సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్
కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది..
అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి, నెత్తుటినది కాస్త రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు..
చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను తద్వారా పాలకుల దురాగతాల్నే భూమికగా చేసుకుని కవిత్వం రాస్తున్నాడు. నేలదాహం తీరని సామ్రాజ్యవాదపోకడల్ని కవిత్వంగా మన ముందుంచుతున్నాడు.
బిసాన్ ఓవ్డా అనే ఈ కవిత్వం పాలస్తీనా నేలపై గాజా భూభాగంపై సాగుతున్న మరణమృదంగాన్ని రాశాడు. బిసాన్ ఓవ్డా అనే పాలస్తీనా జర్నలిస్ట్ తమపై, తమ నేలపై జరుగుతున్న అధర్మయుద్దాన్ని ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్న ధీరవనిత బిసాన్ ఒవ్ డా..ఈ ప్రయత్నంలో ఎప్పుడు తనకేమవుతుందో తెలీదు. ఎప్పుడు తనది తననేలపై ఆఖరి అడుగో తెలీదు. కానీ ప్రతీ విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడంలో ఇప్పటికీ తలమునకలై వుంది. ఒకపక్క ఇజ్రాయిల్ దేశం తమ దేశంపై సాగిస్తున్న దారుణమారణకాండను వర్తమానప్రపంచానికి తెలియజేస్తూనే సామాజికమాధ్యమాల ద్వారా తమ నేల కు మద్దతును కూడగడుతున్నది. 1997లో గాజాలో జన్మించిన ఈమె జర్నలిస్టుగా హక్కుల కార్యకర్తగా ఫిల్మ్
మేకర్గా ప్రసిద్ది చెందుతున్నారు. ఆమె చేస్తున్న పోరాటానికి స్ఫూర్తిపొంది ఈ సంపుటికి బిసాన్ ఒవ్డా అనే శీర్షికపెట్టుకున్నాడు కవి చౌశా. ప్రాణాలకు తెగించిపోరాడుతున్న బిసాన్ ఒవ్డా గూర్చి ఈ కవితలో..
అసహనంగా ఉన్న ఆకాశంలోంచి /కృత్రిమంగా సృష్టించిన మేఘాల/మాటు నుంచి/రయ్యన దూసుకొచ్చే ప్రమాద/ లోహ విహంగాలు…/కర్ణకఠోర విధ్వంస గీతాల్ని/ స్వేచ్ఛగా ఆలపిస్తూ/నిర్దయగా చావు డప్పులు మోగిస్తుంటే/ హాహాకార…/హృదయవిదారక దుర్ఘటనల్లోంచి/బట్టకట్టిన బలహీనులంతా/బతుకు జీవుడా అంటూ/పరుగులు పెడుతున్న దృశ్యాల్ని../వికృత విధ్వంస యజ్ఞం కోసం/ కుప్పకూల్చిన భవనాల శిథిలాల కింద /సజీవ సమాధి అయిన /మృతదేహాలను…/మట్టి కొట్టుకుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నిర్భాగ్యుల అరణ్య రోదనల్ని…/పరుగులు పెడుతున్న /అంబులెన్సులపైన/అరకొర వైద్యం అందిస్తున్న ఆసుపత్రులపైన/శరణార్థి శిబిరాలైన /పాఠశాలలపైన /తల దాచుకున్న ప్రార్ధనా/మందిరాలపైన /కక్ష కట్టి… గురి చూసి/నింగి నుంచి పిడుగుల వాన కురిపిస్తూ/శ్మశాన వాటికలుగా మారుస్తున్న/దుష్ట శక్తుల నీచాన్ని…/ఉన్నఫలంగా