హైమావతి కథల సంపుటి “జోలె విలువ”.ఈ పుస్తకంలో సీతమ్మ, ప్రయాణం, విముక్తి మార్గం, మార్పు కోరే సహచర్యం, జోలెవిలువ అనే కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ వాస్తవానికి దగ్గరగా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పుస్తకం చదివితే ఇవి కేవలం కథలు కాదు. వాస్తవాలుగా, మన చుట్టూ జరిగిన సంఘటనలని మనకు అర్థమవుతుంది. రచయిత్రి తన చుట్టూ ఉన్న సమాజంలోని దోపిడి, పీడన, అంటరానితనం, ఆకలి మంటలు, పేదరికం, బాల్య వివాహాలు, వలసలు, కుల వివక్ష, జోగిని వ్యవస్థ, లింగ వివక్ష, వర్ణం మతం, అవిద్య, మరియు తన పరిసరాల్లోని వ్యక్తుల మనస్తత్వాలు ఇలా ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ పుస్తకంలోని కథలు ముడిపడి ఉన్నాయి. నేను ఈ పుస్తకం చదవకముందు నా దృష్టిలో కథలంటే అనగనగా ఒక అడవిలో జంతువులు, వాటికి రాజ సింహం. అని మాత్రమే నాకు తెలుసు. కథలు ఇట్లా రాస్తారని కూడా నాకు తెలియదు. ఇలా ఉంటాయని కూడా నాకు తెలియదు. ఒక్కొక్క కథ ఒక్కొక్క భిన్నమైన అంశాన్ని తెలియజేస్తుంది. చదివే వారికి విసుగు కలిగించదు. అట్లా ఈ కథలను రూపొందించింది హైమావతి. ఆమె రచనా శైలి కూడా అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా, ఆసక్తి కలిగించే విధంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అమ్మ నేర్పే భాషలా ఉంటాయి ఈ కథలు. ఇది ఆమె ప్రచురిస్తున్న మొదటి పుస్తకం. పుస్తకం తెచ్చే క్రమంలో ఆమె కొన్ని ఇబ్బందులకు గురైంది. నిరాశ చెందింది. కానీ పుస్తకం ప్రచురించేందుకే సిద్ధపడ్డది. ఆమెను విరసం నిర్మాణం లోకి తీసుకొచ్చి తోడుగా నిలిచి స్ఫూర్తిగా నిలిచిన ప్రొఫెసర్ కాశీo సార్, ఆమెకు అండగా నిలిచాడు. 1985 సంవత్సరం నుంచి రచయిత్రి హైమావతి కుటుంబం పై విప్లవ రచయితల సంఘం(విరసం) యొక్క ప్రభావం ఉంది. వారి కుటుంబ సభ్యులైన పెదనాయన పోలప్ప, చిన్నాయిన అమ్మన్న ప్రభావం బాల్యం నుంచి ఆయన మీద ఉంది. ఆమెకు ప్రధానంగా విద్యార్థి సంఘం నుంచి వచ్చి ఉపాధ్యాయుడైన సూర్యచంద్ర సార్ రాజకీయ గురువు. ఇట్ల వీరందరి ప్రభావం ఈ పుస్తకం వెనుక ఉంది. ఇందులో ఈమె రచించిన మొదటి కథ జోలెవిలువ. హైమావతి వెన్నెల టీచర్గా తన పాత్రను ఈ కథను రూపొందించుకున్నది. అంటే తననే ఆ పాత్రగా మలుచకున్నది. ఈ కథలో విద్య ఎందుకు అవసరమో చెప్పింది రచయిత్రి. జోలె అంటే మనకు గుర్తొచ్చేది రోడ్లపై, చెత్తకుప్పల దగ్గర, గ్రామాలలో, పట్టణాలలో, కాగితాలు ప్లాస్టిక్ డబ్బాలు, బట్టలు తిండి డబ్బులు ఇవ్వమని అడుక్కునే పిల్లలు మనకు గుర్తొస్తారు. వారిని ఎలా ఉన్నారు అని అడిగే దిక్కు కూడా ఈ సమాజంలో ఉండదు. అలాంటి వారిని చదువుకోవడానికి బడికి తీసుకువచ్చింది వెన్నెల టీచర్. ఆమె ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలి స్థానంలో ఉన్నది. అయినా సరే కులం ఆమెను వెంటాడింది తోటి ఉపాధ్యాయులు ఆమె పట్ల వివక్షను చూపిస్తారు. అంతటి స్థాయిలో ఉన్న ఆమెనే అంతటి కుల అవమానాలను చవిచూస్తుంటే, జోలే వేసుకుని ఇంటింటికి తిరిగే పిల్లలను పాఠశాలలకు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అడుక్కునే పిల్లలను పాఠశాలలకు తీసుకొచ్చినందుకు ఇతర పిల్లల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు చివరకు అటెండర్ తో కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది వెన్నెల టీచర్. అలా ఆ పాఠశాలలో చదువుకునేందుకు వచ్చిన అమ్మాయి అంజమ్మ. ఈమె పేరును అంజలిగా మార్చింది వెన్నెల టీచర్. అంజలికి తల్లిదండ్రులు ఎవరూ లేరు వాళ్ళ తాత తప్ప ఇంకెవరు ఆమెకు దిక్కులేరు. రోజూ అడుక్కొని వచ్చి  వాళ్ళ తాతకు భోజనం పెట్టడం అంజలి ముఖ్యమైన పని. కానీ ఆమె పాఠశాలకు రావడం వలన అంజలి తన తాతకు భోజనం అడుక్కుని పెట్టేందుకు సమయం ఉండటం లేదని ఆమె తన టీచర్ అయిన వెన్నెలతో సమస్యను చెప్పుకుంటుంది.

