ఎక్కడో ఛత్తీస్ఘడ్ అడవిలో ఒక చెట్టుకింద కూర్చున్న నాకు చలం పరిచయమయ్యాడు. అక్కడ సిగ్నల్ ఉండదని ముందే యూట్యూబ్ కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నాను. వాటిల్లో చలం రచనలు అని ఇరవై రెండో ఇరవై మూడో ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. అప్లోడ్ చేసిన వాళ్ళు సరిగా గుర్తులేరు కౌముది అనుకుంటా. అవన్నీ వింటూ వింటూ చలం పరిచయం అయ్యాడు. మొదట అందులో నేనూ విన్నది కూడా ప్రేమలేఖలు అనే వీడియో. అప్పుడు నాకు విరహం కూడా ఎక్కువే ఉండేది. కుటుంబాల మీద కాదు! అక్కడి నుంచి నాకు చలం అలవాటు అయ్యాడు. నేను సాహిత్య ప్రపంచంలోకి రావడానికి ఒక కారణం కూడా చలమే. వచ్చింతరువత అన్ని నేర్చుకునే క్రమంలో నాకు ఆయన మీద విమర్శ లేకపోలేదు కానీ ఇక్కడికి తీసుకొచ్చాడన్న కృతజ్ఞత ఇంకెక్కువ ఉంది.
చలం అర్దమవ్వడు అంటారు చాలా మంది, అలా అర్దమవ్వలేదంటే మనల్ని మనం విమర్శించుకుని మళ్ళీ చలాన్ని చదవాలనుకుంటా నేను. చలం వచ్చిన కాలం స్వాతంత్రపు మునుపు కాలం సుమారు 1920లు . ఆ కాలంలో ఇంకా భూస్వామ్యాపు ప్రభావం, పెట్టుబడి దారుల దోపిడి అధిక దశలో ఉన్నాయి. అయినా ఆయన ఎంచుకున్న వస్తువు ‘స్త్రీ’. చలం ఎంచుకున్న వస్తువు కొత్తదేమి కాదు అంతకుముందు నుంచి చాలా మంది ఉన్నారు. వీరేశలింగం, గురజాడ. గురజాడ పరిచయం చేసిన మధురవాణి వేసిన ప్రశ్నలు.
చలం వస్తువు పాతదే. అయితే చలం చెప్పిన తీరు ఆ కాలానికి కొత్తది. ఆయన శైలి కొత్తది. వస్తువుని శైలిని వేరు వేరు చేసి చూస్తారు కొందరు. ‘మీ శైలి బాగుందండీ’ అంటారు. అయితే శైలి మాత్రమే కాదు వస్తువు తో జత చేసి చూసినప్పుడే చలం విలువ తెలుస్తుంది.
చలం రాసిన ఒక కథ ఇచ్చి నన్ను మాట్లాడమన్నారు. ఆ కథ పేరు ‘చుక్కమ్మ’ (అనువాద కథ). ఆ కథ మీద నాకేం పెద్ద అభిప్రాయం లేదు. ఆయన చెప్పిందే మళ్ళీ ఇంకొంచం వేరే విదంగా చెప్పాడు. అందులో ఆయన చెప్పిందేంటంటే ‘మగవారి బుద్ధి, ఆడవారి బలహీనత’ అని రెండు విడివిడిగా చెప్పాడు. ఆ కథ మొదటనే నాయికకి పెళ్ళైపోతుంది. భర్త ఇంకోచోట ఉంటాడు. (అది జైలు అని తరువాత తెలుస్తుంది) అప్పటి తెలుగు దేశంలో వలస వెళ్ళిన వారు అనేకం. ఇంట్లో ఉండే వారి భార్యాలకి బలహీనతలు ఉంటాయి. ఎవరికీ లేవని ఆయన ఉద్దేశ్యం కాదు కానీ అలా బలహీనమైన క్షణాల్లో ఇంకోకరితో కలవడం తప్పు అంటుంది సమాజం. కానీ అది వారి స్వేచ్ఛా అంటాడు చలం. వలస వెళ్ళిన మగవారంత యేతప్పు చేయలేదని మీకు తెలుసా? ఒకసారి నగ్నంగా ఆలోచించుకోండి అంటాడు. అదే చెప్పాలనుకున్నాడు. కానీ అవసరాల రీత్యా భర్తే చివరికి ఇంకో మగాడి దగ్గరికి పంపిస్తాడు . నిజంగా వెళ్ళిందా అని తలుపు దగ్గరికి వెళ్ళి చాటున వింటుంటాడు. ఇంతటి కుళ్ళు నిండిపోయింది సమాజం నిండా అని చలం ఆ కథ ద్వారా చెప్పదలుచుకున్నాడు. స్త్రీని ఒక వస్తువుగా ఉపయోగిస్తున్నారు వారికి స్వేచ్ఛనివ్వండి అని చుక్కమ్మ కథ ద్వారా చెప్పాడు. కానీ నిజానికి చెప్పాల్సింది ఆ బలహీనత నుంచి స్త్రీ తమకు తాము అదిగమించాలని. ఒక బలహీనత్వంలో౦చ్చి మరో బలహీనత్వంలోకి పడిపోమ్మని కాదు. ఇలా నాకర్దమయింది.