ఇళ్లను, ఊళ్లను ఖాళీ చేసి/ అనుబంధాల్ని, మమకారాల్ని సమాధి చేసి/ఒట్టి చేతుల్తో…/ పిల్లాపాప- ముసలీ ముతకా/ కాళ్లీడ్చుకుంటూ కన్నీరు కారుస్తూ /ముక్కులు చీదుతూ/మూల్గుతూ/నడవలేక నడవక తప్పని దుస్థితుల్ని…/అడుగడుగునా తనిఖీల్ని/అనుమానం పేరుతో చిత్రహింసల్ని ఘోర అవమానాల్ని/బుక్కెడు బువ్వ కోసం/కళ్లు నిండిన దీన దైన్యం సాక్షిగా/దేహీ అంటూ ప్రపంచం ముందు/ఖాళీ కడుపుల్లోంచి చాచిన/ చేతుల విదారక ఘట్టాల్ని…/అడుగడుగునా/అనుభవిస్తున్న నరకయాతనల్ని/గుండె లోతుల్లో మండుతున్న బడబాగ్ని బాధల్ని/గుడారాల్లో తల దాచుకున్న అష్ట కష్టాల్ని/కారాగారమైన చిమ్మ చీకటి దేశంలో కళ్లున్నా కానరాని/బాహ్య ప్రపంచానికి/భాష తెలియని జన బాహుళ్యానికి/‘‘ఇట్స్ బిసన్ ఫ్రం గాజా’’/‘‘ఐయాం స్టిల్ అలైవ్’’ అంటూ/సామ్రాజ్యవాదుల దుర్మార్గాలను/యుద్ధోన్మాదుల విధ్వంసాలను/భూతల నరక కూపాన్ని అతి పెద్ద వల్లకాడును/గురి పెట్టిన బుల్లెట్లు దూసుకొస్తున్నా/ విసిరిన బాంబులు వర్షిస్తున్నా/పన్నిన కుట్రలు వెంటాడుతున్నా…/అదరకుండా బెదరకుండా/ఏ మాత్రం చెక్కు చెదరకుండా/ సంకల్ప బలంతో గెలుపు ఆశతో/సామాజిక వేదికల సాక్షిగా/కళ్లకు కడుతూ… /ధీరోదాత్త… గాజా గొంతుకై /దూసుకుపోతున్న/ బిసాన్ ఓవ్డా.. నువ్వు వర్ధిల్లాలి!/సామ్రాజ్యవాదం చిత్తుగా ఓడిపోవాలి!/నీ మోములో కాంతి రేఖలు నాట్యమాడాలి!..
శాంతినికోరే దేశాలమాట వినట్లేదు.ఐరాస మాటా వినట్లేదు. శాంతి చర్చలకు లొంగట్లేదు. అహంకారానికి కారణం స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా సామ్రాజ్యవాదదేశాలు కూడబలికి సాగిస్తున్న దారుణాలు. వొకవైపు ప్రపంచం ముందు, పైకి మాత్రం మధ్యప్రాచ్యంలో శాంతిని కోరుకుంటున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఆయుధాలు రవాణా చేస్తూ దాడులకు ఉసిగొల్పుతున్నాయి. పాలస్తీనా నేలను నెత్తుటితో తడిపేస్తున్నారు.
కవి చౌశా ఈ కవిత్వం నిండా పాలస్తీనా ప్రజల కన్నీళ్ళను బాధను ఆవేదనను తన బాధగా రాసుకున్నాడు. మానవీయంగా మద్దతు పలకాలని కోరుకుంటున్నాడు. సామ్రాజ్యవాద విధ్వంసాల్ని, మనిషి ఊచకోతను మానవత్వంతో అడ్డుకుందాం రండని పిలుస్తాడు. ఇజ్రాయిల్ దేశం సాగిస్తున్న కుతంత్రాల్ననింటినీ ఈ కవిత్వంలో చెబుతాడు.
కవి కవిత్వాన్ని నినాదమయం చేశాడు. ఇలా రాయడం వల్ల సామాన్య జనబాహుళ్యంలోకి వెళ్ళే అవకాశం వుంటుంది. ఈ కవిత్వం ఏ వర్గానికి చేరాలో, ఈ కవిత్వం ఏ సమాజాన్ని చైతన్య పరచాలో ఆ సమూహానికి అవలీలలగా అలవోకగా అర్థమయ్యే పదప్రయోగమే చేశారు.
