ఉత్తర ప్రదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడగానే భారతీయ జనతా పార్టీ తన కుతంత్రాల పాలన వల్ల జరిగిన నష్టాన్ని సవరించుకోడానికి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల ప్రలోభాలతో, ప్రతిపక్ష పార్టీల మీదకేసులు, దాడులనుంచి, దేవాలయ నిర్మాణం సాకుతో ఎన్నికలను హిందూకీరణ చేయడం వరకు అన్నీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రధాన మంత్రి మోడీ కూడా తన పూర్తి శక్తిని ఉత్తర ప్రదేశ్ లో వెచ్చిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం అనీ కేవలం యోగికి వదిలేయడం సరికాదని అతనికి తెలిసిపోయింది. ఉత్తర ప్రదేశ్ 2017 విధాన సభ ఎన్నికల్లో భాజపా 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకొని మెజారిటీలో వుండింది. ముఖ్యమంత్రి ఎవరు అవుతారో ప్రకటించకపోవడంవల్ల రాజకీయ ప్రపంచంలో జరుగుతున్న రకరకాల ఊహాగానాలను అంతం చేస్తూ భాజాప ముఖ్యమంత్రిగా అజయ్ బిష్ట్ @ యోగి ఆదిత్యనాథ్ పేరు మీద ముద్ర వేసింది. ఇలా చేయడం ఆ పార్టీ సభ్యులతో పాటు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఈ ప్రకటనతో రాబోయే 5 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్  హిందుత్వ కోటగా వుండబోతోందనేది దాదాపు నిర్ణయమైపోయింది. యోగి ఆదిత్యనాథ్ నేపథ్యమే అలా వుండింది. తన జీవితంలోని రెండవ దశాబ్దంలోనే అజయ్ బిష్ట్ యిల్లు వాకిలి వదిలేసి గోరఖ్‌పూర్ మఠంలో సాధువుఅయిన గురు అవైద్యనాథ్‌తో వుండడం మొదలుపెట్టాడు.

అవైద్యనాథ్‌ గురువు పేరు దిగ్విజయ్‌నాథ్. ఆసక్తిదాయకమైన విషయమేమంటే ఈ దిగ్విజయ్‌నాధ్‌ను మహాత్మా గాంధీ హత్య సందర్చంలో అరెస్టు చేశారు. 1967లో అతను హిందూ మహాసభ టికెట్ మీద పార్లమెంట్ సభ్యుడయ్యాడు. తన గురువు సహాయంతో సాధువు అవైద్యనాథ్ కూడా హిందూ మహాసభ మద్దతుతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు కూడా. ఈ విధంగానే యోగి ఆదిత్యనాధ్ రాజకీయ జీవిత గమనం కూడా హిందుత్వ కోణంలోనే ప్రారంభమైంది. బాబ్రీ మసీదు విధ్వంస ఉద్యమం తోటే ఇతను హిందుత్వవాద రాజకీయాల వైపు ఆకర్షితుడై ఆ బలం మీదనే గోరఖ్ పూర్ నుంచి వరసగా అయిదవసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాడు.

2017లో ముఖ్యమంత్రిగా ఎన్నికవడంతోనే హిందూత్వవాద గురువుల నుంచి నేర్చుకున్న ఎజెండాను నిర్ణయించేసుకున్నాడు.  ఈ అయిదు సంవత్సరాలలో రాజ్యయంత్రాంగాన్ని ప్రజల అణచివేతకు, మత తత్వీకరణ చేయడానికి సంపూర్ణంగా ఉపయోగించాడు. మీడియాను నిభాయించి తన ప్రతినిధిగా ఉపయోగించుకున్నాడు. ఒక మత తత్వ సంస్థతో సంబంధం వున్న, ఒక మతాన్ని సమర్ధించే, యితర మతాల వారికి వ్యతిరేకంగా మతపర విషాన్ని వెళ్లగక్కే, మహిళల పట్ల భూస్వామ్య, పితృస్వామిక భావనలు కలిగిని వాడే కాదు, వాటిని వ్యక్తపరిచేవాడు కూడా అయిన వ్యక్తి చాలా సులభంగా ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా ఎలా అయిపోతాడు అని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అవడంతో భారతదేశంలోని ప్రజాస్వామ్యం మీద కూడా ప్రశ్న తలెత్తుతుంది.  .  పదవిలో వుండి కూడా అలాంటి భాషలోనే నిరంతరం మాట్లాడుతూంటాడు. ముఖ్యమంత్రి పదవిలోకి రావడానికి ముందు నుంచే యోగి ఆదిత్యనాథ్ ముస్లిం సముదాయానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందాడు. 2007లో ఒక ఉపన్యాసంలో “వాళ్ళు ఒక హిందువును చంపితే మనం వంద ముస్లింలను చంపుదాం” అన్నాడు. 2002 లో ‘హిందూ యువ వాహిని’ పేరుతో యువజన సంఘాన్ని కూడా ప్రారంభించాడు. ఆ సంఘ ముఖ్య ఉద్దేశ్యం, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలో జాగా దొరకని నిరుద్యోగ యువతను హిందూత్వంతో సన్నిహితం చేయడం. ఈ సంఘం మొదలైనప్పటినుంచే అల్లర్లను రెచ్చగొట్టే ఆరోపణలు మళ్ళీ మళ్ళీ వచ్చాయి.


