(కా. క‌న‌కాచారి స్మృతిలో  4వ తేదీ ఆదివారం విజ‌య‌వాడ‌లో దేశ‌భ‌క్త ప్ర‌జాతంత్ర ఉద్య‌మం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌ద‌స్సు ప్ర‌సంగ పాఠంలోని కొన్ని భాగాలు)

చరిత్ర, న్యాయశాస్త్ర పరిశోధనలలో కార్పోరేషన్స్ మీద ఒక మాట వాడుకలో ఉంది. అదేమిటంటే “కార్పోరేషన్ కు ఆత్మ అంటూ ఉండదు” (a corporation has no soul) అని. ఆత్మ లేక పోవడాన్ని మత పరమైన లేదా ఆధ్యాత్మిక అర్థంలో వాడటం లేదు. కార్పోరేషన్స్ కు మార్కెట్ విలువ తప్ప మరే విలువల పట్టింపు ఉండదని, తమ ఆర్థిక అధికారాన్ని పెంపొందించుకోవడానికి ఎంతటి నేరానికైనా ఒడికట్టుతాయని, మనిషిపై, ప్రకృతిపై తన ప్రయోజనాల కోసం ఎంతటి విధ్వంసానికైనా దిగుతాయనే అర్థంలో వాటికి “ఆత్మ” ఉండదనే మాట వాడుతుంటారు. ఆ మాట అలంకారికంగా వాడినప్పటికీ అది ప్రపంచ వ్యాప్తంగా కార్పోరేషన్లు  చేసిన, చేస్తున్న నేరాలా, విధ్వంసాల మూలంగా రుజువయిపోయింది.

ఒకప్పుడు సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం గురించి విన్నాం. కాని ఇప్పుడు  ప్రపంచంలో ఎక్కడా కార్పోరేషన్స్ తాకని నేలంటూ లేదనేది నిజం. అవి కేవలం మార్కెట్ రూపంలోనే కాదు, రాజకీయ, సాంస్కృతిక రూపాలలో ప్రపంచవ్యాప్తంగా తమ పెత్తనాన్ని కొనసాగిస్తున్నాయి. కాబట్టి కార్పోరేషన్ల పూర్తి స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే వాటికుండే రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ముఖాలను తడిమి చూడాలి. అన్నింటిని కలిపి చూడాలి. వాటి మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. 

1990లో 50 టాప్ కార్పోరేషన్లు మార్కెట్ విలువ ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 4.7 శాతం వుండేది, కాని అది 2020 నాటికి 27.6 శాతానికి పెరిగింది. ఈ మొత్తం కార్పోరేట్ సంపదలో 69 శాతం అమెరికాలోనే పోగయివుంది. ప్రపంచమంతా పట్టు కలిగి ఉన్న 100 టాప్ కార్పోరేషన్లలో 59 అమెరికా ప్రధాన బేస్ గా కొనసాగుతున్నాయి. ఒక్క ఆపిల్ వంటి కార్పోరేషన్ మార్కెట్ విలువ (2.7 ట్రిలియన్ డాలర్లు) భారతదేశం స్థూల దేశీయోత్పత్తి (2.6 ట్రిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ. ప్రపంచంలో అతి పెద్ద 100 ఆర్థిక వ్యవస్థల్లో 49 దేశాలు ఉంటే 51 కార్పోరేషన్స్ వున్నాయి. ఒక్క వాల్ మార్ట్ అనే కార్పోరేషన్ ప్రపంచంలోని 161 దేశాలకన్నా పెద్ద అర్థిక సంస్థ. 

మనం ఏం తినాలో, ఏ బట్ట కట్టాలో, ఏ వినోదాన్ని కోరుకోవాలో, ఏ వార్తలు వినాలో, ఎలాంటి ఆలోచనలు చెయ్యాలో, ఎక్కడ పనిచేయాలో, ఎట్లా చెయ్యాలో… ఒక్క మాటలో ఎట్లా బతకాలో, ఎలాంటి సమూహంలో ఉండాలో నిర్ణయించే స్థాయికి కార్పోరేట్స్ వచ్చేశాయి. కేవలం వ్యక్తిగత ఇష్టాయిష్టాలను మాత్రమే కాదు దేశ రాజకీయాలను, అనేక పాలకవర్గ సంస్థలను కూడా ప్రభావితం చేసే, నిర్ణయించే స్థితికి కార్పోరేషన్స్ మారాయి.  ప్రపంచంలోని అనేక దేశాలను, సమాజాలను శాసించగల స్థాయిలో కార్పోరేషన్లు వున్నాయి. పిడికెడు కార్పోరేషన్లు మొత్తంగా ప్రపంచ సమాజాన్ని శాసించగలుగుతున్నాయి. 

కార్పోరేట్ పెత్తానాన్ని, విధ్వంసాన్ని అర్థం చేసుకోవాలంటే కార్పోరేషన్లకు, రాజ్యానికి ఉండే సంబంధాన్ని పరిశీలించాలి. కార్పోరేషన్లు తమకు తాముగా స్వతంత్రులమని, స్వీయ నియంత్రణలో పనిచేసే వ్యవస్థలని, ప్రభుత్వాల జోక్యం లేకపోతేనే అవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రగల్భాలు పలుకుతుంటాయి. ఇలాంటి వాదనలకు నయా ఉదారవాద మేధో మంద వత్తాసు పలుకుతుంది. కాని చరిత్రలో ఏ కార్పోరేషన్ కూడా రాజ్యం ప్రోద్భలం లేకుండా మనుగడలోకి రాలేదు. విస్తరించలేదు. రాజ్యానికి, కార్పోరేషన్లకు ఒక సహజీవన సంబంధం (symbiotic relationship) ఉంటుంది. ఒకదాని మీద మరొకటి ఆధారపడి మనుగడ సాగిస్తాయి. 

నిజానికి కార్పోరేషన్లు తమ మీద ఎలాంటి రాజ్య నియంత్రణ ఉండకూడదని కోరుకోవడమంటేనే తమ పని విధానాలను, మార్కెట్ విస్తరణలను, ట్రేడ్ యూనియన్ వ్యతిరేక ధోరణులను, ప్రకృతి దోపిడీని చూస్తూ ఊరుకోవాలే తప్ప అడ్డు చెప్పకూడదు అని చెప్పడం.   

అయితే కార్పోరేషన్స్ అన్నింటిని ఒకే గాటికి కట్టలేము. ఒక (సామ్రాజ్యవాద) దేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని పదిలంగా ఉంచుకుని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో అనుబంధ కార్యాలయాలను నడిపే బహుళజాతి సంస్థలు ఒకవైపు వున్నాయి. మరొకవైపు మొన్నటి వరకు స్థానికంగా, జాతీయంగా ప్రభుత్వరంగ సంస్థగా వున్నవాటిని మార్పు చేసి పబ్లిక్ రంగ కార్పోరేషన్లుగా మార్చివేయడం. ఈ సంస్థలకు కొంత స్వతంత్రత వున్నప్పటికి అవి ప్రభుత్వ అదుపాజ్ఞలలోనే పనిచేయాల్సి వుంటుంది. ఈ కార్పోరీటీకరణ కూడా రాజ్యం ప్రజా సంక్షేమంలో తన ప్రత్యక్ష బాధ్యతను తప్పించుకునే పనిలో భాగమే. అంతకు మించి ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించడానికి ఇది మొదటి మెట్టుగా రాజ్యానికి ఉపయోగపడుతుంది. పబ్లిక్ రంగ కార్పోరేషన్లకు ఇవ్వాల్సిన సహకారం అందివ్వక, వాటిని నష్టాల బారిన పడేసి, ఇక ప్రైవేటీకరణే శరణ్యం అని చెప్పే ఒక కుట్ర కూడా దాగుంది. అంతిమంగా అన్నిపబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పోరేషన్లకు అప్పగించే పని ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది.

పబ్లిక్ రంగ కార్పోరేషన్లు చరిత్ర పొడువునా ఉనికిలో ఉన్నట్లుగా అనేక చారిత్రక ఆధారాలు వున్నాయి. కొందరు చరిత్రకారులు వాటి మూలాలను ప్రాచీన ఈజిప్ట్, రోమన్ సామ్రాజ్యంలోను చూస్తున్నారు. అయితే ఒక నిర్మాణంగా మొదటిసారి అమలులోకి వచ్చింది మాత్రం ఇటలీలో ఫాసిస్టు ముస్సోలిని అధికారం హస్తగతం చేసుకున్న తర్వాతనే. తన మొదటి ఆర్థిక పాలసీలో (1922-1925) పొగాకు, అగ్గిపెట్టెల పరిశ్రమను, ఇన్సూరెన్స్ రంగాన్ని, మెటల్ పరిశ్రమను, టెలిఫోన్ నెట్ వర్క్ ను కార్పోరేషన్ల పేరిట ప్రైవేటీకరించాడు.

అన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలను కార్పోరేటీకరించే పనిలో ఫాసిస్ట్ ఇటలీ నమూనాను అనేక నియంతలే కాదు, “ఉదారవాద ప్రజాస్వామ్య” రాజ్యాలు కూడా అనుసరించాయి. అనుసరిస్తున్నాయి. ఇటలీ ఫాసిస్టులు కార్పోరేటీకరణ సందర్భంలో రెండు మార్గాలను ఎంచుకున్నారు. అందులో మొదటిది, సామాజిక కార్పొరేటీకరణ. ఇందులో భాగంగా వర్కర్స్ కు సమ్మె చేసే హక్కును రద్దు చేశారు. లేబర్ కోర్టులను మూసివేశారు. దీనితో పాటుగా ట్రేడ్ యూనియన్లను, వాటి పని విధానాలను నియత్రించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కార్పోరేషన్స్ ద్వారా కొత్త కార్పోరేషన్ల నిర్మాణాన్ని ప్రోత్సహించారు.

ఇక రెండవది, రాజకీయ కార్పోరేటీకరణ. ముస్సోలిని చాలా చాకచక్యంగా ముందుగా సామాజిక కార్పోరేటికరణను అమలు చేసిన తర్వాత రాజకీయ కార్పోరేటీకరణకు తెరలేపాడు. అతని ప్రధాన లక్ష్యం ముందుగా పార్లమెంట్ ను కైవసం చేసుకోవడం. 1922లో పార్లమెంట్ ను తన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటికి ఆ వెంటనే తనకు తానుగా ఇటలీ నియంతనని ప్రకటించుకోలేదు. వాస్తవానికి ముస్సోలిని మొదటి మూడు సంవత్సరాలు అప్పటికే అమలులో వున్న రాజ్యాంగం, రాచరిక పద్దతులకు అనుకూలంగా పనిచేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే సమూలంగా ఇటలీ సమాజాన్ని ఫాసిజం విలువలతో నింపాలనేది అతని ముఖ్య ఉద్దేశం. నూతన ఫాసిస్టు మానవుడిని నిర్మాణం చేయాలనేది అతని అంతిమ లక్ష్యం. అది జరగాలంటే మొత్తం సమాజాన్ని తన గుప్పిట్లోకి తీసుకురావడం ప్రధానం అని భావించాడు. అతను రాజకీయంగా త్వరగా ముందుకు సాగడం లేదని విమర్శలు తన ఫాసిస్టు పార్టీలోనే రావడం మొదలు కావడంతో తన 1925 పార్లమెంటరీ ఉపన్యాసంలో ఇటలీలో అన్ని అధికారాలు నావేనని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక పోలీస్ రాజ్య నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 1926లో ఒక 15 ఏండ్ల అబ్బాయి ముస్సోలిని మీద కాల్పులు జరిపాడానే నెపంతో దేశంలోని ఇతర అన్ని రాజకీయ పార్టీలను రద్దు చేశాడు. ఇక కేవలం ఒక్క నేషనల్ ఫాసిస్ట్ పార్టీ మాత్రమే దేశంలో మిగిలింది. దేశమంటే ఫాసిజం, ఫాసిజమంటే దేశమనే నినాదం అమలులోకి వచ్చింది. అయినా బూటకపు ఎన్నికల తంతు మాత్రం ఆగలేదు. 1928 నాటికి పార్లమెంటరీ సంస్కరణల పేరిట ఎన్నికలను రద్దుచేసి ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ) ను అమలులోకి తెచ్చాడు. 1929 జనరల్ ఎన్నికలుగా చెప్పే తంతులో 400 మంది సభ్యులుండే పార్లమెంట్ (చాంబర్ ఆఫ్ డిప్యూటీస్)కు ఫాసిస్టులే తమకు అనుకూలంగా వుండే 800 మందిని సెలక్ట్ చేసి వాళ్ళలో సగం మందిని ఎన్నుకోమని ప్రజల దగ్గరకు పోయారు. అది ఏ రకంగా కూడా ఎన్నికా కాదు, ప్రజాభిప్రాయ సేకరణా కాదు. ఈ “ఎన్నికల” పద్ధతిలో ముస్సోలిని పెట్టుబడిదారులు లేదా వారి ప్రతినిధులను ప్రత్యక్షంగా అధిక సంఖ్యలో పార్లమెంట్ లోకి తీసుకు రాగలిగాడు.  

ఇటలీ ఫాసిస్ట్ ప్రయోగం మనకు చెబుతున్న పాఠం ఏమంటే పెట్టుబడికి, ఫాసిజానికి ఉండే పేగు బంధం గురించి. అంతే కాదు, కార్పోరేటీకరణ అనేది కేవలం ఒక ఆర్థిక వ్యవహారాలకు మాత్రమే పరిమితమైనది కాదు. అది సామాజిక, రాజకీయ, సాంసృతిక రంగాలను కూడా కార్పోరేటీకరిస్తుంది. దానికి సంబంధించిన విలువలను సాధారీకరణ చేస్తుంది. సాంస్కృతిక, భావజాల రంగంలో కార్పొరేటీకరణను మామూలు విషయం చేయగలిగితే ఆర్థికరంగంలో కార్పోరేటీకరణ సులభమవుతుంది. దాదాపు ఇదే ఫార్ములాను జెర్మనీలో నాజీ హిట్లర్ ఎంచుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే (1934-1937) ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత ఇదే మార్గంలో ఫ్రాన్స్, బెల్జియం కూడా నడిచాయి.

ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్దం తర్వాత పరిమితంగా వున్న ప్రాకృతిక, మానవ వనరులను సరిగ్గా ఉపయోగించుకుని సమర్థవంతమైన అభివృద్దిని, సేవలను పెంపొందించాలంటే కార్పోరీటీకరణ, ప్రైవెటీకరణే మార్గమని ఒక బలమైన సిద్దాంతాన్ని ముందుకు తెచ్చారు. దానికి అనుకూలంగా ఉనికిలోకి వచ్చిన బ్రెటన్ వుడ్ సంస్థలు  (ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ) కార్పోరేటీకరణకు సాధికారతను ఇచ్చాయి, ప్రపంచవ్యాప్తం చేశాయి. 

స్వేచ్ఛా మార్కెట్ రాజకీయార్థిక అంశాలను సిద్ధాంతీకరించడానికి కొత్త సంస్థలు, “థింక్ టాక్స్” పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ చికాగో లోని ఆర్థికశాస్త్ర విభాగంలో మిల్టన్ ఫ్రైడ్ మన్, ఆర్నాల్డ్ హర్బెర్గర్ వంటి ఆర్థికవేత్తలు ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ ఏ విధంగా దేశ ఆర్థిక రంగంపై అప్పుల భారాన్ని తగ్గించి అభివృద్దికి దోహదపడుతాయో చెప్పే కొత్త మోడల్స్ ను నిర్మాణం చేశారు. వాటిని లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా ఖండాల నుండి వచ్చే ఆర్థికశాస్త్ర విద్యార్థులకు నూరిపోసి ఒక స్వేచ్ఛా మార్కెట్ ఆలోచనాపరుల గుంపును తయారుచెయ్యగలిగారు. వీళ్ళనే “చికాగో బోయ్స్” అంటారు. (బహుశా అందరు పురుషులే అయివుంటారు!).

ఈ చికాగో బోయ్స్ సలహాల ప్రకారం ప్రభుత్వరంగ ఆస్తులను, సేవలను ప్రైవేటీకరించి, కార్పోరేటీకరించిన మొదటి దేశం చిలీ. 1950ల నుండే “చిలీ ప్రాజెక్ట్” పేరిట ఆర్థికవేత్తల ట్రైనింగ్ మొదలు పెట్టింది చికాగో ఆర్థికశాస్త్ర విభాగం. దానికి యూ ఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్, ఫోర్డ్ ఫౌండేషన్, రాకొఫెల్లర్ ఫౌండేషన్ ఆర్థిక వనరులను సమకూర్చారు. సెప్టెంబర్ 11. 1973న  ప్రజాస్వామికంగా ఎన్నికైన సాల్వడార్ అయెండే ప్రభుత్వాన్ని కూలదోసి నియంతృత్వాన్ని అమలు పరిచిన అగస్టో పీనోచే (1973 నుండి 1990 వరకు) రెండు విడుతలుగా దేశంలోని దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశాడు. పీనోచే అధికారంలోకి రావడానికి అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) తోడ్పడితే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కొద్ది మంది చేతుల్లోకి పొయ్యేలా చికాగో బోయ్స్ చేశారు. మొత్తం బ్యాంకింగ్, మైనింగ్ వంటి రంగాలు గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి.

ఆచరణలో CIA, చికాగో బోయ్స్ వున్నప్పటికి ఆ మొత్తం వ్యవహారాన్ని డిరెక్ట్ చేసింది అమెరికన్ సామ్రాజ్యవాదం, బ్రెటన్ వుడ్ సంస్థలు. 1970ల తర్వతా ప్రపంచ ఆర్థిక సంస్థల దగ్గర అప్పులు తీసుకోని వాటిని వెనక్కి చెల్లించలేని అన్ని దేశాలకు చిలీని ఒక మోడల్ గా చూపించారు. చికాగో బోయ్స్ సృష్టికర్త మిల్టన్ ఫ్రైడ్ మన్ కు 1976లో ఆర్థిక రంగంలో నోబల్ బహుమతి వచ్చిన తర్వాత తాను బహుళ ప్రచారం చేసిన స్వేచ్ఛా మార్కెట్ పాలసీలకు మరింత బలం చేకూరింది. వాటిని ప్రశ్నించలేనంతగా ప్రపంచబ్యాంక్ వంటి సామ్రాజ్యవాద చేతి సంస్థలు ప్రపంచ సమాజంలోకి తీసుకుపోయాయి.

ఆధునిక కార్పోరేషన్ల గుత్తాధిపత్యం ఫాసిస్టులతో, నియంతలతో మొదులు మొదలయినప్పటికి 1980ల నుండి అన్ని రకాల ఉదారవాద రాజకీయ పాలకవర్గాలకు కూడా అది ఒక మంత్రదండమయ్యింది. ఈ కార్పోరేటీకరణ కేవలం ప్రజల నిత్యజీవితాలను మాత్రమే కాదు, మొత్తంగా రాజ్యానికి, పెట్టుబడికి, పౌరసమాజానికి ఉండే సంబంధాలను  కూడా పూర్తిగా మార్చివేసింది. చిలీ మాదిరిగానే అనేక దేశాలలో సంపదను కేవలం కొంతమంది పెట్టుబడిదారుల చేతులల్లో కేంద్రీకృతం చేసి ఆ పెట్టుబడిదారులే రాజ్యాన్ని నియంత్రించే స్థాయికి పరిస్థితి మారింది. లేదా కేవలం కొద్ది మంది కార్పోరేషన్ల అభివృద్ధి కోసం రాజ్యం తన ఆర్థిక పాలసీలను తయారుచేసే స్థితి ఒకటి వచ్చింది. అంటే రాజ్యం పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారింది. అలా ఒకరికొకరు సహకరించుకోవడం రాజ్యానికి (పాలకవర్గాలకు, దాని సంస్థలకు), పెట్టుబడిదారులకు అత్యవసరమయ్యింది.

అయితే రాజ్యం, పెట్టుబడి ఎప్పుడు ఒకటిగా జత కట్టి కనిపించాల్సిన అవసరం లేదు. ఆ రెండూ అన్ని సందర్భాలలో హింసను కొనిసాగించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే పూర్తిగా హింసను ఆధారంగా చేసుకుని ప్రజలను అణిచివేయలేమని ఆధునిక రాజ్యానికి తెలుసు. అయితే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి లేదా దోపిడీ, అణిచివేతలను ప్రజలు ప్రతిఘటించినప్పుడు రాజ్యం హింసనే ఆశ్రయిస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే రాజ్యహింస బాధితులు మన కళ్ల ముందే వుంటారు, రాజ్యం నగ్నంగా తన క్రూరత్వాన్ని అనేక నిర్బంధ రూపాలలో చూపిస్తుంది. అయితే రాజ్యం మనకు కనబడని హింసను కూడా తన రాజ్య యంత్రాంగం ద్వారా, ముఖ్యంగా కొంత సాపేక్ష స్వేచ్ఛ వున్నాయనుకునే సంస్థల ద్వారా (న్యాయవ్యవస్థ, విద్య, మీడియా …) తన ఆధిపత్యానికి సాధికారిత కల్పించుకుంటుంది. ప్రజలలో సమ్మతి సంపాదించాక లేదా సమ్మతి దొరుకుతుందనే నమ్మకం రాజ్యానికి కలిగిన తర్వాత ఇక అది తనకు అడ్డు వచ్చిన అన్ని మానవ, సామాజిక నిర్మాణాలను బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది. ఇలాంటి సూక్ష్మ ఫాసిస్టు ఎత్తుగడలు, రేపటి స్థూల ఫాసిస్టు వ్యూహానికి వెన్నెముకగా మారుతాయి. ఈ రెండు పక్రియలు విజయవంతం కావడానికి రాజ్యం, కార్పోరేషన్ల సహజీవనం ఎంతో ఉపయోగపడుతుంది. 

పెట్టుబడిదారుల చేతుల్లో రాజ్యం సాధనమయ్యిందంటే ఒప్పుకోని వాళ్లు ఉంటారు. వాళ్లు కేవలం కొందరు పెట్టుబడిదారుల మీద కాకుండా మొత్తం పెట్టుబడి మీద తమ ఫోకస్ పెడుతారు. ఎందుకంటే పెట్టుబడిదారులు ఏ వానకు ఆ గొడుగు పడుతారు. వాళ్ళకు రాజ్యాధికారం కాదు నిరంతరం సంపద పోగేసుకోవడమే ముఖ్యం. చిలీలో పీనొచే పాలనలో అత్యంత సంపన్నులుగా మారిన పెట్టుబడిదారులు అతను రాజకీయంగా పతనం కాగానే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి మద్దతు పలికి తమ పెట్టుబడిని మరింత పోగేసుకున్నారు. అయితే ట్రంప్ లాంటి బిలియనీర్లు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి అధికారం చేపట్టిన చరిత్ర కూడా మనముందు వుంది.

ఏది ఏమయినా ప్రపంచ పెట్టుబడి దృష్ట్యా రాజ్యం అంటే పెట్టుబడులకు అన్ని దారులు తెరిచి, సానుకూల పాలసీ, న్యాయ వాతావరణాన్ని ఏర్పాటు చేసి, పెట్టుబడి ఎదుగుదలకు అడ్డుపడని శాంతి మండలాలను నిర్మాణం చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులకు, దళారీ బూర్జువాలకు మధ్య ఒక సంధానుకర్తగా ఉండటం, అంతర్జాతీయ ఒప్పందాలలో పెట్టుబడి సానుకూల ప్రతినిధిగా పనిచేయడం.

మొత్తం కార్పోరేటీకరణలో ఒక వైరుధ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పాలకవర్గాలు ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూనే మరోవైపు జాతీయంగా తన కనుసన్నల్లో ఉండే కార్పోరేషన్లను పెంచి పోషిస్తారు. అంతేకాదు వాటిని రాజ్యానికి అత్యంత ప్రియమైన సంస్థలుగా మారుస్తారు. వాటి గుత్తాధిపత్యానికి రాజ ముద్ర వేస్తారు. 

ఇటువంటి అనుకూల పరిస్థితుల మూలంగానే కార్పోరేషన్లు, ముఖ్యంగా బహుళజాతి కార్పోరేషన్లు, ప్రపంచంలోని అన్ని ఉత్పత్తి, వినిమయ, సేవా రంగాలను తన గుప్పిట్లో పెట్టుకోగలుతున్నాయి. ఉదాహరణకు, కేవలం ఆరు కార్పోరేషన్లు 72 శాతం గ్లోబల్ విత్తనాల మార్కెట్ ను కంట్రోల్ చేస్తున్నాయి. కేవలం ఆరు కార్పోరేషన్లే ప్రపంచ వ్యాప్తంగా 79 శాతం పురుగుమందుల తయారీ, మార్కెటింగ్ రంగాన్ని తమ చేతుల్లో ఉంచుకున్నాయి. టాప్ పది ఎరువుల మందు కార్పోరేషన్లు 50 శాతం మార్కెటింగ్ చేస్తున్నాయి. కేవలం ఆరు కంపనీలు 52 శాతం వ్యవసాయ యంత్రాల ఉత్పత్తి, సరఫరా ప్రపంచమంతా చేస్తున్నాయి. 

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సందర్భంలో బహుళ జాతి కంపెనీలకు ప్రపంచమంతా బల్లపరుపుగా ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని తాము విస్తరించగలిగినన, కొల్లగొట్టగలిగిన మార్కెట్ గానే చూస్తాయి. వాటి పెట్టుబడులకు, సరుకులకు, భావజాలానికి ఎలాంటి అడ్డు గోడలు ఉండవనే అనుకుంటాయి.

బహుళజాతి సంస్థలను సమర్థించే మేధావులు కొన్ని భ్రమలను ప్రపంచమంతా ప్రచారం చేస్తుంటారు. అందులో ముఖ్యమయినది కార్పోరేషన్లు తాము పోయే ప్రతి దేశానికి కొత్త శాస్త్ర పరిజ్ణానాన్ని తీసుకొని పోతాయి. దాని మూలంగా పారిశ్రామిక అభివృద్ధి పెరగడమే కాదు, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక్కడ అన్నింటికంటే ముందు తెలుసుకోవాల్సింది కార్పోరేషన్లు దాతృత్వసంస్థలు కావు. అవి తమ ప్రయోజనం తప్ప మరే ప్రయోజనాన్ని పట్టించుకోవు, విలువనివ్వవు. తన అవసరాల కోసం “అభివృద్ది” చెందుతున్న దేశాలకు టెక్నాలజీ బదిలీ చేసినా అది ఎప్పుడు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ద్వితీయ స్థాయి టెక్నాలజీనే ప్రవేశపెడుతుంది. అంతేకాదు తాను తీసుకొచ్చే టెక్నాలజీ మూలంగా శ్రామికుల ఉద్యోగాలు పోతాయి తప్ప పెరుగవు. ఎందుకంటే అవి తీసుకొచ్చే ఆటమేషన్ టెక్నాలజీ మూలంగా శ్రామికుల శ్రమ అవసరం లేకుండా పోతుంది. పెట్టుబడిదారి వ్యవస్థ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ ద్వారా శ్రమశక్తి, ప్రకృతిని కొల్లగొట్టే పద్ధతినే “సృజనాత్మక విధ్వంసం” అంటాడు ప్రముఖ రాజకీయార్థికవేత్త జోసెఫ్ శంపీటెర్స్.  ఉదాహరణకు, వ్యవసాయంలో ఒక ట్రాక్టర్ కనీసం ఐదుగురి రైతు కూలీలకు పనిలేకుండా చేస్తుంది.    

అంతేకాదు కార్పోరేషన్లు ఎక్కడ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టినా దాని సంబంధిత సైన్స్, ఫార్ములా ఎప్పటికి పంచుకోవు. ఉదాహరణకు, మొదటిగా 1980లలోనే కోకకోలా కంపెనీ ఇండియాలో తన ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేసింది. కాని భారత ప్రభుత్వం తప్పనిసరిగా ఆ కోకకోల ఫార్ములా మాకు చెబితేనే ప్లాంట్ పెట్టుకోవడానికి అనుమతి ఇస్తామని చెప్పడంతో కోకకోలా కార్పోరేషన్ వెనుతిరిగి పోయింది. అదే కంపనీ 1992లో మారిన రాజకీయార్ధిక సందర్భంలో ఎలాంటి షరత్తులు లేకుండా ఇండియన్ మార్కెట్ లోకి రాగలిగింది.  

అంతర్జాతీయ పెట్టుబడులకు సంబంధించిన కూడా ఒక భ్రమ ఉంది. విదేశీ పెట్టుబడుల మూలంగా మెరుగైన టెక్నాలజీ దేశానికి వస్తుందని, మానవ వనరులు మెరుగవుతాయని, దేశీయంగా ఉత్పత్తుల పోటీ పెరిగి సరుకుల, సేవల నాణ్యత పెరుగుతుందని, ఎగుమతుల పెరుగుదల మూలంగా ప్రపంచ మార్కెట్లో భాగస్వామ్యం పెరిగి విదేశీ ద్రవ్య విలువలు పెరుగుతాయని, మొత్తంగా దేశ అభివృద్దికి బాటలు పడుతాయని.  ఇక్కడ మనం మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన విషయం ఏమంటే బహుళజాతి కంపనీలు ఎవ్వరినీ ఉద్దరించడానికి ప్రపంచం మీదికి ఎగప్రాకడం లేదు, కేవలం తన స్వంత లాభాల కోసం తప్ప. తమ బేస్ దేశాలలో కాకుండా “అభివృద్ధి”చెందుతున్న, “వెనుకబడిన” దేశాలలో పెట్టుబడులు పెట్టడానికి కారణం అక్కడ చౌకగా దొరికే సహజ వనరులు, కార్మికులు, బలహీనమైన చట్టాలు, లాభదాయకమైన టాక్స్ పాలసీలు. వీటి మూలంగా తమ దేశాలలో కాకుండ “అతిధి” (హోస్ట్) దేశాలలో బహుళ జాతి సంస్థలు ఎక్కువ లాభాలు పొందుతాయి.

మొదటగా విదేశీ పెట్టుబడులు చేసే పని లోకల్ గా వుండే కంపెనీలను చౌక ధరకు కొనడం కాని, లేదా ఆ కంపనీలలో పెద్ద షేర్ ను కైవసం చేసుకోవడం. ఈ crows out (ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ఆ ప్రాంతంలోని వాళ్లను నయానో భయానో బయటకు నెట్టివేయడం) పరిణామం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. దీని మూలంగా కేవలం లోకల్ కంపెనీలు మాత్రమే కాదు, జాతీయంగా రీసర్చ్ వ్యవహారాలన్నీ కుంటుబడుతాయి. తన సొంత కాళ్లపై ఎదగాల్సిన జాతి తన కాళ్లను తానే నరికేసుకుంటుంది. తన నడక కోసం విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడుతుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేమంటే చాలా దేశాలలో విదేశీ పెట్టుబడులు మొత్తంగా బయటి నుండి రావు, దేశీయ బ్యాంకుల నుండి, వర్కర్స్ పెన్షన్ నిధుల నుండి లోన్ తీసుకుంటాయి. అంతేకాదు విదేశీ పెట్టుబడులు ఎక్కువగా పెట్టేది వనరులను కొల్లగొట్టే రంగంలోనే. ఆ పని కోసం పెద్ద పెద్ద యంత్రాలను వాడుతారు కాబట్టి ఉద్యోగ ఉపాధి పెరిగే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. వీటన్నింటికి మించి బహుళ జాతి సంస్థలకు టాక్స్ కట్టకుండా తప్పించుకునే నైపుణ్యం, చరిత్ర చాలా వుంది. అంతేకాదు, లాభాలు ఎక్కడ ఎక్కువ వుంటే అక్కడ వాలిపోయే డేగలు బహుళ జాతి సంస్థలు. అవి ఎప్పుడైనా, ఎక్కడినుండైనా వెళ్లి పోవచ్చు. అలా వెళ్లి పోవడం మూలంగా లోకల్ ఆర్థిక వ్యవస్థ ఏమయిపోతుంది అనే విషయాన్ని అవి పట్టించుకోవు. ముందే చెప్పుకున్నాం కదా అవి “ఆత్మ” లేని వింత జీవులని!  