‘గాజా ప్రజలారా? ఆగండి! ఎదురుతిరగండి! ఐకమత్యంతో సామ్రాజ్యవాద దురంహంకారాన్ని ఎదుర్కోండి’ ఇలా చెప్తారు. అయితే సామ్రాజ్యవాదరాక్షసి విశ్వమంతా పాదం మోపింది. పాదం మోపని స్థలమే కానరాదు. విశ్వాన్ని కబళించే పనిలో నిమగ్నమై వుంది. చిన్న చిన్న దేశాల అస్థిత్వం లేకుండా చేసుకుంటూపోతూ పెద్దపెద్ద దేశాలనే కబళించేపనిలో నిమగ్నమై ఉంది.అటువంటి సందర్భంలో చిన్నదేశాలొక లెక్క. పాలస్తీనా-ఇజ్రాయిల్ యుద్దంగా చూడకూడదు. దీనికొక విశాల రాక్షసరూపం వుందని గమనంలో ఉంచుకోవాలి. అందుకే కవి…సామ్రాజ్వవాద భూతమా../నీ పేరెత్తితేనే కంపరం కలుగుతోంది/వెంటనే హత్య చేసి/నిర్ధాక్షణ్యంగా నామరూపాల్లేకుండా/ లోతైన గోతిలో పాతిపెట్టాలని వుంది.. అంటారు.
ఈ సామ్రాజ్యవాద కాంక్షకు పాలస్తీనాలో బలైంది అభం శుభం తెలియని పసిపిల్లలు, మహిళలు, కార్మికులు, కర్షకులు ఈ వర్గాలే కదా..ఏ సంపన్నుడు చచ్చాడు. దుర్మార్గం కాదా..ఏ మతమూ చంపమని చెప్పదు. ఏ మతమూ విధ్వంసాలు సృష్టించమని బోధించదు. నేల ఎప్పటికీ ఎవరి సొంతమూ కాదు..ఎవ్వరైనా కాస్త అనుభవించి ఖాళీ చేయాల్సిందే.
అందుకే కవి అగ్ని పర్వతమై రగులుతున్న నాగుండె/ వాడ్నీ వాడి సైన్యాన్ని /కసితీరా మట్టుబెట్టమని చెబుతోంది../నా దేశాన్ని ధ్వంసం చేసినట్టే /వాడి దేహాన్ని తూట్లు తూట్లుగా పొడిచి /చంపాలని వుంది..నాకిప్పుడు తుపాకీ కావాలి! అంటాడు..
ఇలా ఏ వొక్కరో ఇద్దరో తుపాకీ పడితే దీన్ని ఓడించలేము..ముందుఅన్నీ దేశాల్లో వామపక్షాలు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే కార్మికర్షకుల ఐక్యతని నిర్మించాలి. దీన్ని సామ్రాజ్యవాదమని మాత్రమే అనకూడదు. ఇది సామ్రాజ్యవాద ప్రపంచీకరణ..ఇది వేయిపడగల రాకాసి. అన్నింటిని కబళించేస్తుంది. అందుకే సామ్రాజ్యవాదులు అన్నీ దేశాల్లో పాలకులు, పాలకప్రభుత్వాలు క్రియా రహితంగా ఉండాలని కోరుకుంటారు. తద్వారా ఆయా దేశాల సంపదను అవలీలగా తమగుప్పిట్లోకి తీసుకోవచ్చన్నది వ్యూహం. అందుకే ఈ యుద్దాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వర్తమాన ప్రపంచంలో అది మనకిప్పుడు తెలుస్తూనే ఉన్నది. అందుకే కవి ఈ కవిత్వంలో వాణ్ణి నరహంతకుడితో పోల్చాడు..ఎలాంటి నరహంతకుడంటే..
