ఉత్తరప్రదేశ్ అజంఘడ్‌లో విమానాశ్రయ విస్తరణ వ్యతిరేక పోరాటం

ఉడే దేశ్ కా ఆమ్ నాగ్‌రిక్ (ఉడాన్-దేశ సాధారణ పౌరుడు ఎగరాలి) పథకం కింద మండూరి అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్‌ను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎయిర్‌స్ట్రిప్ విస్తరణకు మొదటి దశలో 310 ఎకరాలు, రెండవ దశలో 264 ఎకరాలు అవసరమవుతాయి, ఇది తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్లను ప్రభావితం చేస్తుంది.

ఉడాన్ పథకం కింద అజంగఢ్ ఎయిర్‌స్ట్రిప్ విస్తరణ కోసం మొత్తం 600 ఎకరాలు అవసరం — దశ-I కోసం 310.338 ఎకరాలు, దశ-II కోసం 264.360 ఎకరాలు. అదనంగా, ఎనిమిది-తొమ్మిది గ్రామాలలో 783 ఇళ్ళు కూడా ప్రభావితమవుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు ఎనిమిది గ్రామాలకు చెందిన 10,000 మంది ప్రజలు నిరాశ్రయులు అవుతారని జిల్లా పరిపాలన అధికారి ఒకరు  తెలిపారు.

జిల్లా యంత్రాంగం సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిందని స్థానిక పత్రికలు కథనాలు ప్రచురించాయి. అయితే, గ్రామస్తులు ఏ సర్వేలోనూ పాల్గొనడానికి అనుమతించనప్పుడు సర్వే ఎలా జరిగిందని ప్రశ్నలను లేవనెత్తారు.

జిల్లా యంత్రాంగం అక్టోబర్ 12-13 రాత్రి రహస్యంగా సర్వే చేయడానికి ప్రయత్నించినప్పుడు గ్రామస్తులు దానిని వ్యతిరేకించారు. భూములివ్వడం ఇష్టం లేనప్పుడు సర్వే అవసరం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ ఘర్షణలో రెవెన్యూ అధికారులతో పాటు వచ్చిన పోలీసులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళలను ఒక గదిలో నిర్బంధించి కొట్టారని గ్రామస్తులు ఆరోపించారు.

అంతేకాకుండా, ఈ విషయంలో గ్రామ ప్రధానులపై కూడా ఒత్తిడి తెచ్చారని గ్రామస్తులు తెలిపారు. గ్రామాల్లో సర్వే చేసేందుకు ప్రయత్నించగా జామువా హరిరన్ గ్రామ ప్రధాన్‌ను తప్పుడు కేసులతో బెదిరించి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారని నివేదికలో పేర్కొన్నారు. మరో రోజు, పోలీసులు అతన్ని జీపులో తీసుకెళ్లడానికి ప్రయత్నించినపుడు మహిళలు వాహనాన్ని చుట్టుముట్టి, గ్రామం వదిలి వెళ్ళనివ్వలేదు. దీంతో పోలీసులు అతడిని విడిచిపెట్టాల్సి వచ్చింది.

గ్రామస్తులు జిల్లా మేజిస్ట్రేట్‌ను కలవడానికి వెళ్లినప్పుడు, డ్రోన్‌లు, ఖతౌని రికార్డులను (ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగు కోసం భూమి, దాని యజమానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్న పత్రం) ఉపయోగించి తాము భూమిని సర్వే చేసామని ఆందోళన చెందుతున్న గ్రామస్తులకు తెలియజేసినట్లు ఆందోళనకు చెందిన మరో నాయకుడు రాంనాయన్ యాదవ్ చెప్పారు.

ఆగ్రహంతో వున్న గ్రామస్తులు తమ ఉద్యమానికి “మకాన్ బచావ్-ఖేత్ బచావ్” (ఇల్లు కాపాడదాం-పొలం కాపాడదాం) అని పేరు పెట్టుకొన్నారు. తమ ఉద్యమ ప్రారంభంలోనే “ప్రాణాలైనా యిస్తాం కానీ భూమినివ్వం” అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు.

సర్వే ప్రక్రియలో ఉపయోగించిన బలవంతపు చర్యలు అజంగఢ్‌ ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేసాయి. నిరసనకు వివిధ వైపుల నుండి సంఘీభావం లభించింది. రైతు నాయకుడు రాకేష్ టికైత్, సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్, సామాజిక కార్యకర్త అరుంధతీ ధురు తదితరులు తమ మద్దతును తెలియజేసేందుకు అజంగఢ్ నిరసన స్థలానికి వెళ్లారు. నిరసనకు సంఘీభావం తెలిపిన రైతాంగ ఉద్యమ నాయకుడు టికాయత్, “రైతులు తమ భూమిని విక్రయించడానికి అంగీకరించకపోతే, ఎవరూ బలవంతంగా స్వాధీనం చేసుకోలేరు” అని ప్రకటించారు. “ఎయిర్‌స్ట్రిప్ విస్తరణ వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారో తెలియదు, కానీ రైతులు తమ భూమిని కోల్పోయిన తర్వాత వారి భవిష్యత్తు ఖచ్చితంగా చెడిపోతుంది”

భూమిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, యుపి ప్రభుత్వం, స్థానిక పరిపాలన భూసేకరణ చట్టం, 2013లోని నిబంధనలను విస్మరిస్తున్నాయని, ఆ భూమిని ప్రభుత్వం తీసుకోడానికి ముందు 80% భూ యజమానుల నుండి సమ్మతి కోరడం తప్పనిసరి అని మేధా పాట్కర్ అన్నారు.

2023 ఫిబ్రవరి 2, న జరిగిన చర్చల్లో రైతులు, కూలీలు తమ భూములు, ఇళ్లు ఇవ్వడానికి ఇష్టపడని కారణంగా అజంగఢ్‌లోని విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టును రద్దు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను మధ్యవర్తులు కోరినప్పుడు ఎంపీ లేదా ఎమ్మెల్యే కోరిక మేరకు రద్దు చేయవచ్చని జిల్లా కలెక్టరు సమాధానం యిచ్చారు అని 123వ రోజు ధర్నాలో వక్తలు తెలిపారు. ప్రజలు ఈ చర్యను వ్యతిరేకిస్తూ జిల్లా మేజిస్ట్రేట్‌కు మెమోరాండం యిచ్చారు. ప్రజా సంఘాలు కూడా రైతులకు సంపూర్ణ మద్దతు నిచ్చాయి. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ నేతలు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు.

విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణ, ఇళ్ల తొలగింపునకు వ్యతిరేకంగా 2022 సెప్టెంబర్ నెల నుంచి దాదాపు ఏడు నెలలుగా పోరాటం కొనసాగుతోంది. “వికాస్ చాహియే, వినాష్ నహీ” (మాకు అభివృద్ధి కావాలి, విధ్వంసం కాదు), “భూమి మన హక్కు… మనం బ్రతకాలి” అని వ్రాసిన నల్లటి ప్లేకార్డ్‌ లను ప్రదర్శిస్తున్నారు.

అజంగఢ్ జిల్లా కలెక్టర్  ప్రకారం నిరసనలు “రాజకీయ ప్రేరేపితమైనవి”.

రైతులకు తమ భూములివ్వడం ఇష్టం లేదని జిల్లా యంత్రాంగమే ఒప్పుకున్నప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును వాయిదా వేయడమే కాకుండా రద్దు చేయాలనేది ప్రజల డిమాండ్.

2023 మార్చి 1నాడు కప్టాన్‌గంజ్‌కు వస్తున్న పార్లమెంట్ సభ్యుడు  దినేష్‌లాల్ యాదవ్ నిర్హువాను కలిసేందుకు రైతు కూలీలు వెళ్లినప్పుడు, అక్కడ వున్న బీజేపీ నేతలు, పోలీసులు వారిని కలవనీయకుండా అడ్డుకుని అవమానించారు. ఖిరియా బాగ్‌లో నాలుగు నెలలుగా ధర్నా చేస్తున్నతమ  డిమాండ్‌లకు బీజేపీ ఎంపీ వద్ద సమాధానం లేదని మహిళల పట్ల వ్యవహరించిన తీరును బట్టి అర్థమవుతోంది.

అంతేకాకుండా అజంగఢ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల గురించి యిష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు.

అంతే కాకుండా ఆందోళనకారులను పైకి పంపిస్తానని, జైల్లో పెట్టిస్తానని, తన  మోకాలికి గాయం చేశారని వాంగ్మూలం ఇచ్చాడు. ఎయిర్‌పోర్టును వ్యతిరేకించే వారు భూములు లాక్కోవాలని చూస్తున్నారు అని అన్నాడు.

రైతులు-కూలీల భూములను లాక్కునే విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసే వరకు ధర్నా కొనసాగిస్తామన్నారు.

