‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.అధర్మం. అన్యాయం.’

‘మనఓట్లు తీసుకుని గెలిచిన ప్రభుత్వం మన పునాది బతుకులను దెబ్బతీసేందుకు చట్టాలను నియమాలను తెచ్చిందా? దేశ రక్షణ పేరుతో, ఇస్లాం టెర్రరిస్టుల బూచి చూపి ముస్లిం చొరబాటుదారులను ఏరివేయడానికి అని చెప్పి, మొత్తం జన వర్గానికి ప్రతి వ్యక్తికీ తన ఉనికిని రుజువుచేసుకునే దుర్మార్గమైన పరిస్థితిని కల్పించింది.’

ఈ మాటలు అన్నది ఎవ్వరో కాదు. సుప్రసిద్దన్యాయవేత్త ప్రొ.మాడభూషి శ్రీధర్‌. “ఎవడ్రా నన్ను పౌరుడు కాదన్నది?”  పౌరసత్వం నా జన్నహక్కు అంటూ వొక పుస్తకాన్ని తీసుకొచ్చారు. 2019 నుండి పౌరులంతా భయభ్రాంతులకు గురయ్యేలా బిజెపీ పాలకులు సీఏ ఏ- ఎన్ ఆర్ సీ చట్టాన్ని తీసుకొచ్చారు. మనమెవరో మన నేల ఎక్కడో, మనం ఈ నేలమీద బతకాడికి కూడా దృవీకరణ పత్రాలు కావాలని తుగ్లక్‌ తరహా రాజాజ్ఞలు తీసుకొచ్చారు. ఇది భారతదేశంలో నివసించే వొక వర్గానికో, వొక సమూహానికో, లేదా వొక కులానికో వర్తిస్తుందని అందరూ భావించారు. కానీ దాన్ని లోతుల్లోకి వెళ్ళినపుడు ప్రతీ పౌరుడు తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి వుంది. అందుకే ఈ పుస్తకంలో మాఢభూషి శ్రీధర్‌ ‘ఆధార్‌ కార్డు కోసం 129 కోట్ల ప్రజలను మించి అందరూ అన్ని రకాల వివరాలు ఇచ్చారు. రుజువులుచూపారు. చేతి పది వేళ్లతో వేలిముద్రలు ఇచ్చారు. కంటి రెప్పల చిత్రాలు కూడా కళ్లద్దాలు తీసి మరీ ఇచ్చారు. ఇంకా ఏం ఇవ్వాలి. కాళ్ల గుర్తులుఅడగనందుకు సంతోషించాలి కావచ్చు. ఇంకా ఏం వివరాలు ఇవ్వాలో ఏమేం చూపాలో తెలియదు.’ అంటారు ఈ పుస్తకంలో రచయిత. దీన్నిబట్టి  ప్రమాదం ఎంత పొంచి వుందో అర్థమౌతుంది. మనం ఎంత ప్రమాదంలో ఉన్నామని విషయం కూడా అర్థమవుతుంది. పాలకులకు  భారత రాజ్యాంగం పట్ల ఏ మాత్రమూ గౌరవం లేకపోవడం వల్లే ఇటువంటి విధానపరమైన  నిర్ణయాలతో ప్రజలు ఆందోళన చెందేలా ప్రవర్తిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ళుగా దేశప్రయోజనాలపై దృష్టిసారించక  మనుషుల మధ్య కులం పేరుతో మతం పేరుతో విభజన రేఖలు గీయడానికే సమయం వెచ్చిస్తున్న వైనాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకే 2024లో పూర్తిస్థాయిలో అధికారాన్ని కట్టబెట్టకుండా  ప్రాంతీయపార్టీలపై ఆధారపడేలా చేశారు. ఇది ఆరంభం మాత్రమే.  వీళ్ళు రాముణ్ణి అడ్డం పెట్టుకుని ఎన్నాళ్ళని ఒట్లడుగుతారు. ఎన్నాళ్లు మత రాజకీయాలు చేస్తారు. మన దేశ భవిష్యత్తు  ఆందోళన చెందుతూ ఈ పుస్తకంలో రచయిత లోతైన విషయాలు భారత ప్రజల ముందుంచారు. అయితే ఈ పుస్తకం సామాన్యజనంలోకి వెళితే మనల్ని పాలిస్తున్న భాజాపా అసలు రంగు బయటపడటం ఖాయం. రచయిత చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు ఈ పుస్తకంలో చెప్పారు. పైగా తను ‘నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు.  నాకు ఎక్కడినుంచి నిధులు రావడం లేదు.  ముస్లింల పక్షాన నేను మాట్లాడడం లేదు.  టెర్రరిస్టులను రక్షించాలన్న ఆలోచన నాకు లేదు.  ముస్లిం మతతత్వ పిచ్చిని నేను సహించను.  హిందూ మతతత్వ పిచ్చిని క్రైస్తవ మతపిచ్చిని నేను వ్యతిరేకిస్తాను.  ముస్లింలను ఓట్లకోసం నెత్తికెక్కుకోవడం ఎంత దారుణమో, ఓట్ల కోసం హిందూ మతతత్వాన్ని రెచ్చగొట్టడం అంతే దారుణం.’ అంటూ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. ఒక భారత పౌరుడుగా ఈ దేశాన్ని ఎలా విచ్చిన్నం చేస్తున్నారో ప్రశ్నార్ధకమవుతున్న భారతదేశ భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ రాశారు. ఎవరు ఏ తరహా ఉన్మాదానికి పాల్పడినా దాన్ని ఆయన సహించనంటారు. ఇది అందరి దేశం. ఈ దేశనిర్మాణంలో అందరి భాగస్వామ్యముంది. ఏ వొక్క కులంవల్లో ఏవొక్క మతం వల్లో ఈ సువిశాలదేశం ఏర్పడలేదు. స్వరాజ్యపోరాటంలో  కులాలకు మతాలకు అతీతంగా ప్రాణత్యాగం చేశారు. మతతత్వం అనే ప్రాణంతక వైరస్‌ ఈ మానవ మెదడులో నిక్షిప్తమై ఉన్నన్ని రోజులు సమాజం తిరోగమనదిశలోనే పయనిస్తుంది. అందుకే మహాకవి శ్రీశ్రీ‘సూర్యుడిలాంటి ఈ సత్యానికి మబ్బులాంటిది మతం. అందుకనే మతాన్ని మనుష్యుల పాలిటి నల్లమందుగా అభివర్ణించాడు మార్క్సు. అనాదినుంచీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుష్యులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చెయ్యలేక పోయింది. అలాచేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషి కుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది మతం. దేవుడనే హేతువాదదూరమైన భావాన్ని ఆరాధిస్తూ శాస్త్రీయవిజ్ఞానానికి పోటీగా మూఢవిశ్వాసాలను నిలబెడుతుంది.’ అంటూ ఆ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ మతా నికి అర్థం చెప్పాడు. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం అలానే చేస్తున్నది. స్వామీజీలచుట్టూ, పీఠాధిపతులచుట్టూ తిరుగుతున్నది.