2017లో ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆదిత్యనాథ్ ముఖ్య ఎజెండా హిందూత్వ ప్రచారమే వుండింది. ముస్లిం, దళిత, మహిళ, యితర వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా పెట్టుకొన్నాడు. పదవిలోకి రాగానే ముస్లిం వ్యతిరేకతను ప్రకటిస్తూ పశు వధశాలలను మూసివేయడం మొదలుపెట్టాడు. వాటిని నడిపే పేద ముస్లింల ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడమనేదే కాక, ముస్లింలను ఒక మూసపోసిన పద్ధతిలో, అంటే వారు మాత్రమే వధశాలలను నడుపుతారు అని చిత్రీకరించడం ఈ చర్య చేపట్టడం వెనుక వున్న పభుత్వ ఉద్దేశ్యం. ఉత్తరప్రదేశ్ లోని, మొత్తం దేశంలోని పెద్ద వధశాలల వివరాలు బయటికి రావడం మొదలవడంతో, వాటి యజమానులు ప్రధానంగా హిందువులు, జైనులు అని తేలింది. వాటి నుంచి మాంసం విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది.


2019 లో సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లాంటి ప్రజావ్యతిరేక చట్టాల ఫలితంగా దేశంలో ఆందోళనలు మొదలవగానే వాటి ప్రభావం ఉత్తర ప్రదేశ్ మీద కూడా చాలా వుండింది. ఉత్తర ప్రదేశ్‌లో వారణాసి, అలహాబాద్, లక్నోతో సహా అన్నీ పట్టణాల్లో పెద్ద పెద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి, వాటిలోమహిళల పాత్ర కూడా పెద్ద ఎత్తున వుండింది. వీటిని అణచివేయడానికి యోగి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నం చేసింది. అనేక నగరాల్లో ఇంటర్నెట్ ఆపేశారు. వారణాసిలో, యితర అనేక ప్రదేశాల్లో 2019 డిసెంబర్ 19న ఏర్పాటు చేసిన నిరసన ప్రదర్శనలో లాఠీ చార్జి చేసి, తప్పుడు ఆరోపణలు చేసి జైళ్లలో బంధించారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన మొత్తం 33 మందిలో ఎనిమిదేళ్ళ పిల్లవాడు కూడా వున్నాడు.


కానీ, అది ఒక అద్భుత సమయం. అణచివేతకు ఏ మాత్రం భయపడకుండా ప్రజలు బహిరంగంగా ప్రతిఘటించారు. జైళ్ళలో నింపేస్తున్నప్పటికీ ప్రజలు ఎంత కోపంగా వున్నారంటే నిరంతరం నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూనే వున్నారు. భయపడిపోయిన యోగీ ప్రభుత్వం గూండాల భాషలో నిరసనలో పాల్గొన్నవారి ఆస్తులను జఫ్తు  చేసుకుంటామని బెదిరించింది, సామాజిక కార్యకర్తల పోస్టర్లను సార్వజనిక స్థలాల్లో అంటించింది.


2020 మార్చి తరువాత కరోనాని ఆయుధంగా చేసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆందోళనలను అణచివేశాయి. దేశమంతా కరోనా, లాక్‌డౌన్‌లతో  సతమతమవుతుంటే యోగీ ప్రభుత్వం మోడీ కేంద్ర ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమకారుల పై తప్పుడు కేసులు పెట్టడమనే తన ముఖ్యమైన పనిని కూడా పూర్తి చేసింది. కరోనా చివరి దశలో, 2020 జూన్‌లో 2019 డిసెంబర్ 19నాడు  ఘంటా ఘర్ దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు అనే ఆరోపణతో 297 మీద చార్జి షీటు దాఖలు చేసింది. వీరిలో 18 మంది మీద దేశ భద్రతా చట్టం కింద విచారణ చేశారు. 68 మీద నిందితుల మీద ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్)యాక్ట్ 1986 కింద కేసు నడిపే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 43 మంది మీద nbw జారీ చేసింది. దాదాపు 300 మంది మీద ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే కేసు పెట్టింది. ఈ ఆందోళన సమయంలో యోగీ ప్రభుత్వపు హిందూత్వ ఫాసిజం బహిరంగంగా ముందుకు వచ్చింది. ఈ కాలంలో రాష్ట్ర ప్రజలు అసంఖ్యాక నోటీసులు, వేలకొలది అరెస్టులు, భాష్పవాయు ప్రయోగాలు, లాఠీ చార్జి యిలా అన్నిరకాల అణచివేత చర్యలను ఎదుర్కొన్నారు. అందరికంటే ఎక్కువగా, ముస్లిం సముదాయం రాజ్యం నుంచి అణచివేతను, అన్యాయాన్ని ఎదుర్కొంది.


