ఏప్రిల్‌ 16 నాడు ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా ఆదివాసుల అడవిలోని ఆపటోల గ్రామం వద్ద తన ప్రియమైన 29 మంది సహచరులతో పాటు అసువులు బాసిన మిత్రుడు శంకర్‌ సొంతూరు చల్లగరిగె.  అమ్మా నాన్నలు ముద్దుగా పెట్టుకున్న పేరు సుధాకర్‌.  ఆ తల్లి తండ్రులకు ఆయన ఒక్కగానొక్క కొడుకు. ఆ బిడ్డే తమకు  దిక్కవుతాడని  ఆ కుటుంబం ఎన్నో కలలు కని ఉంటుంది.

ఇవేవీ  ఆ ఊరు పొలిమేరు ఆవల పెద్దగా తెలియదేమో!

కానీ, ఈ రోజు ఆయన గడిపిన సార్ధక జీవితం గురించి ఎంతో ఆయన పార్థివ శరీరం ముందు నిలబడి తలపోసుకుంటున్నారు. 

ఇప్పుడు ఆయనను ఎవ్వరూ ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లదు. ఆయన శవంపైన అలంకరించిన అరుణ వస్త్రమే   ఆయనను పరిచయం చేస్తున్నది. ఎందరెందరినో కదిలిస్తోంది. ఎక్కడెక్కడి వాళ్లో ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన అందించిన ప్రజా సేవల స్మృతులలో   పిడికిళ్లు బిగించి గుర్తు చేసుకొని కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ఆయనకూ -వాళ్లకూ అనుబంధం పోరాటాల బంధమే. లేకపోతే, వాళ్లంతా చల్లగరిగెకు ఎందుకు వచ్చేవాళ్లు? ఈ ఊళ్లో ఎన్నో మరణాలు సంభవించాయి. కానీ, ఎవరి శవం ఇలా శవయాత్రకు నోచుకోలేదే! ఊళ్లల్లో శవయాత్రలంటే, పాడెను కాటి వరకు సంప్రదాయంగా తీసుకెళ్లడమే కదా! కానీ, అన్నల పోరాటాలే కాదా, వారి మరణాలకు, అంతిమయాత్రకు  ఒక నూతన వరవడిని సృష్టిస్తున్నాయి. అవి కొత్త సందేశాలను వినిపిస్తున్నాయి. పల్లెల్లో అన్నలు తిరుగాడటం మొదలయ్యాక గ్రామ జీవితాలలోని ప్రతిదీ ఒక పెద్ద కుదుపుకు లోనైంది.

