ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ కు తొమ్మిది రోజుల్లో పర్యావరణ అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. నమ్మశక్యం కానీ ఉద్యోగాల సంఖ్య, భారీ ప్రోత్సాహకాలతో, ఆంధ్రప్రదేశ్ ఎఐ మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నం, దేశంలో డేటా సెంటర్ల విషయంలో ఉన్న నియంత్రణా లోపాన్ని బట్టబయలు చేస్తోంది.

తర్లవాడలోని వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్, అనకాపల్లిలోని వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్లకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ప్లాన్స్ (పర్యావరణ నిర్వహణ ప్రణాళికలు) లోని ఒక పేజీలో షాపింగ్ మాల్కు సంబంధించిన నీటి పొదుపు లెక్కలను పొందుపరిచారు. ఈ రెండు పత్రాలలోనూ, ఘన వ్యర్థాల నిర్వహణ వివరాలు కూడా ఒక షాపింగ్ మాల్కు ఉన్నట్లే ఉన్నాయి. అయితే ఈ రెండు ప్రాజెక్టులలో ఏదీ కూడా షాపింగ్ మాల్ కాదు. ఇది అదానీ గ్రూప్నకు చెందిన ప్రాజెక్టుల కన్సల్టెంట్ అయిన ‘పృథ్వి ఎన్విరోటెక్’ చేసిన ముద్రణ లోపం (టైపోగ్రాఫిక్ ఎర్రర్) కావొచ్చు లేదా టెంప్లేట్ సమర్పణ కావొచ్చు. కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ల హడావిడిని, తన లక్ష్యాలను చేరుకోవడానికి రాష్ట్రం తీసుకుంటున్న అడ్డదార్లను సరిగ్గా కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిలిచిపోయిందని, ఆయన కంటే ముందు అధికారంలో ఉన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పదవీ కాలంలో పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రం నుండి వెనక్కి వెళ్లిపోయాయనేది— 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రచార ప్రధానాంశం.
హైదరాబాద్కు ప్రపంచ సాంకేతిక పెట్టుబడులను తీసుకువచ్చాననే వాదనపైనే చంద్రబాబు నాయుడి టెక్నోక్రాట్ (సాంకేతిక నిపుణుడి) గుర్తింపు నిర్మితమైంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్, దాని పన్ను ఆదాయం తెలంగాణకు వెళ్ళిపోవడంతో, ఆయన ప్రతిష్టను మరింత బలోపేతం చేసుకోవడానికి అటువంటి విజయాన్ని మళ్ళీ పునరావృతం చేయడం ఒక అనివార్యతగా మారింది. 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పణంగా పెట్టిన ప్రతిపాదిత కొత్త రాజధాని నగరం అమరావతి ఆశించిన మేర పురోగతి సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆయన వారసుడైన జగన్ రెడ్డి దీనిని పక్కన పెట్టేసాడు.
2024 జూన్లో టిడిపి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ, బీజేపీలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకమైన విధానాలను ప్రవేశపెట్టింది. ఇందులో డేటా సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా ఒకటి.
గడిచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ‘ఎఐ డేటా సెంటర్లు’ అత్యంత ప్రాధాన్యతాంశంగా అవతరించాయి. అమెరికా వెలుపల గూగుల్ సంస్థకుచెందిన అతిపెద్ద ఎఐ హబ్కు రాష్ట్రం నిలయంగా మారడం, ప్రభుత్వం పెట్టుబడుల కోసం చేస్తున్న కృషికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఏప్రిల్ 28న విశాఖపట్నంలో జరిగిన భూమిపూజ (శంకుస్థాపన) కార్యక్రమంలో చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును హైదరాబాద్లోని ఐటీ, ఆర్థిక వ్యాపార ప్రాంతమైన ‘సైబరాబాద్’తో పోల్చారు. అలాగే దీనిని రాష్ట్రానికి తీసుకువచ్చిన ఘనత తన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఇప్పటివరకు లోకేష్ గారి కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పే అత్యంత ప్రముఖమైన విజయంగా నిలిచింది.
విశాఖపట్నం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో, తీరప్రాంతం వెంబడి మల్టీ-గిగావాట్ ప్రాజెక్టులతో భారతదేశంలోనే అతిపెద్ద ఎఐ మౌలిక సదుపాయాల హబ్ను పెంపొందించడంపైన ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. 2025 చివరి నాటికి, భారతదేశంలో మొత్తం స్థాపిత డేటా సెంటర్ సామర్థ్యం సుమారు 1.5 గిగావాట్గా ఉండగా, కేవలం విశాఖపట్నం పరిసరాల్లో ప్రతిపాదించిన ప్రాజెక్టులే భారతదేశ డేటా సెంటర్ సామర్థ్యానికి అదనంగా సుమారు 3 GWగిగావాట్లను జోడించనున్నాయి.