అజంగఢ్ జిల్లా యంత్రాంగంతో 6 దఫాలు  రైతులు-కార్మికులు చర్చలు జరిపిన తరువాత, రైతులు తమ భూమిని ఇవ్వడానికి సిద్ధంగా లేరని పరిపాలన బహిరంగంగా ఒప్పుకొంది, కాబట్టి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ జరగకూడదు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో మండూరి విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 670 ఎకరాల భూమిని సేకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

దీని పరిధిలోకి ఎనిమిది గ్రామసభలు రానున్నాయి. ఈ ఎనిమిది గ్రామసభల్లో నాలుగు గ్రామసభలను పూర్తిగా ధ్వంసం చేసి వేరే చోటికి మార్చనున్నారు. మిగిలిన నాలుగు గ్రామసభలు పాక్షికంగా ప్రభావితమవుతాయి. అయితే, భవిష్యత్తులో రన్‌వే కాకుండా ఇతర విమానాశ్రయ కార్యకలాపాల కోసం భూమి తీసుకున్నప్పుడు, పాక్షికంగా ప్రభావితమైన గ్రామసభలు కూడా వారి ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎనిమిది గ్రామసభల ప్రజలు ఆందోళనకు, భయాందోళనలకు గురవుతున్నారు.

తమ ఇళ్లను, వూళ్ళను కాపాడుకోవడానికి పోరాడుతున్నారు, పరిపాలనా యంత్రాంగాన్ని, పోలీసులను ఎదుర్కొంటున్నారు.  ఈ ప్రక్రియలో శ్రామిక, రైతాంగ-కార్మికులు, ఆదివాసీ, దళితులు-వెనుకబడిన వారిని నిర్మూలించి, వారి ఇళ్లను, వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి, వారిని చౌక కూలీలుగా నగరాల్లోని మురికివాడలకు తరిమేయడమే లక్ష్యంగా ఉన్న అభివృద్ధి నమూనాను సవాలు చేస్తున్నారు. ఖిరియా బాగ్ (ధర్నా-సమావేశ స్థలం) కేంద్రంగా ఉన్న ఎనిమిది గ్రామసభల ప్రజలు తమ ఇళ్లు, భూమిని అప్పగించడానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు.

వ్యవసాయం నుండి వేరై పోయి,  అనిశ్చిత భవిష్యత్తు లోతైన, చీకటి అగాధంలోకి విసిరివేయబడుతుందనే భయం ఎంత ఘోరంగా వుంటుంది, మనిషిని ఆసాంతమూ ఎలా కలవరపరుస్తుంది, రాత్రి నిద్రను, పగటి ప్రశాంతతను ఎలా దూరం చేస్తుంది, ముఖాలను ఎలా పాలిపోయేట్లు చేస్తుంది, భవిష్యత్తు కోసం పొదుపు చేసిన కలలన్నింటినీ ఎలా నాశనం చేస్తుంది అని తెలుసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఒకసారి ఖిరియా బాగ్ (అజంగఢ్) వెళ్ళాలి. ఆ ఎనిమిది గ్రామాల ప్రజలు సమ్మె చేస్తున్నారు, వారి ఇళ్లు ధ్వంసమయ్యాయి వ్యవసాయ భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. ఇలా చేయమని పరిపాలన ఆదేశాలు జారీ చేసింది. తమ వూరూ, యిళ్లూ విడిచి వెళ్లాలని గ్రామస్తులకు చెప్పారు. భవిష్యత్తులో అజంగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ రన్‌వే నిర్మించబోతున్నారు కాబట్టి వారు తమ తోటలను, పూర్వీకుల వ్యవసాయాన్ని విడిచిపెట్టి అనిశ్చిత-తెలియని ప్రదేశానికి వెళ్లిపోవాలి.

ఆ గ్రామాల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతుల గురించి స్థూలంగా తెలుసుకోకుండా ఉద్యమ స్వభావం, దాని బలాలు, బలహీనతలు, భవిష్యత్తును అర్థం చేసుకోలేం.

ఈ గ్రామాలు అజంగఢ్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 13 నుండి 15 కిలోమీటర్ల దూరంలో, పూర్వాంచల్ ఎక్స్‌‌ప్రెస్‌ వే సమీపంలో ఉన్నాయి. ఈ గ్రామాలకు ఆనుకొని ఉన్న పెద్ద పట్టణం కప్తాన్‌గంజ్. దేశీయ విమానయానాల కోసం మండూరి విమానాశ్రయం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉంది. ఉత్పాదకత దృష్ట్యా, ఇక్కడి భూమి చాలా సారవంతమైనది, మూడు పంటలు రావి, ఖరీఫ్, జయద్ పండుతాయి. (చలికాలంలో వర్షం రబీ పంటను పాడుచేస్తుంది, అయితే ఖరీఫ్ పంటకు మంచిది. రబీ పంటలు: గోధుమ, బార్లీ, గ్రాము, ఆవాలు, బఠానీ, మసూర్, బంగాళదుంప, ఆవాలు, పొగాకు, మొదలైనవి. జాయెద్ పంటలను ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో అంటే మార్చి నుండి జూన్ వరకు పండిస్తారు. జాయెద్ పంటలు: గుమ్మడికాయ, పుచ్చకాయ, పుచ్చకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ, వెన్నెముక, దోసకాయ, మిరపకాయ, టమోటా, పొద్దుతిరుగుడు, చెరకు, వేరుశెనగ, పప్పులు, చేదు, దోసకాయ మొదలైనవి.

ఈ సమయంలో పూలు పూసిన ఆవాల పంట ఆ ప్రాంతమంతా ఊగుతోంది, శనగలు పంటకొచ్చాయి, మరి కొన్ని పొలాలు పంటకు తయారవుతున్నాయి.

బంగాళాదుంపల పంట ప్రతిచోటా కనిపిస్తుంది. చెరుకు పంట కోతలు జరుగుతున్నాయి. తాజా చెరుకు రసం, బెల్లం వండుతున్న తియ్యటి వాసన అటువైపు లాగుతోంది. చెరుకు కొరికి రసం పీల్చేవాళ్ళు కూడా కనిపిస్తారు. గోధుమ నాట్లు  దాదాపుగా అయిపోయాయి, కొన్ని చోట్ల నీరు కూడా పెట్టారు. కందుల మొగ్గలు చిగురించాయి. ఈ ప్రాంతంలో కూరగాయలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పండ్ల చెట్లు కూడా సమృద్ధిగా కనిపిస్తాయి, మామిడి ఇక్కడ బాగా పెరుగుతుంది. దాదాపు ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉంది. మొత్తం ప్రాంతంలో లెక్కలేనన్ని చెరువులు, మంచి నీటి చెరువులు ఉన్నాయి. అనేక నదులు, చేపలకు నిలయం. చాలా మందికి ఇక్కడ ఏవో ఒకరకం పశువులు వున్నాయి. కొందరికి ఎద్దులు, మరికొందరికి ఆవులున్నాయి. చాలా మంది మేకలను కూడా పెంచుతారు.

అయితే ఎద్దులు దాదాపు అదృశ్యమయ్యాయనే చెప్పాలి. పొలాలను ట్రాక్టర్లతో మాత్రమే దున్నుతారు, కానీ ఈ గ్రామాల్లో పంట కోతలు కంబైన్ హార్వెస్టర్లతో  చేయడం లేదు. (మూడు వేర్వేరు పంటకోత ప్రక్రియలను -పంట కోత, నూర్పిడి, తూర్పార పట్టడం-  చేస్తుంది కాబట్టి ఆ యంత్రానికి ఆ పేరు వచ్చింది).  చాలా మందికి పశుగ్రాసం కోసం తవుడు, ఎండు గడ్డి అవసరం కాబట్టి చేతితో కోత జరుగుతుంది. గడ్డిని, చెరకు పిప్పి మొదలైనవాటిని వంట చెరకు గానూ, చలికాలంలో చలి కాచుకోవడానికి మంట కోసమూ ఉపయోగిస్తారు. చాలా మంది ప్రజల పొలాల పరిమాణం చాలా చిన్నదిగా వుండడం కూడా మరొక కారణం (సగటున అర ఎకరం కంటే తక్కువ). తాము స్వయంగా లేదా కూలీలను పెట్టుకొని పంట కోతలు పూర్తి చేస్తారు. ఇది పొలం పరిమాణం, సామాజిక స్థితి- ఈ రెండింటిపై ఆధారపడి ఉంటుంది. అర ఎకరం భూమే ఉన్నప్పటికీ అగ్ర కులస్థుడు పంటకోత స్వయంగా చేయకుండా, కౌలుకు యిస్తాడు లేదా కూలీలతో చేయిస్తాడు.

ఉత్పత్తి సాధనాల ఆధారంగా (ముఖ్యంగా వ్యవసాయ భూమి యాజమాన్యం) చూస్తే  ఇక్కడ ఉన్న కుటుంబాల్లో ఎక్కువ భాగం భూమిలేని పేదకూలీలు, పేద రైతులు. మధ్యస్థ రైతు  కుటుంబాలు కొన్ని వున్నాయి. సాధారణంగా భూమి లేని కూలీలు అర ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న కుటుంబాల వర్గంలోకి వస్తారు. వారి జీవనోపాధిలో ప్రధాన భాగాన్ని కూలి ద్వారా సంపాదించుకుంటారు. వారు రెండు రకాల వేతనాలు వచ్చే పనులు చేస్తారు, ఈ కుటుంబాల మహిళలు గ్రామంలోని ఇతర వ్యక్తుల పొలాల్లో లేదా మన్‌రేగా పథకంలో పని చేస్తారు. ఇప్పుడు ఏడాదికి రెండు నెలలకు మించి పొలాల్లో పని దొరకడం లేదు. చాలా మంది పురుషులు రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. ఎక్కువగా నైపుణ్యం లేని కార్మికులు గ్రామం వెలుపల ఉన్న పట్టణాలు, అజంగఢ్ జిల్లా ప్రధాన కార్యాలయం, ఇతర ప్రాంతాలలో ఉన్నారు. పని దొరికితే సాధారణంగా రోజుకు రూ.300 కూలీ వస్తుంది. అయితే వారికి సంవత్సరంలో ఐదు-ఆరు నెలలు మాత్రమే పని దొరుకుతుంది. కొద్దిపాటి పొలం వుంటే అందులో కొన్ని రోజులు పని చేసుకుంటారు. భూమిలేని రైతు కూలీల్లో ఎక్కువ మంది దళిత సముదాయాలు, చాలా వెనుకబడిన కులాలకు చెందినవారు.

