గిజుభాయి బదేక రాసిన “పగటికల” పుస్తకం విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆశించే ఉపాధ్యాయులకు ఓ గొప్ప మార్గదర్శక పుస్తకం. పోలు శేషగిరిరావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.

పేరులో ఉన్నట్టు ఈ పుస్తకం
“ఈ పగటి కల” కాకుండా పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా భయం లేని విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ప్రేరణను ఇస్తుంది. ఈ పుస్తకం ముఖ్యంగా నేటి ఆధునిక విద్యా వ్యవస్థకు కూడా ఎంతో అవసరం. పుస్తకంలో గురువు పాత్ర పోషించినది లక్ష్మీకాంత్ అనే ఓ నూతన ఉపాధ్యాయుడు. అతను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరి అక్కడ ఉన్న పాత బోధనా పద్ధతులను మార్చి, పిల్లలకు ఆట పాటలతో జ్ఞానాన్ని ఎలా అందించాలో ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. పగటి కల అంటే అర్థం పగలు కలలు కనడం మాత్రమే కాదు, ఆదర్శవంతమైన తరగతి గదిని ఊహించి దానిని నిజం చేయడం అనే గిజుబాయ్ ఆలోచన. వాస్తావానికి అతను దానిని నిరూపించాడు కూడా. పుస్తకంలో గురువు విద్యార్థుల మధ్య సంబంధం ఎలాంటిదో వివరంగా చర్చించాడు. గురువు ఉద్యోగం చేయడానికి కారణం జీతం కోసమే కాదు. విద్యార్థికి జ్ఞానాన్ని అందివ్వడం, మంచి చెడుల తేడాలను తెలపడం. సమాజాన్ని అర్థం చేయించడం. కానీ కొంతమంది గురువులు ఇలా చేయకుండా ఎక్కువగా ఏకధాటిగా పాఠ్యాంశాలు చెప్పి, అవసరం లేని నీతులు చెప్తారు. అలాగే వారి కఠిన దండనతో పిల్లలను చదువుకు దూరం చేస్తారు. వారికి నెలనెలా జీతం వస్తే చాలు అనుకుంటారు. అలా కాకుండా ఒక ఉపాధ్యాయుడు సిన్సియర్గా చదువు చెప్తే ఎంత బాగుంటుందో ఈ పుస్తకంలో చదవచ్చు. అయితే పిల్లలు తమ కంటే ఎక్కువగా తెలివివంతులై వుంటే, వారి అభిప్రాయాలకు వ్యతిరేకమైన చేష్టలు చేస్తే. ఆ పిల్లల ముందు తను తక్కువగా అవుతాను అని  ఉపాధ్యాయుల అభిప్రాయము. భయం కూడా!
ఉపాధ్యాయులు అందరూ “పగటి కల” లోని లక్ష్మీకాంత్ అనే ఉపాధ్యాయుడిలా ఆలోచిస్తే

ఈ ప్రపంచం ఎంతో బాగుపడుతుంది. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలను చదువులతోనూ, పరీక్షలతోను, బహుమతులతోనూ, పోలుస్తారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే పిల్లలకు చదువు ముఖ్యం కావాలి కానీ వాస్తవంగా ఆ చదువు మనస్పూర్తిగా చదవడం లేదు. అది ప్రధానమైన సమస్య. ఉపాధ్యాయుడి భయంతోనే ఏదో చదువుతారు. అలాకాకుండా ఆ ఉపాధ్యాయుడు విద్యార్థితో ప్రేమగా, అభిమానంగా, మసలుకుంటూ చదువు చెప్పాలి. అప్పుడు వాళ్లు గురువు చెప్పే పాఠాన్ని అర్థం చేసుకోగలరు. ఉపాధ్యాయుడు అంటే ఒక విద్యార్థిని మంచి దారిలో నడిపించేవాడు. కానీ అలాంటి ఉపాధ్యాయులే నేటి సమాజంలో ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తప్పుడు వ్యవహారాల నడుపుతున్నారు. అది ఏ మాత్రం మంచిది కాదు. అందుకే గిజుబాయి స్వయంగా గుజరాతి భాషలో రచించిన గ్రంథాల్లో మాంటిసోరి పద్ధతి, బాలశిక్షన్, ప్రాథమిక శాల, మా శిక్షణ పద్దతీయా, దివాస్వప్న(పగటి కల) మొదలైన గ్రంథాలను రచించాడు. ఒక విద్యావేత్తగా బాలల విద్యలో మార్పులు రావాలని జీవితాంతం తపించాడు.