వాటిని వెన్నల టీచర్ పరిష్కరించింది. ఎంతోమంది అడుక్కునే పిల్లలు ఆమె చొరవ వల్ల బడిలోకి వచ్చారు. వాళ్లకు చదువు అవసరమా అని ప్రశ్నను వెన్నెల టీచర్ ఎదుర్కొన్నది. ఆమెను తిట్టుకున్నారు. అంజలి మాత్రం ఎంతో చక్కగా చదివింది ఒకరోజు తన స్నేహితురాలైన మరో విద్యార్థికి పెళ్లి జరుగుతున్నదని ఆ బాల్యవివాహాన్ని ఆపుదామని వెన్నెల టీచర్కు చెప్పింది. ఇది టీచర్కు సంతోషాన్ని కలిగించింది. బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. రక్షించారు. వెన్నెల తన భర్తతో కలిసి రాత్రి బడిని కూడా చెప్తుంది విచిత్రంగా అంజలి వాళ్ళ తాతను రాత్రి బడికి పొమ్మనేది. వెన్నెలకు అంజలి కుడి భుజంగా మారింది. గురు శిష్యుల అనుబంధం స్నేహంగా మారింది. ఈ కథ కల్పన కాదు ఇది రాస్తున్న సమయానికి సరిగ్గా ఆ పాత్రలు సజీవంగా ఉండే చోటికి తమ ఉద్యమంతో బడిని తెచ్చిపెట్టారు హైమావతి టీచర్.

ఈ కథలో ముగింపు అద్భుతంగా ఉంటుంది జోలె వేసుకొని ఇంటింటికి తిరిగి అన్నం అడుక్కున అంజమ్మ, కథ చివరిలో ఉండే అంజలి ఒక్కటేనా? అనేంత ఆశ్చర్యాన్ని ఈ కథ కలిగిస్తుంది. రెండవ కథ  సీతవ్వ. ఇందులో సీతవ్వ పాత్ర చాలా ముఖ్యమైనది. పురుషాధిపత్యంతో నలిగిన జీవితం సీతవ్వది. ముగ్గురు మనవరాళ్ళు కూడా ఉంటారు.