శంకర్‌ ఒక్కడి శవమే కాదు, ఆయనతో జీవితాన్ని పంచుకున్న ఆయన జీవిత సహచరి రజిత శవం కూడ చల్లగరిగె చేరింది. వారిద్దరు జీవితాలను పంచుకున్నవారు. పోరాటాలలో సగ భాగం అయినవారు. అమరత్వంలోనూ విడిపోలేదు. వారు సహ మరణం పొందారు. అందుకే  వారిద్దరి శవయాత్ర జంటగా సాగింది. శవయాత్రలో పాటలు, నినాదాలు, పోరాటాల సందేశాలను వినిపించే డప్పుల చప్పుళ్లు, దరువు, శవయాత్రకు ముందు అమరుల ఫొటోలతో పెద్ద బ్యానర్‌ చూస్తేనే వారు ఎవరి మనుషులో చెప్పకనే చెపుతున్నవి. అవన్నీ వారికి అందించిన గొప్పతనం మాత్రం వారు నిర్వహించిన పోరాటాలలో, వారు మడిమ తిప్పకుండా నిలిచిన ఉద్యమంలో వుంది. ఉద్యమంలో వారి పాత్రలో వుంది. 2018లో చల్లగరిగెకు రౌతు విజేందర్‌తో పాటు ఆయన జీవిత భాగస్వామి శాంతి కూడ విగత జీవులుగానే చేరుకున్నారు. మన విజేందర్‌, సుధాకర్‌  దళితులు, వారి జీవితాన్ని పంచుకున్న సహచరిలు ఆదివాసీలు. వీళ్లు పునాది వర్గాల శ్రమ జీవుల బిడ్డలు. వారి త్యాగాలు అజరామరం. అప్పుడూ ఇప్పుడూ ఆ బిడ్డల రక్తబంధువులను ఓదార్చడానికి ఎక్కడెక్కడి నుంచో అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు వెళ్లారు. ఈ రెండు సందర్భాల్లోనూ దారుణమైన నిర్బంధమే. సాహసం, నిబద్ధత తప్ప మరేమీ లేని మామూలు అమరుల కుటుంబసభ్యులు, విప్లవాభిమానులు చల్లగరిగె పోరాట వారసత్వాన్ని ప్రపంచానికి ఎత్తి చూపించారు. అయితే, రౌతు విజేందర్‌ అమరత్వం రోజు అమరుల బంధు మిత్రుల సంఘం వారితోపాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చడానికి అందరి మధ్య పెద్ద దిక్కుగా వీవీసారు వుండే. కానీ, ఈరోజు ఆ సారెక్కడో! ఏ జైళ్లోనో లేదా జైలు లాంటి  బహిరంగ నిర్బంధ శిబిరంలోనో వున్నారు.   సుర్జాగఢ్‌ గనుల తవ్వకం కోసం గడ్‌చిరోలీలో శ్రీనును(విజేందర్‌ను) చంపారని  సారు ప్రకటించారు. ఈ రోజు దేశాన్నంతా కార్పొరేట్‌ శక్తులకు ఇవ్వడానికి, దేశాన్ని కార్పొరేట్‌ హిందూ రాష్ట్రగా మార్చడానికి పాలకవర్గం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ అనే అంతిమ యుద్ధాన్ని తిప్పికొడుతూ చల్లగరిగె వీరుడు శంకర్‌, ఆయన సహచరి రజిత అమరులయ్యారని అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు ప్రకటించారు.

                                                                                0              0              0

                శంకర్‌ బాల్యమిత్రుడు రౌతు విజేందర్‌. ఇంకా నిజం చెప్పాలంటే ఆయనకు ఉద్యమ సహచరుడు. అంతకన్నా ఉద్యమమార్గదర్శి. అలాంటి రౌతు విజేందర్‌ను గుర్తు చేసుకుంటూ, శంకర్‌ ఇలా రాశాడు ‘‘1980-90ల దశాబ్దాలలో చల్లగరిగె గ్రామం విప్లవోద్యమానికి గుండెకాయ లాంటిది. అది విప్లవోద్యమాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ తన గడ్డ మట్టిన పుట్టిన వీర యోధులలో అర డజన్‌ మందిని భూతల్లి చెర విడిపించటానికై సాగుతున్న వ్యవసాయ విప్లవానికి అంకితం చేసింది’’ అంటూ గుర్తు చేసుకున్నాడు. అంతే కాదు, విజేందర్‌ తండ్రి పాత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు. ఆ తండ్రి వారసుడిగా విజేందర్‌ ఆయన భావాలకు భౌతిక శక్తి అయ్యాడు’’ అని చెపుతూ తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి చిట్యాల, చేర్యాల ప్రాంతాల పోరాట ఒరవడిని తెలుపుతూ ఉత్తర తెలంగాణను ఉర్రూతలూగించిన, దొరల గడీలను గడగడలాడిరచిన విప్లవ పోరాటాలు, ఆ పోరాటాలలో అసువులు బాసిన వీరులను మనకు గుర్తు చేస్తాడు. ‘‘కామేడ్స్‌ గాజర్ల సారన్న, నల్లా వసంత్‌ల కృషితో ఆ ఊరి బడుగు జనాలు సంఘటితమై ఊరి దొరలు కరై నర్సింహారెడ్డి, గైలం సమ్‌దానీ, గోప నాయక్‌, పోలీస్‌ పటేల్‌ శ్యాంరావు, రవీందర్‌ రావుల దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించారు. చిట్యాల ప్రాంత ప్రజలు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో, సమరశీలంగా కదిలి బ్రాహ్మణ, రెడ్డి, లంబాడ భూస్వాములలో కరుడుగట్టిన వారిని ఊరి నుండి తరిమి కొట్టి వారి భూములల్లో ఎర్ర జెండాలు పాతి వారి అక్రమ భూములను స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంపిణీ చేశారు’’ అంటూ రౌతు విజేందర్‌ జ్ఞాపకాలలో తన ఊరును, తన ఊరి ప్రజలను, ఆ ప్రజలను నడిపిన విప్లవ ‘గురువులను’ గుర్తు చేసుకున్నాడు. ఆపటోలలో ఆయన వారిలో భాగమయ్యాడు. ఆ గతాన్ని ఇపుడు మనకు శంకర్‌లా మళ్లీ వినిపించేవాళ్లు కావాలి. ఆ దొరలను నల్ల వసంత్‌, గాజర్ల సారన్నలు జనాలతో కలిసి ఊరి నుండి తన్ని తరిమారు. కానీ, ఆనాటి దొరతనం ఇవాళ మరో రూపంలో మన జీవితాలపై సవారీ చేస్తున్నది. ఈ రోజు నల్ల వసంత్‌, గాజర్ల సారన్న, రౌతు విజేందర్‌  లేరు. వాళ్లను గుర్తు చేసుకున్న మన సుధాకర్‌ లేడు. కానీ, ఊరుంది. ఊరి జనం ఉన్నారు. కొత్త అవతారాలలో దొరతనం వుంది. ఈ రోజు మనకు అంకితభావంతో జనం కోసం పని చేసే నిన్నటిలాంటి మనుషులు కావాలి. వక్తల ఉపన్యాసాలను ముందుకు తీసుకెళ్లే కార్యకర్తలు మనకు కావాలి.