ఈపుస్తకం ఏ వొక్క ఎన్‌ఆర్‌సి, సీఏఏకు సంబంధించినదనో అని అనడానికి వీల్లేదు. ప్రజల అస్తిత్వానికి ముంచుకొస్తున్న ప్రమాదకరమైన విషయాల్ని చెబుతూ అనేక  ప్రశ్నల్ని లేవనెత్తింది. ఎవడ్రా నన్ను పౌరుడు కాదన్నది అన్న బలమైన వాక్యం పాలకుల పీఠాన్ని కదిలించేలా చేయగలుగుతుంది. ఇది వాస్తవం..ఈ పుస్తకంలో రెండు గొప్ప కవితల్ని చదవవచ్చు. వొకటి  నాపేరు రాసుకో, నేను భారతీయుడిని అంటూ అజ్మల్‌ఖాన్‌ అనువదించిన కవితను చదవవచ్చు. ఈ కవిత ప్రారంభంలో పాలస్తీనా గురించి మహమూద్‌ దర్వేష్‌, కశ్మీర్‌ గూర్చి ఆగా షాహిద్‌ అలీ, అస్సాం గురించి మియా కవులు రాసిన కవితలను అనుసరించి అంటూ కవిత ప్రారంభమౌతుంది అది చూద్దాం..

