“నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపుము., నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబధ్ధ సాక్ష్యము చెప్పకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.’’
(బైబిల్ లోని పాత నిబంధన గ్రంథం నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం నుండి 17 వరకు)
ఈ మాటలు ఇజ్రాయల్ ప్రజలొక్కటే కాదు, బైబిల్ను బలంగా నమ్మే నేతలకు తెలీదా? పైన పేర్కొన్న బైబిల్ వాక్యాలకు భిన్నంగా పాలస్తీనా`ఇజ్రాయిల్ మధ్యన అధర్మయుద్ధం నడుస్తుంది. అందులో ఏ ఒక్కమాటను కూడా ఉన్మాదం తలకెక్కిన దేశాలు, దేశాధినేతలు పాటించవు. నిత్యం బైబిల్ను పఠించే నరహంతక పాలకుడు బెంజిమెన్ నెతన్యాహు నిరంతరం నెత్తుటి దాహం తీర్చుకుంటూనే ఉన్నాడు. ఏ మత గ్రంథం కూడా హింసను ప్రేరేపించదు. శాంతి సమానత్వాన్నే ప్రబోధిస్తాయి. మతాలు శాంతి సమానత్వాలను బోధిస్తే , మతాలను ఆచరిస్తున్నామనే ఆయా మతాలకు చెందిన మతోన్మాదులు మాత్రం విధ్వంసాలకు తెరతీసి ప్రపంచవినాశనానికి కారణమౌతున్నారు. ఏ మతం చెప్పని హింసను ఆచరించి మానవ సమాజ అంతానికి కారణమవ్వడమేమిటి?
ఇంత ఉపోద్ఘాతం చెప్పడానికి కారణం మున్ముందు వాళ్ళ దుర్మార్గాలను కళ్ళకు కట్టినట్లు చూపే కవిత్వం గూర్చి చెప్పేందుకే. ఈ మధ్య అఫ్సర్ Fasting Hymns పేరుతో ఆంగ్లంలో కవితలు రాయగా అఫ్సర్ ఉపవాస పద్యాలు పేరుతో పి.శ్రీనివాసగౌడ్ అనువదించారు. ముస్లీం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటారు. ఉపవాసప్రార్థనలతో స్మరిస్తారు. ప్రవక్త మహమ్మద్ బోధనలకు అనుగుణంగా వారి పవిత్రగ్రంథమైన ఖురాన్ పఠిస్తూ చేస్తారు. కానీ కవి అఫ్సర్ ఉపవాస పద్యాలను వర్తమాన ప్రపంచంలో జరుగుతున్న మారణహోమానికి, రక్తపాతానికి, విధ్వంసానికి అనుసంధానిస్తూ రాయసాగారు. పొద్దుటి ఆహారంలో రొట్టెను తాకగానే`ప్రతి తునకలో గాజా కనిపిస్తుంది. ఈరోజుకీ పాలస్తీనాలోని గాజానగరంలో నరమేధం ఎలా జరుగుతుందో చెప్పక్కర్లేదు. ప్రతీరోజూ పాలస్తీనా దేశంలో వందలాది మంది ఆఖరిశ్వాసను వదులుతున్నారు. అధిపత్యం ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలిసిందే..! కవి ఉపవాసాన్ని ఆచరించే ప్రతి ముస్లిం సూర్యోదయానికి ముందు తినే రొట్టె ముక్కను తాకగానే అని చెప్పడం వల్ల కళ్ళలో కన్నీళ్ళు నిండిపోతాయి. ఎవరి కోసం ఈ సామ్రాజ్యావాదం..? ఎవరి కోసం నెత్తుటి సంగ్రామం అనిపిస్తుంది.? గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఈ సంగ్రామం ఇప్పటికీ చల్లారలేదు. ఇప్పటి ఎన్నోశిరస్సులు రాలిపడుతున్నాయి..ఎన్నో దేహాలు చిద్రమౌతున్నాయి. పసిమొగ్గలన్నీ భవిష్యత్తును చూడలేక జీవితాన్ని ముగిస్తున్నాయి. అంతం లేని మరణమృదంగాన్ని ఇంకెన్నాళ్ళు మోగిస్తారు.
