగంగా ఆదివాసీలను నేరస్తులుగా చిత్రీకరించే వ్యవస్థాగత ప్రక్రియను మనం గమనించలేకపోతున్నాం. వారు తమ స్వంత భూముల్లోనే ‘అక్రమ ఆక్రమణదారులు’ గానో, లేదా తమ జీవనోపాధి, రాజకీయ స్వేచ్ఛను వినియోగించుకుంటున్నందుకు ‘తీవ్రవాదులు’ గానో ముద్ర వేయబడుతున్నారు. ఈ మూడు సంఘటనలలోని వేధింపుల చట్టపరమైన చట్రం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది: వ్యక్తుల నిర్బంధం అనేది కేవలం ఒక వ్యక్తిపై చర్య కాదు; అది తమ రాజకీయ స్వేచ్ఛను, చట్టబద్ధమైన హక్కులను కోరుతున్న ప్రజాస్వామిక ఉద్యమాలు, అణగారిన వర్గాలపైన సాగించే ఒక సామూహిక శిక్షా ప్రక్రియ. ఈ క్రమంలో ఉపా, ఛత్తీస్‌ఘడ్ స్పెషల్ పీపుల్స్ సెక్యూరిటీ యాక్ట్ (సిఎస్‌పిఎస్‌ఎ), సిఎల్‌ఎ వంటి భద్రతా చట్టాలు, అలాగే చట్టవిరుద్ధంగా గుమిగూడటం లేదా కుట్రకు సంబంధించిన ఐపిసి (ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత లేదా (బిఎన్‌ఎస్) నిబంధనలు మొదట ‘సంఘటితం అవ్వడాన్ని’ నేరంగా పరిగణిస్తాయి. తద్వారా మధ్య-తూర్పు భారతదేశంలోని ఆదివాసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాల్లోకి ఇవి తమ విష కోరలను చాచుతున్నాయి.

పంతొమ్మిదవ శతాబ్దం చివరలో, ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో, వలసరాజ్యాల ప్రభుత్వం ఎమినెంట్ డొమైన్ సిద్ధాంతాన్ని* క్రోడీకరిస్తూ వరుస చట్టాల ద్వారా భూమిని, అడవులను, సహజ వనరులను స్వాధీనం చేసుకుంది. ఉదాహరణకు, నేటికీ అమలులో ఉన్న భారత అటవీ చట్టం 1927, అడవులను పాలించే హక్కును రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించింది. దీని కోసం అధికార యంత్రాంగాన్ని, క్రిమినల్ యంత్రాంగాలను ఉపయోగించుకుంది. మరోవైపు, ఆదివాసీలకు, ఇతర అటవీ నివాసులకు ఉన్న హక్కులను హరించివేస్తూ, అడవిపై ఆధారపడిన వారి జీవనోపాధిని నేరంగా పరిగణించింది. తద్వారా వారిని వారి స్వంత భూముల్లోనే ‘అక్రమ ఆక్రమణదారులు’గా మార్చింది.

స్వతంత్ర భారతదేశం గత ఏడు దశాబ్దాలుగా తన అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా IFA మరియు భూసేకరణ చట్టాల వంటి వాటిలో ఉన్న ఇదే ‘ఎమినెంట్ డొమైన్’ నిర్మాణాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా, దాన్ని మరింత విస్తరించింది. పెద్ద ఆనకట్టలు, పరిశ్రమలు మరియు సహజ వనరుల వెలికితీతకు మార్గం సుగమం చేయడం కోసం ఆదివాసీలే అత్యధికంగా నష్టపోయారు. భారీస్థాయిలో అంతర్గత స్థానభ్రంశం (internal displacement) మరియు ఆస్తిపాస్తుల కోల్పోవడం (dispossession) ద్వారా అభివృద్ధి భారాన్ని వారు మోయాల్సి వచ్చిందనేది బహిరంగ రహస్యం.