పగటికల లో లక్ష్మీకాంత్ అనే ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాలలో బోధించడానికి ప్రవేశిస్తాడు. అతడు నాలుగవ తరగతిని బోధనకు ఎంచుకుంటాడు. లక్ష్మీకాంత్ బోధించడానికి తరగతిలోకి వెళ్ళాడు. కానీ అక్కడ నాలుగవ తరగతి విద్యార్థులు అతని పట్ల గౌరవం లేకుండా, భయం లేకుండా, అతడు వచ్చినా పట్టించుకోకుండా, తమ అల్లరిని అలాగే చేస్తారు అప్పుడు ఉపాధ్యాయుడు పిల్లలను దగ్గరికి పిలిచి, మనమందరం పరిచయం చేసుకుందాం అన్నాడు. అయినా సరే పిల్లలు పట్టించుకోకుండా తమ అల్లరిని కొనసాగిస్తారు. అప్పుడు లక్ష్మీకాంత్ కు అర్ధమైన విషయం ఏమిటంటే వీళ్లను సరైన పద్ధతిలోకి తీసుకురావాలని. అప్పటినుంచి ఆయన తన పనిని మొదలుపెడతాడు. పిల్లలను మురికి టోపీలతో, పెద్ద పెద్ద గోర్లు పెంచుకొని చిరిగిన బట్టలతో, గుండీలు లేని బట్టలతో ఉంటున్న ఈ పిల్లలను ఎలా మార్చాలి అనే ఆలోచన అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి, పిల్లలకు పుస్తకాలు లేవు. తరగతికి వెళితే అల్లరి. ఏమి చేయాలా అని ఆలోచిస్తే అతనికి ఒక ఆలోచన వచ్చింది. కథ చెప్పడం

కథ చెప్తే వింటారేమోనని చెప్పడం మొదలుపెట్టాడు. కథ మొదలవగానే పిల్లలందరూ తమ అల్లరిని ఆపి శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. అట్లా కథ చెప్తూనే వెళ్ళాడు. మధ్యలో ఒకసారి ఇప్పుడు హాజరు వేసుకుందాం అని అన్నాడు. కానీ పిల్లలు మళ్లీ కథ చెప్పమని అల్లరి పెట్టారు. కానీ లక్ష్మీకాంత్ హాజరు తీసుకున్న తర్వాత మళ్లీ కథ మొదలు పెడతాను అంటాడు. అలా తరగతి గదిని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. ఇందులో ఎక్కడా పిల్లలను దండించడం, విసుక్కోవడం, భయభ్రాంతులకు గురి చేయడం, అనేది లేదు. ఇదే పద్ధతిలో పిల్లలను జ్ఞానవంతులను చేస్తాడు అట్లా రోజు కథలు చెప్పడం పిల్లలు శ్రద్ధగా వినడం కొనసాగింది. ఆ పాఠశాలలో గ్రంథాలయం మొదలుపెట్టాడు. పిల్లలకు ఇష్టమైన కథల పుస్తకాలు తెచ్చి పిల్లలతో చదివించడం మొదలుపెట్టాడు. అది ఎంత కష్టమైనా ఇష్టంగా చేశాడు. అలాగే చిన్న చిన్న పనులతో పిల్లలను మార్చాలి అనుకున్నాడు.

