రౌండ్‌ టేబుల్‌ సమావేశం
25 జనవరి 2023, హైదరాబాదు
ప్రెస్‌ నోట్‌

ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న మేము జనవరి 11వ తేదీన దక్షిణ బస్తర్‌లోని కిష్టారం`పామేడు ప్రాంతంలో జరిగిన సైనిక దాడికి దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లలో కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు వెళ్లి బాంబులు దాడులు చేశాయి. ఈ దాడిలో పొట్టం హంగి అనే ఆదివాసీ యువతి మృతి చెందింది. రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం తానే ఈ దేశ ప్రజలపై  వైమానిక యుద్ధం చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. మానవతకు వ్యతిరేకం. భారత ప్రజలు అనేక ప్రక్రియల ద్వారా, పోరాటాల ద్వారా స్థాపించిన ప్రజాస్వామిక, మానవీయ విలువలను ప్రభుత్వాలే కాలరాస్తున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ.   మన ప్రజాస్వామ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నదని ఈ ఘటన తెలియజేస్తోంది. సామాజిక ఆర్థిక సాంస్కృతిక సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు వాటిని మరింత పెంచుతూ పోయి చివరికి ఇలాంటి యుద్ధ నిర్ణయం తీసుకున్నారు.  

మానవ ఆవాసాల మీద దాడులు చేయకూడదని, ప్రజలను లక్ష్యం చేసుకొని ఏ సైనిక చర్యా చేపట్టకూడదని అంతర్జాతీయ యుద్ధ నియమాలు కూడా చెబుతున్నాయి. పొరుగు దేశాల మీద యుద్ధాల్లో సహితం పాటించాల్సిన నియమాలను భారత ప్రభుత్వం  తన ప్రజల దగ్గరే పాటించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధానికి వ్యతిరేకంగా శాంతిని, మానవ హక్కులను కోరుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ఇలా ప్రజలపై యుద్ధాన్ని ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నది. 

గత కొన్నేళ్లుగా దండకారణ్య ప్రాంతంలో ఇలాంటి సైనిక దాడులు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 2021లో, 2022లో మానవ రహిత డ్రోన్ల ద్వారా చాలా ప్రాంతాల్లో బాంబులు వేశారు. మధ్య భారత ఆదివాసీ ప్రాంతంలోని వందలాది ఖనిజాల మైనింగ్‌ను ఆదివాసులు వ్యతిరేకిస్తున్నందు వల్లనే ప్రభుత్వం ఈ యుద్ధానికి దిగిందని మేం భావిస్తున్నాం. కార్పొరేట్‌ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గనుల తవ్వకాలకు అనేక ఒప్పందాలు చేసుకున్నాయి.  పెసా చట్టం ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లోకి గ్రామ సభల తీర్మానం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదు. రాజ్యాంగంలోని 5 షెడ్యూల్‌ ఆదివాసులకు ప్రత్యేక రక్షణను హామీ పడిరది. కానీ పాలకులు వీటన్నిటినీ పక్కన పెట్టి ఆదివాసీ ప్రాంతాల్లో గనుల తవ్వకానికి కార్పొరేట్లకు అనుమతి ఇస్తున్నారు. గనుల తవ్వకాలను వీలుగా భారీ రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారు. ఆదివాసుల నిరసనలను ఎదుర్కోడానికి వందలాది సైనిక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. సిఆర్‌పిఎఫ్‌, కోబ్రాలు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డులు, బిఎస్‌ఎఫ్‌లకు చెందిన లక్షలాది బలగాలకు స్థావరాలు నిర్మిస్తున్నారు.  