భారత రాజ్యాంగం, ఐదవ షెడ్యూల్ కింద, ఆదివాసీలకు వారి సంప్రదాయ భూములు, అడవులపైన గల హక్కులను గుర్తిస్తుంది; అటువంటి భూములను ఇతరులకు బదిలీ చేయడాన్ని నిషేధిస్తుంది; గ్రామసభల వంటి సాంప్రదాయ సంస్థలకు నిర్ణయాధికారాలను కట్టబెడుతుంది. పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) చట్టం 1996 (పెసా) ప్రకారం, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సంప్రదాయ భూములు, అడవులు, సహజ వనరులను ఉపయోగించే ముందు గ్రామసభలతో ముందస్తు సంప్రదింపులు జరపడం తప్పనిసరి. అటవీ హక్కుల చట్టం 2006 (ఎఫ్‌ఆర్‌ఎ) ఒక అడుగు ముందుకు వేసి, అటవీ నివాసులను వారి స్వంత భూముల్లోనే అక్రమ ఆక్రమణదారులుగా మార్చిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఇది అడవులపై వారికి ఉన్న వ్యక్తిగత, ఉమ్మడి హక్కులను గుర్తించడంతో పాటు, తమ సంప్రదాయ వనరులను రక్షించుకునే, నిర్వహించుకునే హక్కును గ్రామసభలకు కల్పిస్తుంది. 2013 నాటి నియమగిరి తీర్పులో, అటవీ భూములను ఇతర అవసరాలకు మళ్లించేటప్పుడు గ్రామస్థుల ‘ముందస్తు, సమాచారంతో కూడిన అంగీకారం’ తీసుకోవడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని తదనంతరం అనేక రాజ్యాంగ ధర్మాసనాలు సమర్థించాయి. రాజస్థాన్‌లోని పవిత్ర వనాలను రక్షించే విషయంలో 2024 డిసెంబర్‌లో కూడా సుప్రీంకోర్టు దీనిని పునరుద్ఘాటించింది.

ఇన్ని రాజ్యాంగ, చట్టపరమైన రక్షణలు ఉన్నప్పటికీ, ఆదివాసీలను ‘అక్రమ ఆక్రమణదారులు’గా పిలిచే ధోరణి ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ‘పర్యావరణ పరిరక్షణ’, ‘భద్రత’ అనే కొత్త ముసుగులలో వ్యక్తమవుతోంది. 2019 ఫిబ్రవరిలో, పదవీ విరమణ చేసిన అటవీ అధికారులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎఫ్‌ఆర్‌ఎ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పైన విచారణ చేస్తూ, అటవీ భూముల్లో ఉన్న ‘అక్రమ ఆక్రమణదారులను’ ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదృష్టవశాత్తూ, ఆ ఉత్తర్వును ప్రస్తుతం నిలిపివేసారు, కానీ పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆదివాసీలను వెళ్లగొట్టడం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తరాఖండ్‌లోని కార్బెట్, రాజాజీ నేషనల్ పార్కులలోని వన్ గుజ్జర్లు చేస్తున్న పోరాటం దీనికి నిదర్శనం.

ఆదివాసీలను కేవలం ‘అక్రమ ఆక్రమణదారులు’గా భావించి వెళ్లగొట్టడం లేదా భారతదేశ అభివృద్ధి ఆకాంక్షలలో వారు కేవలం అదనపు నష్టంగా మిగిలిపోవడం మాత్రమే ఇక్కడ అసలు విషయం కాదు. చారిత్రక కోణంలో చూస్తే, తమ సంప్రదాయ భూములు, అడవులపై తమకు ఉన్న రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కులను వినియోగించుకోవడాన్ని కూడా నేరంగా పరిగణించడం, దానిపై పోలీసులు క్రూరమైన హింసను ప్రయోగించడం కనిపిస్తుంది.

గతంలో జరిగిన కొన్ని ఉదంతాలను గుర్తుచేసుకుంటే:

•             2001 (జార్ఖండ్): కోయల్-కారో జలవిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసుల కాల్పుల వల్ల ఎనిమిది మంది ముండా ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు.

•             2006 (ఒడిశా): జాజ్‌పూర్‌లోని టాటా స్టీల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినందుకు కళింగనగర్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఒక మైనర్‌తో సహా 13 మంది మరణించారు.