ప్రభుత్వం పెడుతున్న ఈ పందెం భారీ నష్టాన్ని మిగులుస్తుందా?
ఎన్డిఎ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 2024లో తన ‘డేటా సెంటర్ పాలసీ 2024-2029’ను ప్రారంభించింది. ఈ విధానంలో నిర్దేశించుకున్న లక్ష్యం ఏమిటంటే, డేటా సెంటర్ సామర్థ్యాన్ని 1 గిగావాట్ వరకు పెంచడం. ప్రత్యేకంగా రూపొందించిన ప్రోత్సాహకాల ప్రయోజనాన్ని పొందేందుకు, పెట్టుబడి పెట్టే కంపెనీలు కనీసం 50 మెగావాట్ల సామర్థ్యమూ, రూ. 5,000 కోట్ల పెట్టుబడితో కూడిన ప్రాజెక్టులను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఈ నిబంధన చాలా చిన్న కంపెనీలను పందెం నుండి పక్కకు నెట్టివేసింది.
గూగుల్-అదానీ ప్రాజెక్టుకు ప్రోత్సాహకాల రూపంలో రూ. 22,000 కోట్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు సాంకేతికతను అందిస్తుంది. అదానీ గ్రూప్ డేటా సెంటర్లను నిర్మించి, నిర్వహిస్తుంది. అలాగే ‘నెక్స్ట్రా ఎయిర్టెల్’ ఫైబర్ కనెక్టివిటీని, సబ్సీ (సముద్రగర్భ) కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను చూసుకుంటుంది.
గడిచిన రెండేళ్లలో ఒకే ఒక కార్పొరేట్ సంస్థకు ఇంత భారీ స్థాయిలో రాయితీలు కేటాయించడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మే 20న విజయనగరంలో గిగా-స్కేల్ ఎఐ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్కు కూడా ప్రభుత్వం ఇలాంటిదే రూ. 19,000 కోట్ల భారీ రాయితీ ప్యాకేజీని కేటాయించింది.
2025లో అదానీ గ్రూప్ 2035 నాటికి 100 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా తన వాటాను పెంచుకునే ప్రణాళికలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 5 గిగావాట్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలనేది ఈ గ్రూప్ లక్ష్యం. ఇందులో దాదాపు 2.5 గిగావాట్ల సామర్థ్యం కేవలం ‘గూగుల్-అదానీ’ ప్రాజెక్టు ద్వారానే సమకూరనుంది.
గూగుల్-అదానీ డేటా సెంటర్ను సాధారణంగా 1 గిగావాట్ ప్రాజెక్టుగా విస్తృతంగా చర్చించారు. అనేక ప్రభుత్వ ఉత్తర్వులలో (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్) కూడా ప్రతిపాదిత సామర్థ్యం 1 గిగావాట్ గానే ఉంది. కానీ రాంబిల్లి, తర్లవాడ, అడవివరం డేటా సెంటర్లకు చెందిన చట్టబద్ధమైన ఫైలింగ్లు (స్టాట్యుటరీ ఫైలింగ్స్) వేరే కథను చెబుతున్నాయి. విశాఖపట్నంలో అదానీ నిర్వహిస్తున్న ఈ మూడు డేటా సెంటర్ల సామర్థ్యం సుమారు 2.5 గిగావాట్ల వరకు ఉంటుందని అంచనా.

మానవ హక్కుల వేదికకి చెందిన గుత్తా రోహిత్ ‘ఫ్రంట్లైన్’తో మాట్లాడుతూ: “ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటి నుండి, ఇది 1 గిగావాట్ డేటా సెంటర్ అని ప్రజలకు చెప్పారు. కానీ ఇప్పుడు రెండు డేటా సెంటర్లకు అనుమతులు మంజూరయ్యాయి. మరొకటి అనుమతుల ప్రక్రియలో ఉంది. ఇవన్నీ అదానీ యాజమాన్యంలోనివే. అయినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ కన్సల్టేషన్) జరగలేదు” అని అన్నారు. మానవ హక్కుల వేదిక అనేది అదానీ ప్రాజెక్టుపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఒక హక్కుల సంఘం.
గూగుల్ వెనుక దాగుడుమూతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘గూగుల్’ బ్రాండ్ పేరును ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి పునరుజ్జీవన గాథను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి; ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వ ఖజానా నుండి రూ. 22,000 కోట్ల భారీ కేటాయింపులను సమర్థించుకోవడానికి సహాయపడింది. కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ఆరు నెలల్లో జారీ చేసిన పలు ప్రభుత్వ ఉత్తర్వులు పారదర్శకత, ప్రజా జవాబుదారీతనం లోపించడాన్ని బట్టబయలు చేశాయి.