ఒక ఎకరం భూమి ఉన్నపేద రైతుల జీవనాధారంగా తమ పొలాల్లో పని చేసుకోగా మిగిలిన సమయ కూలీ చేస్తారు. పేద రైతులలో ఎక్కువ మంది వెనుకబడిన కులాలకు చెందినవారు. మధ్యస్థ రైతులు అంటే ఒకటి నుండి మూడు ఎకరాల వరకు భూమి ఉన్నవారు. వారి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం, దానితో పాటు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటారు. మధ్యతరగతి రైతుల్లో చాలా మంది వెనుకబడిన, అగ్రవర్ణాలకు చెందినవారే. అయితే, వ్యవసాయ భూమి వున్న అగ్రవర్ణాలకు చెందినవారిని  ఏ వర్గంలోకి  చేర్చాలనేది కాస్త కష్టమైన అంశం, వ్యవసాయ భూమిపై యాజమాన్యం ఆధారంగా వారు మధ్య రైతాంగంలోకి వస్తారు, కానీ సాధారణంగా వారు తమ పొలాల్లో పని చేయరు. తమ వ్యవసాయాన్ని కౌలుదార్లకు యిస్తారు లేదా కూలీలతో చేయిస్తారు. అయితే దున్నడంలో యాంత్రీకరణ రావడంతో వారికి ఇక ఆ అవసరం లేదు. వారిని పెట్టుబడిదారీ ధనిక రైతులు అని కూడా పిలవలేం, ఎందుకంటే వ్యవసాయం వారి ప్రధాన ఆదాయ వనరు కాదు, వారి ప్రధాన ఆదాయ వనరు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం లేదా ఏదైనా చిన్న వ్యాపారం అయి వుంటుంది.

వారి పొలాల పరిమాణం, వ్యవసాయ స్వభావం పెట్టుబడిదారీ రైతులు అని పిలవదగిందిగా లేదు. వ్యవసాయ భూమి యాజమాన్యం, ఇతర సామాజిక సముదాయాలతో వారికి వుండే సంబంధాల రీత్యా వారు చిన్న భూస్వాముల వర్గంలోకి వస్తారు. అగ్రకులాలవారు వున్న  గ్రామాలలో సగం భూమిని కలిగి ఉన్న వెనుకబడిన కులాల రైతులు తమ పొలాల్లో పని చేస్తారు, అదే వారి అతిపెద్ద ఆదాయ వనరు. వ్యవసాయం పంపిణీ ఖచ్చితంగా కుల వ్యవస్థపై ఆధారపడివుంటుంది. ఈ ఎనిమిది గ్రామాల జనాభాలో దాదాపు సగం మంది దళితులు. ఒక ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న కుటుంబాలు రెండు లేదా మూడు మాత్రమే ఉన్నాయి. వీరిలో చాలా మందికి 2 బిస్వా నుండి 10 బిస్వా (అర్ధ ఎకరం) వరకు భూమి ఉంది. వీరు ప్రాథమికంగా కూలీలు. దళితులలో, పాశ్వాన్ ప్రజల స్థానం కొంచెం మెరుగ్గా ఉంది, వారికి కూడా చాలా తక్కువ భూమి ఉంది, కానీ ఇతర వ్యాపారాల్లో వారి స్థానం కొంచెం మెరుగ్గా ఉంది, ఎందుకంటే ఆ ప్రాంతంలోని అగ్ర కులాలవారు వారిని ఇతర దళితులంతగా ‘అంటరానివారు’గా పరిగణించరు .

ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కులాల (నిషాద్, కుమ్హర్, రాజ్‌భర్) పరిస్థితి కూడా దళితుల మాదిరిగానే ఉంది. దాదాపు అందరికీ అర ఎకరం కంటే తక్కువ భూమి ఉంది, ఒకటి లేదా రెండు కుటుంబాలకు మాత్రమే ఒక ఎకరం భూమి ఉంది. కుమ్మరి సముదాయం కూడా భూమి లేనివారిలోకి వస్తారు. వారి ప్రధాన జీవనాధారం రోజువారీ వేతనాలు. ఎవరికీ అర ఎకరం కంటే ఎక్కువ భూమి లేదు. అన్ని రకాలుగానూ అత్యంత వెనుకబడినవారు (నిషాద్, కుమ్హర్, రాజ్‌భర్ మొదలైనవి) భూమిలేని కూలీల కిందికి వస్తారు. చాలా కాలం క్రితమై వారి సాంప్రదాయ వృత్తి అంతమై పోయింది. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి వనరులు కల్పించలేదు. రోజువారీ వేతనాలు మాత్రమే వారికి వున్న ప్రత్యామ్నాయం.

ఈ ఎనిమిది గ్రామాలలో వెనుకబడిన వారిలో అత్యధిక జనాభా కలిగిన పేద రైతులు, మధ్య రైతుల వర్గీకరణలోకి యాదవులు వస్తారు. పేద రైతుల్లో యాదవులు ఎక్కువ. వారికి సుమారు మూడు ఎకరాలు వరకు భూమి ఉంటుంది. తమ పొలాల్లో అరుగాలం కష్టపడతారు. దాదాపు ప్రతి కుటుంబానికి పాడి పశువులు (గేదె లేదా ఆవు) ఉన్నాయి. వారిలో కొంత మంది రోజువారీ కూలీ కూడా చేస్తారు. కొన్ని యాదవ కుటుంబాలు సాపేక్షికంగా సంపన్నులైన మధ్యస్థ రైతులు. చాలా మంది బ్రాహ్మణులకు ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు భూమి ఉంది. ఐదెకరాలకు పైగా భూమి ఉన్న కుటుంబాలు ఒకటి, రెండు వున్నాయి. ఒకే ఒక కుటుంబానికి 30 ఎకరాల భూమి ఉంది. ఒక గ్రామంలో 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న నాలుగైదు రాయ్ కుటుంబాలు ఉన్నాయి.

సమానమైన లేదా కాస్త ఎక్కువ లేదా తక్కువ భూమి ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు లేదా ఏదైనా ఇతర వ్యాపారం, వృత్తి చేసుకునే వారు ఉన్నట్లయితే ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న దళితుల కుటుంబాల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అత్యంత వెనుకబడిన, వెనుకబడిన వారిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కుటుంబాలు చాలా తక్కువ. చాలా బ్రాహ్మణ కుటుంబాలు ఏదో ఒక ఉద్యోగం లేదా ఇతర వృత్తిలో ఉన్నాయి, అంటే పూర్తిగా వ్యవసాయం లేదా పశుపోషణపై ఆధారపడటం లేదు.

సామాజికంగా, ఆ ఎనిమిది గ్రామాలూ దళిత-వెనుకబడిన సముదాయాల ఆధిపత్యం వున్న గ్రామాలే. జనాభాలో 50 శాతం దళితులే. సామాజికంగా అగ్రవర్ణాలకు పూర్తిగా ‘అంటరాని’, తక్కువ ‘అంటరాని’ (పాసి, ధోబీ) దళితులుగా స్పష్టంగా రెండు విభాగాలుగా వున్నారు. వెనుకబడిన వారిలో ఆర్థికంగా వెనుకబడినవారు, అత్యంత వెనుకబడినవారు అనే విభజన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రామాల్లో అత్యంత వెనుకబడిన వారు ఆర్థికంగా దళితులకు, సామాజికంగా వెనుకబడిన వారికి దగ్గరగా ఉంటారు.

వర్ణాలు, కులాల ఆధారంగా, బ్రాహ్మణ వాడ, యాదవ్ పేట, నిషాద్ పేట, రాజ్‌భర్ పేట, పాసి పేట, దళిత పేటలుగా కుగ్రామాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఈ గ్రామాల్లో కనిపించే విశేషమేమిటంటే.. వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, దళితుల మధ్య సామాజికంగా కలిసిపోయే అనుబంధం ఉంది. దళితులు చాలా తేలికగా యాదవుల పేటల్లో కలిసి తిని తాగుతారు. అలాగే చాలా మంది యాదవులు దళితుల బస్తీల్లో అలా కలిసిపోతారు.

వారి మధ్య చాలా సహజమైన, స్నేహపూర్వక అనుబంధం కనిపించింది. అత్యంత వెనుకబడినవారు, దళితుల మధ్య సంబంధం మరింత సహజమైనదిగా, సమానమైనదిగా వున్నట్లు  కనిపించింది. వారిద్దరూ రోజువారీ కూలీ కోసం గ్రామం నుండి కలిసి వెళ్ళడం అనేది దానికి ప్రధాన కారణం.

