నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలు,పేపర్ లీకేజీ జరిగిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి, సమగ్ర దర్యాప్తు జరిపాలని సీబీఐ ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి కేంద్రంలోని భాజపా సర్కారు వైఫల్యంతోనే వరుసగా పేపర్ లికేలీలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని చర్చకు లేకుండా భాజపా అనుకూల విద్యార్థి సంఘం ఎబివిపి,గోది మీడియా, వ్యక్తులు కేవలం పరీక్ష నిర్వాహణ సంస్థ ఎన్టీఏ తప్పిదంగా పరిమితం చేస్తూ విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు.మే 3, 2026న జరిగిన నీట్ ,యూజి 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు, రాజస్థాన్లోని సీకర్ కోచింగ్ సెంటర్ లో గెస్ పేపర్ పేరుతో లీక్ పేపర్లు వాట్సాప్/టెలిగ్రామ్ ద్వారా అమ్మకం జరిగినట్లు బయటపడింది.మహారాష్ట్రలోని నాసిక్లో ప్రింటింగ్ ప్రెస్ నుండి పేపర్ లీక్ అయ్యిందని ప్రాథమికంగా నిర్ధారించారు. 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ జాతియ స్థాయి పరీక్ష రద్దు కావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.2024 నుండి వరుసగా పేపర్ లికేలీలు జరుగుతున్నా భాజపా సర్కారు చేపట్టిన చర్యలు ఏమిటి? ఇది ముమ్మాటికీ మోడీ సర్కారు వైఫల్యమే. నిజానికి నీట్ పరీక్షనే ఒక అన్యాయపు పరీక్ష.ఈ పరీక్ష నిర్వాహణను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పేద,గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు నీట్ పరీక్ష ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారు. కొంత మంది ధనిక, మద్యతరగతి కుటుంబాల ప్రజలు నీట్ ద్వారా తమ పిల్లలను వైద్య విద్య చదివించాలని ఆశపడుతున్నప్పటికీ అందులో జరుగుతున్న మోసాలతో ప్రతిసారీ బలౌతూ, తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవడం, విద్యార్థుల సమయం వృధా అవ్వడం పరిపాటిగా మారింది.అయితే ఎంబిబిఎస్ సీట్లు పరిమితంగా ఉండటం, కోర్సు పూర్తి అయిన తరువాత ఉద్యోగం,ఉపాది అవకాశాలు ఉండటంతో తల్లిదండ్రులు ఎలాగైనా తమపిల్లలను వైద్య విద్యలో చేర్పించాలనే ఉద్దేశాన్ని దేశంలో కార్పోరేట్,ప్రైవేటు విద్య సంస్థలు,కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి.ప్రతి ఏడాది ఎదో విధంగా పేపర్ లీకేజీకి పాల్పడుతూ తమ కోచింగ్ సెంటర్ల నుంచి విద్యార్థులు తప్పుడు మార్గంలో ర్యాంకులు సాధించేలా పకడ్బందీగా పథకం అమలు చేస్తున్నారు. తద్వారా విద్యార్థులను,వారి తల్లిదండ్రులను ఆకర్షించి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి పరీక్ష ఏజెన్సీ ఎన్టిఏ లో పనిచేసే వ్యక్తుల సహాకారం,దళారుల ప్రమేయం, రాజకీయ నాయకుల ప్రొద్బలం కూడా తోడైవుంది. 2024 నుండి నేటి వరకు వరుసగా మూడుసార్లు పేపర్ లీకేజీ జరిగినట్లు బహిర్గతమైంది. దీంతో అసలు ఈ దేశంలో లీకేజీ జరగని పరీక్ష ఉందా అనే అనుమానం రాకమానదు. బీహార్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ లో కూడా పేపర్ లీకేజీ జరిగింది. తెలంగాణలోని శ్రీచైతన్య, నారాయణ , ట్రినిటీ వంటి సంస్థల్లో పనిచేసే ఎజిఎం లు, ఉపాధ్యాయులు గతంలో ఎంసెట్, జెఈఈనీట్ పేపర్ లీకేజీ ఘటణలలో పాల్పొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పోరేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు ర్యాంకులు నిజానికి విద్య బోధన ద్వారా కాకుండా లీకేజీల ద్వారా రప్పించి ఆయా కాలేజీల్లోని ఒకటి రెండు శాతం మందికి ర్యాంకులు సాధించేలా చేస్తూ తమ కాలేజీల్లో మిగిలిన వేలాది మంది విద్యార్థులు అరకొర మార్కులతో పాసవుతున్నా ఆ వివరాలు బయటికి రాకుండా చేస్తున్నారు. వేల సంఖ్యలో ఫెయిల్ అవుతున్నా విషయాన్ని బయటికి రానివ్వకుండా తమ వ్యాపారం సజావుగా జరిగేలా చూస్తున్నారు. ఈసారి లీకైనా నీట్ ప్రశ్నాపత్రం కూడా హైదరాబాద్ కు చెందిన కార్పోరేట్ కోచింగ్ సెంటర్లు కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తెలంగాణ సర్కారు ఈ అంశంపై దర్యాప్తు జరపాలి. అదే సందర్భంలో పరీక్షల నిర్వహణలో విఫలమైన స్వాతంత్ర్య టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా వైద్య విద్య, సాంకేతిక విద్య,ఆయా వర్శిటీల బోర్డులు తదితర విభాగాల ద్వారా ఎంట్రెన్స్ పరీక్షలు జరపాలని, ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రాలు ఉండాలని డిమాండ్ చేయాలి. అనేక వివాదాలకు కారణమవుతున్న నీట్,జెఈఈ,నెట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణను సమీక్షించాలి.
నీట్ ద్వారా పేదలకు అందని వైద్య విద్య :
దేశంలో ఎంబిబిఎస్ (మెడిసిన్), అగ్రికల్చర్, హర్టికల్చర్, వెటర్నరీ వంటి ప్రొఫెషనల్ చదువులు సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి లేకుండా ఒక మహత్తరమైన కుట్ర జరుగుతున్నది. ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్న మనువాద కుట్రనే. ఈ కుట్రకు బలైతున్నది పేద బహుజన ప్రజలు. మన దేశంలో ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం వైద్య విద్యను కొన్ని వర్గాలకు పరిమితం చేసిన మన దేశ బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, దానిని కాపాడుతున్న విదేశీ-స్వదేశీ పెట్టుబడిదారులు కూడా. మెడికల్ విద్యలో పేద విద్యార్థులపై కుట్రలు ఎంట్రన్స్ ఎగ్జామ్ నుండి ప్రారంభమైతాయి. మెడిసిన్ సీటు కొరకు దేశ వ్యాప్తంగా జరిగే అర్హత పరీక్ష నీట్ (NEET) పరీక్ష గురించి పేదలైన దళితులకు, ఆదివాసీలకు, వెనకబడిన కులాలకు ఏమాత్రము అవగాహన కల్పించరు. ఈ పరీక్ష స్థానిక ప్రాంతీయ భాషలలో కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో జరగుతుండటంతో దక్షిణాది పేద విద్యార్థులు రాణించలేకపోతున్నారు. ఇప్పటికీ పేదలు చదివే ప్రభుత్వ బడుల్లో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ విద్య భోదన అభివృద్ధి కాకపోవడం ఇందుకు ప్రధాన కారణం. 1857 తొలి సిఫాయిల తిరుగుబాటు వరకు దళిత బహుజనులకు విద్యను భోధించేందుకు బ్రాహ్మణ సమాజం నిరాకరించింది. పీడిత ప్రజల తిరుగుబాటును పక్కదారి పట్టించే కార్యక్రమంగా అంటరాని వారికి విద్యనందించాలనే హంటర్ కమీషన్ నివేదిక ఆధారంగా బ్రిటిష్ వలస పాలకులు విద్యాకార్యక్రమంతో ముందుకు వచ్చారు. వారు నేర్పే విద్య వారి వాణిజ్య వ్యాపారాలు చక్కబెట్టేదిగా ఉంటే, నేటి అర్ధ వలస బ్రాహ్మణవాద, మనువాద పాలకులు అందిస్తున్న విద్య ఒక వర్గం మరో వర్గాన్ని పచ్చి అజ్ఞానంలో ఉంచుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో అణచివేత, దోపిడీ కొసాగించేందుకు అత్యంత అనువుగా ఉంది.