ఈ కథల్లో ఉన్నట్టే ఎక్కడైనా గాని ముఖ్యంగా భారతదేశంలో కులం, మతం, లింగ వివక్ష అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. అవి గ్రామమైనా, పట్నమైనా,పరాయి దేశమైనా, ఆ వివక్ష సజీవంగా ఉంటుంది. సీతమ్మకు ఏడు సంవత్సరాలకే పెళ్ళిఅయింది. బడికిపోయే వయసులోనే ఆమెకు పెళ్లి చేశారు. కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. ఆనాటి సావిత్రిబాయి పూలే, మహాత్మ జ్యోతిరావు పూలే అందరిని ఎదిరించి సంప్రదాయాలను ఆచారాలను సంస్కృతులను ఎదిరించి, బాల్య వివాహాలను సతి సహగమనాలను ఆపడం కోసం వారు చేసిన పోరాటం ఈనాటికీ చాలా ప్రాంతాల్లో అవసరం ఉంది. ఎందుకంటే బాల్య వివాహాలు జరుగుతున్నాయి కనుక. కథలో ఒకచోట సీతవ్వ  మనవరాలు అవ్వ మీ అమ్మ పేరేమిటి? అని అడిగింది మా అమ్మ పేరు గంగమ్మ అని చెప్పింది ఆమె. మరి మీ నాన్న ఎవరు అని అడిగింది అమాయకంగా. అంటే నాకు నాన్న ఎక్కడ ఉంటాడు?మా అమ్మ “బిసివి” అని చెప్పింది. ఇది మనమరాలకి అర్థం కాలేదు. ఆ అవ్వ మా అమ్మను కురుమంతరాయుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే మా అమ్మ దేవుడి భార్య అని,తనకు నాన్న లేడు అని మనమరాలకి చెప్పింది. కురు మంతురాయుడా!? అని మనవరాలు ఆశ్చర్యపోయింది. దేవుడే…. దేవుణ్ణి అలా ఎలా అంటావు? అన్నది అమాయకంగా సీతవ్వ. మనుమరాలు నీ పిచ్చి కాకపోతే దేవుడు ఉన్నాడని నమ్మడమే కాకుండా దేవుడిని ఎలా పెళ్లి చేసుకుంటారు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వాస్తవంలో దేవుడి భార్య అని చెప్పి ఊర్లో ఉండే మగాళ్లు ఆమెను శారీరకంగా అనుభవిస్తుంటారు. మీరు ఎప్పుడు దీనిని వ్యతిరేకించాలి కదా అని మనమరాలు అడిగినప్పుడు సీతమ్మ చెప్పిన సమాధానం చాలా గొప్పది. నా బిడ్డను కూడా  బసివిని చేద్దామని తన భర్త అంటే తన భర్తను ఎదిరించి, ఊరిలోనే కుల పెద్దలందరినీ ఎదిరించి, తన బిడ్డను బసివిని అనే నీచమైన ఆచారం నుంచి కాపాడుకున్నది. ఒక మంచి మనిషినికి ఇచ్చి వివాహం చేసింది. సీతమ్మ పోరాటం గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది మనకు. వాస్తవానికి గ్రామాల్లో చాలామందికి ఇలాంటి ఆచారాల పేరుతో అన్యాయం జరిగింది. బసివి అంటే దేవుడి పేరు మీద జరిగే లైంగిక దాడి. దేవుడి భార్య అంటూ ఆ ఊరి దాసరయ్యతో పుస్తెలు కట్టిస్తారు. కానీ దేవుని పేరుమీద ఆయన బసివిగా బతుకుతుంది. తర్వాత ఊర్లో ఉండే మగాళ్ళoదరికీ ఉమ్మడి వస్తువు అవుతుంది ఎంత భయంకరమైన ఆచారం ఇది. దీనిని కేవలం దళితులు అనుభవించారు అని నేను తెలుసుకున్నాను. సీతవ్వను చూస్తే నాకు సావిత్రిబాయి పూలే గుర్తుకొచ్చింది. మనమరాలిని చూస్తే పూలన్ దేవి యాదికొచ్చింది మనమరాలు తిరిగి పట్నంకు వచ్చింది కానీ ఊర్లో సీతవ్వ చెప్పిన విషయాలు మాత్రం ప్రతిక్షణం గుర్తొస్తున్నాయి.

ఆ ఆలోచనతో మునిగిపోయింది.

ఈ జోగిని వ్యవస్థ ఇప్పటికి కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో లస్కర్ బోనాల్లో జోగినీలను శివసత్తులను ఆడించి వారికి చేయూతనిస్తాం అంటూ, ఈ జోగిని వ్యవస్థను బలపరుస్తున్నారు. మహిళలపై ఇట్లాంటి దారుణాలతో పాటు ఈ సమాజంలో లైంగిక వేధింపులు అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఇప్పుడున్న కాలంలో చిన్న వయసులోనే ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, గొడవలు పడటం భార్యను భర్త, భర్తను భార్య చంపడం సాధారణంగా మారిపోయింది.

ఇది చాలా బాధాకరమైన విషయం వీటిని చూస్తే సమాజంలో మానవత్వం దయ జాలి సహాయం చేసే గుణాలు మనుషులు కోల్పోయారు అనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క అమ్మాయి చదవాల్సిన మంచి కథ వయసు తో సంబంధం లేకుండా చిన్న పిల్లల మీద లైంగిక దాడులు చేస్తున్నారు. లేదా అక్రమ రవాణా చేస్తున్నారు ఇక ప్రయాణం అనే కథ చదువుపై ఎంత శ్రద్ధ ఉండాలో చెప్పింది. ఈ కథలో సుగుణ,కిరణ్ అనే ఇద్దరు అన్నా చెల్లెల్లు వెనుకబడ్డ పిల్లలు పేదరికం, వలసలు, తిండి లేని తనం, వారి జీవితాల్లోకి చదువును తీసుకువచ్చే ప్రయత్నమే ఈ ప్రయాణం కథ. చదువు ఎంత ముఖ్యమైనదో మన జీవితంలో చదువుకు ఉన్న విలువ ఏమిటో, చదువు ఎందుకు కొందరికి పరిమితమైందో చదువుకుంటే జీవితాలు ఎట్లా మారుతాయో, అనేది ఈ కథలో చదవచ్చు. ఇందులోని సుగుణ టీచర్ అనే పాత్ర ప్రతి గుడిసెకు వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి ఆ విద్యార్ధులను బడికి తీసుకువచ్చింది. బడికి పంపడానికి సహకరించని తల్లిదండ్రులకు ఓపిగ్గా సర్ది చెప్పింది ఈ కథలో ఉన్న సుగుణ అనే పాత్ర కూడా హైమావతి చేసిన కృషినే… ఇట్లా ఇందులోని ప్రతి కథ గొప్పగా అనిపిస్తుంది ఈ పుస్తకం వచ్చి దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తున్న దీని అవసరం ఇప్పటికీ ఉంటుంది కనుక ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి.

Leave a Reply