సామాజికంగా, అగ్రవర్ణాల ప్రపంచం భిన్నంగా ఉంటుంది, వారు ఇప్పటికీ దళితులను ‘అంటరానివారు’గా, తమ కంటే చాలా తక్కువవారిగా భావిస్తారు. నేటికీ గ్రామంలోని అగ్రవర్ణాలకు, దళితులకు కలిసి  తినడం, తాగడం అనే ప్రాతిపదికన ఎలాంటి సామాజిక సంబంధాలు లేవు, ఇద్దరి మధ్య స్నేహం, సోదర భావాలు లేవు. అజయ్ యాదవ్ ని (35 సంవత్సరాలు, బి.ఏ.) వెనుకబడిన, దళితుల మధ్య ఇటువంటి సోదర, స్నేహ భావాల  గురించి అడిగినప్పుడు, ‘వెనుకబడిన, దళితుల మధ్య ఈ సంబంధం కొంతవరకు గతంలో ఉంది, కానీ ఈ కొత్త తరం మధ్య ఈ మరింత సమానమైన సంబంధానికి ప్రధాన కారణం వెనుకబడిన, దళిత సముదాయాలు  రెండూ కష్టపడి జీవించేవి, అగ్ర కులాల వారికి భిన్నంగా ఉత్పాదకతలో పాల్గొనే, కష్టపడి పనిచేసే సముదాయాలు. అగ్రకులాలవారు శారీరక శ్రమ (ముఖ్యంగా వ్యవసాయంలో) నుండి పారిపోతారు, దానిని అవమానంగా భావిస్తారు. ఏదో ఒక స్థాయిలో శారీరక శ్రమ చేసే వారిని (దళితులు, వెనుకబడినవర్గాలు) హీనంగా పరిగణిస్తారు. ఇందులో మతపర-సామాజిక ఆలోచనా విధానం, సంప్రదాయాలు, విలువల పాత్ర చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఈ గ్రామాల్లో స్థూలంగా మూడు రకాల మహిళలు ఉన్నారు. ఒకవైపు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళల కష్టపడి తమ పశువులను (ఆవులు, మేకలు, గేదెలు) సంరక్షిస్తుంది. కాలానుగుణంగా వారు అగ్రకులాల, యాదవుల పొలాల్లో కూలీగానూ, కొన్నిసార్లు మన్‌రేగా శ్రామికురాలిగానూ పని చేస్తుంది. దాంతోపాటు ఇంటి పని ఎలాగూ చేస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న దళిత కుటుంబాల (ప్రభుత్వ ఉద్యోగాలు లేదా విదేశాల్లో వేతనాలు వచ్చేవారు) ఇళ్లలో, కొత్త కోడలు ఇంటి లోపల పరదాలో వుంటుంది. బయటి వ్యక్తులు వారితో మాట్లాడడం  కష్టం. బ్రాహ్మణ వాడలో  చాలా మంది స్త్రీలు ఇంటి లోపలే  వుండిపోయారు. బయట కొందరు వృద్ధ మహిళలు కనిపించారు. వాళ్ళు  కూడా మాతో మాట్లాడలేక పోయారు. తమ మగవాళ్ళతో మాట్లాడమన్నారు. చాలా కొద్ది మంది  మహిళలు మాత్రమే మాట్లాడారు. అయితే కొందరు అగ్రకులాల స్త్రీలు కూడా పొలాల్లో పచ్చిమిరపకాయ, ఆవాలు తీస్తూ కనిపించారు. ఒకామె పశువుల కోసం గడ్డి కూడా కోస్తోంది.

దళితవాడ స్త్రీలు పూర్తిగా నిక్కచ్చిగా, స్వతంత్రంగా కనిపించారు. ఖిరియా బాగ్ ఉద్యమంలో నేతృత్వంలో ఉన్న మహిళల్లో ఎక్కువ మంది (సునీత, కుటురి, కిస్మతి, ఫూల్మతి మొదలైనవారు) దళితులు వుండడానికి యిది ఒక పెద్ద కారణమనిపిస్తుంది. చాలా వెనుకబడిన కులాలకు చెందిన స్త్రీలు, దళిత స్త్రీల పరిస్థితి దాదాపు ఒకలాగే వుంది. వెనుకబడిన కులాల (ముఖ్యంగా యాదవుల) మహిళల పరిస్థితి మధ్యస్థంగా ఉంది. వారు సాధారణంగా ఇంకొకరి పొలంలో పని చేయరు, లేదా రోజువారీ కూలీ చేయరు, కానీ తమ పశువులను జాగ్రత్తగా చూసుకుంటారు, ఇంటి లోపల కొంత వరకు పరదా వెనుక ఉంటారు. ఇక్కడ కూడా 40-50 ఏళ్లలోపు మహిళలతో బయటి వ్యక్తి మాట్లాడటం కొంచెం కష్టంగానే వుంటుంది. అయితే కొన్ని చాలా పేద కుటుంబాలు కూడా ఉన్నాయి, వారి స్థితి భిన్నంగా ఉంటుంది.

దళిత, అగ్రకులాల మహిళల స్థితికి మధ్యలో యాదవ కుటుంబాల మహిళల స్థితి వుంటుంది అని  చెప్పవచ్చు.  సార్వజనిక శ్రమలో భాగస్వామ్యం దృష్టితో చూస్తే, ఈ గ్రామాలలో అగ్రకులాల మహిళల పాత్ర లేదనే చెప్పాలి. దళిత స్త్రీలలో ఎక్కువ మంది సార్వజనిక శ్రమలో భాగస్వాములు అయితే, చాలా వెనుకబడిన కులాల మహిళల విషయంలో కూడా ఇదే పరిస్థితి. యాదవ కుటుంబానికి చెందిన స్త్రీల స్థితి సామాజిక శ్రమలో పాల్గొనే విషయంలో దళిత, అగ్రకులాల వారి మధ్యన ఉంది.

ఈ ఎనిమిది గ్రామాలలో దళిత-వెనుకబడిన కులాలకు చెందినవారు అత్యధికంగా వున్నారు. ఎక్కువ మంది మహిళలు శ్రమ చేసేవారు (ఇంటి పనికాకుండా). వీరే ఖిరియా బాగ్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నారు. వారు ప్రభుత్వం-పరిపాలన, పోలీసులను ఎదుర్కొంటున్నారు. వీరి శక్తి సామర్ధ్యాల పైననే బలంతో ఈ ఉద్యమం కొనసాగుతూ, స్థిరంగా వుందనేది వాస్తవం.

ఈ ఎనిమిది గ్రామాల ప్రజలు రాజకీయాల్లో ఎవరి పక్షం వున్నారనేది చాలా వరకు కుల ప్రాతిపదిక పైన ఆధారపడి వుంటుంది. అగ్రకులాలు బిజెపి ఓటర్లు. కానీ దళితుల్లో పెద్ద సంఖ్యలో పాశ్వాన్‌లు ఇటీవల బిజెపి ఓటర్లుగా మారారు. కానీ యాదవులు పూర్తి బలంతో ఎస్‌పితో పాటు దళితులు బిఎస్‌పి ఓటర్లుగా ఉన్నారు, నిషాద్, రాజ్‌భర్, కుమ్హర్ (ప్రజాపతి) ఇక్కడ బీజేపీ వైపు లేదా సంజయ్ నిషాద్, ఓం ప్రకాష్ రాజ్‌భర్ వంటి వారి కులాల పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఓటర్ల రూపంలో రాజకీయ ధోరణి లేదా రాజకీయ పక్షపాతం వివిధ సామాజిక సమూహాలలో వివిధ రూపాల్లో వ్యక్తీకృతమైంది.

నరేంద్ర మోడీ, ఆదిత్యనాథ్, బిజెపి,  స్థానిక ఎంపిల పైన విమర్శను ఏమాత్రం వినడానికి యిష్టపడని అగ్రకులాల వారు వున్న చోట, బిజెపికి చెందిన దళితులు (పాశ్వాన్) ఇతర వెనుకబడిన కులాల ఓటర్లు (నిషాద్, రాజ్‌భర్, కుమ్హర్ మొదలైనవారు) అంత మూఢత్వంతో, నిబద్ధతతో వారి పక్షాన నిలబడరు. యాదవులు, దళితులు వేర్వేరు పార్టీల (ఎస్‌పి -బిఎస్‌పి) ఓటర్లు అయినప్పటికీ, గ్రామంలో ఈ రాజకీయ పక్షం వహించినప్పటికీ, రెండుగా విభజించడానికి,  వేరుపడిన యాదవులు, అగ్రకులాలు  లేదా అది దళితులు, అగ్రకులాల మధ్య కనపడినట్లుగా వీరి మధ్య ఏ విధమైన  రాజకీయ పోటీ కనబడదు, మాదిరిగానే ఇద్దరినీ దూరం చేస్తుంది.

పైన పేర్కొన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల స్వర వ్యక్తీకరణ ఖిరియా బాగ్ ఉద్యమంలో కనిపిస్తుంది. వివిధ ఆర్థిక, సామాజిక స్థితిగతులు, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా ఎనిమిది గ్రామాలలోని అన్ని కుటుంబాలు (దళిత, వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, అగ్రకులాలు) అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే పేరుతో తమ భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోకూడదని ఏకగ్రీవంగా కోరుతున్నారు. తమకు ఎంత నష్టపరిహారం వచ్చినా ఇల్లు, భూమి వదులుకోవడానికి ఏసముదాయమూ సిద్ధంగా లేదు.  అగ్రకులాల వారు కూడా పూర్వాంచల్ ఎక్స్‌‌ప్రెస్‌‌వేలో తమ భూములను కోల్పోయి, ఎంత పరిహారం దొరికినప్పటికీ, వచ్చిన అంతిమ ఫలితాన్ని చూశారు.