ఎఐ డేటా సెంటర్ కోసం గూగుల్-అదానీ భాగస్వామ్యాన్ని అక్టోబర్ 2025లో ప్రకటించారు. ఈ ప్రోత్సాహక ప్యాకేజీలో ప్రారంభంలో గూగుల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ‘రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా’ (రైడెన్) ను లబ్ధిదారుగా పేర్కొన్నారు. డిసెంబర్ 2న జారీ చేసిన ఒక ప్రభుత్వ ఉత్తర్వులో, అదానీ, ఎయిర్టెల్లను అధికారికంగా రైడెన్కు చెందిన నోటిఫైడ్ భాగస్వాములుగా గుర్తించారు; తద్వారా వారు కూడా మంజూరైన ప్రోత్సాహకాలను పొందేందుకు అర్హులయ్యారు.
అక్టోబర్లో, ఈ ప్రాజెక్టుకు మూడు ప్రాంతాలలో కలిపి 480 ఎకరాల భూమిని కేటాయించారు; కానీ ‘రైడెన్’ అభ్యర్థన మేరకు, వరుస ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా దీనిని మూడు ప్రాంతాలలో కలిపి 601.4 ఎకరాలకు పెంచారు. ఈ సవరణకు గల కారణాల గురించి బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారంలో ఎలాంటి వివరణా లేదు.
ప్రభుత్వం ఈ భూమి పత్రాలను అదానీకి బదిలీ చేసింది. 2026 జనవరి 12 నాటి ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం—అదానీ గ్రూప్కు చెందిన ఇంజనీరింగ్-ప్రొక్యూర్మెంట్- కన్స్ట్రక్షన్ విభాగమైన ‘అదానీ ఇన్ఫ్రా’, మూడు ప్రాంతాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను సమర్పించిందని, అలాగే ఆయా ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన మూడు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ప్రత్యేక ప్రత్యేక ప్రయోజన వాహనాలు – ఎస్పివి) 100 శాతం అదానీ ఇన్ఫ్రా అనుబంధ సంస్థలుగా ఉంటాయని పేర్కొంది. గుత్తా రోహిత్ మాట్లాడుతూ: “‘అదానీ’ అనే పేరు తిరస్కరణకు, హేళనకు దారితీస్తుంది కాబట్టి, ప్రభుత్వం గూగుల్ బ్రాండ్ వెనుక దాక్కుంటోంది” అని అన్నారు.
ఈ ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు వేగవంతమైన, సులువైన అనుమతులను స్పష్టం చేస్తున్నాయి. నిజానికి, ఫిబ్రవరి 27 నాటి ఒక ఉత్తర్వు చివర్లో—రాష్ట్రానికి వచ్చిన “దేశంలోనే అత్యంత భారీ ఏకైక కార్పొరేట్ ఎఫ్డీఐ [విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి]”గా పేర్కొన్న ఈ ప్రాజెక్టు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చూడాలని సంబంధిత శాఖలన్నింటినీ ఆదేశించారు.
ఏప్రిల్ 17 నాటి ఒక ఉత్తర్వు ప్రకారం, అదానీ గ్రూప్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ ‘ఫంగిబిలిటీ క్లాజ్’ (నిధుల మార్పిడి నిబంధన)ను కోరింది. దీనిని అనుసరించి, రూ. 22,000 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి, వివిధ విభాగాల వారీగా బడ్జెట్ అంచనాలను సవరించుకోవడానికి అదానీకి అనుమతినిస్తూ ప్రభుత్వం ప్రోత్సాహక నిబంధనలను సడలించింది.
డేటా సెంటర్ల ఫ్లోర్-టు-సీలింగ్ (నేల నుండి పైకప్పు) ఎత్తుపై ఎటువంటి పరిమితులు లేకపోవడం, కిటికీల అవసరం నుండి మినహాయింపు, భవనాల పైకప్పులపై చిల్లర్స్ (శీతలీకరణ యంత్రాలు) ఉంచుకునేందుకు అనుమతి, ఎ ల్యాండ్-యూజ్ జోన్ (భూ వినియోగ జోన్) అయినప్పటికీ డేటా సెంటర్లను అనుమతించడం, నివాస గృహాల రేట్ల ప్రకారమే ఆస్తి పన్ను విధించడం వంటి మరికొన్ని సడలింపులను కూడా అదానీ ఎస్పివిలకు మంజూరు చేసినట్లు ఈ ఉత్తర్వులో ఉన్నాయి.