నాటి నుండి నేటివరకు దేశవ్యాప్తంగా పేదల పిల్లలు సంవత్సరాలుగా చదువుతున్నది ఆర్ట్స్ సబ్జెక్టులు మాత్రమే. అందులో బిఏ, బిఏ లిటరేచర్, ఎంఏ, ఎంఏ లిటరేచర్, ఇంటిగ్రేటెడ్ ఎంఏ వంటి కోర్సులు. అందులో బోదించే పాఠాలు మహాభారతం, రామాయణంలోని పద్యాలు, కల్పిత కథలు. ఇక పాలకులు ఇస్తున్న బిఎస్సీ డిగ్రీలతో నిరుద్యోగం పెరిగిందే తప్ప ఉపాధి దొరికింది లేదు. అగ్రకుల భూస్వాముల పిల్లలు, ధనికుల పిల్లలు యంబిబిఎస్ సీటును కోట్లు పెట్టి కొంటున్నారు. వ్యాపార దృక్పథపు మెడికల్ చదువులు మెడికల్ మాఫియా వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహించుతున్నాయి. అవసరమైతే పేపర్ లికేలీలకు పాల్పడుతున్నారు. పేపర్ లీకేజీల ద్వారా అక్రమంగా ర్యాంకులు పొందుతూ కష్టపడి చదివే పేదలను వెనక్కి నెడుతూ అడ్మీషన్ దొరకకుండా చేస్తున్నారు. వైద్య విద్య అందించడంలో అసమానతలు రాజ్యమేలుతున్నాయి.
నీట్ ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు :
రాజస్థాన్ రాష్ట్రం కోటా నగరంలో , హైదరాబాద్, విజయవాడ తదితర పట్టణాల్లో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి. ఇక్కడ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు తమ వద్ద కోచింగ్ లో చేరితే దేశంలోనే పేరుపొందిన యూనివర్సిటీలు, వైద్య సంస్థలు, ఐఐటి ఇతర సంస్థల్లో తప్పకుండా అడ్మిషన్ పొందొచ్చు, ప్రభుత్వ కొలువులు సాధించవచ్చు అని ప్రకటనలు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుంది విద్యార్థులు వేల సంఖ్యలో కోటా నగరం, హైదరాబాద్ విజయవాడ నగరాల్లోని కార్పోరేట్ కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయల ఫీజు చెల్లించి చేరుతున్నారు. కేవలం కోచింగ్ సెంటర్లు జారీ చేసే ప్రకటనలను చూసి చేరుతున్న విద్యార్థులు అక్కడి నిర్బంధ విద్య పరిస్థితులు తట్టుకోలేక, హాస్టళ్ళలో కనీస సౌకర్యాలు లేక, నీట్ పరీక్ష భయంతో అనుకున్న లక్ష్యాన్ని చేరలేమనే భావనతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొందరు హాస్టల్ భవనంపై నుంది దూకి, మరికొందరు సీలింగ్ ఫ్యానికి ఉరి వేసుకొని, కొందరు సూసైడ్ నోట్ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఈ ఆత్మహత్యలకు పాలకవర్గాలు ప్రత్యక్ష కారకులైతే తల్లిదండ్రులు పరోక్ష కారకులుగా మారుతున్నారు. తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలనే ఉద్దేశంతో విద్యార్థుల అభిష్టాన్ని గౌరవించకుండా జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు తయారవ్వాలని బలవంతంగా ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేర్చిస్తున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు కష్టపడి కూడపెట్టుకున్న డబ్బుతో పాటు ఎంతో విలువైన తమ బిడ్డలను కోల్పోతుండడం గమనర్హం. రాజస్థాన్ రాష్ట్రం కోటా నగరంలోని కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల మరణాలు గమనిస్తే 2023 సంవత్సరంలో 26 మంది ,2024 లో 17 మంది, 2025 లో 15 మంది విద్యార్థులు చనిపోయారు. ఒక కోటా నగరంలోనే 2015 నుండి 2026 వరకు 131 మంది విద్యార్థులు చనిపోయారు. హైదరాబాద్ , విజయవాడ నగరాల్లోని కార్పోరేట్ కోచింగ్ సెంటర్లు, కళాశాలలో కూడా ఇదే స్థాయిలో మరణాలు సంభవించాయి. నమోదుకాని ఆత్మహత్యల సంఘటణలు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి. ఆసలు విద్యార్థుల మరణాలకు కారణమైన ప్రవేశ పరీక్షలలో పోటీ విధానాన్ని ఎత్తివేయకుండా, కోచింగ్ సెంటర్లను రద్దు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే విద్యార్థుల మరణాలకు కారణమవుతున్నాయి. నేటికీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్య మాఫియా యదేచ్ఛగా చెలరేగుతున్నది. గుజరాత్ లోని కోచింగ్ సెంటర్లు, తెలంగాణలోని శ్రీ చైతన్య నారాయణ,ఆకాశ్,అలెన్,ట్రినిటి, భాష్యం తదితర కార్పొరేట్ విద్య సంస్థలలు విద్యార్థుల పాలిట మరణకుపాలుగా మారాయి. ఈ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి ర్యాంకుల పేరుతో ప్రకటనలు ఇస్తున్నటువంటివే. ఏడాదికి వందల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నప్పటికీ ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోలేదు. మరోవైపు నూతన విద్యా విధానంలో ప్రైవేటు దాతృత్వ సంస్థలు విద్యాసంస్థలను నెలకొల్చి ఫీజులు వసూలు చేయవచ్చు అని కేంద్ర ప్రభుత్వమే పేర్కొంది.
మన విద్యా విధానంలో పేదలు, మధ్య తరగతి విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులను చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎంబిబిఎస్, నాణ్యమైన ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్య కోర్సులు చదవాలంటే ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆధారపడవలసి ఉంటుంది. చేతి వేళ్లపై లెక్కపెట్టగలిగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీటు పొందాలంటే అందుకు తప్పనిసరిగా లక్షలాది రూపాయలు ధారపోసి ప్రవేటు కోచింగ్ సెంటర్లలో చేరాల్సిందే. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలు లేవు. విద్యార్థుల అభిష్టానికి అనుగుణంగా, అభిరుచికి అనుగుణంగా నచ్చిన కోర్సును ఉచితంగా చదివే అవకాశం కల్పించడంలో మన విద్యా విధానం పూర్తిగా విఫలమైంది. ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ప్రతిభ ఆధారిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ ర్యాంకులు, మార్కులే కొలమానంగా చూస్తున్నారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను ఏమాత్రం కొలమానంగా చూడడం లేదు. అనేక ఏళ్లుగా సామాజిక వివక్షను అనుభవించిన సమూహాల విద్యార్థులు ఇంగ్లీషులో,హిందీలో ప్రవేశ పరీక్షలు రాయడంలో వెనుకబడుతున్నారు. కేవలం ప్రైవేటు కార్పోరేట్ వ్యాపార వర్గాల మెప్పుకోసం ప్రొఫెషనల్ విద్యను పేదవారికి అందుబాటులోకి తేకుండా అందని ద్రాక్షలా మార్చుతున్నారు పాలకులు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బిఏ ) కోర్సులు చదివేందుకు రాష్ట్రాలలో విద్యాసంస్థలలో ఎలాంటి ప్రవేశ పరీక్షలు లేకుండా ఆయా కోర్సులు చదువుకోవాలనుకునే విద్యార్థులందరికీ అవకాశం ఇస్తున్నట్టి ప్రభుత్వాలు కేవలం వృత్తివిద్య కోర్సుల విషయంలో పోటీ పరీక్షలను పెడుతూ విద్యార్థులలో అనవసరపు పోటీ అసహనం, భయం, బాధ, కోపం వంటి చర్యలను పురికొల్పుతున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకునే హక్కును కాలరాస్తున్నారు. మానవ సమాజ అభివృద్ధి క్రమంలో అనేక పరిశీలినలు ప్రయోగాల ద్వారా పొందిన, పొందుతున్న జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు, పోటీ లేకుండా ఉచితంగా అందించాల్సిన బాధ్యత నేటి పాలకులపై ఎంతైనా ఉన్నప్పటికీ వారు విస్మరిస్తున్నారు. ఈ విషయంలో విఫలమైన పాలకులను నిలదీస్తూ నిరంతరం విద్యార్థులు పోరాటాలలో మమేకమవ్వాలి.
తేది:13.05.2026.
-కోట ఆనంద్, ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 8712352122.