ఇల్లు-వాకిలి, భూమి, తోటలను కాపాడుకోవాలనే తపన అందరినీ ఏకమవ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే అగ్రకులాల సామాజిక ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనే కోరిక, బిజెపి సిద్ధాంతాలు, రాజకీయాల పట్ల మతోన్మాద నిబద్ధత వారిని ఆచరణలో పోరాటం నుంచి దూరం చేసింది లేదా వేరే మార్గాన్ని అవలంబించేట్లు చేసింది. మొత్తం ఉద్యమంలో అత్యధికులు దళితులు, వెనుకబడినవారు, అత్యంత వెనుకబడినవారు వున్నారు. దళితులలో దళిత స్త్రీల భాగస్వామ్యం అత్యధికంగా వుంది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు, ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఘర్-జమీన్ బచావో సంయుక్త్ మోర్చా రాంనాయన్ యాదవ్ నేతృత్వంలో ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది.

ఈ ఉద్యమంలో ఏర్పడిన గ్రామ కమిటీలలో దళితులు, అత్యంత వెనుకబడిన, వెనుకబడిన ప్రజల ఆధిపత్యం వుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి – మొదటిది, ఈ గ్రామాల జనాభాలో 90 శాతం మంది ఈ వర్గాలకు చెందినవారు. రెండవది, ఈ సముదాయమే  ఉద్యమంలో అందరికంటే ముందుండి పాల్గొంటోంది.

వీటన్నింటిలో కూడా ఉద్యమంలో గరిష్ట సంఖ్య, ప్రభావం దళిత మహిళలది వున్నది. వెనుకబడిన, చాలా వెనుకబడిన కులాలకు చెందిన అత్యధిక ప్రజలు తమ సామాజిక-ఆర్థిక, రాజకీయ స్థితి కారణంగా, ఉద్యమంలో దళిత మహిళల అత్యధిక సంఖ్య వుండడంతోనూ,  వారి నాయకత్వంతోనూ ఎలాంటి ప్రత్యేక సమస్య లేదు. కానీ దళిత స్త్రీల నేతృత్వంలో జరిగే ఏ ధర్నా, ఆందోళనా కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడానికి అగ్రకులాలవారు  సిద్ధంగా లేరు.

ఒక అగ్రకుల మహిళ ఈ విషయాన్ని యిలా వ్యక్తం చేసింది – “వారి(దళిత మహిళలు) మధ్యలో మేం (అగ్రకుల) ఎలా కూర్చోగలం?”. వెనుకబడిన కులాలవారు  ఉద్యమ నాయకులుగా (రామ్‌నయన్ యాదవ్-రాజీవ్ యాదవ్, వీరేంద్ర యాదవ్) వుండడం వల్ల అగ్రకులాల వారు కొద్దో గొప్పో నేరుగా ఉద్యమంతో సంబంధాన్ని కలిగివున్నారు. ఈ ఉద్యమానికి మద్దతుదారులైన ఇద్దరు ఉపాధ్యాయ్‌ల ప్రకటనల ద్వారా ఇది వ్యక్తమవుతుంది – ” రాజీవ్ యాదవ్ వుండడం వల్ల మేం అప్పుడప్పుడూ వెళ్తాము, లేకపోతే వారందరూ (దళిత మహిళలు) ప్రవర్తించేతీరుకి, అక్కడికి ఎవరు వెళతారు.”

తమ రాజకీయ సైద్ధాంతిక-రాజకీయ స్థితి కారణంగా కూడా అగ్రకులాలు  ఈ ఉద్యమంనుంచి వేరు పడుతున్నాయి. ఉద్యమంలో మెజారిటీ భాగం ముఖ్యంగా దాని నాయకత్వ బృందం మొత్తం అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తోంది, అజంగఢ్‌లో ఎక్కడా అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం లేదని చెబుతోంది. మకాన్-జమీన్ బచావో సంయుక్త్ మోర్చా అధ్యక్షుడు రాంనయన్ యాదవ్ – “అజంగఢ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమే లేదు, ఇదంతా రైతుల భూములను అంబానీ-అదానీలకు అప్పగించే ప్రణాళికలో భాగమే” అని అన్నారు.

“విమానాశ్రయం కోసం ఎక్కడైనా, ఏ గ్రామంలోనైనా ప్రజల ఇళ్లను- భూమిని తీసుకోవలసిన అవసరం ఏ మాత్రం లేదు” అని ఉద్యమానికి పెద్ద మద్దతుదారుడు, మిత్రుడు రాజీవ్ యాదవ్ కూడా అతని అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు.

“ఈ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా మా ఉద్యమం జరుగుతోంది, దీని కింద పెద్ద ఎత్తున ఆదివాసీలు, శ్రమించే రైతుల భూమిని తీసుకుంటున్నారు. మేము కేవలం ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాత్రమే  వ్యతిరేకించడం లేదు, ఈ దేశంలోని కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ప్రతి పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రైతులు, కూలీలు, ఆదివాసీలు అభివృద్ధి చెందే, అందరికీ ఉపాధి కల్పించే అభివృద్ధి నమూనాను డిమాండ్ చేస్తున్నాం తప్ప వారి ఇళ్లను, భూమిని దోచుకునే అభివృద్ధి నమూనాను కాదు” అని ఆయన పదే పదే నొక్కిచెప్పారు,

ఈ ఉద్యమ స్వరానికి భిన్నంగా అగ్రకులాల వారికి విమానాశ్రయాన్ని విస్తరించడం పట్ల వ్యతిరేకత లేదు. తమ గ్రామాల్లో కాకుండా వేరే ఎక్కడైనా నిర్మించాలని వారు అంటున్నారు. చాలా తక్కువ ఇళ్ళు వున్న చోట లేదా కొద్దిగా భూమి సాగు అవుతోన్న లేదా బంజరు భూముల్లో నిర్మించమని సూచిస్తున్నారు. “ఇప్పటికే ఉన్న విమానాశ్రయ ఉత్తర, దక్షిణ దిశలో ఖాళీ స్థలాలు అందుబాటులో వుండగా  విమానాశ్రయాన్ని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎందుకు నిర్మిస్తున్నారు?” అని సుజయ్ ఉపాధ్యాయ్ ప్రశ్నిస్తున్నారు.

అభివృద్ధి నమూనాకు సంబంధించి మాత్రమే  కాకుండా, మోడీ-యోగి, స్థానిక ఎంపీల పట్ల అగ్రకులాలు, ఇతర ఆందోళనకారులలో వైఖరిలో భిన్నత్వం ఉంది. అజంగఢ్‌లోని ఎస్పీ ఎమ్మెల్యేలందరూ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండగా, బీజేపీ ఎంపీలు బహిరంగంగా దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే నఫీస్ అహ్మద్ శాసనసభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ ఎనిమిది గ్రామాలను నాశనం చేయడానికి అజంగఢ్ ఎంపీ (నిర్హువా) అనుమతించరని ఉద్యమంలోని అగ్రకులాలవారు విశ్వసిస్తున్నారు. అలా అని అతను యిచ్చిన హామీపైన వారికి పూర్తి విశ్వాసం వుంది.

సభా వేదిక వద్ద మోడీ-యోగి, నిర్హువ వ్యతిరేక నినాదాలు చేయడాన్ని అగ్రకులాల ప్రజలు కోరుకోవడం లేదు. “ఈ ఉద్యమాన్నిరాజకీయం చేయకూడదు. మనం మన సమస్యకు మాత్రమే పరిమితమై వుండాలి” అని ఉద్యమ ప్రారంభ నాయకుడు శశికాంత్ ఉపాధ్యాయ్ అంటాడు.

ఈ హామీని  బీజేపీ ఎంపీ (నిరాహువా) వ్యక్తిగత స్థాయిలో ఇచ్చారు. అయితే, యాదవులు (రామ్ నయన్ యాదవ్, వీరేంద్ర యాదవ్, రాజీవ్ యాదవ్ మొదలైనవారు) ఉద్యమ అగ్ర నాయకులుగా ఆవిర్భవించడంతో, బిజెపిని వ్యతిరేకించడమే ప్రధాన కర్తవ్యంగా ఉన్నఎస్‌పి ఉద్యమంగా ఇది మారిందని అగ్రకులాల వర్గం అభిప్రాయపడుతోంది.

అగ్రకులాల నేతలు ఈ నిరసన, ఉద్యమం కొనసాగాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే “ఈ ధర్నా (ఉద్యమం) కొనసాగితేనే, పోరాటం కొనసాగితేనే బీజేపీ నేతలు (ముఖ్యంగా ఎంపీలు) మా మాట వింటారు. ఈ పోరాటం వల్లనే ఆయన మాతో మాట్లాడాల్సి వచ్చింది. వారిపై ఒత్తిడి ఉండాలి.’’ శశికాంత్ ఉపాధ్యాయ, సుజయ్ ఉపాధ్యాయ “మేము ఉద్యమం నుండి విడిపోయి ఉండవచ్చు, కానీ మేము కూడా పోరాడుతున్నాము, కానీ వేరే ఛానెల్ ద్వారా (ఎంపి ద్వారా)” అని చెప్పారు.