దరఖాస్తు చేసుకున్న తొమ్మిది రోజుల వ్యవధిలోనే, ఏప్రిల్ 18న అదానీ ఇన్ఫ్రా యాజమాన్యంలోని ఎస్పివిలు రాంబిల్లి, తర్లవాడలలోని రెండు డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతులను పొందాయి; ఇక అడవివరంలో మూడవది అనుమతుల ప్రక్రియలో ఉంది.
డిసెంబర్ 2 నాటి భూమి బదిలీ ఉత్తర్వు, ఈ ప్రాజెక్టును 1 గిగావాట్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి ఆమోదించింది. కానీ ఈ మూడు డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యం సుమారు 2.5 గిగావాట్లు వరకు ఉంటుంది, ఇది బహిరంగంగా ప్రకటించిన అంకెకు రెట్టింపు కంటే ఎక్కువ.
గుత్తా రోహిత్ మాట్లాడుతూ: “ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుండి ఒక ‘బ్లాక్ బాక్స్’ (రహస్యాల పుట్ట) లాగే మిగిలిపోయింది. తీవ్రమైన పర్యావరణ భారాలను కలిగించే ఇటువంటి ప్రాజెక్టుల కోసం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించలేదు” అని అన్నారు.
ఈ డేటా సెంటర్ ప్రాజెక్టును మానవ హక్కుల వేదిక అత్యంత తీవ్రంగా విమర్శిస్తోంది. అక్టోబర్ నుండి ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఈ సంస్థ డాక్యుమెంట్ చేస్తూ వస్తోంది. మే 31న, డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతాలలో ఒకటైన అడవివరంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం—ఇంకా అనుమతులు మంజూరు కాకముందే అక్కడ సాగుతున్న పనులను వేదిక సవాలు చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే, దేశంలోని డేటా సెంటర్లకు సంబంధించిన HRF యొక్క రెండు ఇన్స్టాగ్రామ్ (Instagram) పోస్టులను ఆ ప్లాట్ఫారమ్ నిలిపివేసింది (పరిమితం చేసింది). ఈ అంశంపై వివిధ 11 అకౌంట్లకు చెందిన సుమారు 20 లఘు చిత్రాలను (షార్ట్ వీడియోలను) సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ సెన్సార్ చేసిందని కూడా HRF ఒక ప్రకటనలో తెలిపింది.
పర్యావరణ సంబంధిత ఆందోళనలు
ఇతర దేశాల పరిధిలో 2.5 గిగావాట్ల పరిమాణంలో ఉండే ఒక ప్రాజెక్టుకు నెలల తరబడి పర్యావరణ పరిశీలన అవసరమవుతుంది. కానీ ఏప్రిల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (ఎపిఎస్ఇఐఎఎ) దరఖాస్తు దాఖలు చేసిన తొమ్మిది రోజుల వ్యవధిలోనే రెండు దరఖాస్తులను ఆమోదించింది. లోపిస్తున్న పారదర్శకత; ప్రజలపట్ల జవాబుదారీతనం గురించి స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు, నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ఈ వేగవంతమైన అనుమతుల్లోనే అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గూగుల్-అదానీ డేటా సెంటర్ల మూడు ప్రాంతాలు—తర్లవాడ (వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్), రాంబిల్లి (వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్), అడవివరం (వైజాగ్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్). ఇవి పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలలో ఉన్నాయి. వీటిని ఒకే ప్రాజెక్టుగా పరిగణించకుండా, ఎపిఎస్ఇఐఎఎ విడివిడిగా అనుమతులను మంజూరు చేసింది; దీనివల్ల అంత దగ్గరి పరిసరాల్లో మూడు హైపర్స్కేల్ డేటా సెంటర్లు ఏర్పాటు కావడం వల్ల కలిగే ఉమ్మడి ప్రభావాన్ని సరిగ్గా అంచనా వేసే అవకాశం లేకుండా పోయింది.
అంతేకాకుండా, భారతీయ చిరుతపులుల ఆవాసమైన ‘కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’కి కేవలం 1.53 కిలోమీటర్ల దూరంలో తర్లవాడ ఉంది. అడవివరం కూడా ఇదే సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉంది. రాంబిల్లి ప్రాంతం ఆరు రిజర్వ్ ఫారెస్ట్ల (రక్షిత అడవుల)తో చుట్టూతా ఉంది, ఇందులో అత్యంత సమీపంలో ఉన్న అడవి కేవలం 1.3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. రాంబిల్లి ప్రాంతం ‘ఐఎన్ఎస్ వర్ష’ అణు జలాంతర్గామి (న్యూక్లియర్ సబ్మెరైన్) స్థావరానికి కూడా చాలా దగ్గరగా ఉంది.