మన సుధాకర్‌ 30 ఏండ్ల కిందటి చల్లగరిగె గురించి రాయడమే కాదు, ప్రస్తుతం తను పని చేస్తున్న ప్రాంతంలో ఏం జరుగుతుందో రాసుకున్న డైరీ ఇటీవలే మిత్రులకు అందుబాటులోకి వచ్చింది. అందులో ఆయన ‘‘మా ప్రాంతంలోని జనతన సర్కార్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా, ప్రజా వ్యతిరేకులకు స్థానం లేకుండా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో మహిళలు 50 శాతం వుండేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’’ అని అక్కడి పరిస్థితులను, జనతన సర్కార్ల ఎన్నికల తీరును రాసుకున్నాడు.

ఇపుడిపుడే ముగిసిన 18వ లోకసభ ఎన్నికలలో ఎంతటి కండ బలం, కులబలం, మతోన్మాదం, ధనబలం చోటు చేసుకున్నదో చూశాం. అసలు మన శంకర్‌ రాసుకున్నదానితో ఈ ఎన్నికలను పోల్చనే లేం. ఇంకా ఆయన ఏం రాసుకున్నాడంటే, ‘‘ఒక ఊళ్లో తెగపెద్ద మూఢ నమ్మకాలతో ఊరి జనాలను బెదిరిస్తుంటే, ఊరి జనాల ముందుకు ఆయన్ని పిలిచి ఇలాంటి వేషాలు మానుకోవాలనీ హెచ్చరించాం’’ అని రాసుకున్నాడు. వీటిని మావోయిస్టులు, ఆదివాసీ ప్రజలు ప్రజా కోర్టులు అంటుంటే, మేధావులు మాత్రం ‘‘కంగారు’ కోర్టులు అంటున్నారు.

శంకర్‌ రాసుకున్న డైరీలో ఆర్జికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా ప్రజలలో ప్రచారం చేస్తున్నట్టు, 15 ఆగస్టు నిజమైన స్వతంత్ర దినం కాదనీ, అది అధికార మార్పిడి దినమని ప్రజలలో బహిర్గతం చేస్తున్నట్టు, 9 సెప్టెంబర్‌ విశ్వ మూలవాసీ దినం పోరాట దినంగా పాటించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నామనీ రాసుకున్నాడు. ఎంత చక్కగా రాసుకున్నాడంటే, నిజానికి మావోయిస్టులను దేశ ద్రోహులనీ, ఉగ్రవాదులని నిందించే వాళ్లంతా ఆయన డైరీ చదవడం మంచిది. ఇక పోతే, ఆయన డైరీలో తమ ప్రాంతంలోని వెచ్చఘాట్‌ అనే చోట స్థానిక మూలవాసీ ప్రజలు జల్‌-జంగల్‌-జమీన్‌ కోసం జరుపుతున్న చట్టబద్ధ పోరాటం గురించి అద్భుతంగా రాసుకున్నాడు. తమ జనతన సర్కార్లు అవే డిమాండ్ల మీద ప్రజలను కదిలిస్తుంటే నేరం అవుతోంది. మేం నేరస్థులం అవుతున్నాం. ఉగ్రవాదులం అవుతున్నాం. కానీ, ప్రజలు అనేక కొత్త ఎత్తుగడలతో ఉద్యమిస్తున్నారు. అవే డిమాండ్లపై వేలాది మంది ప్రజలు బహిరంగంగా టెంట్లు వేసుకొని పోరాడుతున్నారు. వారికి సంఫీుభావంగా ఢల్లీి నుండి కూడ మేధావులు వస్తున్నారు. సమర్థిస్తున్నారు. వెళుతున్నారు. 