చలం రాసినా వాటన్నింటిలో నేను గమనించింది ఏంటంటే చలం స్వేచ్ఛ కావాలన్నాడు. స్వేచ్ఛా మీదే రాశాడు. విపరీతంగా పోరాటం చేయాలి అన్నాడు. కానీ ఆయన ఒక డెస్టినేషన్ చూపించాడు స్వేచ్ఛకి, కానీ దారి వేయలేకపోయాడు అనిపించింది. ఆయన ఒక consistency గా ఉండలేకపోయాడు అనిపించింది.
మొదటగా పాఠకులని రచన ప్రపంచంలోకి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయం. చలం రచన చదివితే మొదటి పేజీలోనే ఆయన పాఠకులని తమ లోకంలోకి తీసుకెళ్లగలడు. ఆయన మొదటి రచన శశిరేఖ లో గ్రాంథికం వాడారు తరువాత నుంచి వచనంలోకి వచ్చారు. గ్రాంథికం అర్దం కాలేదు అని కాదు పాఠకులు తీసుకోలేకపోయారు అనుకుంటాను నేను. అందుకే తరువాత బాష మార్చారు కానీ వస్తువు మార్చలేదు. ఒక్కో రచయిత ఒక్కో తీరు. ఇది చలం తీరు. ఎంత సైంటిఫిక్ గా లేకపోయినా ఆ ఊహ ప్రపంచంలో౦చ్చి ప్రపంచపు స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాటం చేయమంటాడు. చలం రాసిన చాలా రచనలని నిజ జీవితంలో౦చ్చే తీసుకొచ్చాడు. ఆయనకి కమ్యూనిస్టులు వ్యతిరేకులు అంటారు చాలా మంది. కానీ ఆయనకి వ్యతిరేకులు కాదు ఆయన రచనకి విమర్శకులు అని నాకు అర్దమైంది. ఓ పువ్వు పూసింది అని చాలా కథ రాసినప్పుడు చలం ఇష్టపడే కవి శ్రీశ్రీ ఆ కథ మీద మరో కథ రాశాడు. అప్పుడు శ్రీశ్రీ చలానికి వ్యతిరేకి అని అనుకోకూడదు. ఇలా ఉంటుంది చలంతో ప్రయాణం.
ఇప్పటికీ ప్రేమ అనే దాని మీద అతి రొమాంటిక్ కథలు, నవలలు చదవాలంటే చలం దగ్గరి నుంచే మొదలు పెట్టాలి చివరికి చలం దగ్గరే అది ఆగిపోతుందేమో అనుకుంటాను నేను. నిజమే ఇప్పటికీ ఈ కాలానికి చలం అవసరం. జెన్ జి కూడా చలం దగ్గరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
( చలం రచనా ప్రపంచం మీద ‘లామకాన్’ లో 24 మే 2026 న మాట్లాడిన మాటలకు అక్షర రూపం)




