అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భ్రష్ఠు పట్టించనున్నారని అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతోన్నాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధించిన ప్రతీకార సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందన్న భయం ఇప్పుడు అమెరికా సహా ప్రపంచమంతటా నెలకొంది. వాణిజ్య యుద్ధానికి తెర లేపి ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లను కుప్పకులేలా చేసిన ట్రంప్‌ విధానాలు మరిన్ని ప్రమాదాలను సృష్టించనుందని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలకిందులు చేయాలన్న (డీ డాలకైజేషన్‌) సంకల్పం… అందువల్ల ట్రంప్‌ చర్యలతో అమెరికా భారీగా లాభపడుతుందన్న గుడ్డి విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసానంగా ఏప్రిల్‌ 3 నుంచి అంతర్జాతీయ మార్కెట్లన్నీ అధోగతిలో పయనిస్తున్నాయి. కొత్త పన్నులతో అమెరికాలో ద్రవ్యోల్బణం 3 నుంచి 3.5 శాతానికి పెరుగుతుందని అంచనా. ద్రవ్యోల్బణం పెరిగితే, ధరలు హెచ్చి వినియోగదారుల విశ్వాసం, కొనుగోలు శక్తి తగ్గుతుంది. అది వృద్ధిరేటు మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిరుద్యోగ పెరుగుదలకు దారితీస్తుంది.

ట్రంప్‌ విధించిన ప్రతిచర్య సుంకాలతో మాంద్యం ముప్పు తప్పదన్న భయం వెన్నాడుతుండగా ప్రధాన ఈక్విటీల విచ్చలవిడి అమ్మకాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. మన బిఎస్‌ఇ, నిఫ్టీల్లో  ఒక్క రోజులో రూ. 14 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా అయితే ఎక్కడా ఆశారేఖ కనబటడం లేదు. డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుగా ప్రారంభించిన సుంకాల దాడితో ప్రపంచానికి ముఖ్యంగా అమెరికాకు అలాంటి ముప్పే పొంచి ఉందని జెపిమోర్గాన్‌ బ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త బ్రూస్‌ కాస్‌మాస్‌ హెచ్చరించాడు. దేర్‌ విల్‌ బి బ్లడ్‌ (రక్తస్రావం జరగొచ్చు) అనే శీర్షికతో తమ ఖాతాదార్లకు వెల్లడిరచిన విశ్లేషణ ప్రపంచ వార్తగా నిలిచింది. ట్రంప్‌ దెబ్బకు ఎస్‌ అండ్‌ పి 500 సూచికలో కంపెనీల వాటాల ధరలు ఒక్క రోజే 2.4 లక్షల కోట్ల డాలర్ల మేర పతనమయ్యాయి. డాలర్‌ బలహీనపడటం, చమురు ధరలు పడిపోవటం లాంటి పరిణామాలన్నీ కేవలం మదుపరుల్లో తాత్కాలికంగా అలుముకున్న నిరాశా నిస్పృహల వల్లే అని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చిత్రమేమంటే… ఇంత జరుగుతున్నా ఈ సంక్షోభాన్ని తాత్కాలికమైనదిగానే ట్రంప్‌ పరిగణిస్తున్నారు. తానిచ్చిన డోస్‌ పనిచేయటం మొదలెట్టాక అమెరికా ఆర్థిక వ్యవస్థ శరవేగంతో ఎదుగుతందని ట్రంప్‌ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోన్నాడు.

‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ పేరుతో ట్రంప్‌ చేస్తున్న విన్యాసాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. అగ్రరాజ్యం సహా పలు దేశాల్లో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తన మిత్ర దేశాలు సహా ప్రపంచంలోని దాదాపు 60 దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌ల మోత మోగించడం ప్రపంచ మార్కెట్లను కుదేలు చేసింది. బిఎస్‌ఇలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ సోమవారం ఒక్క రోజే రూ. 14.9 లక్షల కోట్లు ఆవిరై మన దేశ చరిత్రలో మరో ‘బ్లాక్‌ మండే’గా నిలిచిపోయింది. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను ప్రకటించడం ద్వారా చైనా గట్టిగా ప్రతిఘటించడం, మిత్ర దేశాలు సహా చాలా దేశాలు అదే బాటలో వెళ్తుండటం ట్రంప్‌కు మింగుడుపడని వ్యవహారమే! టారిఫ్‌లు ప్రకటించాక 6 లక్షల కోట్ల డాలర్లు, ట్రంప్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుండి 11 లక్షల కోట్ల డాలర్ల మేరకు అమెరికా స్టాక్‌ మార్కెట్లలో నష్టం వచ్చినా… తన వైద్యం ప్రభావం చూపడానికి సమయం పడుతుందంటూ అమెరికా అధ్యక్షుడు బుకాయించడం సిగ్గుచేటు. ట్రంప్‌ సొంత పార్టీ నేతలు, అనుకూల పెట్టుబడిదారులు సైతం ఆర్థిక అణు యుద్ధం అంటూ ఈ దుందుడుకు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ప్రపంచ దేశాలను దోచుకుని, యుద్ధాలు చేసి బతుకుతున్న అమెరికా.. అధిక టారిఫ్‌లు విధించడం విడ్డూరం. ఈ విపరీత పోకడలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటిపై తీవ్ర ప్రభావం చూపుతాయని పలు సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి.

ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు 20శాతం కంటే ఎక్కువగా తగ్గే అవకాశం ఉందని యూఎస్‌ ఆర్థికవేత్త జోనాథన్‌ పింగిల్‌ పేర్కొన్నారు. రాబోయే త్రైమాసికాలలో జిడిపిలో దిగుమతులు 1986కు ముందు స్థాయిలకు తిరిగి వెళ్లే అవకాశం ఉందన్నారు. అమెరికా నూతన సుంకాల విధానంపై ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌ యంత్రాంగం అమలుచేస్తున్న సుంకాలు దేశానికి గతంలో ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయన్నారు. బార్ల్కేస్‌, బోఫా గ్లోబరల్‌ రీసెర్చ్‌, డ్యూష్‌ బ్యాంక్‌, యూబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ఇతర పరిశోధనా సంస్థలు సైతం అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థను పతనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ సహా తమతో వాణిజ్య లావాదేవీలు కలిగి ఉన్న దేశాలన్నింటిపైనా ఆయన సుంకాలు వేశారు. భారత్‌-27శాతం, వియత్నాం-46 శాతం, ఇజ్రాయెల్‌-17 శాతం సుంకాలు విధించారు. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని… అయితే కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా సహా అన్ని ప్రధాన మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ పరిణామాలన్నిటి పట్ల ఆర్థిక వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జెపి మోర్గాన్‌తో పాటు బార్క్లేస్‌, బోఫా గ్లోబల్‌ రీసెర్చ్‌, డ్యూష్‌ బ్యాంక్‌, యుబిఎస్‌ గ్లోబల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వంటి ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థలు ట్రంప్‌ చర్యలను తప్పుబట్టాయి. అధిక టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థను పతన దిశగా నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే ఒత్తిడిలోకి జారుకున్నాయని హెచ్‌ఎస్‌బిసి పేర్కొంది. యుఎస్‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ కూడా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారిపోయే అవకాశాన్ని 35 శాతానికి పెంచింది. గోల్డ్‌మన్‌ సాచ్స్‌ వంటి కంపెనీలు అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం ఖాయమని ఇటీవలే పలు రిపోర్టులో తెలిపాయి. రాబోయే త్రైమాసికాల్లో దిగుమతుల స్థాయి 1986కు ముందు స్థాయి కనిష్ఠానికి క్షీణించొచ్చన్నారు. అంటే దాదాపు 40 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగుమతులు పడిపోనున్నాయి. అధిక టారిఫ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ వాణిజ్య విధానంలో తీవ్ర సంక్షోభం చోటు చేసుకోవచ్చనే అంచనాల్లో ఇటీవల అమెరికా సహా ప్రపంచ మార్కెట్లన్నీ తీవ్ర పతనాన్ని చవి చూస్తోన్న విషయం తెలిసిందే. మౌలికంగా స్టాక్‌ మార్కెట్లు కచ్చితమైన అంచనాల ఆధారంగా ముందుకు కదులుతాయి. మదుపుదార్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పెట్టుబడులు పెడతారు. సంపద పోగవుతుంది. కానీ ట్రంప్‌ చర్యలతో అంతా తలకిందులైంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం ఇప్పట్లో సాధ్యమా? అని ఆర్థికవేత్తలు, రేటింగ్‌ సంస్థలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, కార్పొరేట్‌ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. వీటి ప్రభావంతో వినియోగ ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కులు ఎదురుకానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా గ్రేట్‌ అగైన్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ నుంచి వృద్ధి అనుకూల విధానాల పై ప్రకటనలు వస్తాయని ఆశించిన పెట్టుబడిదారులు టారిఫ్‌ హెచ్చరికలతో ఆందోళనకు గురయ్యారు. ట్రంప్‌ టారిఫ్‌ హెచ్చరికలు మొదలుపెట్టిన దగ్గరినుంచి… అమెరికాకే నష్టం జరుగుతోందన్న అంచనాలు వెలువడ్డాయి. విదేశాల నుంచి వస్తోన్న వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరిగి, అమెరికా పౌరులకే నష్టం వాటిల్లుతుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న వాదనను కొట్టిపారేసిన ట్రంప్‌.. ఆర్థికమాంద్యం వస్తోందన్న అంచనాలను మాత్రం తోసిపుచ్చలేదు. అంతిమంగా అమెరికాకే మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. అయితే, మొత్తంగా మార్కెట్‌ ఈ పరిస్థితులను ఎలా తీసుకుంటుందో చూడాలి అని గ్రీన్‌వుడ్‌ క్యాపిటల్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వాల్టర్‌ టాడ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మేం అత్యంత బలహీనమైన స్థానంలో ఉన్నాం. ఈ పరిస్థితులు సడెన్‌ రికవరీ లేక బ్రేక్‌డౌన్‌కు మమ్మల్ని సిద్ధంగా ఉంచుతుంది అని ఇంటరాక్టివ్‌ బ్రోకర్స్‌ చీఫ్‌ స్టాట్రజిస్ట్‌ స్టీవ్‌ సోస్‌నిక్‌ అంచనా వేశారు.