ఈ ఎనిమిది గ్రామాల్లోని అన్ని వర్గాల మధ్య ఐక్యతను ఎలా కాపాడుకోవాలో, ఐక్యంగా ఎలా పోరాడాలన్నదే ఉద్యమ అగ్ర నాయకత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఏ భాగమూ విడిపోయి పరిపాలన చేతుల్లోకి వెళ్లకూడదు.

ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం:

నిర్దేశిత గ్రామాల నుంచి మహిళలు పెద్దఎత్తున ధర్నాకు దిగుతున్నారు. అజంగఢ్ విమానాశ్రయం విస్తరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మహిళలు ముందున్నారు.

“ప్రాణాలిస్తాం కానీ భూమినివ్వం” అంటూ మహిళలు నినదిస్తున్నారు. తాము చాలా పేదలమని, జీవనోపాధి పొందలేకపోతున్నామని, అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని స్థానభ్రంశం చేస్తే పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. మండూరి, జమువా, హరిరాం, గదన్‌పూర్, హిచ్చన్నపట్టి, కడిపూర్, హసన్‌పూర్, జోలా జమువా, జిగిన కర్మన్‌పూర్‌లు విస్తరణ పరిధిలోకి వస్తున్నాయి. భూ విస్తరణలో గ్రామస్తులు తమ ఇల్లు, మొత్తం భూమిని కోల్పోతున్నారు. ఎనిమిది గ్రామాల జనాభా కూడా దీని పరిధిలోనే ఉంది. దళితులు, మహిళల పట్ల జిల్లా యంత్రాంగం దురుసుగా ప్రవర్తిస్తోంది.

అజంగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే కోసం ఎనిమిది గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి దళిత మహిళలు వెన్నుదన్నుగా నిలిచారు. నవంబర్ 12వ తేదీ, ముఖ్యంగా అర్ధరాత్రి 1 గంటలకు, పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ ను ఎదుర్కొన్నది కూడా దళిత మహిళలే. రాత్రి పోలీసుల రాకతో బ్రాహ్మణ సంఘాల మహిళలు కాస్త హడావిడి చేసినా.. పోలీసులను అడ్డుకునేందుకు దళిత మహిళలు పరుగులు తీశారు. ఈ వాస్తవాన్ని ప్రత్యక్ష సాక్షులు, ఉద్యమ అగ్రనేతలందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. అంతకుముందు పోలీసులు బ్రాహ్మణ వాడ వైపే  వచ్చారు.

బ్రాహ్మణ వాడకు చెందిన సుజయ్ ఉపాధ్యాయ “పోలీసులతో పోరాటంలో దళిత మహిళలు ముందంజలో ఉన్నారు” అనే వాస్తవాన్ని అంగీకరించారు. తమను సర్వే చేయకుండా అడ్డుకుంటున్న మహిళలు, భూమిని కొలిచే పరికరాన్ని పట్టుకుని, లాఠీలతో కొట్టకుండా అడ్డుకుంటున్న మహిళలు దళితులేనన్న విషయం పోలీసులకు తెలియడంతో, వారిపై కుల దూషణలకు కూడా దిగారు. దీర్ఘకాలంగా సాగుతున్న ఈ ఉద్యమంలో, ధర్నా ప్రదేశంలో (ఖిరియా బాగ్)లో ఎప్పుడూ 70 నుండి 80 శాతం మహిళలు ఉంటారు, ఉద్యమ అగ్రనాయకులు లేదా ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహిస్తున్న లేదా ఏదైనా ప్రత్యేక సందర్భం లేదా బయటి నుండి ఉద్యమంలోకి వచ్చిన పురుషులు మాత్రమే అక్కడ ఉంటారు.

నవంబర్‌లో తొలిసారిగా జరిగిన ఈ ఊరేగింపులో దాదాపు 250 మంది పాల్గొన్నారు, వీరిలో 200 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా డిసెంబర్‌లో జరిగిన ఊరేగింపులో 300 మంది హాజరవగా, అందులో 200 మందికి పైగా మహిళలు ఉన్నారు. జనవరి 1 న జరిగిన ఊరేగింపులో సుమారు 600 మంది పాల్గొన్నారు, ఇందులో 400 మంది మహిళలు ఉన్నారు. ఉద్యమం ఉధృతమయేటప్పటికి , రాజీవ్ యాదవ్‌ను పోలీసులు రహస్యంగా పట్టుకున్నారు, డిసెంబర్ 26 న, పోలీసుల ఈ చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన సుమారు 250 మంది, దాదాపు 200 మంది మహిళలతో సహా, పోలీసులతో పోరాటం చేశారు.

అదేవిధంగా డిసెంబర్ 30న కలెక్టర్‌తో చర్చలకు వెళ్లిన 60 మందిలో 40 మంది మహిళలు ఉన్నారు. ఈ వాస్తవాలను ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మకాన్-జమీన్ బచావో సంఘర్ష్ మోర్చా అధ్యక్షుడు రాంనయన్ యాదవ్ తెలియ చేసారు.

మహిళా కిసాన్-మజ్దూర్ పంచాయితీని జమీన్ మకాన్‌ బచావ్  సంయుక్త్ మోర్చా జముహరిరంలో నిర్వహించింది. సర్వే పేరుతో మహిళలను, వృద్ధులను వేధిస్తున్నారని మహిళలు వెల్లడించారు.

ఫూల్మతి, సునీత, నీలం, సుధ, కాళింద, సుభావతి తమ కష్టాలను పంచుకున్నారు. 12-13 అక్టోబర్ నాడు పోలీసుల వేధింపుల బాధాకరమైన అనుభవాన్ని కూడా వారు పంచుకున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం మాస్టర్‌ ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌ను బలంగా వినిపించారు.

నాలుగు రోజులుగా ఈ గ్రామాల్లో మకాం వేసి ధర్నా స్థలంలో ఉన్న ప్రజలతో మాట్లాడిన జన్‌చౌక్‌ బృందం ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకొంది. ఇక్కడ ధర్నా స్థలమైనా, పశుగ్రాసం ఊరేగింపు అయినా, పరిపాలనకు వెళ్లినా అందులో పాల్గొనే మహిళల్లో 90 శాతానికి పైగా దళిత మహిళలే అనే వాస్తవాన్ని మరోసారి నొక్కి చెప్పాలి. కొంతమంది కుమ్హర్, నిషాద్, రాజ్‌భర్ లేదా యాదవ్ కుటుంబానికి చెందిన మహిళలు, గుప్తా కుటుంబానికి చెందిన కొందరు మహిళలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు, అయినప్పటికీ గ్రామంలో గుప్తా సముదాయ ప్రజల సంఖ్య తక్కువగా ఉంది. ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో, దళిత స్త్రీల ప్రశ్నను లేవనెత్తినప్పుడు, ఉద్యమ నాయకులు బ్రాహ్మణులే (శశికాంత్ ఉపాధ్యాయ మొదట్లో ఉద్యమానికి నాయకత్వం వహించేవారు) కానీ వారి మహిళలు ఈ ఉద్యమంలోకి రాలేదు. దీని తరువాత ఒకరిద్దరు వృద్ధ బ్రాహ్మణ స్త్రీలు కొద్ది రోజులకు ఈ ఉద్యమానికి వచ్చారు, కానీ ఆ తర్వాత వారు రావడం మానేశారు, అయినప్పటికీ తరువాత బ్రాహ్మణ పురుషులు కూడా రావడం మానేశారు. బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన మహిళలు ఎందుకు రారు అనే ప్రశ్నకు ఒక బ్రాహ్మణ మహిళ సమాధానమిస్తూ- “ఉన్హాన్ (దళిత) బీచ్ హమాన్ కే అబ్ జా కే బైతీ (మేం ఇప్పుడు దళిత మహిళల మధ్యకు వెళ్లి కూర్చుంటాం)” అని సమాధానం ఇచ్చింది.

ఈ ఉద్యమంలో మహిళలు ఎందుకు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు? అనే ప్రశ్నకు  ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేదు. తన పేరు చెప్పటానికి నిరాకరించిన ఉద్యమంలోని ఒక ప్రముఖ వ్యక్తి ఇలా అన్నారు: “ఈ ఉద్యమానికి కవచం, డాలు స్త్రీలు. ఒకవేళ మహిళలు లేకుంటే పోలీసులు ధర్నా చేస్తున్న వారిని తరిమికొట్టి గ్రామాలు సర్వే చేసేసేవారు.  ఎనిమిది గ్రామాల, ముఖ్యంగా కేవలం నాలుగు గ్రామాల ప్రజలు ఎంతకాలం పరిపాలనను, పోలీసు-పీఏసీని అడ్డుకోగలరు. “మహిళలను లాఠీచార్జి చేసి జైలుకు పంపడానికి పోలీసు-పిఎసి భయపడుతోంది, అలా చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. పోలీసు పరిపాలనతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుంది” అని ఆయన అన్నారు. ఇతర క్రియాశీల నాయకులు, ఉద్యమ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. డిసెంబరు 30న డిఎం కార్యాలయంలో చర్చలు జరిగిన రోజున ఓ పోలీసు కూడా ఒక సంభాషణలో ఇలా అన్నాడు, “అందరూ (ఉద్యమ నాయకులు) చాలా తెలివైనవారు, మహిళలను ముందుంచారు.”