‘‘ఔను,  ఈ పోరాటాలు ముందుకు తెస్తున్న డిమాండ్లు ప్రభుత్వ మోసకారితనాన్ని వెల్లడి చేస్తున్నాయి. 25 ఏండ్లు దాటినా అమలు కానీ ప్రభుత్వ గ్రామసభల చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ స్వభావాన్ని ఆ పోరాటాలు బట్టబయలు చేస్తున్నాయి. కానీ, జనతన సర్కార్లు ఇంత కంటే ముందుకు వెళ్లాయి. కాగితాల మీద చట్టాలతో ప్రజలకు దక్కేదేమీ లేదనీ, ప్రజల సంఘటిత శక్తితోనే భూములు, అడవులు, వనరులు, అధికారం దక్కుతుందనీ ఆచరణలో పోరాటాల ద్వారా నిరూపిస్తున్నాయి. అందుకే దోపిడీ ప్రభుత్వాలకు జనతన సర్కార్లు ప్రమాదకరం. వాటిని నిషేధించాలి. వాటిని సమర్థిస్తే శిక్షించాలి అని అడవులపై దాడులు చేస్తున్నాయి’’ అని శంకర్‌ రాసుకున్నాడు.

అంతేకాదు, ఆయన డైరీలో ఒకచోట ‘‘అడవుల కార్పొరేటీకరణ జరుగుతోంది. అందుకు గతంలోని అన్ని చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. ఇది అసలు విషయం. ఈ టెంట్లు వేసుకొని ఎన్నేళ్లు పోరాడినా, అడవుల కార్పొరేటీకరణను అడ్డుకోకుంటే మాత్రం ఆదివాసులకు అస్తిత్వమే వుండదు. ఆ కార్పొరేటీకరణను మావోయిస్టులు అడ్దుకుంటున్నారని భద్రతా బలగాలను దింపి అడవులను సైనికీకరిస్తున్నారు. మావోయిస్టులను ముందు పెట్టి ప్రభుత్వం ఎంతటి భీభత్సాన్ని సృష్టించినా చెల్లుతుంది. అదానీకి హస్‌దేవ్‌ అడవులను అప్పగించారు. అక్కడి ఆదివాసుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. ఇపుడు ఇక్కడా అదే జరుగుతుంది. మావోయిస్టుల నాయకత్వంలో ప్రజలు రావ్‌ఘాట్‌ గనుల తవ్వకాలను మూడు దశాబ్దాలుగా నిలువరించగలిగారు. కానీ, హిందుత్వ శక్తుల మోదీ పాలనలో తుపాకీ రాజ్యమే సాగుతోంది’’ అని రాసుకున్న శంకర్‌ డైరీలోని తేదీలను చూస్తుంటే ఆ అక్షరాల తడి ఆరకముందే అమరుడు కావడం వాస్తవాల పట్ల ఆయన వివేచనను తెలుపుతోంది. ఆయన అమరుడైన కొద్ది రోజులలోనే చట్టబద్ధ ప్రజాపోరాటాలను సైతం పాలకులు ఉపేక్షించడం లేదనీ, ఆ ప్రాంత ఆదివాసీ ప్రజా నాయకుడు సురుజూ టేకంను అరెస్టు చేయడం తెలియచేస్తోంది.