పర్యావరణ అనుమతులకు సంబంధించిన అత్యంత వివాదాస్పదమైన అంశాలలో ఒకటి ఏమిటంటే—చట్టబద్ధమైన ఫైలింగ్లలో ఉన్న వివరాలు, అంచనా కమిటీ (అప్రైజల్ కమిటీ) తేల్చిన ముగింపులకు విరుద్ధంగా ఉన్నాయి. స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశ నిమిషాల (మినిట్స్) ప్రకారం, తర్లవాడ ప్రాంతంలోని 90 శాతం భూమి ‘పెద్ద చుక్క కొండ’ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ, సర్వే ఆఫ్ ఇండియా టోపోగ్రాఫిక్ షీట్లో సమాచారం లేదని పేర్కొంటూ స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. ఈ పత్రాలను పరిశీలించిన అధికారులు ఈ వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమయ్యారు.
ప్రకటించిన నీటి గణాంకాలు కూడా ఆందోళనను మరింత పెంచుతున్నాయి. తార్లవాడ డేటా సెంటర్ రోజుకు 267 కిలోలీటర్ల నీటి అవసరాన్ని ప్రకటించగా, రాంబిల్లి రోజుకు 234 కిలోలీటర్లు అవసరమని ప్రకటించింది. ఈ రెండు ఇసిలు కూడా ఉపయోగిస్తున్న శీతలీకరణ సాంకేతికతల వివరాలను వెల్లడించలేదు; దీనివల్ల నీటి వినియోగాన్ని అంచనా వేయడం మరింత కష్టమవుతోంది. 100 మెగావాట్ల ప్లాంట్కు అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రమాణం రోజుకు 2,000 కిలోలీటర్లు గా ఉంది. ప్రకటించిన ఈ గణాంకాలు వాస్తవ వినియోగానికి ఏమాత్రం దగ్గరగా లేవు.
రాంబిల్లి పర్యావరణ నిర్వహణ ప్రణాళిక ప్రకారం, ఈ ప్రాజెక్టు స్థలానికి 2 కిలోమీటర్ల పరిధిలోనే ఐదు రిజర్వ్, రక్షిత అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అలాగే, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (కేంద్ర భూగర్భ జలాల బోర్డు) 2020 నాటి నివేదిక ప్రకారం, రాంబిల్లిలో భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమయ్యాయి. తీవ్రంగా కలుషితమైన, రక్షిత ప్రాంతాలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాజెక్టుల కోసం పర్యావరణ ప్రభావ అంచనాలో పేర్కొన్న నిబంధనల ప్రకారం—గూగుల్-అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టును ‘కేటగిరీ ఎ’ ప్రాజెక్టుగా పరిగణించాలని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్. శర్మ వాదిస్తున్నారు.
ఇదిలావుండగా, 354 బ్యాకప్ జనరేటర్ల నుండి వెలువడే సంభావ్య వాయు కాలుష్యం గురించిన అంచనా కూడా ఈ పత్రాలలో లేదు.
మానవ హక్కుల వేదిక, ఆంధ్రప్రదేశ్కు చెందిన వి.ఎస్. కృష్ణ, గూగుల్-అదానీ డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. అయితే ఈ సమస్య కేవలం ఒక్క డేటా సెంటర్ ప్రాజెక్టుకు మాత్రమే పరిమితమైనది కాదు. డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి వాటిల్లే ముప్పు విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా నియంత్రణ పరమైన శూన్యత (నిబంధనలు సరిగ్గా లేకపోవడం) నెలకొంది.
2006 నాటి పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్, హైపర్స్కేల్ ఎఐ డేటా సెంటర్ల ఆవిర్భావానికి కంటే ముందరిది. అన్ని డేటా సెంటర్లను ‘కేటగిరీ ఎ’ ప్రాజెక్టులుగా స్పష్టంగా వర్గీకరించకపోవడం వల్ల, వాటిని చాలా తక్కువ పరిశీలన ఉండే ‘కేటగిరీ బి’ ప్రాజెక్టులుగా నమోదు చేసే అవకాశం దక్కింది. కేటగిరీ బి అనేది సాధారణ భవనాలు, నిర్మాణ ప్రాజెక్టుల కోసం ఉద్దేశించినది; దీని ప్రకారం నిర్మిత ప్రాంతం (బిల్ట్-అప్ ఏరియా) 1,50,000 చదరపు మీటర్ల లోపు ఉన్నంత వరకు, ఎటువంటి ప్రజా విచారణ (పబ్లిక్ హియరింగ్) అవసరం లేదు.
గూగుల్-అదానీ డేటా సెంటర్లను కూడా ‘కేటగిరీ బి’ కిందనే వర్గీకరించారు. తర్లవాడ ఫైలింగ్లలో ప్రకటించిన నిర్మిత ప్రాంతం 1,48,922 చదరపు మీటర్లు కాగా, రాంబిల్లికి అది 1,48,475 చదరపు మీటర్లుగా ఉంది; ఇవి రెండూ ప్రజా విచారణ అవసరమయ్యే కనీస పరిమితి కంటే చాలా తక్కువగా ఉన్నాయి.