ఇంత జరుగుతున్నా ఈ ఉద్యమంలో దళిత మహిళలు అత్యధిక సంఖ్యలో, అగ్రగామిగా ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. ఒక సమాధానం ఏమిటంటే, ఈ గ్రామాల జనాభాలో దళితులు మెజారిటీ (సుమారు 50 శాతం) ఉన్నారు. తమ సొంత ఇల్లు, వ్యవసాయ భూమిని (ఏ మాత్రం వున్నా) కాపాడుకోవడం వారికి అస్థిత్వాన్ని కాపాడుకోవడంతో సమానం. తమ ఇళ్ల నుండి పొలాల నుంచి వెళ్లగొడితే దొరికే నష్ట పరిహారం చాలా తక్కువగా వుంటుందని కూడా వారికి తెలుసు.

కొందరికి పక్కా ఇంటిక కాయితాలు కూడా లేవు, మరికొందరు గ్రామసభ (ఆబాది) స్థలంలో ఇళ్లు కట్టుకొన్నారు, మరికొందరి స్థలంలో పాత భూస్వామి పేరు చెక్కుచెదరకుండా ఉంది. ఇది కాకుండా, జీవనోపాధి కోసం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తారు. ఈ భూములపై ​​వారికి ఎలాంటి యాజమాన్యం లేదు. దీంతోపాటు గ్రామంలో ఉంటూ ఇతరుల పొలాల్లో కూలిపనులు చేస్తుంది. అంతే కాకుండా జీవనోపాధి కోసం మరో సాధనమైన పశువులు, మేకలు ఈ గ్రామంలోని తోటలు, చెరువులు, పొలాల్లో వాటి కూడా మేత మేస్తూంటాయి.

దళిత స్త్రీల భర్తలు, కొడుకులు సుదూర నగరాలలో, కొంతమంది విదేశాలలో కూడా కూలీలుగా పని చేస్తున్నారు, కానీ వారు నగరంలో ఇల్లు కొనడానికి లేదా కట్టుకోడానికి తగినంత సంపాదించలేరు, వారికి తమ వూళ్ళోని యిల్లే చివరి ఆశ్రయం. కోవిడ్ సమయంలో వారు ఈ విషయాన్ని మరింత లోతుగా గ్రహించారు.

కుటురి (సుమారు 55 ఏళ్ల దళిత మహిళ) ఈ మొత్తం పరిస్థితిని ఇలా వ్యక్తీకరిస్తుంది, “మమ్మల్ని వెళ్లగొడితే ఎక్కడికి వెళ్తాము. ఎలాగోలా కొడుకులు (అఖిలేష్-కమలేష్) విదేశాల్లో (గల్ఫ్ దేశాల్లో) పనిచేసి చక్కని ఇల్లు కట్టుకున్నారు, దాన్ని లాక్కుంటే మేం సర్వనాశనం అయిపోతాం. పిల్లలు డబ్బు పంపుతారు, మా పొలాల్లో, ఇతరుల పొలాల్లో కాస్త పని చేస్తాం. కుటుంబం బాగానే గడిచిపోతోంది. ఇదంతా అంతమైపోతుంది. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం?”

దళిత పురుషుల కంటే దళిత స్త్రీలు సమ్మె స్థలం, ఆందోళనలలో ఎక్కువగా పాల్గొనడానికి కనిపించే స్పష్టమైన కారణం ఏమిటంటే, దాదాపు దళిత పురుషులందరూ రోజువారీ కూలీ కోసం గ్రామం నుండి బయటకు వెళ్లడం. కొందరు అదే రోజు రాత్రి తిరిగి వస్తారు, కొందరు వారం లేదా 25 రోజుల్లో తిరిగి వస్తారు. యిది పని స్వభావం మీద ఆధారపడి వుంటుంది.

చాలా వెనుకబడిన కులాలకు చెందిన పురుష కార్మికుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రవేశ్ నిషాద్ అనే వ్యక్తి ఖిరియా బాగ్ ఉద్యమానికి ఒక ముఖ్యమైన స్తంభం, కానీ అతను కూడా ప్రతిరోజూ ధర్నాకు హాజరు కాలేకపోతున్నాడు. దీనికి కారణం అడిగితే, “నేను పని చేయకపోతే, నా కుటుంబం ఆకలితో చనిపోతుంది. నా పిల్లలు వారి చదువుకు దూరమవుతారు. ఊరిలో పని లేకపోవడంతో బయటకు వెళ్ళాలి. నేను పికెటింగ్, వేతనాల మధ్య సమన్వయం చేసుకోవాలి, చాలా అవసరమైనప్పుడు, నేను పనిని వదిలి ఉద్యమంలోకి వచ్చేస్తాను. మన ఇల్లు, భూమిని కాపాడుకోవడంతో పాటు ప్రతిరోజూ మనల్ని మనం పోషించుకోవడానికి పోరాడాలి” అని వివరించాడు. ప్రేమ్‌చంద్ (దళితుడు) కూడా అదే మాట్లాడాడు. అతని భార్య కిస్మతి ఈ ఉద్యమ నాయకురాలు, ఒక ముఖ్యమైన వ్యక్తి.

అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారు, అయితే నిరసన ప్రదేశంలో, పోరాటంలో ఎక్కువ మంది దళిత మహిళలు ఎందుకు ఉన్నారు అనే ప్రశ్న సమాధానం లేకుండా వుండిపోతోంది. ఇందుకు చాలా కారణాలున్నాయి. మొదటి కారణం ఏమిటంటే, ఇంటి నిర్వహణలో (ముఖ్యంగా ఆర్థిక బాధ్యతలు) దళిత పురుషులు, స్త్రీల పాత్ర దాదాపు సమానంగా వుంటుంది.

వారు కేవలం ఇంట్లో పనులకు మాత్రమే పరిమితం అవరు. వారిద్దరూ బయట కష్టపడి పనిచేస్తేనే ఇల్లు నడుస్తుంది. కొన్ని మధ్యతరగతి దళిత కుటుంబాలను మినహాయిస్తే, ఇంటి ఆర్థిక బాధ్యతలను చూసుకోవడం పురుషుడి పని అని ఏ దళిత మహిళ కూడా భావించదు. ఆమె దానికి దాదాపు సమానంగా బాధ్యత వహిస్తుంది. కొంతవరకు, ఈ పరిస్థితి చాలా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలకు కూడా ఉంది, దీనికి విరుద్ధంగా, వెనుకబడిన కులాలు, అగ్రకులాలకు చెందిన మహిళల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

గ్రామాల్లో అగ్రకుల కుటుంబాల మహిళలు ఇంటి పనులకే పరిమితమవుతున్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా నడిపించే బాధ్యత మగవాడిదేనని ఆమె భావిస్తుంది. అగ్రకులాల పురుషులు కూడా ఇలాగే ఆలోచిస్తారు. వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు, వారు ఇంటి వెలుపల పని చేయడానికి కొంత సహకారం అందించినప్పటికీ, ఇంటి పనులకు, పశువుల సంరక్షణకు మాత్రమే పరిమితమవుతారు.

ఈ కారణంగా, కుటుంబపు ఉనికిపై సంక్షోభం ఏర్పడినప్పుడు, వివిధ సామాజిక సమూహాలకు చెందిన  మహిళల పాత్ర భిన్నంగా ఉంటుంది, ఇక్కడ దళిత, అత్యంత వెనుకబడిన కులాల స్త్రీలు, పురుషులు ఇంట్లో సంక్షోభాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. దాదాపు సమానంగా బాధ్యత వహిస్తారు. అప్పుడు అగ్రకుల, వెనుకబడిన కులాల స్త్రీలు సమస్యను ఎదుర్కోవడం, దానిని పరిష్కరించడం పురుషుల ప్రధాన బాధ్యతగా భావిస్తారు. ఈ ఉద్యమ సందర్భంలోనూ ఈ పరిస్థితి కనిపించింది. దళిత పురుషులు, మహిళలు తమ ఇంటిని, భూమిని కాపాడుకోవడంలో తమను తాము సమానంగా భావిస్తుండగా, అగ్రకుల మహిళలు, వెనుకబడిన కులాల మహిళలు ప్రధానంగా పురుషుల బాధ్యతగా భావిస్తారు.

కుటుంబ నిర్వహణలో వేర్వేరు పాత్ర, దాని నుండి పుట్టుకొచ్చిన ఆలోచన కారణంగా, దళిత, అత్యంత వెనుకబడిన కులాల మహిళలు తమ కుటుంబాల సామాజిక-రాజకీయ నిర్ణయాలలో దాదాపు సమానంగా పాల్గొంటున్నారు, అగ్రకులాలు, మహిళలు మరియు వెనుకబడిన కులాలలో ముందున్న కులాల మహిళలు  అలా చేయరు. ఇంట్లోని పురుషులకు పూర్తి అనుచరురాలుగా వుంటారు.