అఫ్సర్ కవిత్వం చదువుతున్నంతసేపూ ఏకబిగిన చదవాలనిపిస్తుంది. కవితా వస్తువు రూపాన్ని ఆశ్రయించి వుంటుంది.కవిత్వం ఇలా ఉంది..అలా వుంది..అని కవిత్వనిర్మాణ పద్దతులు ఇలా రాశాడు అలా రాశాడు అని చెబటానికి ప్రయత్నించడం లేదు. కవిత్వం చదువుతుంటే ఘటనలు దృశ్యంగా కనబడుతుంటాయి. భావచిత్రాలు వెన్వెంటనే రెప్పచాటుకు చేరిపోతాయి. ఈ కవిత్వం ఒక సూఫీలా రాశాడు. చెప్పదలచుకున్న కవితావాక్యాలకు వర్తమాన ప్రపంచపు విధ్వంసపు ముఖచిత్రాన్ని వైవిధ్యశిల్పరంగులద్ది రాశాడు. అతను రాసిందంతా ఆంగ్లంలోనే కదా..ఈ ప్రతిభమొత్తం పి.శ్రీనివాసగౌడ్ దని అనుకోవచ్చు. నిజమే కాని, ప్రాథమికంగా ఇద్దరూ తెలుగు కవిత్వంలో లబ్ధప్రతిష్టులైన కవులే. ఇందులో అఫ్సర్ దశాబ్ధాలుగా కవిత్వం రాస్తున్న సీనియర్ కవి కథకులు. ఇద్దరూ ప్రగతిశీల భావాలతో రాస్తున్న కవులు. అందుకే ఈ కవిత్వ సమీక్షలో ఎంచుకున్న వస్తువును కేంద్రీకరించి ఈ సమీక్ష రాశాను..ఎత్తుగడలు, భావచిత్రాలు, పదచిత్రాలు, శిల్పవైవిధ్యం లాంటి కవిత్వ నిర్మాణసూత్రాల గురించి కాకుండా జరుగుతున్న పరిణామాలనుదృష్టిలో ఉంచుకొని సాగించాను.
అఫ్సర్ తన కవిత్వవస్తువును ‘ఉపవాసం’గా ఎంచుకున్నప్పటికీ ప్రతీ ఉన్మాదచేష్టలను చెబుతూ వెళతారు. మనదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 28.09.2015న దాద్రీకి సమీపంలో ఉన్న బిసహదా గ్రామంలో గొడ్డుమాంసం, గోహత్య చేశారనే అనుమానంతో 52 ఏళ్ళ మహమ్మద్ అఖ్లాక్ను ఒక మతోన్మాదగుంపు కొట్టి చంపింది. ఇప్పటికీ ఏ ఆధారాలు లభించనప్పటికీ కేసు మూసివేయాలనుకుంటే దర్యాపు చివరి క్షణం వరకు కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు చలించిన కవి..కొన్ని ఉపవాసాలు ఎంత కఠినమో?/ఈరోజు ఉదయాన్నే కూర్చొని, అన్నం ముద్దని చూసినపుడు`/అది వెంటనే అఖ్లాక్ ముఖాన్ని గుర్తుచేస్తుంది.
అసలు ఆహారం మీద ఆంక్షలేంటి? ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉందా? ఆ మాటకొస్తే..వాళ్ళు దైవంగా బావించే మనుధర్మశాస్త్రం అనబడే మనుస్మృతిలోనే మాంసం తినాలనే నిబంధన ఉంది..అదీ పరిశీలిద్దాం.
సృష్టి ప్రారంభ కాలమున ప్రాచీన మహర్షులు చేసిన యాగములలోనూ, బ్రాహ్మణ, క్షత్రియులు చేసిన యాగములందునూ మృగపక్షి మాంసములే హవిస్సులుగా నున్నవి. కాన యజ్ఞము నిమిత్తము మంత్ర పూర్వకముగా జంతు హింస చేయవచ్చును.
భక్ష్యా భక్ష్య మాంసం విచారము: సమంత్రకముగా యజ్ఞమునుందు వేల్వబడిన పశుమాంస శేషము, శ్రాద్ద క్రియయందు నిమంత్రితుడైనప్పుడు, వేరు ఆహరము లభించక ప్రాణము కడబట్టినప్పుడు ద్విజుడు మాంసభక్షణ చేయవచ్చును. బ్రహ్మయే ప్రతి దినము భక్షింపదగిన ప్రాణులను, భక్షించువారిని ఏర్పరిచినాడు గాన మాంసభక్షణ చేయవచ్చును. దైవ పితృకార్యములందుగాక, యితర విధముల మాంసము భుజించువాడు అవసానకాలమున తాను తిన్న జంతువుచేతనే తానూ తినబడును. ఇట్టివానికి కలుగు పాపము వృత్తినిమిత్తము జంతువులను వధించి విక్రయించువానికి కలగదు. ఇట్లే శ్రాద్దములందు నివేదించబడిన మాంసమును తిననిద్విజుడు ఇరవై ఒక్క జన్మలు పశువుగా జన్మించగలడు. మధుపర్కము, జ్యోతిష్టోమాది యజ్ఞము, శాద్ద్రకర్మ, దైవిక క్రియలందు మాత్రమే బ్రాహ్మణుడు జంతుహింస చేయవచ్చును. అంటే వేదార్ధక్రతువుసమయాల్లో తినవచ్చును.