రాసుకో నా పేరు/నేనొక భారతీయుణ్ని/రాసుకో రాసుకో/నా పేరు అజ్మల్‌/నేనొక ముస్లిమ్‌ను/భారతీయపౌరుణ్ని/మా ఇంట్లో ఉన్న ఏడుగురమూ/పుట్టుకతో భారతీయులమే/ధ్రువీకరించే పత్రాలు కావాలా?/నా పేరు రాసుకో/భారతీయుడినని రాసుకో/నేనొక మోప్లాను/నా పూర్వీకులు అస్పృశ్యులు/నీ భాషలో చెప్పాలంటే హిందువులు/శతాబ్దాల కింద మనువును చెంపదెబ్బ కొట్టి/గౌరవం పొంది/పేర్లు మార్చుకున్నవాళ్లు/అదంతా మీ సిద్ధాంతకర్తల/ముత్తాతలు పుట్టక ముందరి ముచ్చట/నీకేమన్నా అనుమానమా?/రాసుకో నా పేరు/నేను భారతీయుడిని/నా తాత ముత్తాతలు/ఈ నేల దున్నారు/వాళ్లీ మట్టిలో పుట్టి పెరిగి/ఈ మట్టిలో కలిసిపోయారు/వాళ్ల వేళ్లు/ఈ మర్రిచెట్ల వేళ్లకన్న/ కొబ్బరిచెట్ల వేళ్లకన్న/లోతుగా పరచుకున్నాయి/వాళ్లు భూస్వాములు కాదు/రైతులు మాత్రమే/కాని ఈభూమే వాళ్ల వేరు/వాళ్ల వేరు వాసనే/ఈ నేల సుగంధం/వాళ్ల చర్మపు వర్ణమే/ఈ నేల రంగు/ధ్రువీకరణ పత్రాలు కావాలా?రాసుకో నా పేరు/నేను భారతీయుడిని/ఇంకా ధ్రువీకరణ పత్రాలు కావాలంటావా?/మరి నేను మలబార్‌ లోనూ/ఇతరచోట్లా /సమాధులన్నీ తవ్వవలసిందే/మా తాత ముత్తాతలు/బ్రిటిష్‌ తుపాకి గుళ్లకు/ఒరిగిపోయినప్పుడు/వాళ్ల చాతీల/మీద మిగిలిన బూట్ల తన్నులూ/తూటాల గాయాలూ/చూపుతాను/అయినా/పత్రాలు కావాలంటావా?/నీదగ్గర ఉన్న/పత్రాలేమిటో/నాకు తెలుసు/సెల్యులార్‌ జైలులో లొంగుబాటు లేఖ/నీ చేతులకు అంటిన గాంధీజీ నెత్తుటి మరకలు/ఇంకా నీ పత్రాలు/గుర్తు చెయ్యమంటావా?/నువ్వింకా నా పత్రాలు అడిగితే/నోరు మూసుకుని/దొబ్బెయ్యమంటాను/రాసుకో నా పేరు/నేను భారతీయుడిని/గుర్తు పెట్టుకో/నువ్వు మసీదు /కూలగొట్టడానికి/జనాన్ని తోలావని/నేను మరిచిపోలేదు/ఇప్పుడు నువ్వు/రాజ్యాంగాన్ని కూలగొట్టావు/ఈ నేల ఆత్మను కూలగొట్టావు/నేను మండిపోతున్నాను/ఎంత ధైర్యం నీకు?/ఎంత ధైర్యం నీకు?/రాసుకో నా పేరు/నేను భారతీయుడిని/ఇది నాదైన నేల/నేనిక్కడే పుట్టాను/ఇక్కడే గిడతాను/అందువల్ల నీఎన్‌ఆర్‌సి మీద /అన్నిటికన్న పైన/స్పష్టంగా/పెద్దక్షరాలతో ముద్దక్షరాలతో/రాసుకో నేను భారతీయుడినని..రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని కాదనడానికి ఈ పాలకులెవరూ..రాబోయే రోజుల్లో దేశపౌరులు అదానీ, అంబానీలు తప్ప వేరెవ్వరూ కదాంటారేమో..లేదంటే స్వామీజీలకు, పీఠాధిపతులకు, అఘోరాలకు మాత్రమే ఈ దేశంలో పౌరసత్వం ఉందంటారేమో! ఎంత దుర్మార్గం. ఈ పుస్తకంలో ఉన్న మరొక కవిత ముజీబ్‌ జైహూ కవితను ఎన్‌.వేణుగోపాల్‌ అనువదించారు. దాన్ని చూద్దాం..ఎన్నటికీ ఈ స్థలం వదిలిపోం కవితా శీర్షికను చూద్దాం..