ఈ సందర్భాలన్నింటిలోనూ, నిరసనలు, ఆందోళనలు, పోరాటాలలో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ణయించడంలో వివిధ సామాజిక సమూహాలకు చెందిన పురుషులు తమ ఇళ్లలోని మహిళల పట్ల వుండే దృష్టికోణం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. తమ ఇంటి ఆడవాళ్ళు బయటకు రావడం, ప్రజా జీవితంలో పాల్గొనడం, ఇతర పురుషులతో కలిసి పనిచేయడం, ఇతర పురుషులతో కలిసి కూర్చోవడం, వారితో భుజం భుజం కలిపి పోరాటాల్లో పాల్గొనడం అనేది తమ మగతనానికి సవాలుగా గ్రామాల్లో శ్రమించే దళిత పురుషులు చాలా మంది భావించరు. వారి కుండే ఇలాంటి ఆలోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొనేందుకు దళిత స్త్రీలకు స్వేచ్ఛ కలగడం అనేది సహజం.

ఈ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహిస్తున్న సునీత (దళితురాలు, 22 సంవత్సరాలు) అన్నయ్యలు అఖిలేష్, కమలేష్‌లను “ఈ ఉద్యమంలో సునీత (మీ సోదరి) అంత సక్రియంగా వుంది కదా మీకు ఏమనిపిస్తుంది అని అడిగినప్పుడు, వారు సమాధానం “మేము ఆమెని ప్రోత్సహిస్తాం. మా సోదరి చాలా చురుకైనది, ఆమె వీడియోలో మాట్లాడటం, ఉద్యమానికి నాయకత్వం వహించడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది.” అనడంలో ఈ పరిస్థితి ప్రతిబింబిస్తుంది.

ఈ గ్రామాలలోని వెనుకబడిన కులాల ముఖ్యంగా అగ్రకులాల పురుషుల ఆలోచన యిందుకు భిన్నంగా వుంటుంది. పరపురుషులు తమ ఆడవాళ్ళని కలవడం, కబుర్లు చెప్పడం, కలిసి కూర్చోవడం వీరికి ఇష్టం ఉండదు. ఇది తమ సామాజిక స్థితికి, మగతనానికి వ్యతిరేకంగా భావిస్తారు. “వారిలాగా (దళిత-వెనుకబడిన) మేం మా స్త్రీలను పంపలేం కదా?”అనే వినయ్ ఉపాధ్యాయ్ మాటల్లో  ఇది వ్యక్తమవుతుంది.

ముగింపు:

విమానాశ్రయం విస్తరణ అంశాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో, రాష్ట్రీయ జనతా దళ్‌కు చెందిన మనోజ్ ఝా రాజ్యసభలో గ్రామస్తుల ఆందోళన సమస్యను లేవనెత్తారు: “వేల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు, కానీ వారితో ఎటువంటి సంపర్కమూ  చేయలేదు.” ఆగ్రహించిన రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని మంత్రిత్వ శాఖను ఝా కోరారు. దీనిపై విచారణ జరుపుతామని సింధియా తెలిపారు. కానీ ఎలాంటి చర్యా తీసుకోలేదు.

అజంగఢ్‌కు చెందిన ప్రజలు తరచూ దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు పని కోసం వెళ్తుంటారు. అజంగఢ్ నుండి వలస వెళ్ళే చాలా మంది ప్రజలు విమానాశ్రయాన్ని ఉపయోగించలేదు, ఎందుకంటే జనాభాలో ఎక్కువ భాగం పేదలు. వాళ్ళు సాధారణంగా రైలు ప్రయాణమే చేస్తారు. అందువల్ల, ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించడానికి మరిన్ని రైళ్లు మరియు కోచ్‌లు అవసరం.

వారణాసి, ఖుషీనగర్, గోరఖ్‌పూర్, అయోధ్య మరియు ఇప్పుడు లక్నోలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నప్పుడు ఈ విమానాశ్రయం అవసరమా అని బాధిత గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, కొత్తగా నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ ప్రెస్‌ వే కారణంగా లక్నో విమానాశ్రయానికి దూరం అజంగఢ్ నుండి 2.5 గంటలకు తగ్గింది. జిల్లా నుండి వారణాసి విమానాశ్రయం కూడా రెండు గంటల ప్రయాణంలో ఉంటుంది. విస్తరణ ప్రాజెక్టు కోసం అత్యంత సారవంతమైన భూమిని సేకరించే ప్రభుత్వ ఎంపికను కూడా నిరసనకారులు నిందించారు.

అజంగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఎయిర్‌స్ట్రిప్ విస్తరణ యోచనను రద్దు చేసే వరకు రాతపూర్వకంగా ఇచ్చే వరకు రైతు కూలీలు తల్లులు, అక్కాచెల్లెళ్లు పోరాటం చేస్తూనే ఉంటారు.

ఏడు నెలలుగా సమ్మె జరుగుతున్నా ఒక్కరోజు కూడా ఖిరియా బాగ్‌కు రైతులు, కూలీలను కలిసేందుకు రాలేదు. ఎయిర్‌పోర్టు ప్రభుత్వమే నిర్మిస్తుందని,  అది ఆగదని చెబుతున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు  ఈ దేశం ఏ పార్టీకి చెందదని, ఈ దేశం ప్రజలదని, ఎయిర్‌పోర్టు కావాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయిస్తారని వారు తెలుసుకోవాలి. రైతులు, కూలీలు ఈ దేశాన్ని నిర్మాతలనీ, దేశ భవిష్యత్తును వారే నిర్ణయిస్తారని బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.

(హిందీ వెబ్ సైట్ జన్‌చౌక్ బృందం చేసిన సర్వే, వివిధ అంతర్జాల సమాచారం ఆధారంగా రాసినవ్యాసం)

One thought on ““మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమినివ్వం”

  1. ✊✊
    మా సత్యం
    ఉదయిని గారు
    హిందీ వెబ్ సైట్ జన్‌చౌక్ బృందం చేసిన సర్వే, వివిధ అంతర్జాల సమాచారం ఆధారంగా రాసినవ్యాసం చాలా చాలా ఆలోచింపచేస్తోంది.
    వ్యాసకర్తకి ఉద్యమాభి వందనాలు తెలియజేస్తూ.. ఉత్తరప్రదేశ్ అజంఘడ్‌ లో విమానాశ్రయ విస్తరణ మానవ హక్కుల ఉల్లంఘన లో భాగమే. అక్కడి గ్రామ ప్రజల జీవన మరణ సమస్య.
    ఈనాడు భారత సర్వోన్నత న్యాయస్థానం పాలకుల ఫాసిస్ట్ విధానాలకు లోబడి
    ఫాసిస్ట్ కోర్టుగా పని చేస్తుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లో “ఉడాన్ పథకం కింద ఆజంఘఢ్ ఎయిర్ స్ట్రిప్ విస్తరణ”కు వ్యతిరేకంగా 2022 సెప్టెంబర్ నెల నుంచి దాదాపు 7 నెలలుగా పోరాటం కొనసాగుతున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిరంకుశ చర్యకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ హైకోర్టు గాని భారత సర్వోన్నత న్యాయస్థానం గాని, జాతీయ మానవ హక్కుల సంఘం కానీ సుమోటోగా కేసును ఇంతవరకు స్వీకరించకపోవడం హాస్యాస్పదంగా ఉంది.
    భారత ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,
    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దుష్ట చతుష్టయం
    Benito Mussolini ఫిలాసఫీని అభివృద్ధి పేరుతో నయా పెట్టుబడిదారులైన ఆదాని అంబానీ సంరక్షణకై అత్యంత పగడ్బందీగా అమలు చేస్తున్నారు.
    “We do not argue with those who disagree with us, we destroy them.”
    “మనతో విభేదించే వారితో మేము వాదించము, వారిని నాశనం చేస్తాము”.
    “Fascism should more appropriately be called Corporatism because it is a merger of state and corporate power”.
    “Peace is absurd: Fascism does not believe in it.” Benito Mussolini ఫిలాసఫీని విభిన్న రూపాలలో వారి ప్రణాళికలో అమలు చేస్తూ వస్తున్నారు. భారత పాలకులు నయా పెట్టుబడిదారులకు అండగా నిలబడడం వారికి అన్ని రకాల సేవలు అందించడం ఫాసిజం లో ఒక భాగం.భారత పాలకుల ప్రతి అణచివేత చర్యల వెనుక Benito Mussolini ఫిలాసఫీ అంతర్లీనంగా దాగి ఉంది.
    ఉత్తరప్రదేశ్ ఆజంఘఢ్ గ్రామ ప్రజల “మకాన్ బచావ్- ఖేత్ బచావ్” ఉద్యమాన్ని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న పోరాటం. “ఉత్తరప్రదేశ్ అజంఘడ్‌లో విమానాశ్రయ విస్తరణ వ్యతిరేక పోరాటం”కు నాయకత్వం వహించిన వారితో మాట్లాడి, వారి పోరాటానికి సంఘీభావంగా భారతదేశంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ సంఘటన పట్ల అంతర్జాతీయంగా తెలియజేస్తూ, వెన్వెంటనే బహిర్గతం చేసి ఖండించడం, రాజకీయంగా బహిర్గతం చేసి ఖండించే కార్యక్రమాన్ని మరింత విస్తృతం, తీవ్రం చేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం మన ప్రజా సంఘాల అందరిపై ఉందని నా యొక్క భావన.

Leave a Reply