2025 చివరి నాటికి ఆర్థిక మాంద్యం చుట్టుముట్టనుందని పలు సంస్థలు భావిస్తున్నాయి. ట్రంప్‌ టారీఫ్‌ చర్యలు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టబోతున్నాయని దిగ్గజ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ జెపి మోర్గాన్‌ విశ్లేషించింది. ట్రంప్‌ చర్యల వల్ల అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం 60 శాతానికి చేరుకుందని అంచనా వేసింది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది చివరి నాటికి మాంద్యంలోకి ప్రవేశించే అవకాశం ఉందని విశ్లేషించింది. సంక్షోభం రావడానికి గతంలో 40 శాతం అవకాశాలుండగా.. ఇది ఇప్పుడు 60 శాతానికి చేరిందని పేర్కొంది. యుఎస్‌ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదంగా మారిందని తెలిపింది. ఈ పరిణామాలు స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)పై తీవ్ర ప్రవాభాన్ని చూపే అవకాశం ఉందని జిపి మోర్గాన్‌ సిఇఒ, ఆర్థిక నిపుణులు మైఖేల్‌ ఫెరోలి తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2025 చివరి నాటికి మాంద్యంలోకి జారుకోనుందన్నారు. ఫలితంగా ఉద్యోగ నష్టాలు తప్పవని తన నివేదికలో వెల్లడిరచారు. 2025 ద్వితీయార్థంలో జిడిపి తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మూడవ త్రైమాసికంలో 1శాతం, నాలుగవ త్రైమాసికంలో 0.5 శాతం తగ్గుదల ఉంటుందని జెపి మోర్గాన్‌ అంచనా వేసింది. ఇది నిరుద్యోగానికి దారి తీయనుందని స్పష్టం చేసింది. 

ఇదంతా చూస్తూ కూడా అధికార రిపబ్లికన్లు నోరెత్తరు. విపక్ష డెమోక్రాట్లూ మౌనంగానే ఉంటారు. సాధారణ ప్రజానీకం ‘హ్యాండ్సాఫ్‌ ట్రంప్‌’ అంటూ వేలాదిగా రోడ్లపైకొస్తున్నారు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాగస్వాములు కావటానికి ససేమిరా అన్న వర్ధమాన దేశాల పాలకులను నయానో భయానో దారికి తెచ్చి అక్కడి వనరులన్నిటినీ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మూడున్నర దశాబ్దాలుగా ఎడాపెడా వాడుకున్న అమెరికా… ట్రంప్‌ ఏలుబడి వచ్చాక దానికి విరుద్ధమైన పోకడలకు పోతోంది. ఇన్నేళ్లుగా అమెరికాను అన్ని దేశాలూ దోచుకున్నాయని ఎదురు ఆరోపిస్తోంది. ఏప్రిల్‌ 2న ‘అమెరికా విముక్తి దినం’ రోజున మిత్రులు, ప్రత్యర్థులన్న విచక్షణ కూడా లేకుండా సుంకాల మోత మోగించేందుకు ట్రంప్‌ అధ్యక్షుడికి ఉండే ‘ఎమర్జెన్సీ’ అధికారాలను వినియోగించుకున్నారు. కేవలం యుద్ధ సమయాల్లో వాడుకోవాల్సిన ఈ అధికారాలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన చేజిక్కించుకున్నా అమెరికన్‌ కాంగ్రెస్‌ గానీ, ఇన్నాళ్లుగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన రిపబ్లికన్లు గానీ, బహుళజాతి కార్పొరేషన్లు గానీ నోరెత్తక పోవటం విచారకరం. కేవలం కెనడాపై విధించిన అదనపు సుంకాలను రద్దు చేయటం వంటి పరిమిత చర్య మినహా సెనేట్‌ మౌనంగా ఉండిపోయింది. ఈమాత్రం చర్యను కూడా ట్రంప్‌ మద్దతుదారులు సహించలేకపోతున్నారు. 

ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌ల సెగ భారతీయ ఐటీ కంపెనీలకు కూడా తగులుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్‌ వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా యాజమాన్యాలు ఖర్చులను తగ్గించుకుంటారని చెప్తున్నారు. ఐటీ సేవలపై ట్రంప్‌ ప్రత్యక్షంగా టారిఫ్‌లను విధించలేదు. అయినప్పటికీ, అమెరికాలోని మాన్యుఫ్యాక్చరింగ్‌, లాజిస్టిక్స్‌, రిటెయిల్‌ రంగాలకు చెందిన క్లయింట్లు కొత్త సుంకాలకు తగినట్లుగా తమ బడ్జెట్లను సర్దుబాటు చేసుకుంటారు. భారతీయ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్‌ అమెరికన్‌ కంపెనీలే కాబట్టి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్‌ టారిఫ్‌లను ప్రకటించిన వెంటనే భారతీయ ఐటీ రంగం రేటింగ్స్‌ను బెర్న్‌స్టీన్‌, ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ తగ్గించాయి. అనేక సంవత్సరాల నుంచి ఆదాయ వృద్ధి బలహీనంగా ఉన్న నేపథ్యంలో క్లయింట్‌ కాన్ఫిడెన్స్‌ను ట్రంప్‌ పునరుద్ధరిస్తారని అమెరికా ఐటీ రంగం ఆశలు పెట్టుకుంది. అటువంటి సమయంలో టారిఫ్‌ల పిడుగులు కురిశాయి. భారతదేశం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల విలువ 190 బిలియన్‌ డాలర్లు. దీనిలో సగానికి పైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో వ్యాపార సంస్థలకు తమ వ్యయాలపై విశ్వాసం సన్నగిల్లితే, ఆ మార్పుల ప్రభావం భారతీయ ఐటీ కంపెనీలపై కచ్చితంగా పడుతుంది. ఆర్థిక మాంద్య ప్రమాదమున్న క్రమంలో అవసరమైన వాటిపై ఖర్చు చేసే కంపెనీలు ఇబ్బందులు పడక తప్పదని బిఎన్‌పి పారిబాస్‌ విశ్లేషకుడు కుమార్‌ రాకేశ్‌ చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బాహ్య రుణాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ కలిగి ఉంది. డిసెంబర్‌ 2021లో విదేశీ సంస్థలు కలిగి ఉన్న యుఎస్‌ ట్రెజరీ సెక్యూరిటీల మొత్తం 7.7 ట్రిలియన్‌ డాలర్లు, ఇది డిసెంబర్‌ 2020లో 7.1 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే. ఫిబ్రవరి 2022లో మొత్తం యుఎస్‌ ఫెడరల్‌ ప్రభుత్వ రుణం చరిత్రలో మొదటిసారిగా 30 ట్రిలియన్‌ డాలర్‌ మార్కును అధిగమించింది. డిసెంబర్‌ 2023 నాటికి మొత్తం ఫెడరల్‌ రుణం 33.1 ట్రిలియన్‌ డాలర్లు, ప్రజల వద్ద 26.5 ట్రిలియన్‌ డాలర్లు, అంతర్‌-ప్రభుత్వ రుణం 12.1 ట్రిలియన్‌ డాలర్లు. ఈ రుణాన్ని అందించడానికి అమెరికా బడ్జెట్‌లో వార్షిక ఖర్చు జూలై 2023లో 726 బిలియన్‌ డాలర్లు, ఇది మొత్తం ఫెడరల్‌ వ్యయంలో 14%. అదనంగా, ఇటీవలి దశాబ్దాలలో, వృద్ధాప్య జనాభా పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు సమాఖ్య ప్రభుత్వ ఆర్థిక విధానాల దీర్ఘకాలిక స్థిరత్వం గురించి ఆందోళనకు దారితీశాయి. ఫిబ్రవరి 2024లో, మొత్తం సమాఖ్య ప్రభుత్వ రుణం 100 రోజుల వ్యవధిలో సుమారు 1 ట్రిలియన్‌ డాలర్లు పెరిగిన తర్వాత 34.4 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. మార్చి 6, 2025 నాటికి, సమాఖ్య ప్రభుత్వ రుణం 36.56 ట్రిలియన్‌ డాలర్లు కానుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి ట్రంప్‌ టారిఫ్‌ల పెంపు చర్యలను చేపట్టాడు. అయితే ఈ చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థికవేత్తలు, రేటింగ్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply