అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని శాంతింపజేయటం పౌరుల బాధ్యత, ముఖ్యంగా రాజకీయాల్లో లీడర్ స్థానంలో ఉన్నవాళ్లకి అది మరింత ముఖ్యమైన బాధ్యత. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  విస్మరించారా ఉద్దేశ పూర్వకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం రాకమానదు. 2026 జూన్ 2 న అంటే తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగే సమయంలోనే తాను ఇక్కడ సభ పెడతానూ అనటం. భావోద్వేగాలను రెచ్చగొట్టటమే కాదా!?

 ఆరోజున బహిరంగ సభ అంటే కచ్చితంగా అనుమతి నిరాకరిస్తారని ముందే తెలిసి, దానిని అణచివేత చర్యగా చెబుతూ తన ఇంటివద్దనే ప్రెస్‌మీట్ పెట్టడం కూడా ఉద్దేశపూర్వకమైన ఆలోచనే అని అనుమానించాల్సి వ్చస్తోంది…

ఆరోజు ఆయన చాలా సున్నితమైన అంశాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణా మీ జాగీరా? అని ఆవేశంగా పవన్ మాట్లాడటం ఆయనకి కనీస అవగాహన లేని తనాన్ని సూచిస్తోంది.

తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. అది నిజమే. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలోని ప్రతి పౌరుడికీ తెలంగాణలోకి రావడానికి, తిరగడానికి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి హక్కు ఉంది. ఆ హక్కు పవన్ కళ్యాణ్‌కీ ఉంది. కానీ అదే సమయంలో తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఈ నేల చరిత్రను, ఈ రాష్ట్రం కోసం జరిగిన త్యాగాలను, ప్రజల భావోద్వేగాలను గౌరవించే బాధ్యత కూడా ఉంది.

తెలంగాణ ఒక రోజులో ఏర్పడిన రాష్ట్రం కాదు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు చేసిన ఉద్యమం, వందలాది మంది అమరుల త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రం కేవలం ఒక పరిపాలనా యూనిట్ కాదు. అది ఆత్మగౌరవానికి ప్రతీక.

అందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మళ్లీ ప్రశ్నించే వ్యాఖ్యలు చేయడం చాలా మందికి అసౌకర్యంగా అనిపించింది. విభజన ఎలా జరిగిందన్న చర్చ చరిత్రలో భాగం కావచ్చు. కానీ తెలంగాణ ఉనికిని, దాని న్యాయబద్ధతను మళ్లీ మళ్లీ సందేహాస్పదంగా చూపించే ధోరణి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది.

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్ర ప్రజలను శత్రువులుగా చూడలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సామాజిక, సాంస్కృతిక, కుటుంబ సంబంధాలు కొనసాగుతున్నాయి. సమస్య ప్రజల మధ్య కాదు, రాజకీయ నాయకులు చరిత్రను ఎలా వినియోగిస్తున్నారన్నదే ప్రశ్న. తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాలలో ఉన్న సెటిలర్లని, ఎప్పుడూ ఎవరూ పొమ్మని అనలేదు. సామాన్య జనాన్ని “ఆంధ్రాకి వెళ్లిపోండి” అనలేదు. అలాంటి పరిస్థితే ఉంటే ఇవాళ ఇన్ని లక్షల ఆంధ్ర ప్రదేశ్ వాసులు ఇక్కడ ఉండేవాళ్లా?

“ఇలాగే వదిలేస్తే వందేమాతరం పాడరూ, జనగణమణ పాడం అంటారూ” అనే మాట అత్యంత అవమానకరం. ఇది తెలంగాణ నేల పోరాటాన్నీ, చరిత్రనూ అవమానించే మాట. ఇక్కడ విముక్తి పోరాటాలు జరిగే కాలానికి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రమే లేదు.  దాస్య విముక్తి కోసం దేశానికి స్వతంత్రం వచ్చిన తరవాత కూడా లక్షల మరణాలని బహుమతిగా పొందిన నేల ఇది… అయినా మేము ఈ భూమి మీద ద్వేషాన్ని పెంచుకోలేదు. భారత దేశం మాది కాదు అనలేదు.

పవన్ కళ్యాణ్ నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షని గౌరవిస్తే, ముందుగా తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన చారిత్రక కారణాలను అంగీకరించాలి. తెలంగాణ ప్రజలకు తమ రాష్ట్రం ఎందుకు అవసరమైందో అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆయన మాటలకు విశ్వసనీయత వస్తుంది. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. అదే సమయంలో తెలంగాణ కోసం పోరాడిన ప్రజల చరిత్రను తక్కువ చేసి చూపే వేదిక కూడా కాదు. ఈ నేలని ప్రేమించాలంటే, ముందుగా ఈ నేల జ్ఞాపకాలను గౌరవించాలి.

తెలంగాణ ఉద్యమం ఒక్కరోజులో పుట్టలేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచే తెలంగాణ ప్రాంతంలో అసంతృప్తి వ్యక్తమవుతూ వచ్చింది. ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అనేక అంశాలపై తెలంగాణ ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని భావించారు. 1969లో భారీ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత కూడా దశాబ్దాల పాటు ఈ డిమాండ్ కొనసాగింది. చివరకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

1953లో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదే సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వేరు రాష్ట్రంగా ఉండేది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలపాలా వద్దా అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (SRC, 1955) ఒక ముఖ్యమైన సూచన చేసింది: తెలంగాణను వెంటనే ఆంధ్రతో కలపకూడదు. తెలంగాణ ప్రజలు కోరుకుంటే భవిష్యత్తులో విలీనం గురించి ఆలోచించవచ్చు. ఎందుకంటే… ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతుందేమో, తమ ఆదాయాలు ఇతర ప్రాంతాలకు మళ్లిపోతాయేమో, సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణ వెనుకబడుతుందేమో, రాజకీయంగా సంఖ్యాబలం తక్కువ కావడం వల్ల ఆధిపత్యం ఏర్పడుతుందేమో లాంటి ఎన్నో అనుమానాలు అప్పుడే వ్యక్తమయ్యాయి కాబట్టే పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.

కానీ తర్వాత ఏమైంది? “ఒప్పందం కాగితాల మీద ఉంది. కానీ అమలు కాలేదు.” ఉద్యోగాల్లో స్థానికేతరుల నియామకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ప్రాంతీయ మండలి ప్రభావం క్రమంగా తగ్గిపోయింది. నీటి పంపకాలు, బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా అసంతృప్తి పెరిగింది. ఈ అసంతృప్తులే కదా 1969 తెలంగాణ ఉద్యమానికి దారి తీశాయి. ఈ మాత్రం చరిత్ర తెలియకుండా నోటికొచ్చిందల్లా మాట్లాడి విద్వేశాలు రెచ్చగొడతామంటే కుదరదు.

PRS India లో ఉన్న బిల్లు సారాంశం చదివితే ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా తెలుస్తుంది: భారత పార్లమెంట్ తెలంగాణను “విభజించబడిన ప్రాంతం”గా కాదు, “కొత్త రాష్ట్రం (Successor State)”గా గుర్తించింది. చట్టం పేరు కూడా Andhra Pradesh Reorganisation Act, 2014. “Partition Act” కాదు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వచ్చిందంటే చాలామంది ఆనందంతో, గర్వంతో ఈ రాష్ట్ర చరిత్రను గుర్తుచేసుకుంటారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటికీ తెలంగాణ ఏర్పాటును “విభజన” అనే పదంతోనే సంబోధిస్తుంటారు. జూన్ 2, 2026న పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలో కూడా అదే ధోరణి కనిపించింది.

ప్రశ్న ఏమిటంటే తెలంగాణ ఏర్పడిన పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఎందుకు “విభజన” అని పిలవాలి?

భాషలో పదాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక సంఘటనను మనం ఏ పేరుతో పిలుస్తామో, దాని గురించి మన దృక్పథం కూడా అదే చెబుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక రాజ్యాంగబద్ధమైన రాజకీయ ప్రక్రియ. భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రం. అలాంటప్పుడు దానిని పదే పదే “విభజన” అని పిలవడం వెనుక కేవలం పద ప్రయోగం మాత్రమే ఉండదు; ఒక రాజకీయ అర్థం కూడా దాగి ఉంటుంది.

ఇది ఒక ప్రాంతం ఇంకో ప్రాంతాన్ని ద్వేషించి సాధించిన ఫలితం కాదు. ఇది ఒక ప్రాంత ప్రజలు తమ స్వీయ పరిపాలన కోసం చేసిన ప్రజాస్వామ్య పోరాటం.

అందుకే తెలంగాణ ప్రజల దృష్టిలో ఇది “విభజన” కాదు. ఇది “ఆవిర్భావం”. ఇది “పునర్వ్యవస్థీకరణ”. ఇది “రాష్ట్ర నిర్మాణం”. కానీ ఇప్పటికీ కొందరు నాయకులు “విభజన” అనే పదాన్నే ఉపయోగిస్తుంటారు. అధికారిక పత్రాలలో కూడా బైఫరికేషన్ అనే పదాన్ని ఉధ్యోగుల, శాఖల విభజనలో తప్ప. బౌగోళిక ఏర్పాటులో వాడలేదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుణర్వ్యవస్థీకరణే తప్ప. విభజన కాదు.

తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను ఎప్పుడూ శత్రువులుగా చూడలేదు. హైదరాబాద్‌లో లక్షలాది ఆంధ్ర కుటుంబాలు గౌరవంగా జీవిస్తున్నాయి. వేలాది తెలంగాణ కుటుంబాలకు ఆంధ్రలో బంధుత్వాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య వ్యాపారాలు, ఉద్యోగాలు, విద్యా సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రజల మధ్య సమస్య లేదు. సమస్య రాజకీయ భాషలో ఉంది.