•             2021 (ఛత్తీస్‌గఢ్): సిలంగేర్‌లో గ్రామసభ అనుమతి లేకుండా సంప్రదాయ భూముల్లో సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించినందుకు జరిగిన పోలీసు కాల్పుల్లో ఒక మహిళతో సహా నలుగురు ఆదివాసీలు మరణించారు. ఈ సిలంగేర్ కాల్పుల ఘటనే మూల్ నివాసీ బచావో మంచ్ ఆవిర్భావానికి కారణమైంది.

2013 సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా, నియమగిరిలో బాక్సైట్ మైనింగ్‌ను 12 గ్రామాలు ఏకగ్రీవంగా తిరస్కరించిన చాలా కాలం తర్వాత, 2017లో ఆ అంశాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగా నియమగిరి సురక్ష సమితి ఒక నిషేధిత ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోందనే ఆరోపణలతో ఉపా కింద దానిని లక్ష్యంగా చేసుకున్నారు. 2018లో జార్ఖండ్‌లోని ఖుంటి, పరిసర జిల్లాల్లో జరిగిన పతల్‌గఢి ఉద్యమం, ‘ల్యాండ్ బ్యాంకుల’ ఏర్పాటును, రక్షణ చట్టాలను నీరుగార్చడాన్ని వ్యతిరేకించింది. దీని ఫలితంగా స్టాన్ స్వామితో సహా 10,000 కంటే ఎక్కువ మందిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి.

తీజ్మాలిలో కార్తీక్ నాయక్ అరెస్ట్ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఆయన అరెస్టుకు ఏడాది ముందే, ప్రతిపాదిత బాక్సైట్ మైనింగ్ కోసం పర్యావరణ ప్రభావ అంచనా ప్రక్రియలో భాగంగా నిర్వహించే బహిరంగ విచారణల ముందు, అనేక అక్రమ నిర్బంధాలు, ప్రముఖ సామాజిక కార్యకర్తల అరెస్టులు జరిగాయి. అదే ఏడాది డిసెంబర్‌లో, ప్రభుత్వం గ్రామసభల నుండి చట్టబద్ధమైన సమ్మతిని పొందే ప్రక్రియను నిర్వహించింది; అయితే, ఇవి ‘నకిలీ’ అని ప్రభావిత గ్రామస్తులు ఒడిశా హైకోర్టులో సవాలు చేశారు. 2025 జనవరిలో ప్రభావిత గ్రామాల్లో బహిరంగ సమావేశాలకు ఆటంకాలు కలిగించడం, పేరు తెలియని అనేక మందిపై ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ముందస్తు, సమాచారంతో కూడిన అంగీకారం’ అనే హక్కుకు ఇన్ని ఉల్లంఘనలు జరిగినప్పటికీ, ఇటీవల అటవీ పరిరక్షణ చట్టం (ప్రస్తుత వన సంరక్షణ ఏవం సంవర్ధన్ అధినియం) కింద ఆ బాక్సైట్ గనికి ‘స్టేజ్-I’ అటవీ క్లియరెన్స్ లభించింది.

మొత్తం మీద చూస్తే, భూముల స్వాధీనం, ఆదివాసీలను నేరస్తులుగా మార్చే ఈ విధానం రాబోయే సంవత్సరాల్లో మరింత తీవ్రం కానుంది. కోవిడ్-19 విపత్తు సమయం నుండి (అంతకు ముందు నుండే), కేంద్ర ప్రభుత్వం ‘వ్యాపార సౌలభ్యం’ పేరుతో అడవులు, పర్యావరణ పరిరక్షణ, మైనింగ్‌కు సంబంధించిన చట్టపరమైన చట్రాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ మార్పులు అడవుల ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేస్తాయి, అనేక ప్రాజెక్టులకు చట్టపరమైన నిబంధనల నుండి మినహాయింపులు ఇస్తాయి; గ్రామసభల సమ్మతి అవసరాలను, పర్యావరణ రక్షణ చర్యలను నీరుగారుస్తాయి. 2025 చివరలో, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గ్రామసభలకు ఇచ్చిన ఉమ్మడి హక్కుల పత్రాలను రద్దు చేస్తూ అపూర్వమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పు హస్‌దేవ్‌లోని అదానీ బొగ్గు మైనింగ్ ప్రాజెక్టుకు దశాబ్ద కాలంగా అడ్డుగా ఉన్న ప్రధాన చట్టపరమైన అడ్డంకిని తొలగించింది.