ఇక్కడ మనం బ్రాహ్మణ మత కుటిల ఎత్తుగడలను అర్ధం చేసుకోవాలి. శంకర్‌ డైరీలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రాజకీయ వివరాలు ఇంకా నోట్‌ కాకపోవడంతో మనం వాటి గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ విష్ణుదేవ్‌ సాయి అనే బ్రాహ్మణీయ ఆదివాసీని ముఖ్యమంత్రిని చేశారు. ఈయన గారు ఆదివాసీల నుండి ‘మత’ మార్చిడి చేసుకున్న ద్విజుడు. కానీ, ఈయన ఆదివాసీ గుర్తింపును వదలుకోవడం లేదు. అది వదలుకుంటే, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోలేడు  కదా! ముఖ్యమంత్రిగా ఈయన ఛత్తీస్‌గఢ్‌లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్న మావోయిస్టులను మట్టుబెట్టే సైనిక కేంపెయిన్‌కు బాధ్యుడు. కాకపోతే, అక్కడ అసలు చక్రం తిప్పుతున్నదంతా బాహ్మణ కౌటిల్యుడు విజయ్‌ శర్మ. ఆయన అక్కడ పోలీసు మంత్రి. ఆయనే అక్కడ ఉప ముఖ్యమంత్రి. సాయిని ముందు పెట్టి నడుపుతున్నదంతా ఈ నాయకుడే. మహారాష్టలోనూ ఏక్‌ నాథ్‌ సింధే ముఖ్యమంత్రే, కానీ నడిపేదంతా బ్రాహ్మణ కౌటిల్యుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌. మధ్య ప్రదేశ్‌లో యాదవుడు ముఖ్యమంత్రి, కానీ నడిపేదంతా అగ్రవర్ణాలే.

చారిత్రకంగా బ్రాహ్మణ మత నిజ స్వభావాన్ని చూస్తే బౌద్ధ్దాన్ని ఓడిరచిన నాటి నుండి నిన్నటి మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్‌ల వరకు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అది మారుతూ తుదకు 10 ఏళ్ల కింద అధికారాన్ని కైవసం చేసుకుంది. బుద్ధిడిని  దశావతారాలలో కలుపుకుంది. రిజర్వేషన్లను మొదట వ్యతిరేకించినా తరువాత ఆ పొరపాటు నుండి బయటపడి బ్రాహ్మణ-బనియాగా వుండిపోతే, ఈ దేశంలో బతికి బట్టకట్టలేమనీ, అధికారం అందుకోలేమనీ గుర్తించి క్రమంగా వ్యవసాయ కులాలను, దళిత, ఆదివాసీలను తనలో ఇముడ్చుకోసాగింది. మోదీలను, యాదవ్‌లను, సాయిలను ముందుకు తెచ్చింది. తన ఏజండాను తిరుగులేని విధంగా అమలుచేయ తలపెట్టింది. తన వర్గానికి 10 శాతం రిజర్వేషన్‌లను సత్తా బలంతో సాధించుకుంది. ‘అందితే జుట్టు, అందక పోతే కాళ్లు’’ అనే దాని అసలు నీతితో బుద్ధుడు, అండేడ్కర్‌, బిర్బాలను తనలో ఇముడ్చుకోవడమే కాదు, 18వ లోక్‌ సభ ఎన్నికలలో ‘‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌ అంటూ మోదీ అండ్‌ కంపెనీ మదమెక్కి చేసిన ప్రచారం తుస్సుమనడంతో ఖంగు తిని చివరకు అధికారం కోసం మోదీ ఎన్‌.డీ.ఏ శరణు కోరి ప్రధాన మంత్రి అయ్యేవరకు వాతాపి జీర్ణం నీతిని చూడవచ్చు. మన అమరుడు శంకర్‌ జీవించి వుంటే మనకు ఈ విషయాలన్నీ మరింత వివరంగా, విశ్లేషణాత్మకంగా నిస్సందేహంగా అందించి వుండే వాడు. ఈ బ్రాహ్మణ్యంతోని మనం పోరాడాలి. అడవుల కార్పొరేటీకరణను వ్యతిరేకిస్తున్న ఆదివాసీలతో మనం మమేకం కావాలి. ఇదే మన శంకర్‌ కోరుకున్నది. మనం అలా చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అవుతుంది.

Leave a Reply