పవన్ కళ్యాణ్ వంటి నాయకులు తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే చేయొచ్చు. అది వారి రాజ్యాంగ హక్కు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు. కానీ తెలంగాణ ప్రజల చరిత్రను అర్థం చేసుకోకుండా, వారి రాష్ట్ర ఆవిర్భావాన్ని పదేపదే “విభజన”గా పేర్కొనడం మాత్రం గౌరవప్రదమైన రాజకీయ సంభాషణ కాదు.

“అప్పులు పంచుకున్నాం, ఆస్తులు పంచుకున్నాం, ఉద్యోగులను పంచుకున్నాం, పార్లమెంట్ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు కేవలం ‘విభజన’ అనే పదాన్నే పట్టుకుని వేలాడుతున్నాం?”

ఈ పదం వల్ల ఒక ప్రమాదకరమైన భావన బలపడుతుంది. అదేమిటంటే, తెలంగాణ ఏర్పడటం ఒక తప్పు జరిగిపోయినట్లుగా, ఒక విషాద ఘటన జరిగినట్లుగా, ఒక కుటుంబం చీలిపోయినట్లుగా చిత్రీకరించడం. కానీ నిజం ఏమిటంటే, భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది కొత్త విషయం కాదు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఇవన్నీ కూడా ప్రత్యేక రాష్ట్రాలుగానే ఏర్పడ్డాయి. వాటిని ఎవరూ ఈరోజు “విభజన”గా పిలవరు. మరి తెలంగాణ విషయంలో మాత్రమే ఎందుకు?

తెలంగాణ ఏర్పడటం వల్ల ఆంధ్ర ప్రజల పౌర హక్కులు పోయాయా? లేదు.

తెలంగాణ ఏర్పడటం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు శత్రువులయ్యారా? లేదు.

తెలంగాణ ఏర్పడటం వల్ల తెలుగు భాష నష్టపోయిందా? లేదు.

అయితే ఇంకా “విభజన” అనే పదాన్ని ఎందుకు, ఎవరిని రెచ్చగొట్టటానికి వాడుతున్నారు?

అప్పులు పంచుకున్నాం, ఆస్తులు పంచుకున్నాం, ఉద్యోగులను పంచుకున్నాం, పార్లమెంట్ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు కేవలం ‘విభజన’ అనే పదాన్నే పట్టుకుని వేలాడుతున్నాం?

పవన్ కల్యాణ్ ఇప్పటికీ 2014కి ముందున్న రాజకీయ భావోద్వేగాలతోనే తన రాజకీయాలని కొనసాగించాలనే ఉద్దేశంతో ఉన్నారా?

ఎందుకంటే “విభజన” అనే పదం వింటే ఒక బాధ, ఒక కోపం, ఒక అన్యాయం జరిగిన భావన సులభంగా రేకెత్తుతుంది. అదే “ఆవిర్భావం” అని అంటే ప్రజాస్వామ్య విజయం గుర్తుకు వస్తుంది. తెలంగాణ ఏర్పడటం గురించి ఎవరు ఏ అభిప్రాయం కలిగి ఉన్నా ఉండొచ్చు. కానీ 2014 తర్వాత అది ఇక అభిప్రాయం కాదు. అది భారత పార్లమెంట్ ఆమోదించిన రాజ్యాంగబద్ధ వాస్తవం. ఆ వాస్తవాన్ని అంగీకరించకుండా పదేపదే ‘విభజన’ అనే పదాన్ని వాడటం, తెలంగాణ ప్రజల చారిత్రక ఆకాంక్షను చిన్నబుచ్చడమే అవ్వదా. తెలంగాణ ఏర్పడటాన్ని అంగీకరించకుండా, దాని ఆవిర్భావ దినోత్సవం రోజునే పాత గాయాలను మళ్లీ రేపాలనుకోవడం ప్రజలను దగ్గర చేయదు. దూరం చేస్తుంది. ఈ నష్టం పవన్‌కి తెలియకపోవచ్చుగానీ. అటు ఆంధ్రప్రదేశ్‌లో పనులకోసం వెళ్ళే తెలంగాణ వాసులనీ, ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ వాసులనీ తీవ్రమైన ఇబ్బందుల్లో పడేస్తుంది.

ఇప్పుడు సమస్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలది కాదు. ఇంకా “విభజన” అనే పదం వదలలేని రాజకీయాలదే.

పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణను “విభజన”గా చూస్తే, సమస్య తెలంగాణలో లేదు. సమస్య ఇంకా చరిత్రను అంగీకరించలేని మనస్తత్వంలో ఉంది.తెలంగాణ ఏర్పడింది. అభివృద్ధి చెందుతోంది. తన తప్పులనూ, విజయాలనూ తనే మోస్తోంది. ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా అంగీకరిస్తే అంత త్వరగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంభాషణ కూడా ఆరోగ్యకరంగా మారుతుంది.

ఎందుకంటే తెలంగాణ ఒక విభజన కాదు. అది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి వచ్చిన రాజ్యాంగబద్ధమైన గుర్తింపు.

Leave a Reply