మాజీ ప్రభుత్వ కార్యదర్శి శర్మ గారు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు (ఎంఒఇఎఫ్సిసి) లేఖ రాస్తూ: “ఈ ప్రాజెక్టును పరిశీలన కోసం తమ మంత్రిత్వ శాఖకి ‘కేటగిరీ ఎ’ ప్రాజెక్టుగా సమర్పించి ఉండాల్సింది” అని పేర్కొన్నారు.
“రాజకీయ ఒత్తిళ్ల కారణంగా, ముందస్తు ప్రారంభోత్సవానికి వీలు కల్పించడం కోసం, ఎంఒఇఎఫ్సిసి – 2006 ఇఐఎ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, ఎపిఎస్ఇఐఎఎ వీటిని పొరపాటున కేటగిరీ బి ప్రాజెక్టులుగా పరిగణించి హడావిడిగా పర్యావరణ అనుమతులను జారీ చేసింది” అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ‘డేటా సెంటర్ పాలసీ 4.0’ లో ప్రోత్సాహకాలు, విద్యుత్ మినహాయింపులు; ఇతర వసతులకు సంబంధించిన నిబంధనలకు సంబంధించిన సుదీర్ఘ జాబితా ఉన్నప్పటికీ, పర్యావరణ, స్థానిక ప్రజల ఆందోళనల గురించి ఇది చాలావరకు మౌనంగానే ఉంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి రూపొందించిన విధానానికి, డేటా సెంటర్ల కోసం నిర్దిష్ట నియంత్రణ చట్రం లేని చట్టానికి మధ్య చిక్కుకుని—స్థానిక ప్రజలు తమ నిరసనను నమోదు చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు.
రెండు అనుమతులను వెంటనే నిలిపివేయాలని; ఈ ప్రాజెక్టును ‘కేటగిరీ ఎ’ గా పునఃవర్గీకరించి, ప్రభావిత గ్రామాలన్నింటిలో చట్టబద్ధమైన ప్రజా విచారణలను నిర్వహించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. అలాగే, పర్యావరణ ప్రభావ అంచనా చట్రం కింద డేటా సెంటర్ల వర్గీకరణను సమీక్షించాలని; వాటి అసలు పరిమాణం, ప్రభావాన్ని ప్రతిబింబించేలా ఒక ప్రత్యేక నియంత్రణ వర్గాన్ని (డెడికేటెడ్ రెగ్యులేటరీ కేటగిరీ) ఏర్పాటు చేయాలని కూడా ఎంఒఇఎఫ్సిసిని డిమాండ్ చేసింది.
గడిచిన రెండేళ్లలో, ప్రభుత్వ ప్రాధాన్యతలు పెద్ద ప్రైవేట్ రంగ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగానే సాగాయి. గూగుల్-అదానీ ప్రకటన వచ్చిన రెండు వారాల తర్వాత, ప్రభుత్వం మైక్రోసాఫ్ట్, ఎన్టీటీ, ష్నైడర్ ఎలక్ట్రిక్, జియో ప్లాట్ఫారమ్స్, నాస్కామ్ వంటి సంస్థల ప్రతినిధులతో ఒక ‘డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్’ (డేటా సెంటర్ సలహా మండలి) ను ఏర్పాటు చేసింది. పెట్టుబడులను సులభతరం చేయడం, డేటా సెంటర్ విధానాలను సమీక్షించడం; వాటిని అమలు చేయడం మొదలైనవాటిని ఈ మండలి ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. ఈ కౌన్సిల్ చేసిన సూచనలు (ఒకవేళ ఏవైనా ఉంటే) బహిరంగ రికార్డులలో ఎక్కడా అందుబాటులో ఉంచలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో, భారతీయ డేటా సెంటర్ల నుండి క్లౌడ్ సేవలను నిర్వహించే విదేశీ సంస్థలకు 20 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు (టాక్స్ హాలిడే) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీలు ఇచ్చే విషయంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ తమ స్వంత విధానాలను అనుసరిస్తున్నాయి; వీటిలో ఆంధ్రప్రదేశ్ అత్యంత దూకుడుగా ముందుకు సాగుతోంది.