ఈ చారిత్రాత్మక ఉద్యమ సందర్భంలో యోగి నిరసనకారులను గూండాలన్నాడు. వారి ఆస్తులను జప్తు చేస్తామని బెదిరించాడు. ముఖ్యమంత్రి పదవిలోకి రాగానే అతను చేసిన మొదటి పని పూర్వ ప్రభుత్వం అతనిపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేసుకోవడం. కేవలం తనవే కాదు తనకు కావల్సిన రాజకీయ నాయకులపై కూడా కేసులు ఎత్తివేశాడు. ఇలా ఎత్తివేసిన కేసుల సంఖ్య దాదాపు యిరవై వేలు వుంటుంది.


ఒక డాటా ప్రకారం యోగీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చట్టం UAPA కింద 361 మంది మీద కేసులు పెట్టింది. మొదటి పది నెలలలో ఎన్‌కౌంటర్‌లలో చనిపోయినవారి సంఖ్య 1142. చట్ట వ్యతిరేకంగా పోలీసు కస్టడీలోకి తీసుకుని చంపేసిన వారు 15 మంది. తప్పుడు గోహత్య కేసులు అయితే విపరీతంగా వున్నాయి, అవి కోర్టులో ఏ మాత్రం నిలబడవు. అలాంటి 41 కేసుల్లో 30 కేసులను హై కోర్టు కొట్టి వేసింది. 11 కేసుల్లో బెయిల్ వచ్చేసింది.


యోగీ హిందుత్వ ఫాసిజాన్ని ముస్లింలతో పాటు, దళితులు, మహిళలు కూడా ఎదుర్కోన్నారు. హాత్రస్ ఘటన భారత దేశంలోని కుల వ్యవస్థ, ఆ వ్యవస్థను పెంచి పోషించి, రక్షించే పోలీసు వ్యవస్థ చరిత్రను మరోసారి ముందుకు తెచ్చింది. హేయమైన సామూహిక బలాత్కారం చేసిన నిందితులను రక్షించడానికి పోలీసు, దళారీ మీడియా ఎన్నో ఉపాయాలు పన్నాయి. ఉన్నతాధికారులు పూర్తి గ్రామాన్ని పోలీసు స్థావరంగా మార్చేసి పీడితురాలి మృత దేహాన్ని రహస్యంగా దహనం చేశారు. ఈ ఘటన న్యాయప్రేమికులను తలవంచుకునేట్లు చేసింది. మృతదేహాన్ని దహనం చేస్తున్న పోలీసుల నవ్వు, బాధితురాలి తల్లి హృదయవిదారక రోదన కెమెరాలో చిత్రితమయింది. రాజ్యపు ఈ హేయమైన చర్య మహిళల పట్ల అందులోనూ దళిత మహిళల పట్ల రాజ్యవైఖరికి ఒక ఉదాహరణ మాత్రమే.  


యోగి ప్రభుత్వం తన అయిదుసంవత్సరాల అధికార కాలంలో “నేరాలు లేని ఉత్తర ప్రదేశ్’గా చేస్తానని దావాని నేరస్తులు లేని రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేసింది. అందుకనే న్యాయ ప్రక్రియను కాల రాసి, నిందితుడి మీద ఆరోపణ రుజువు కానప్పటికీ ఎన్‌కౌంటర్‌లో  ‘లేపేసే’ విధానాన్ని అవలంబించింది. 16 నెలల్లో 3,200 ఎన్‌కౌంటర్‌లు, 79 మరణాలు. వీరిలో అధికులు, ముస్లింలు, దళితులు లేదా యితర వెనకబడిన వర్గాలకు చెందినవారు వుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన అధికారులకి లక్ష రూపాయల బహుమానం కూడా అందచేసింది. ఈ ఎన్‌కౌంటర్‌ బాధితులలో 37శాతం ముస్లింలు.


యోగి ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన ఎజెండా, భారతదేశంలో వేర్వేరు పాలసీల ద్వారా ఒక ‘హిందూ రాజ్యాన్ని’ స్థాపించడం.

దస్తక్ పత్రిక నుండి

అనువాదం : కొండిపర్తి పద్మ

Leave a Reply