ఇలా జరుగుతున్నప్పుడు పక్క తరగతి పిల్లలు కూడా లక్ష్మీకాంత్ కు ఆకర్షితమయ్యారు. వాళ్లు తమ తరగతి ఉపాధ్యాయులను కూడా పాఠం వద్దు. కథలు చెప్పండి. అనడం మొదలుపెట్టారు. కానీ, విషయం ఏమిటంటే ఆ తరగతి ఉపాధ్యాయులకు కథలు చెప్పడం రాదు అందుకే వాళ్లు లక్ష్మీకాంత్ ను వ్యతిరేకించారు. “నువ్వు ఇలా పిల్లల కథలు చెప్పడానికి వచ్చావా? పాఠాలు చెప్పడానికి వచ్చావా? నీ వల్ల మా తరగతి పిల్లలు నాశనమవుతారు. ముందు పాఠాలు చెప్పు కథలు కాదు” అన్నారు. అయినా లక్ష్మీకాంత్  పట్టించుకోలేదు అలాగే చిన్న చిన్న ప్రయోగాలు చేసి పిల్లలను తను అనుకున్న దిశగా మార్చాడు. పిల్లల చేత చదివించాడు. ఆటలు ఆడించాడు. ఇతరులు ఏమన్నా పట్టించుకోలేదు. పిల్లలకు శుభ్రమైన నీళ్లు రావడానికి నల్లాలు ఏర్పాటు చేశాడు గోర్లు తీయడానికి బ్లేడ్లు తెచ్చి అందరికీ తనే గోర్లను తీశాడు. ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. ఇదంతా చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అతనిని విచిత్రంగా చూశారు. అయినా లక్ష్మీకాంత్ పట్టించుకోలేదు. అతను తన ప్రయత్నాలను కొనసాగిస్తూ పోయాడు ఇక ఇప్పుడు పాఠ్యపుస్తకాలు తెప్పించి పాఠాలు చెప్పాడు. విద్యార్థితో ప్రేమగా నడుచుకున్నాడు కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా వారికి అవసరమైన జ్ఞానాన్ని అందించాడు.

అది కదా ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణం. తోటి ఉపాధ్యాయులతో మాటలు పడుతూ వాటిని పట్టించుకోకుండా పిల్లల కోసమే అతను ఆలోచించాడు. ఇది కదా గురుతత్వం అంటే విద్యార్థులు సైతం అతనితో స్నేహభావంతో ఉన్నారు.

ఈ కృషి ఎక్కడిదాకా పోయిందంటే విమర్శించిన తన సహచరులే అతని విజయాన్ని అంగీకరించారు ఇలాంటి ఉపాధ్యాయులు సమాజంలో మన మధ్యన ఉంటే మనం విజయం సాధిస్తాం లక్ష్మీకాంత్ అందరూ ఉపాధ్యాయుల్లా అతడూ సామాన్యమైన మనిషే. కానీ అతడు పిల్లల జీవితాన్ని గురించి ఆలోచించాడు.వాళ్లకు చదువే ముఖ్యం. అని భావించి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాడు. అతడు కేవలం జీతం కోసం కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం పనిచేశాడు. ఈనాటి కాలంలో కూడా ఇలాంటి గురువులు ఉండొచ్చు. కొంతైనా ఉండొచ్చు. కానీ మిగతా ఉపాధ్యాయులంతా కూడా ఇలాగే మారాలి. కనుక ఉపాధ్యాయులు తమ ఉద్యోగానికి విలువనిచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి “పగటి కలల” లక్ష్మీకాంత్ లా…

ఈ పుస్తకాన్ని ప్రతి ఉపాధ్యాయుడు తప్పకుండా చదవాలి. తల్లిదండ్రులు కూడా చదవాలి. విద్యా రంగంలో బాధ్యతను సహనాన్ని నేర్పే పుస్తకం ఇది.

Leave a Reply