భూముల స్వాధీనమూ, ఆదివాసీలను నేరస్థులుగా మార్చే ఇటువంటి పరిస్థితుల మధ్యే ఉపా, సిఎస్‌పిఎస్‌ఎ, సిఎల్‌ఎ తదితర భద్రతా చట్టాలు అమలవుతున్నాయి. సాధారణంగా, బెయిల్ పొందే అవకాశం లేకపోవడం వల్ల ఏళ్ల తరబడి విచారణా ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్న ‘రాజకీయ ఖైదీల’ విషయంలో, ఈ చట్టాల ‘దుర్వినియోగాన్ని’ పౌర సమాజం తీవ్రంగా విమర్శిస్తుంటుంది. నిశ్చయంగా, ఇది ఆందోళన కలిగించే విషయమే.

అయితే, ఇటువంటి భద్రతా చట్టాల అసలు ఉద్దేశం సంస్థలను నిషేధించే అధికారంలో ఉంది. ఉపా కింద, సెక్షన్ 3 ప్రకారం ఒక సంస్థను ‘చట్టవిరుద్ధమైనది’గా గానీ, లేదా సెక్షన్ 35 ప్రకారం ‘ఉగ్రవాద’ సంస్థగా గానీ నిషేధించవచ్చు. ఒక చట్టవిరుద్ధమైన సంస్థపై నిషేధం ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది; దీని కోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడిన తాత్కాలిక ట్రిబ్యునల్  ముందు ఒక నామమాత్రపు విచారణ ప్రక్రియ జరుగుతుంది. కానీ, ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించబడిన వాటిపై నిషేధం శాశ్వతంగా ఉంటుంది; వీటికి కనీసం అటువంటి ముందస్తు సమీక్షా అవకాశం కూడా ఉండదు. అదేవిధంగా, సిఎస్‌పిఎస్‌ఎ చట్టం కూడా ఒక సంస్థను ఏడాది పాటు ‘చట్టవిరుద్ధమైనది’గా నిషేధించే అధికారాన్ని కలిగి ఉంది. దీనిపై నిషేధం విధించిన తర్వాత, ఒక సలహా మండలి సమీక్ష నిర్వహిస్తుంది; అయితే ఈ మండలిలో న్యాయాధికారి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

అస్పష్టమైన నిర్వచనాలు, ఏకపక్ష చర్యలకు అతీతంగా, సంస్థాగత నిషేధాలు ప్రభుత్వం తన నేరారోపణల వలయాన్ని “నేరపూరిత అనుబంధం” అనే తర్కం ద్వారా విస్తరించడానికి వీలు కల్పిస్తాయి. ఇక్కడ ప్రభుత్వం ప్రతి వ్యక్తి చేసిన తప్పును విడివిడిగా నిరూపించాల్సిన అవసరం లేదు; నిందితుడు ఒక నిషేధిత సంస్థలో సభ్యుడనే సాధారణ ఆరోపణతో అసంఖ్యాక వ్యక్తులను నిరవధికంగా, శిక్షాత్మకమైన విచారణాధీన నిర్బంధంలోకి తీసుకురావచ్చు. సునీత పొట్టం కేసులో ఈ తర్కం ఇంకాస్త ముందుకు వెళ్లింది—ఆమె సభ్యురాలిగా ఉన్న సంస్థ అసలు నిషేధానికే గురి కాలేదు, కానీ అది మరొక నిషేధిత సంస్థకు “ముసుగు సంస్థ” (ఫ్రంటల్ ఆర్గనైజేషన్) అని ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్ షీట్‌లో పేర్కొంటే సరిపోతుంది. ప్రస్తుతం ఎమ్‌బిఎమ్‌పైన సిఎస్‌పిఎస్‌ఎ కింద ఉన్న నిషేధ కాలపరిమితి ముగిసినప్పటికీ, ఎమ్‌బిఎమ్‌ ఒక ఉగ్రవాద సంస్థకు ముసుగుగా పనిచేస్తోందనే ఆరోపణలతో సునీత ఇంకా కస్టడీలోనే ఉన్నారు. నిజానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో ఎమ్‌బిఎమ్‌ ఒక ముసుగు సంస్థ అని ఎక్కడా పేర్కొనలేదు.