ఈ పన్ను మినహాయింపులు, భూమి కేటాయింపులు, రాయితీ ధరలకే విద్యుత్ టారిఫ్లు; మౌలిక సదుపాయాల రీయింబర్స్మెంట్లు వంటివన్నీ ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు మరింత భారం కానున్నాయని విమర్శకులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయితీల పరిమాణంతో పాటు, ఆ రాయితీలు వర్తించే సుదీర్ఘ కాలపరిమితిపై కూడా వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు—విద్యుత్ టారిఫ్ సబ్సిడీ 2041 వరకు; నీటి సరఫరా హామీ 2046 వరకు చెల్లుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, ఈ రాయితీలు ప్రస్తుత ప్రభుత్వాల పదవీ కాలం కంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంది, ఇది ఒక అనిశ్చితమైన వ్యవస్థను సృష్టిస్తుంది.
2024లో ఎన్డిఎ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు, రాష్ట్రంపైన ఉన్న భారీ అప్పుల గురించి దాని నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం—బడ్జెట్ వెలుపలి రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ. 9.74 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పుడు, డేటా సెంటర్లకు ఈ స్థాయిలో రాయితీలు ఇవ్వడాన్ని ప్రభుత్వం ప్రాథమికంగా ఉద్యోగాల కల్పనను, ఆర్థిక వృద్ధిని చూపుతూ సమర్థించుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వానికి, గూగుల్-అదానీకి మధ్య జరిగిన అవగాహన ఒప్పందాల వివరాలను బహిరంగపరచలేదు. అలాగే గూగుల్ మరియు అదానీల మధ్య కుదిరిన ఒప్పందాల నిబంధనలు కూడా ఎవరికీ తెలియవు. సమాచార హక్కు చట్టం సామాజిక కార్యకర్త చక్రధర్ బుద్ధ ఈ వివరాలను వెల్లడించాలంటూ అప్పీళ్లు దాఖలు చేశారు. ” అవగాహన ఒప్పందాలు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు వంటి వివరాలను ఆర్టిఐ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వమే స్వచ్ఛందంగా బహిర్గతం చేయాలి” అని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు.
ఇలాంటి సమాచారం బహిరంగంగా అందుబాటులో లేకపోవడంతో, ఉద్యోగాల కల్పన వంటి నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చడానికి గూగుల్-అదానీ లేదా ఇతర భవిష్యత్తు పెట్టుబడిదారులపైన ఎలాంటి బైండింగ్ క్లాజెస్ (కట్టుబడి ఉండే నిబంధనలు) ఉన్నాయనేది స్పష్టంగా తెలియడం లేదు; ఎందుకంటే ప్రభుత్వ ఉత్తర్వులలో (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) వీటి గురించిన వివరాలేవీ లేవు.
ఉద్యోగాల కల్పనపై శూన్య హామీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ల వైపు ఇంతలా మొగ్గు చూపడానికి భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరుగుతుందనే హామీయే ప్రధాన కారణం. 2025 అక్టోబర్లో నారా లోకేష్ గారు మాట్లాడుతూ—ఈ పెట్టుబడి ద్వారా దాదాపు 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని, అలాగే రూ. 48,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 28న జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నాయుడు గారు మాట్లాడుతూ—ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి ‘రివర్స్ మైగ్రేషన్’ (వలస వెళ్లిన వారు తిరిగి రావడం) కు దారితీస్తుందని చెప్పారు.
అయితే, ఈ ఆర్భాటపు అంకెలు ఏ ప్రభుత్వ ఉత్తర్వులలోనూ కనిపించవు, కానీ అవి ప్రజల మది నుండి మాత్రం చెరిగిపోలేదు. ప్రభుత్వ చట్టబద్ధమైన పత్రాలలో (స్టాట్యుటరీ ఫైలింగ్స్) కనిపించే సంఖ్యలు చాలా పత్రాలలో ఉన్నాయి. పర్యావరణ అనుమతుల కోసం ప్రాజెక్ట్ నిర్వాహకులు సమర్పించిన పత్రాల ప్రకారం—రాంబిల్లి (650); తర్లవాడ (575) డేటా సెంటర్లలో కలిపి కేవలం 1,225 మంది శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఉంటారని అంచనా వేశారు. నిర్మాణ సమయంలో ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ, అది కేవలం ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితమయ్యే రోజువారీ కూలి పని మాత్రమే.
ఏప్రిల్ 28న గూగుల్ విడుదల చేసిన పత్రికా ప్రకటన కూడా పరోక్షంగా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. తమ నిబంధనలలో భాగంగా, గూగుల్ సంస్థ 1,000 మంది స్థానిక యువత కోసం ‘స్కిల్స్ ట్రేడ్ అండ్ రెడీనెస్’ (నైపుణ్యాభివృద్ధి) కార్యక్రమాన్ని జాబితా చేసింది. ఇది కేవలం నిర్మాణం, వెల్డింగ్, ఫెసిలిటీ ఆపరేషన్లలో ఇచ్చే శిక్షణా కార్యక్రమంతో పాటు ఒక ‘ఎఐ లిటరసీ మిషన్’ (ఎఐ అక్షరాస్యత మిషన్). అయితే, శిక్షణా కార్యక్రమం అనేది ఉద్యోగానికి ఎటువంటి హామీ కాదు.