వాడు కిరాతక నరహంతకుడు హిట్లర్, ముస్సోలినీలను మించినవాడు!./వాడు రక్తం మరిగిన రాక్షసుడు నరకాసుర, బకాసుర… వారసుడు!/వాడు మతిలేని యుద్ధోన్మాది శిథిలాల కింద చిల్లర కోసం వెదికేవాడు!/వాడొక అరాచకవాది శవాల దిబ్బల పునాదులపై రాజ్యాన్ని నిర్మించినవాడు!/వాడు అబద్ధాల మాంత్రికుడు /నిజాన్ని నిలువునా సమాధి చేసిన మహా మాయగాడు!/వాడు పచ్చి మోసగాడు /ఇంతకాలం సమాజాన్ని మాటలతో మోసగించినవాడు!/ప్రపంచ శాంతి కావాలంటే/ ఉన్మాద సామ్రాజ్యవాద భూతాన్ని సంహరించాల్సిందే!/లేదంటే నిత్యం మారణహెమమే!
ఈ గాజా కవిత్వంలో గాజా సిటీ ఎలా విధ్వంసమయ్యింది ప్రతీ ఘటనను కళ్ళకు కట్టినట్టు కవిత్వంగా రాశాడు. గాజా సిటీ అహుపత్రిలో ఐదువేల మంది బాంబు దాడిలో చనిపోవడంతో పాటు యుద్దంలో జరిగిన ప్రతి హృదయ విదారక దృశ్యాన్ని కవిత్వంగా రాశాడు.
పాలస్తీనా దేహంపై ఉన్న గాయాలన్నీ కవిత్వంగా మాట్లాడాయి. శవాల దిబ్బలు, శిథిలాలు, కవితా వస్తువులుగా పలకరించాయి. కన్నీళ్ళన్నీ కథలు కథలుగా కవిత్వంగా చెప్పాయి. ఈ కవి సాగిస్తున్నది కూడా సామ్రాజ్యవాదంపై యుద్దమే. ఈ కవి సాగిస్తున్నది మతదురహంకారంపై యుద్దమే..
కవి చౌశా కాంక్షిస్తున్న సమాజం ఎలాంటిదో చూద్దాం..
గొంతు నులిమేదీ వాడే జోల పాడేదీ వాడే/ఆయుధాలు తయారు చేసి అమ్మేదీ వాడే/ప్రపంచ శాంతి గురించి మాట్లాడేదీ వాడే!/యుద్ధాలను సృష్టించేదీ వాడే నీతులు చెప్పేదీ వాడే!/మారణ హోమాలను ప్రోత్సహించేదీ వాడే మానవత్వాన్ని బోధించేదీ వాడే!?పెద్ద మనిషినని చెప్పేదీ వాడే యుద్ధం ఆపొద్దని ఐరాసాలో వీటో చేసేదీ వాడే!/టెర్రరిజాన్ని సృష్టించిందీ వాడే అంతమొందిస్తామని ప్రతిన పూనిందీ వాడే!/వాడు మానవాళి శత్రువు, విష పురుగు! వాడి అంతంతోనే ప్రపంచ శాంతి!/వాడిని హతమార్చే ఏకైక ఆయుధం సామ్యవాదం మాత్రమే!
సామ్రాజ్యవాదం అంతమై సామ్యవాదం కావాలనే బలమైన కాంక్ష ఈ కవిత్వం నిండా కనబడతుంది. ఈ దిశగా కవి నిరంతరం అక్షర యుద్దం చేస్తున్నాడు. ఈ కల, కృషిసఫలీకృతం అవ్వాలని మన:పూర్తిగా కోరుకుంటూ..
బిసాన్ ఓవ్డా కవితా సంపుటి గురించి కెంగార మోహన్ గారు చక్కగా పరిచయం చేశారు. ధన్యవాదాలు.
Thank you Sir
Mohan ji – nice review sir
Samyavadham —-America pettanam unnanthavaraku Radhu -marpu Raadu.
Jewish people dominate American politics and economy —USA play big politics
———————buchireddy gangula
Yes Sir
Thank you Sir