(మనుస్మృతి వ్యాఖ్యానం తాడంకి వెంకటలక్ష్మీనరసింహారావు పుట సంఖ్య:44)
వాళ్ళు యజ్ఞయాగాదులు చేసేసందర్భంలో తినవచ్చు..మనిషి ఆకలిపోరాటంలో..మనుగడ కోసం తింటే మాత్రం నేరం..ఎంత దుర్మార్గమైన మతోన్మాద పాలనలో మనమున్నామో ఆలోచించండి..ఎందుకింత ఇస్లాం మతమన్నా..ఆ మతాన్ని ఆచరించే ముస్లింలన్నా..అక్కడేమో యూదులుగా పిలవబడే ఇశ్రాయిల్ దేశానికి పాలస్తీనా అంటే పగ. ఇక్కడ వీళ్ళకి సిఏఏ ఎన్ఆర్సి తెచ్చి ముస్లింలను ఈ దేశం నుంచి వెలివేసేందుకు వెనకాడరు. ఏమిటీ దుర్మార్గం. అసలు ఇస్లాం మతం గూర్చి తిరుచునాపల్లి సభలో 18.03.1947న పెరియార్ గారు ఇలా అంటారు..‘‘ఇస్లాం అనేది శాంతి, సుగుణం, అంకితభావం అనే అర్థం వచ్చే అరబిక్ పదం. ఇస్లాం అంటే సహోదర భావం. శాంతి, సమైక్యత, పరస్పర గౌరవం, భక్తి భావం, సహోదరతత్వం ఇస్లాం మత లక్షణాలు.’’ ఎవరి మత విశ్వాసాలు వారివి..ఇతర మతాలను గౌరవించడమే లౌకికత్వం కదా..మనం ముందు మనుషులం..కాలక్రమేణా వచ్చినవే కదా ఇవన్నీ..గాజా ఇప్పటికీ కన్నీటి సంధ్రంలోనే ఉంది. అందుకే కవి అంటాడు..అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది/ ‘‘ఉపవాసానికి నీరు అందిస్తే/పది నేకీలు పొందుతావు అని. అసలు రంజాన్ మాసమంతా/వొకదేశానికి దేశమే/ కూడూ నీళ్ళకు/ వెలి అయ్యిందని తెలిస్తే/ అమ్మ ఏమంటుందో..ఆ దేశమంతా రంజాన్నెల వొక్కటే కాదు..ప్రతీ రోజూ ఉపవాసమే అనుభవిస్తుంది. ఉపవాసమూ..వనవాసమూ రెండు..బతకడమే వాళ్ళకిప్పుడు పెద్దయుద్దమిప్పుడు…ఈ ఉపవాస పద్యాల్లో రంజాన్ 21 రోజున హత్యకు గురైన ప్రవక్త అలీ గూర్చి రాస్తాడు..
‘‘నమాజులో మోకరిల్లిన ప్రతీసారీ/ ప్రవక్త అలీ బలిదానం/గుర్తు చేసుకుంటాను/ ఇప్పటికీ,/ ఆయన చిందించిన రక్తాన్ని దర్శించగలను./ ఆయన గడ్డం నుంచి కారిన ప్రతిబొట్టులోనూ/ నా సకల సమూహాన్ని చిత్రించుకుంటాను.’’ అంటాడు. ఖరీజిత్ అసమ్మతివాది అయిన ఇబ్న్ ముల్జిమ్ ప్రవక్త అలీని 661 సంవత్సరంలో ఉదయం ప్రార్థన సమయంలో ప్రస్తుత ఇరాక్ దేశం కుఫాలోని గ్రేట్ మసీదులో చంపుతాడు. అతని తలపై విషయం పూసిన కత్తితో కొట్టిన రెండు రోజుల తర్వాత అతను గాయాలతోనే మరణిస్తాడు.
రంజాన్ మాసంలో ఇప్తార్ విందుకు ఒక ప్రత్యేకత వుంటుంది. రాజకీయ నాయకులిచ్చే వందుల గూర్చి ఇక్కడ ఆలోచించకండి. ఇప్తార్ అనేది ఏ రోజుకారోజు ఉపవాసం విరమించుకుని అందరూ కలసి భోజనం చేయడం. పవిత్ర ఖురాన్ ప్రకారం. మగ్రిబ్ ప్రార్థనకు పిలుపు వచ్చిన తర్వాత భోజనం తీసుకోబడుతుంది. వివిధ దేశాల్లో వివిధ ఆహార పదార్థాలతో ఇఫ్తార్ విందు చేస్తారు. అఫ్సర్ ఇఫ్తార్ గూర్చి చెబుతూ..
ఇఫ్తార్: ప్రార్థనల కోసం బయటకు వెళ్ళ బోతుంటానా/ అప్పుడు వర్షం మొదలౌతుంది/ నువ్వంటావు‘హోరున గాలి వానా కురుస్తోంది/కానీ. నాకళ్ళ ముందు/ బాంబులూ..రసాయనాల కుండపోత..
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ బాంబుల కుండపోత కురుస్తోందో ప్రతి ఒక్కరికీ తెలుసు..ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఐరాస ఉత్సవ విగ్రహంలా ..సామ్రాజ్యదేశాలకు కొమ్ముకాసే ప్రపంచసంస్థగా ఇవాళ మిగిలిపోయింది.శాంతి చర్చలన్నీ ప్రపంచ ప్రజల దృష్టిలో నాటకమే..ఈ ఏడాది రక్తసిక్తమైన రంజాన్ను చూశాం..ఈ రంజాన్ ఎలా సాగుతుందో కవి అఫ్సర్..
అప్పట్లో`/ప్రేమ దయ నిండిన కథలే/వినపడే రంజాన్ మాసంలో/మేల్కొనేవాణ్ణి. ఇప్పుడు`నేను ఎదుర్కొంటున్నదంతా/ ద్వేషం, రక్తపాతంలో కూరుకున్న లోకాన్ని. ఈ ప్రయాణానికి ఏపేరు పెట్టాలో?
పాలస్తీనా దేశమంతా చిద్రమైంది. ఆ దేశపు ఆయువు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నల్దిక్కులు జీవనదిలా నెత్తుటి ప్రవాహం. ఏ అవయవం ఎవ్వరిదో ఏ దేహం ఎక్కడ ఖననమౌతుందో..ఎవ్వరికి ఎవ్వరూ లేరిప్పుడు. నేలనేలంతా ఏడ్వడానికి కూడా కన్నీళ్ళు లేవు.
ఈ ఉపవాస పద్యాల్లో అఫ్సర్ ఆఖరిపాఠాలు అంటూ ముగిస్తాడు.
కాసింత ఆహారాన్ని, ప్రేమని/మనం పంచుకోవడం మానేస్తే/ ఇకయుగాంతం వచ్చేసినట్టే/ ఇంకా ఇంకా తీసుకోవడానికే గాని/ బదులుగా ఏమీ ఇవ్వకుండానే`/మనం ప్రపంచాన్ని ఎంతగా / తలక్రిందులు చేస్తామో మీకు తెలుసు.
యుగాంతం అశాస్త్రీయ సంకేతం. అఫ్సర్ ఎందుంకలా చెప్పాడో అర్థం కాలేదు. ఇలా చెప్పడంలో నాకనిపించినదేమిటంటే పై పంక్తుల్లో మానవత్వ హననమయ్యాక యుగాంతం వచ్చేసినట్టే అనే భావన వుండి వుండవచ్చు..హిందువులు యుగాంతం అని, క్రైస్తవులు రెండవ రాకడ అనీ ఎవరికి వారు ఈ ప్రపంచాన్ని ఎప్పుడు అంతం చేయాలని వారి వారి ఊకదంపుడు మత ప్రచారాల్లో చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం విషవృక్షం సామ్రాజ్యవాదం, హింసోన్మాదం, మతోన్మాదం లాంటి శాఖలుగా విస్తరించింది. ఆఖరున ఆరడుగుల నేల మాత్రమే అనివార్యమన్న భావనను కాలగర్భంలో కలిపేస్తున్నారు. యుగాంతం రాకపోయినా వచ్చినట్టే..రెండవరాకడ రాకపోయినా వచ్చినట్టే..అందుకే ఒక్కమాట చెప్పి ముగిస్తున్నాను. పాలస్తీనాలో స్వేచ్ఛ స్వాతంత్య్రాలు పునరుద్ధరింపబడాలని, ఇజ్రాయిల్ దానికి అండగా నిలుస్తున్న సామ్రాజ్యవాద దేశాలు చేస్తున్న అధర్మ యుద్ధం ముగించాలని ప్రతివొక్కరం కోరుకుందాం..