చత్తీస్‌ఘడ్‌`తెలంగాణ సరిహద్దుల్లో కూడా 20 దాకా ఇలాంటి క్యాంపులు ఉన్నాయి. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాల్లో ఇలాంటి  సైనిక క్యాంపులు ఏర్పాటు  చేస్తున్నట్లు ఇటీవల తెలంగాణ డీజీపీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా పని చేస్తానని, ఫెడరల్‌ వ్యవస్థను కాపాడతానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆదివాసుల విషయంలో కేంద్ర విధానాలనే అనుసరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి నమూనా వల్లనే ఈ అణచివేత కొనసాగుతున్నది. దాని పర్యవసానమే  ఆదివాసీ ప్రాంతాల సైనికీకరణ. ఈ అభివృద్ధి నమూనా మీద కొన్ని దశాబ్దాలుగా దేశంలో విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రజలకు మేలు చేయదని సామాజిక రాజకీయార్థిక నిపుణులు చెబుతూ వచ్చారు. అయినా పాలకులు తమ పద్ధతులను కొనసాగిస్తున్నారు. అందులో భాగమే  దేశ ప్రజలందరికీ వర్తించే సహజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడానే నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. దీన్ని అంగీకరించని ఆదివాసులను అణిచి వేయడానికి, వాళ్లను అడవి నుంచి ఖాళీ చేయించడానికి,  నిర్మూలించడానికి వైమానిక దాడులకు పాల్పడుతున్నది. ఇది ఈ దేశ ప్రజలపై జరుగుతున్న కార్పొరేట్‌ యుద్ధం. ఇది సైనికీకరణగా వైమానిక దాడుల రూపంలో ఉధృతమైంది. 

ఈ వైమానిక దాడులు భారత రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. సమాజంలో మానవీయ విలువలు, ప్రజాస్వామిక ప్రక్రియలు కొనసాగాలని కోరుకొనే మేం ఈ చర్యలను నిరసిస్తున్నాం.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై వైమానిక దాడులతో సహా అన్ని రకాల నిర్బంధాలను ఆపేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ధోరణి ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి ప్రభుత్వ చర్యలను పౌర సమాజం తీవ్రంగా నిరసించింది.  పాలకులపై ఒత్తిడి తెచ్చింది. ఆ పని గతంకంటే మరింత ఉమ్మడిగా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కృషి చేయడంలో రాజకీయపార్టీలతో సహా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు

    తెలంగాణ

  • 1. ప్రొ. హరగోపాల్‌
  • 2. ప్రొ. కె. లక్ష్మీనారాయణ
  • 3. ప్రొ. డి నరసింహారెడ్డి
  • 4. ప్రొ. సూరేపల్లి సుజాత
  • 5. ప్రొ.మాడభూషి శ్రీధర్‌
  • 6. ప్రొ. అన్వర్‌ఖాన్‌
  • 7. ప్రొ. పిఎల్‌. విశ్వేశ్వరరావు
  • 8. ప్రొ. పద్మజాషా
  • 9. కె. రామచంద్రమూర్తి
  • 10. కె. శ్రీనివాస్‌
  • 11.ప్రొ. కల్పనా కన్నబిరన్‌
  • 12. కె. శివారెడ్డి
  • 13. ప్రొ. కోదండరాం
  • 14. చూపు కాత్యాయని
  • 15. పాశం యాదగిరి
  • 16. డి. మార్కండేయ
  • 17. ఎకె ప్రభాకర్‌
  • 18. సజయ
  • 19. యాకూబ్‌
  • 20. జీవన్‌కుమార్‌(హెచ్‌ఆర్‌ఎఫ్‌)
  • 21. అంబటి నాగయ్య
  • 22. ప్రొ. లక్ష్మణ్‌(సిఎల్‌సి)
  • 23. ఎన్‌. వేణుగోపాల్‌
  • 24. ఎస్‌ ఎ డేవిడ్‌
  • 25. కె. సాంబశివరావు(సిపిఐ)
  • 26. సాదినేని వెంకటేశ్వర్లు(న్యూ డెమెక్రసీ)
  • 27. అరుణోదయ విమల
  • 28 జ్యోతి(సిఎంఎస్‌)
  • 29. బల్ల రవి(సిఆర్‌పిపి)
  • 30. రవిచంద్ర
  • 31. సత్య(ఎబిఎంఎస్‌)
  • 31. పాణి 
  • ….తదితరులు

Leave a Reply