గుత్తా రోహిత్ మాట్లాడుతూ: “1.88 లక్షల ఉద్యోగాలనేది ముమ్మాటికీ అబద్ధం. డేటా సెంటర్లు ఎంత తక్కువ ఉపాధిని కల్పిస్తాయనే దానికి ప్రపంచవ్యాప్తంగా ఆధారాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఆధారం లేని ఒక సంఖ్యను సృష్టించి, దాన్నే పరమ సత్యంగా ప్రచారం చేసింది. ఈ సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగించిన పద్ధతి (మెథడాలజీ) ఏంటో ప్రభుత్వం వెల్లడించగలదా?” అని ప్రశ్నించారు.
గతంలో తన పదవీ కాలంలో నాయుడు హైదరాబాద్కు తీసుకువచ్చిన ‘మైక్రోసాఫ్ట్ డెలివరీ సెంటర్’ విజయాన్ని మళ్లీ పునరావృతం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఈ డేటా సెంటర్లను ప్రదర్శిస్తున్నారని, అయితే ఈ రెండింటికీ అస్సలు పోలికే లేదని ఆయన పేర్కొన్నారు.
హైపర్స్కేల్ డేటా సెంటర్లు ఒకసారి పనిచేయడం ప్రారంభించిన తర్వాత, వాటికి ఎక్కువ మంది కార్మికులు అవసరం ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఎఐ డేటా సెంటర్లు భారీ పెట్టుబడితో కూడుకున్నవి అయినప్పటికీ, ఉపాధి కల్పన పరంగా చాలా పరిమితంగా ఉంటాయి. హైదరాబాద్లో ఉద్యోగాల విప్లవానికి కారణమైన ఐటిఇఎస్ రంగంలా కాకుండా, ఈ స్వయంచాలిత కేంద్రాలకు పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం లేదు.
“ఆంధ్రప్రదేశ్లో పాలన అనేది కేవలం ఒక శూన్య ప్రదర్శనగా మారిపోయింది; దీనిని అనుకూల మీడియా మరింత పెంచి చూపిస్తోంది; మరియు దీని కోసం సోషల్ మీడియాకు భారీగా నిధులు సమకూరుస్తున్నారు” అని రోహిత్ అన్నారు.
ఫిబ్రవరిలో అదానీకి భూమి బదిలీ ప్రక్రియ అధికారికంగా పూర్తయిన తర్వాత, ‘ఫ్రంట్లైన్’ పత్రిక నారా లోకేష్ గారిని, పలువురు అధికారులను సంప్రదించింది. అయితే ఇంటర్వ్యూల కోసం చేసిన అభ్యర్థనలపై ఇప్పటివరకు ఎటువంటి స్పందనా రాలేదు.
ప్రభుత్వం పర్యావరణ ఆందోళనలను కూడా పక్కనపెట్టింది. ఈ సంవత్సరం జూన్ 1న ముంబైలో జరిగిన ఒక సమావేశంలో, డేటా సెంటర్లపై వస్తున్న కొన్ని విమర్శలను లోకేష్ తిప్పికొడుతూ ఇలా అన్నారు: “ప్రతి సంవత్సరం సుమారు 3,000 టీఎంసీల [వెయ్యి మిలియన్ క్యూబిక్ ఫీట్] గోదావరి నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతోంది; ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం నీటి వినియోగానికి సమానం. మేము ప్రణాళిక చేసిన 6.5 GW డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరమవుతుంది. ఒక 1 GW థర్మల్ పవర్ ప్లాంట్, 1 GW డేటా సెంటర్ కంటే ఏడు రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది; అయినప్పటికీ థర్మల్ ప్లాంట్ల గురించి ఎవరూ మాట్లాడరు.”
అయితే ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే—ఆ 1.88 లక్షల ఉద్యోగాల సంఖ్యను ఎలా లెక్కించారో తెలిపే పద్ధతిని (మెథడాలజీ), ఉద్యోగ కల్పనకు సంబంధించిన ఒక కట్టుబాటుతో కూడిన హామీని, ఆ మూడు ప్రాంతాలపైన పడే ఉమ్మడి పర్యావరణ ప్రభావ అంచనా నివేదికను, నీటి వనరుల గురించిన పూర్తి వివరాలను, ఈ విద్యుత్ సబ్సిడీ వల్ల రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోని సామాన్య వినియోగదారులపైన పడే భారం ఎంత అనే లెక్కలను ప్రజల ముందు ఉంచడం.
తెలుగు: పద్మ కొండిపర్తి