2016 నాటి ‘బగైచా’ నివేదిక ఎత్తిచూపినట్లుగా, ఈ “నేరపూరిత అనుబంధం” అనే తర్కంతో విస్తరిస్తున్న నేరారోపణల వలయం అనేది కేవలం ‘తప్పుడు కేసులు’ లేదా చట్టాన్ని ‘దుర్వినియోగం’ చేయడం గురించి మాత్రమే కాదు. వేలాది మంది ఆదివాసీలు అరెస్టు నిబంధనల ఉల్లంఘనలు జరగడం, ఆధారాల కొరత ఉన్నప్పటికీ, కేవలం ‘సభ్యత్వం’ కలిగి ఉన్నారనే ప్రాథమిక ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్నారు. ఉపా సెక్షన్ 10 కింద ‘క్రియాశీల సభ్యత్వం’ అనే ప్రమాణాన్ని సమర్థించడం ద్వారా సుపీమ్ కోర్టు ఈ పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం ఉండేది. అంటే, కేవలం సభ్యత్వం ఉంటే సరిపోదు, హింసాత్మక చర్యల్లో లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటేనే నేరంగా పరిగణించాలి. కానీ, 2023 నాటి అరూప్ భుయాన్-II తీర్పులో సుప్రీంకోర్టు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది; కేవలం సభ్యత్వం ఉన్నదనే ఆరోపణల ఆధారంగా నేరారోపణ చేయవచ్చని సమర్థించింది.

మనం ఊహించుకునే ‘రాజకీయ ఖైదీలు’ సామాజిక-రాజకీయ కారణాల కోసం వాదించే వ్యక్తులు కావచ్చు లేదా కాకపోవచ్చు, కానీ ఈ ‘అక్రమ ఆక్రమణదారులు’ లేదా ‘తీవ్రవాద’ ఖైదీలు క్రిమినల్, భద్రతా చట్టాల ద్వారా సృష్టించబడిన బాధితులు. ఈ చట్టాలు ఆదివాసీలను మొత్తంగా పుట్టుకతోనే అనుమానితులు, నేరస్తులు, ఉగ్రవాదులు అయిన  ఒక సమూహంగా పరిగణిస్తున్నాయి.

* ఎమినెంట్ డొమైన్ సిద్ధాంతం: యజమాని అనుమతి లేకుండా కూడా, ప్రైవేట్ ఆస్తిని ప్రజా వినియోగం కోసం తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుంది , యజమానికి న్యాయమైన పరిహారం అందుతుంది; చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరిస్తుంది . ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి సామాజిక సంక్షేమాన్ని వ్యక్తిగత ఆస్తి హక్కులతో సమతుల్యం చేస్తుంది, దీనికి చట్టబద్ధమైన ప్రజా ప్రయోజనం, చట్టపరమైన అధికారం, ఆస్తికి న్యాయమైన చెల్లింపు అవసరం. భారతదేశంలో, ఈ అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A, 2013 ఎల్‌ఎఆర్‌ఆర్ చట్టం ద్వారా నియంత్రిస్తుంది; చట్టం ద్వారా, సరైన పరిహారంతో తప్ప ఆస్తి తీసుకోబడదని నిర్ధారిస్తుంది.

LARR (Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013): భూసేకరణ, పునరావాసం; పునరావాసంలో న్యాయమైన పరిహారం- పారదర్శకత హక్కు చట్టం-2013. 2014 జనవరి 1, నుండి అమలులోకి వచ్చిన ఈ భారతీయ చట్టం, ప్రభావిత భూ యజమానులకు న్యాయమైన పరిహారం, పునరావాసం, పారదర్శకతను నిర్ధారించడానికి భూసేకరణను నియంత్రిస్తుంది. 

2026 జనవరి 21

https://www.outlookindia.com/national/voices-from-prison-how-indias-security-laws-criminalise-adivasi-resistance

Leave a Reply