దేశానికొచ్చిన సందర్శకులకు/ఆతిథ్యం ఇచ్చేది మహల్‌ లోనే/వారికి తినిపించేది బిర్యానీలూ/ కబాబులూ, జామున్‌ లే/నీ దేశభక్తి కండలు ప్రదర్శించేది/ఎర్రకోట మీదినుంచే/సుల్తాన్‌ లు నిర్మించిన/నగరం మీదనే రాజ్యం చేస్తావు/గజల్‌ లు ఆలకిస్తూ/షేర్వానీలో పొంగిపోతుంటావు/ఉర్దూ గీతాల మాధుర్యంతోనే/నెచ్చెలితో సరసాలాడతావు/ ఒకే ఒక్క అఖండ దేశమని/ చెప్పుకుంటావు గదూ/బాబర్‌ వారసులే గద/దాన్ని ఒక్కటి చేసింది!/అసలు ఇండియా అన్న పేరే/ మరొకరెవరో దానం ఇచ్చిందే గద!/ఇప్పుడిక చిట్టచివరికి/మకరందమంతా పీల్చిపిప్పి చేసి/ఉద్యానవనం మీద ప్రేమ/రుజువు చేసుకొమ్మని/పువ్వును ఆదేశిస్తావు!/ వలసవాద సైతాన్‌ను అడుగడుగునా/అడ్డుకుని పోరాడిరది మేం/ఈ అద్భుతమైన నేల కోసం/మా పిల్లల్ని బలిపెట్టింది మేం/ ఇవాళ నువ్వు బెదిరిస్తే వణికిపోతామని భ్రమపడకు/ మేం దృఢంగా నిలిచే ఉంటాం/నీ అంకెల బలిపీఠం చూసి సొమ్మసిల్లిపోం/ఎన్నటికీ ఈ స్థలం వదిలిపోం/ఎల్లకాలానికీ ఇక్కడే ఉంటాం /మమ్మల్ని వెళ్లగొట్టడానికి చూడకు/ ఆలోచనలూ మాటలూ మార్చుకో/ కలిసి శాంతిని అనుభవిద్దాం/కలిసి ఆటలాడుకుందాం..ఈ కవి ముజీబ్‌ జైహూ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ లో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన రచయిత. వక్త, దేశదిమ్మరి. కేరళలో అనేక విద్యాసంస్థల సంచాలకుడు అని రచయిత పేర్కొన్నారు.

మన నాయకుడు కోట్లు ఖర్చుపెట్టి నీళ్ళలో మునిగేందుకు వెళతాడు కానీ అగ్నగుండంలా మండిపోతున్న మణిపూర్‌ మంటల్ని మాత్రం చల్లార్చడు. ఇంతవరకూ ఆ నేలపై కాలు పెట్టని ప్రధానిగా చరిత్రకెక్కాడు. మన్‌కీ బాత్‌ లు మాయమాటలకే తప్ప ఈ దేశాన్ని సుస్థిరం చేయడానికి మాత్రం కాదు. ఈ దేశాన్ని అవుర్‌ ఏక్‌మాల్‌ సరుకులా కార్పోరేట్లకు అమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశప్రయోజనాలేమి అవసరం లేదు. ఈ దేశం హిందువులది మాత్రమేనని ప్రజల్ని పక్కదారి పట్టించి ఈ చట్టం పేరుతో విభజించాలని చూస్తున్నారు. అసలు హిందుత్వ అన్న పదాన్ని వారి నాయకుడు ఈ దేశంలో తమరాజకీయలకు బీజం వేసిన వీరసావర్కర్‌ 1923లో కనిపెట్టారు. దాన్నొక సిద్దాంతంగా 1989లో భాజాపా స్వీకరించింది. అప్పటి నుండే ఈ విధ్వంస రాజకీయాలకు శంఖుస్థాపన జరిగిందనవచ్చు. మతం ప్రమాదంలో ఉందని పిలుపునివ్వడం తద్వారా తమ పార్టీకి మెజార్టీ ప్రజలు తమ సంపూర్ణ రాజకీయ మద్దతు కూడగట్టుకోవడం, హిందువుంతా బంధువులనడం, హిందువులంతా ఏకంగావాలని పిలుపునిచ్చి రెచ్చగొట్టి తద్వారా ఓట్లతో నోట్లతో రాష్ట్రాలను తమ కబంధహస్తాల్లోకి లాక్కోవడం. ఈ మతోన్మాదవైఖరి వల్లే ఈ దేశంలో ఉన్మాదచేష్టలు మితిమీరిపోతున్నాయి. మతంలో అత్యధికభాగం కులంతో ముడిపడి ఉండటం వల్ల వాళ్ళ ఆటలు అవలీలగా సాగుతున్నాయి.

వాళ్ళ పునాదులు కదిలించే ఆయుధాలను సిద్దం చేసుకుని పీఠాన్ని కూలదోసే శక్తి ఒక్క ఓటుతోనే సాధ్యం. ఏ ఎన్‌ఆర్‌సీలు సీఏఏలు మనల్ని భయపెట్టలేవు. ఈ పుస్తకం ప్రతి పౌరుడు చదవాలి. ఈ పుస్తకం ప్రతిభాషలోకి అనువదించబడాలి.

One thought on “ఎవడ్రా ఈ నేల నాది కాదన్నది..?

  1. Citizenship is necessary for any country —-India is not Hindu country —as per our constitution –
    India belongs to Hindus -Muslims and Christian’s—what BJP creating in the country is wrong
    ============nuchireddy gangula

Leave a Reply