ఉదారవాద మేధావులు బహుళ జాతి కంపెనీలు వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని గొంతెత్తి పాడుతుంటే క్రిటికల్ సామాజిక శాస్త్రవేత్తలు export processing zones ల్లో కొనసాగుతున్న ఆధునిక బానిసత్వం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆధునిక బానిసత్వం అర్థం కావాలంటే ఈ రోజు గ్లోబల్ కాపిటలిజం తన ఉత్పత్తి, సరఫరా వ్యవహారాలను ఎలా చేస్తుందో ఆలోచించాలి. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో అమ్మబడుతున్న ఏ సరుకు పూర్తిగా ఒక్క ప్రాంతంలోనో, దేశంలోనో తయారవుతున్నవి కావు. ప్రతి సరుకు “గ్లోబల్ వాల్యూ చైన్” లో భాగంగా ఉత్పత్తి అయ్యి, పంపిణి అవుతుంది. ఒక సరుకు తయారీని ముక్కలు ముక్కలు విభజించి వివిధ ప్రాంతాలలో వాటిని తయారుచేసి చివరికి వాటికి ఒక్క చోటికి చేర్చి పూర్తి సరుకుగా మారుస్తారు. ఈ ప్రక్రియలో ఎక్కడ వనరులు, పరిజ్ణానం, శ్రామికులు చౌకగా దొరుకుతారో, చట్టాలు అనుకూలంగా ఉన్నాయో చూసుకోని ఆ చైన్ ను తయారు చేస్తారు.

ఈ గ్లోబల్ వాల్యూ చైన్ల పనిలో అనేక దేశాలలో, అనేక నెట్ వర్క్స్ ఉంటాయి. వాటిని అన్నింటిని బహుళ జాతి సంస్థలే కోఆర్డినేట్ చేసుకుంటాయి. అవి అలా నడపడం  కోసం సామ్రాజ్యవాద దేశాల, అలాగే లోకల్ ప్రభుత్వాల సహకారాన్ని తీసుకుంటాయి.ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారమే ఆధునిక బానిసత్వం మూలంగా బహుళ జాతి కంపెనీలు ప్రతి సంవత్సరం 150 బిలియన్ డార్ల లాబం పొందుతున్నాయి. గ్లోబల్ వల్యూ చైన్ నెట్ వర్క్స్ లో పని చేసే వారికి వారి శ్రమ ఫలితాలు ఎవ్వరు ఎనుభవిస్తున్నారో తెలువకపోవచ్చు, కొన్ని సందర్భాలలో వాళ్లు తమ ఆర్థిక పరిస్తితుల మూలంగా ఆయా కంపెనీలలో పనిచేస్తుండొచ్చు … ఏది ఏమైనా అక్కడ జరిగేది శ్రమ దోపిడీ.

ఆ శ్రమ దోపిడీ మూలంగా తయారయిన సరుకులు అందమైన లేబుల్స్ తో ప్యాకేజులుగా మారి మార్కెట్ లోకి వస్తాయి. వాటిని ఉపయోగించే మధ్య తరగతి, ఆ పై తరగతికి ఈ గ్లోబల్ దోపిడీ దొంగల గుట్టు తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఏ కంపెనీ ఎక్కడ తన “వాల్యూ చైన్” వివరాలను బయట పెట్టదు. ఈ కార్పోరేషన్లకు కు కావాల్సిన మద్దతును పౌర సమాజం నుండి కూడగట్టడానికి ప్రభుత్వేతర సంఘాలను (ఎన్ జి వో) తమ పనిలో భాగం చేయడానికి “భాగస్వామ్యం” అనే అందమైన పదాన్ని తెర మీదికి తీసుకొచ్చారు ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జేంస్ వల్ఫెన్సన్.

నిజానికి కార్పొరేటీకరణ మూలంగా పెట్టుబడి మాత్రమే ప్రపంచ వ్యాప్తం కావడం కాదు, కార్పొరేట్ నేరాలు కూడా ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. ఆ నేరాలకు సామ్రాజ్యవాద దేశాల, దళారీ ప్రభుత్వాల అండదండలు ఉంటున్నాయి. నిజమే, కార్పొరేషన్ల నుండి మానవ విలువలను, నైతికతను ఆశించడం పొరపాటే అవుతుంది. కాబట్టి ఆ సంస్థలు ప్రతి నిత్యం ప్రచారం చేసుకునే “కార్పోరేట్ సామాజిక బాధ్యత” లో ఉన్న వైరుద్యాన్ని బట్టబయలు చేయాలి. కార్పొరేట్ ప్రయోజనాల కోసం వాటికి వంత పాడే మేధావులను భావజాల రంగంలో ఎదుర్కొని ఓడించాలి. అంతిమంగా కార్పొరేటీకరణను జల్, జంగల్, జమీన్ అధారంగా నిలువరిస్తున్న ప్రజల పోరాటాలలో భాగస్వాములం కావడం, మద్దతుగా నిలబడటమే మనం భవిషత్తుకు ఇచ్చే ఒక భరోస.  

Leave a Reply